గత ఏడాది నవంబర్లో ప్రపంచ మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సు జరిగింది. భారత ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక వీటిలో పాల్గొని మహిళల అభివృద్ది గురించి గొప్పగా మాట్లాడారు. అదే సమయంలో మరోపక్క మెప్మా ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసన తెలియజేశారు. వీటి గురించి చర్చే లేదు. పైగా ఈ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మహిళలే ఉంటారు. అసలు చాలామందికి ఈ మెప్మా ఉద్యోగుల గురించి, వారి సమస్యల గురించి తెలియదు. వీరంతా తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ మెప్మా(ఆర్.పి) పట్టణ ఉద్యోగుల సంఘం (సిఐటియు)గా ఏర్పడి పోరాటం చేస్తున్న వీరిపై ప్రత్యేక కథనం 'కొలువు' పాఠకుల కోసం
గ్రామాల్లో, నగరాల్లో పొదుపు గ్రూపుల్లో లేని వారిని గుర్తించి గ్రూపుల్లో చేర్చమన్నారు. గ్రామంలో పేదవారిగా ఉన్న వారిని గుర్తించి ఆ పని అప్పగించారు. వీరికి ఆర్.పి(రీసోర్స్ పర్సన్స్) అని పేరుపెట్టారు. 2007లో మెప్మా ఆధ్వర్యంలో ఇది ప్రారంభించారు. వీరు ఇంటింటికి తిరగాలి. అప్పటి వరకు పొదుపు సంఘాల్లో లేని పేద మహిళల్ని గ్రూపుల్లో చేర్చాలి. పొదుపు గ్రూపుల గురించిన ఉపయోగాలు వారికి వివరించాలి. పొదుపు గ్రూపుల గురించే కాదు, ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకాలు తెచ్చినా వాటిని ఇంటింటికి తిరిగి వీరే ప్రచారం చేయాలి. ఏ సర్వే నిర్వహించినా అది ఆర్.పి.లకే అప్పగిస్తారు. నల్లా కనెక్షన్లు, మరుగుదొడ్లు, సమగ్రసర్వే, పెన్షన్లు, ఆహార భద్రత కార్డులు, ఐడి కార్డుల సర్వేలు, ఆధార్ లింకులు, ఓటర్ సర్వేలు, జనాభా లెక్కలు, బడి బయట ఉండే పిల్లల లెక్కలు, శానిటరీ, వికలాంగుల వివరాలు, నిరుద్యోగ సర్వేలు ఇలా ఏదైనా వీళ్ళు కాళ్ళు అరిగేలా తిరగాల్సిందే. కాని వీరికి ఇచ్చే వేతనాలు మాత్రం పన్నెండు వందలు. దీనికి పారితోషికం అని పేరు పెట్టారు.
ఎన్నో ఇబ్బందులు
తెలంగాణ మెప్మా రీసోర్స్ పర్సన్స్ (ఆర్.పి) పట్టణ ఉద్యోగులుగా మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియా (మెప్మా) సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. పట్టణ కేంద్రాలలో పేదరిక నిర్మూలనలో భాగంగా మురికివాడలు, ఇతర కాలనీలలో నివసిస్తున్న ప్రజలతో పొదుపు సంఘాలను ఏర్పాటు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కింది స్థాయిలో అమలు చేయటంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. గత ఎమిమిది సంవత్సరాలుగా పట్టణాల్లో ఆర్.పి.లు(రీసోర్స్ పర్సన్స్) విధులు నిర్వహిస్తున్నారు. పారితోషకం రూపంలో వీరికి వచ్చే అరకొర వేతనాలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్.పి. లే వసూలు చేసుకోవాలి
వీరికి ఇచ్చే ఈ అతి తక్కువ పారితోషకాలు కూడా నియమించిన కొన్ని చోట్ల రెండేళ్ళు, మరికొన్ని చోట్ల మూడేళ్ళ వరకు మాత్రం మెప్మావాళ్ళు సగం, పొదుపు గ్రూపుల తరపున సగం ఇచ్చేవారు. తర్వాత నుండి మొత్తం గ్రూపుల నుండే వసూలు చేసుకోమన్నారు. మొత్తానికి వీరికి ప్రభుత్వం నుండి వచ్చేది ఏమీ లేదు. గ్రామాల్లో ఏమీ తెలియని పేద మహిళలతో పొదుపు చేయించి వారి జీవితాలు బాగుచేయొచ్చనే ఉద్దేశంతో వీరు ఈ పనికి ఒప్పుకున్నారు. కాని ఇప్పుడు ఆ గ్రూపు సభ్యుల వద్ద నుండే డబ్బులు వసూలు చేసుకోమంటున్నారు.
వీరి పారితోషకం వీరి డబ్బు నుండే
ఒక్కో ఆర్.పి కింద 15 నుండి 30 గ్రూపుల వరకు ఉంటాయి. ఒక్కో గ్రూపులో పదిమంది సభ్యులు ఉంటారు. ప్రతి గ్రూపు సభ్యురాలి నుండి వీరే పది రూపాయలు వసూలు చేసుకొని తీసుకోవాలి. ఆ గ్రూపులో ఆర్.పి కూడా సభ్యురాలిగా ఉంటుంది. అంటే వీరు తీసుకోవల్సిన పారితోషకంలో వీరు వేసే పదిరూపాలు కూడా ఉంటాయి. అంటే వీరి దగ్గర వసూలు చేసిన డబ్బే తిరిగి వీరినే తీసుకోమంటున్నారు. ఇవి కనీసం తిరగాడానికి చార్జీలకు కూడా చాలవు. ఇదే ప్రశ్న ప్రభుత్వాన్ని అడిగి, కనీస వేతనాలు అమలు చేయని వీరు అడిగితే, ఇప్పుడు వచ్చేది చాలకపోతే ఒక్కో సభ్యురాలి నుండి యాభై రూపాయలు వసూలు చేసుకోమంటున్నారు.
పీల్చి పిప్పి చేయమంటున్నారు?
ఒక పక్క పొదుపు సంఘాల్లో ఉండే సభ్యులందరూ పేద మహిళలు. కాయకష్టం చేసి కొద్దికొద్దిగా పొదుపు సంఘంలో కూడబెట్టుకుంటున్నారు. అలాంటి వారిని పీల్చి పిప్పి చేసి వారి నుండి యాభై రూపాలు తీసుకుంటే ఇక వాళ్ళకేం మిగులుతుంది. ఇలా వారి నుండి బలవంతగా, బెదిరించి పారితోషకాలు తీసుకోవడం ఎంత దారుణం. కాని ప్రభుత్వానికి ఇవేమీ పట్టడం లేదు.
వారికి ఇష్టమున్న వారికే రుణాలు
ఆర్.పి.లు సర్వే చేసి అర్హత కలిగిన వారికి లోన్లు ఇవ్వమంటే అధికారులు ఇవ్వరు. వారికి ఇష్టం ఉన్నవారికి మాత్రమే రుణాలు ఇస్తారు. పొదుపు గ్రూపుల వారికి యు.ఎస్.ఇ.పి అంటే గ్రూపులో ఉండి ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకుంటే ఇచ్చే వ్యక్తిగత రుణం. అలాగే యు.డబ్ల్యు.ఎస్.పి అంటే గ్రూపులోని నలుగురైదుగురు కలిసి వ్యాపారం చేసుకుంటామంటే ఇచ్చే రుణం. కాని వీటి గురించి చాలామంది సభ్యులకు అసలు ఏమీ తెలియదు. మేము ఎవరికైనా ఇవ్వమన్నా ఇవ్వరు. వాళ్ళవాళ్ళకు మాత్రమే ఇచ్చుకుంటారు. ఈ రుణాల వల్ల అధికారలు, వారి బంధువులు మాత్రమే బాగుపడుతున్నారు.
మా పనికి సమయమంటూ లేదు
''వేతనాలు ఇవ్వడం చేతగాని ప్రభుత్వం అసలు మమ్మల్ని ఎందుకు నియమించాలి. అనేక రకాల సర్వేలు మాతో ఉచితంగా చేయించుకుంటున్నారు. వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు. కనీసం మా పనికి సమయం అంటూ ఉండదు. మేము చేసిన చాకిరిని మాపై అధికారులు ఉపయోగించుకుంటున్నారు. గ్రూపు సభ్యులు ఎప్పుడు రమ్మంటే అప్పుడే మేము వెళ్ళాలి. సభ్యులు చాలా మంది కూలి పనులు చేసుకునేవారు. రాత్రి పూట రమ్మంటారు. ఒక్కోసారి మేం ఇంటికెళ్ళే సరికి పది దాటుతుంటి. బయటకు వెళ్ళినపుడు మాకు ఏం జరిగినా దిక్కులేదు. అందరికీ అన్నీ చేస్తాం. మా గురించి పట్టించుకునేవారు మాత్రం ఎవరూ లేరు. సభ్యుల రుణాల గురించి తిరగాలి. వారి పిల్లల పెన్షన్ల గురించి తిరగాలి. జనశ్రీ, అభయహస్తం వంటివి చేయించాలి. బీమా సౌకర్యం కల్పించాలి. గ్రూపులో ఉన్న సభ్యులెవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే దానికి సంబంధించిన ఎన్సురెన్స్ మొత్తం మేమే చూసుకోవాలి' అంటున్నారు ఈ ఉద్యోగులు.
ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి
ఎనిమిది సంవత్సరాల నుండి వీరికి ఎన్నో సార్లు ట్రైనింగ్ ఇచ్చారు. వీరిలో చాలా పెద్ద చదువులు చదువుకున్నవారు కూడా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ పని చేసి, ఇప్పుడు వేరే పని చేయాలంటే వీరి మనసు అంగీకరించడం లేదు. ప్రభుత్వం మాత్రం ఎన్ని సంవత్సరాల నుండి అడిగినా వీరి వేతనాల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు.
ఆర్.పి.ల డిమాండ్స్
- మెప్మా నుండి గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
- పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలి.
ర ఉద్యోగ భద్రత కల్పించాలి.
- మహిళా ఉద్యోగులకు 180 రోజులు వేతనంతో కూడిన మెటర్నటీ సెలవు సౌకర్యం కల్పించాలి.
- చట్టబద్ధ సౌకర్యాలైన ఇ.ఎస్.ఐ, పి.ఎఫ్ కల్పించాలి.
- ఆహార భద్రత కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలి.
- ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి.
- అధికారుల వేధింపులు అరికట్టాలి.
- ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆర్.పిలను విధుల్లోకి తీసుకోవాలి.
- ఇళ్ళులేని ఆర్.పి లకు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి.
Authorization