ఏండ్ల తరబడి బొగ్గు పరిశ్రమే వీరి జీవనాధారం. ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ఈ పరిశ్రమ ఆ చుట్టుపక్కల కుటుంబాలకు కడుపు నిండా తిండి పెడుతున్నది. ఉత్తర తెలంగాణలో కొద్దో గొప్పో ఉపాధి దొరికి ప్రజలు బతకగలుగుతున్నారు. ప్రజలు కాస్త హాయిగా బతకడం ప్రభుత్వానికి నచ్చదేమో..! అందుకే ప్రభుత్వ రంగంలో నడుస్తున్న మన బొగ్గు పరిశ్రమలను కుప్పకూల్చే ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నది. మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు బావులను విదేశీ, స్వదేశీ కార్పొరేట్ కంపెనీలకు వేలం పాటపెట్టి తెగనమ్ముతోంది. ఈ విధానం కోల్ ఇండియా, మన సింగరేణికి ముప్పుతేబోతున్నది. అందుకే కార్మికులంతా ఏకమై దేశ వ్యాపితంగా ఆందోళనకు పూనుకోబోతున్నారు.
1973కు ముందు తెలంగాణ సింగరేణి తప్ప దేశంలోని మొత్తం బొగ్గు పరిశ్రమ ప్రైవేటు కంపెనీల యాజమాన్యంలోనే వుండేది. ఈ కంపెనీల యాజమాన్యంలో కార్మికులకు రక్షణ కరువైంది. బొగ్గుగని ప్రమాదాలలో వందల సంఖ్యలో కార్మికులు బలయ్యారు. కేవలం లాభాపేక్షతో అధిక లాభం వచ్చే సీములలోని బొగ్గును తీసుకొని మిగిలిన బొగ్గును వదిలేసి విలువైన జాతి సంపదను ప్రైవేటు యాజమాన్యం నష్టపర్చింది. కార్మికుల పోరాటాల ఫలితంగా 1973 సంవత్సరం నుండి బొగ్గు పరిశ్రమ ప్రభుత్వ రంగంలోకి తీసుకోబడింది. బొగ్గు గనుల చట్టంలో కేవలం తమ సొంత పరిశ్రమ అవసరాలకు తప్ప బొగ్గు అమ్ముకోవటానికి, గనులను ప్రైవేటు వారికి ఇవ్వకూడదు. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బొగ్గు గనులు ప్రైవేటు కంపెనీలు తమ సొంతవాడకం కోసం కానీ, అమ్మకం కోసం కాని ఉత్పత్తి చేసుకొనే విధంగా చట్ట సవరణ చేసి బొగ్గు బ్లాకులను ప్రైవేటు వారికి కట్టబెడుతున్నది. ఈ వేలం పాటలో స్వదేశీ, విదేశీ కంపెనీలన్నీ పాల్గొనవచ్చు. ఈ విధానం ద్వారా కోల్ ఇండియాకు, సింగరేణి కంపెనీకి కొత్త బొగ్గు బ్లాకులు పొందాలంటే ప్రైవేటు కంపెనీలతో పోటీపడాలి. ప్రభుత్వం మొగ్గు ప్రైవేటు రంగంపై వున్నందున కొత్త బొగ్గు బ్లాకులను పొందటం ప్రభుత్వరంగ పరిశ్రమలకు చాలా కష్టతరంగా మారనున్నది.
100 శాతం వాటా కొంటే ప్రైవేటీకరణ ఆగుతుందా?
పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేటు వారికి కట్టబెట్టే సవరణ బిల్లును ప్రవేశపెడ్తే టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యులందరూ ఆ బిల్లును బలపర్చి ఆమోదించారు. నేడు ఆ సవరణ చట్టాన్ని అనుసరించి మోడీ ప్రభుత్వం వేలం పాట ద్వారా బొగ్గు బ్లాకులను ప్రైవేటు వారికి అమ్ముతున్నారు. తన ప్రాణం పోయినా 'సింగరేణిని ప్రైవేటీకరించం-కేంద్ర ప్రభుత్వం వాటా 49 శాతం వారు అమ్మితే మేమే కొంటాం'' అని రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పగా చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు 100 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం కొంటే, బొగ్గు వెలికితీతపై హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయా? కోల్మైన్స్ ప్రొవిజెన్స్ యాక్ట ప్రకారం బొగ్గు వెలికి తీయాలంటే కేంద్రం అనుమతి ఇవ్వాలి. ఇది ముఖ్యమంత్రికి తెలియకకాదు. ప్రజలను, కార్మికులను మోసం చేయడానికేనని అర్థం చేసుకోవాలి. అలాగే మరికొన్ని వాస్తవాలు గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్న జెన్ కో కు కేటాయించిన తాడిచర్ల బ్లాక్-1ను సింగరేణి ఇవ్వకుండా ఈ ముఖ్యమంత్రే ప్రైవేటు వారికి కట్టబెట్టారు. తాడిచర్ల బ్లాకు -2 కూడా ప్రైవేటు వారి ద్వారా నిర్వహించే ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. సింగరేణి సొమ్ముతో జైపూర్ పవర్ ప్లాంటును నిర్మిస్తే దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమేయంతో ప్రైవేటు వారి నిర్వహణకు అప్పగించారు. కార్మికుల పిల్లలకు ఉద్యోగాలివ్వడంలో ముఖ్యమంత్రి వాగ్దానం ఏమైందో కనిపిస్తూనే వుంది. ఇప్పటికే ప్రభుత్వరంగ బొగ్గు పరిశ్రమలో ప్రైవేటు రంగం జోరు ప్రత్యక్షంగా కనపడుతోంది. కోల్ ఇండియాలో 23 శాతం వాటాను ప్రైవేటురంగానికి కట్టబెట్టారు. మన సింగరేణిలోని ఓపెన్కాస్ట్ గనుల్లో మొత్తం ఓబి (ఓవర్ బెర్డన్) పనిని ప్రైవేటు వారికి కట్టబెట్టారు. వివిధ రకాల యాంత్రాకరణల పేరుతో కొన్ని విదేశీ కంపెనీలు సింగరేణఙ అండర్ గ్రౌండ్ పనులలోకి చొరబడుతున్నారు. ప్రైవేటు కంపెనీల కార్మికులందరూ కాంట్రాక్టు కార్మికులే. వారికి ఏ విధమైన చట్టబద్ధ హక్కులు, వేతనాలు, భత్యాలు ఇవ్వబడని విషయం మనందరికీ తెలుసు.
పెరిగిపోతున్న కాంట్రాక్టీకరణ
సింగరేణిలో కంపెనీ కార్మికుల సంఖ్య 50 వేల మందికి పడిపోయి. కాంట్రాక్టు కార్మికుల సంఖ్య 25 వేలకు పెరిగింది. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి హైపవర్ కమిటీ ఆమోదించిన వేతనాల నివ్వటం లేదు. ''సమాన పనికి సమాన వేతనం'' అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సింగరేణిలో కేవలం గోడ నినాదంగానే మారింది. కోల్ ఇండియాలో పర్మినెంట్ కార్మికుల సంఖ్య 2,50,000 తగ్గిపోయింది. కానీ కాంట్రాక్టు కార్మికుల సంఖ్య 3,00,000కు పెరిగింది. ఇవన్నీ కోల్ ఇండియా, సింగరేణిలను నిర్వీర్యం చేసే ప్రైవేటీకరణ చర్యల్లో భాగమే తప్ప మరొకటి కాదు. కార్పొరేట్లు, బడా పెట్టుబడిదార్లకు చాకిరీ చేసి పెట్టే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ బొగ్గు పరిశ్రమ పరిస్థితి ఇంత దారుణంగా వుంది. పరిశ్రమ ప్రైవేటురంగం పాలైతే ఇంతే సంగతులు. అవి ఏ వేతన ఒప్పందాలనూ అమలు చేయవు. కార్మికులను అర్ధ బానిసలుగా మారుస్తారు. ట్రేడ్ యూనియన్ హక్కులు హుళక్కే అయిపోతాయి. కావున కార్మిక వర్గం మేలుకోవాలి.
ఐక్యతతో తిప్పికొట్టాలి
కోల్ ఇండియా, సింగరేణికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయ కూడా బడ్జెట్ సపోర్టు ఇవ్వకపోయినా కేవలం కార్మికుల చమట చుక్కలతో వచ్చిన లాభాలను డివిడెండ్ల రూపంలో, పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలు తమ ఖజానాలో వేసుకుంటూ తిరిగి ఈ ప్రభుత్వ కంపెనీలనే కుప్పకూల్చి ప్రైవేటు వారికి కట్టబెడుతున్నారు. ఈ ప్రైవేటీకరణ జబ్బును అమెరికా నేతృత్వంలో ప్రపంచ బ్యాంకు మన ప్రభుత్వానికి అంటించింది. ప్రైవేటీకరణకు ఒత్తిడి చేస్తోంది. ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేశారు. కొన్నింటిని అమ్మేశారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, డిఫెన్స్ రంగ సంస్థలను విదేశీ కార్పొరేట్లకు స్వదేశీ కంపెనీలకు అమ్మకానికి ప్రభుత్వం సిద్ధపర్చింది. 2019 సంవత్సరం నాటికల్లా బొగ్గు పరిశ్రమను ప్రైవేటీకరణ పూర్తి చేయాలని బిజేపీ తలపెట్టింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, బొగ్గుగనుల అమ్మకం తదితర అన్ని బిల్లులను టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో నిస్సిగ్గుగా బలపరుస్తూనే ఉన్నది. అందుకే కార్మికులంతా ఏకం కావాలి. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి కార్మికసంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి బొగ్గుగనుల ప్రైవేటీకరణ ప్రక్రియను ఆగిపోయే విధంగా ఉద్యమించాలి. అందుకే దేశ వ్యాప్త పోరాటాలకు సీఐటీయూ పిలుపు నిస్తున్నది.
Authorization