టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మధ్యాహ్న భోజన కార్మికులు గానీ, వారి సమస్యలు గానీ వారికి కనిపించలేదు. పైగా పేద పిల్లల కడుపుకింత అన్నం పెట్టే ఆ అమ్మల కడుపు కొట్టే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. కార్మికుల పనికి భద్రత కల్పించకపోగా మొత్తం పథకాన్నే ప్రైవేటీకరణ చేసే చర్యలు వేగవంతం చేస్తున్నారు. అందుకే ప్రైవేటీకరణ పేరుతో స్వచ్ఛంద సంస్థలకిచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. గుడ్ల సరఫరాలకు బడ్జెట్ కేటాయించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు, మెనూ చార్జీలు పెంచాలి అని ఆ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వొద్దు
గత 16 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచకుండా కనీస మౌళిక వసతులు కల్పించకుండా పథకం మొత్తాన్ని కేంద్రీకృత వంటశాల పేరుతో మధ్యాహ్న భోజన నిర్వహణను స్వచ్ఛంధ సంస్థలకు అప్పజెప్పాలని నిర్ణయించారు. స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పిన దగ్గర నిర్వహణ సక్రమంగా లేదని కాగ్ నివేదిక చెప్పింది. ఆ నివేదికను తుంగలో తొక్కి ప్రైవేటీకరణ చర్యలు వేగవంతం చేస్తూ తన బాధ్యత నుండి తప్పుకోవాలని ప్రభుత్వం చూస్తున్నది. బడుగు, బలహీనవర్గాలకు అందే ఈ కొద్దిపాటి సౌకర్యానికి వారిని దూరం చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బలహీన వర్గాల పొట్టలు గొట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.
ప్రభుత్వమే సరఫరా చేయాలి
కోడిగుడ్డు పెట్టలేదన్న సాకుతో ఒక పక్క ప్రభుత్వం కార్మికులను తొలగిస్తున్నది. మరో పక్క గుడ్డు పెట్టడానికి అంగీకరించని స్వచ్ఛంద సంస్థలపై మక్కువ చూపెడుతుంది. గుడ్లకు కేటాయించిన బడ్జెట్కి 2 గుడ్లు రావు పైగా 3 గుడ్లు పెట్టాలని కార్మికు లపై ఒత్తిడి తెస్తున్నారు. గుడ్డుకు అదనంగా బడ్జెట్ను కేటాయించాలి లేదా ప్రభుత్వమే సరఫరా చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వాల హామీలు ఎమయ్యాయి?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ, రాష్ట్రంలో వున్న టీఆర్ఎస్ కానీ అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, భారీ మాటలు చెప్పిన ప్రభుత్వాలు సంక్షేమాన్ని గాలికి వదిలి, కార్మికుల ఉపాధికే ఎసరు పెట్టే చర్యలకు పాల్పడుతున్నారు. పాలక వర్గాలు అనుసరిస్తున్న విధానాలన్నీ మన దేశంలో దారిద్య్రం పెరగటానికి కారణం. దీని ఫలితం గా కోట్లాది మంది పిల్లలకు పౌష్టికాహారం లేక చదువు లేక అలమటిస్తున్నారు. వీరిని ఉద్దరించే ఉద్దేశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొన్న తర్వాతనే విధి లేక మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకాన్ని స్వయం గా అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసు కోవడం లేదు. మరోపక్క పెట్టుబడిదారులకు వారి సంస్థలకు అనుకూల విధానాలను చేపడుతున్నది.
కార్మికులకు అన్యాయం
కనీస మౌళిక వసతులు కల్పించటంలో మన రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, 25,966 ఉన్నాయి. ఇప్పటికి 2400 పాఠశాలలకు విద్యుత్ సరఫరా లేదు. 10,200 పాఠశా లలకు ప్రహరీ గోడలు లేవు. 11 వేల పాఠశాలలకు వంట షెడ్లు లేవు. ఒకపక్క ప్రభుత్వం కేజీ నుండి పీజీ వరకు విద్యను ఉచితంగా అందిస్తామని చెప్పుతు న్నారు. మరొక పక్క ప్రాథమిక స్థాయిలో వున్న పాఠశా లలను విలీనం చేయాలని నిర్ణయం తీసుకు న్నారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 4637 పాఠశాలలు విలీనం చేయడంతో లబ్ధిదారులకు ఇటు కార్మికులకు అన్యాయం చేస్తున్నారు.
వేతనాలు ఇవ్వాలి
తమిళనాడు రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం మన రాష్ట్రం కంటే మెరుగ్గా అమలౌతున్నది. మౌళిక వసతు లు కల్పించడంతో పాటు ఒక్కొక్క వర్క్ర్కి 5500 రూపాయల వేతనంగా ఇస్తున్నారు. పండగ అలవెన్స్, టీఏ, డీఏలు ఇస్తున్నారు. తమిళనాడులో ఇస్తున్న విధంగా మన రాష్ట్రంలో కూడా మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు చెల్లించాలి.
ఐక్యంగా పోరాడాలి
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ అనేక రాయభారాలు చేసిన ప్రభుత్వం తీరు చెవుటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా ఉంది. పాలకులకు తమ పదవుల భద్రతే తప్ప మధ్యాహ్న భోజన కార్మికుల ఉద్యోగ భద్రత గురించి పట్టించుకోవడం లేదు. పైగా పథకం మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పి కార్మికుల పొట్టలు కొడుతున్నారు. ఇప్పటికే వికారాబాద్ టౌన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ, కొత్తగూడెం టౌన్, మెదక్ జిల్లాలో 5 మండలాలు అక్షయపాత్రకు అప్పజెప్పింది. వనపర్తి జిల్లాలో చైతన్య పౌండేషన్కు ఇచ్చేందుకు ప్రతిపాదన లకు సిద్దం చేసింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పేందుకు రంగం సిద్దం చేస్తున్నది. అందుకే ఈ కార్మికులు తమ ఉపాధిని కాపాడుకోవడం కోసం, సమస్యలను పరిష్కారానికై పోరాటానికి సిద్ధం కాబోతున్నారు.
డిమాండ్స్
- మధ్యాహ్న భోజన నిర్వహణను అక్షయపాత్ర, చైతన్య పౌండేషన్ తదితర స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
- కనీస వేతనం 18000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలి. మెనూ చార్జీలు పెంచాలి.
- గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలి. అవసరమైన గ్యాస్ను సబ్సిడీకి ఇవ్వాలి.
- గుర్తింపు కార్డులు ప్రభుత్వమే ఇవ్వాలి. ప్రోసిడింగ్ అడర్ ఇవ్వాలి.
- అక్రమ తొలగింపులు అరికట్టాలి. రాజకీయ వేధింపులు ఆపాలి.
- వంట షెడ్లు, వంట పాత్రలు తదితర మౌళిక వసతులు కల్పించాలి
- కాటన్ బట్టల యూనిఫామ్ ఇవ్వాలి. సామాజిక ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి.
Authorization