గ్రామీణాభివృద్ధి మా లక్ష్యం అన్నారు. అందులోనూ మహిళల ప్రగతిపై దృష్టి పెట్టామని చెప్పారు. తినీ తినకా కష్టపడి పొదుపు చేసుకుంటున్న మహిళలకు అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు. అందుకే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ను నియమించారు. పని దొరికినందకు వీరు కూడా సంతోషించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో నడిచే సెర్ఫ్ అనే ఈ సంస్థ ఆధ్వర్యంలో పని చేసే వారంతా మహిళలే. గ్రామంలో పొదుపు సంఘాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వీరి శ్రమకు మాత్రం గుర్తింపు లేదు. ఆ వివరాలేంటో ఈ వారం కొలువులో తెలుసుకుందాం...
''గ్రామాలలో నిరక్ష్యరాస్యులుగా ఉన్న పొదుపు గ్రూపు మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తాం. వారికోసం గ్రామ సంఘంలో సెర్ప్(గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ)Û కేటాయించిన లోన్లు వారికి సక్రమంగా అందుతున్నాయో లేదో పరిశీలిస్తాం. అలాగే మహిళలు పొదుపు చేసుకుంటున్న డబ్బు సక్రమంగా వారి గ్రూపు పేరున జమవుతుందో లేదో చూస్తాం. గ్రామీణ మహిళల అభివృద్ధి కోసం, గ్రామాలలో పేదరికాన్ని నిర్మూలించడం కోసం కేటాయించిన నిధులు మహిళలకు ఎలా అందుతున్నాయో ఆడిటింగ్ చేస్తాం. ఆ నిధులతో మహిళలు బర్రెలు, గొర్రెలు కొనుగోలు చేసుకొని స్వయం ఉపాధి కల్పించుకుంటారు. నిధులు వారికి అందకపోతే ఆ వివరాలు మండల సమాఖ్యకు, సెర్ఫ్కు వెంటనే చేరవేస్తాం. ఈ క్రమంలో మా కుటుంబాలను, పిల్లల్ని వదిలి రోజుల తరబడి గ్రామాల్లోనే ఉంటాం. ఇంతా చేసే మాకు మాత్రం ఎటువంటి సౌకర్యాలు లేవు'' అంటున్నారు కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్(సిఆర్పిలు).
శిక్షణ ఇచ్చే తీసుకుంటారు
మేము సెర్ఫ్ ఆధ్వర్యంలో పనిచేస్తాం. ఈ సంస్థ ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్వహించబడుతుంది. ఈ సంస్థ పరిధిలో జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య ఎకౌంట్లని ఆడిట్ చేస్తున్న వారికి సహాయంగా 2006లో మమ్మల్ని నియమించారు. 3 నెలల నుండి సంవత్సరం వరకు రిటైర్డ్ బ్యాంకు మేనేజర్తో మాకు శిక్షణ ఇప్పిస్తారు. శిక్షణా కాలంలో కమ్యూనిటి ఆడిటర్స్ అని మాకు పేరు పెట్టారు. ఆ తరువాత కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్గా పేరు మార్చారు.
అవినీతి జరిగితే ఊరుకోం
గ్రామాలలో డ్వాక్రా మహిళలకు గ్రూపు లోన్లు ఎలా అందుతున్నాయో చూడడం మా ముఖ్యమైన బాధ్యత. ఏ గ్రామంలో నైనా డ్వాక్రా గ్రూపులకు స్వయం ఉపాధి కోసం ఇచ్చే లోన్లు ఇవ్వకుండానే ఇచ్చామని లెక్కలు రాసుకుంటే మా ఆడిటింగ్లో బయటపడతారు. ఏ గ్రామ సంఘంలోనైనా అవినీతి జరిగితే ఊరుకోం. మండల సమాఖ్య అధికారులకు ఆ వివరాలు అందిస్తాం.
ఎక్కడకు వెళ్ళమంటే అక్కడకు వెళ్ళాలి
నెలకు 15రోజులు మాత్రమే మాకు పని వుంటుంది. మమ్మల్ని సెర్ప్ స్థాయి సిఆర్పి అని కూడా అంటారు. సెర్ప్ యూనిట్ నుండే వేతనాలు, టీఏ, డీఏలు చెల్లిస్తారు. కాని పని చేసే చోట ఎలాంటి కనీస వసతులు కల్పించరు. ఏ జిల్లాకు వెళ్ళమంటే అక్కడకు వెళ్ళాలి. కేటాయించిన జిల్లాలో మండల సమాఖ్యల అకౌంట్స్ని ఆడిట్ చేస్తాం. ఏ గ్రామానికి వెళితే అక్కడ ఆ సంబంధిత కార్యాలయంలోనే మా బస. సమాఖ్యల ఆడిట్ చూడడానికి వెళితే అక్కడి వారు సహకరించరు. కొన్ని చోట్ల మేము వస్తున్నామని తెలిసిన వెంటనే అకౌంట్స్ పుస్తకాలను తీసుకొని కార్యాలయాలకు తాళం వేసి వెళ్ళి పోతారు. అకౌంట్స్ అన్నీ కరెక్టుగా వున్న చోట ఆడిట్ నిర్వహిస్తాం. ఫీల్డ్లో మేము ఎదుర్కొనే బాధలు వర్ణనాతీతం. ప్రసూతి సెలవులు ఉండవు. ఎన్ని రోజులు పని చేసుకుంటే అన్ని రోజులు లెక్కకట్టి కూలి మాదిరిగా వేతనాలు ఇస్తారు.
మమ్మల్నే నిలదీస్తారు
పద్మ అనే ఉద్యోగి మాట్లాడుతూ ''నేను 2006 నుండి సెర్ఫ్లో పని చేస్తున్నాను. రిటైర్డ్ బ్యాంకు మేనేజర్తో మాకు శిక్షణ ఇప్పించారు. గతంలో ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుకున్న వారిని కూడా శిక్షణ ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకునేవారు. కానీ ఇప్పుడు తీసుకోవడం లేదు. నెలకు 15 రోజులు కుటుంబాన్ని వదిలి మేమంతా ఎక్కడికి పంపితే అక్కడకు వెళ్ళి ఆడిటింగ్ చేసి రావాలి. ఇంత చేసినా మాకు ఎటువంటి గుర్తింపూ ఉండదు. మేము వెళ్ళిన దగ్గర ఏదైనా అవినీతి జరిగితే అధికారులు మమ్మల్నే నిలదీస్తారు. మా సమస్యలు పరిష్కరించాలి. మమ్మల్ని పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి. ఫీల్డ్లో కనీస సౌకర్యాలు కల్పించాలి'' అంటున్నారు.
రిసోర్స్ ఫీజు పెంచాలి
''ఇన్నేండ్లు ఈ పనినే నమ్ముకొని ఉన్నాం. అదిలాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్ పని జిల్లాల్లో చేశాను. ప్రస్తుతం పని లేక ఖాళీగా ఉంటున్నా. కుటుంబం గడవడం కష్టమైపోయింది.. దాంతో చాలా ఇబ్బందిగా ఉంది. మాకు వెంటనే పని చూపించాలి. రిసోర్స్ ఫీజు పెంచాలి. (ఆడిటింగ్కి వెళ్ళినందుకు రోజువారి ఇచ్చేది) రోజుకు 425రూపాయలు ఇస్తున్నారు. ఇందులోనే భోజనాలు, వసతి చూసుకోవాలి. పైగా పని ఉండేది నెలలో 15 రోజులు మాత్రమే. నెలవారి వేతనం ఇవ్వాలి. ఫీల్డ్లో ఉన్నప్పుడు రాత్రి సమయంలో ఆలస్యం అవుతుంది. ఆ సమయంలో బస్టాఫ్లో ఉంటే మమ్మల్ని బెదిరించిన సంఘటనలు ఉన్నాయి. ఎక్కడైనా పోలీసులు పట్టుకుంటే వారికి చూపించటానికి కనీసం మా దగ్గర గుర్తింపు కార్డులు కూడా లేవు. సొంత జిల్లాలోనే వేరే క్లష్టర్ను నియమిస్తే మహిళలకు సౌకర్యంగా ఉంటుంది'' అంటున్నారు మరో ఉద్యోగి పి.అనసూర్య.
ఇబ్బందులు తప్పవు
అనసూర్య అనే రిసోర్స్ పర్సన్ మాట్లాడుతూ ''ఫీల్డ్కు వెళ్ళినపుడు కొన్ని మండల సమాఖ్యలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా బాగా సహకరిస్తారు. కాని కొన్ని చోట్ల మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి. మాకేమైనా అక్కడ ఇబ్బందిగా ఉంటే మండల సమాఖ్య ఓబి (పాలక మండలి)కి అప్పగిస్తాం. ఇప్పటి వరకు అదిలాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి, వరంగల్లో చేశాను. అదిలాబాద్లో మూడు సంవత్సరాలు చేశాను. అక్కడ కాస్త ఇబ్బందిగా ఉండేది. పై అధికారులు సహకరించే వారు. నెలలో పదిహేను రోజులు మాత్రమే పని ఉంటుంది. పని చేసిన దినాలకు మాత్రమే రిసోర్స్ ఫీజు ఇస్తారు. ఆ ఇచ్చే డబ్బు చార్జీలకు కూడా సరిగ్గా సరిపోవు. అందుకే మాకు నెలనెల జీతం మాదిరిగా ఇవ్వాలి. కుటుంబాలను వదిలి పనిచేస్తున్నాం. కుటుంబం గడవటానికే పిల్లల్ని కూడా వదిలి అన్నెన్ని రోజులు బయట ఉండి పని చేస్తున్నాం. ఐనా ప్రభుత్వం మా శ్రమను గుర్తించడం లేదు. ప్రస్తుతం 15 రోజుల పని కూడా లేకుండా చేశారు'' అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కష్టపడి ఆడిటింగ్ పూర్తి చేస్తాం ''ఒక క్లష్టర్ను రెండు నెలల్లో పూర్తి చేయాలి. అక్కడి మండలాలన్నీ ఆ రెండునెలల్లో పూర్తి చేస్తాం. వచ్చిన వివరాలు మండల సమాఖ్య, సెర్ఫ్ అధికారులకు అప్పగిస్తాం. మాకు ఇచ్చే రిసోర్స్ ఫీజు కూడా సెర్ఫ్ వాళ్ళే ఇస్తారు. మేమ వెళ్ళిన మండలాల్లో ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా, తిండి దొరక్కపోయినా ఎలాగో కష్టపడి ఆడిటింగ్ పూర్తి చేసుకొని వస్తాం. ఎందుకుంటే బాధ్యత తీసుకున్నాం. పని చేస్తే ప్రభుత్వం ఎప్పటికైనా మమ్మల్ని గుర్తించక పోయిద్దా అని నమ్మకంతో ఇన్ని రోజులు ఉన్నాం. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రాలో మాత్రం పని చేసుకుంటున్నారు. కాని తెలంగాణా రాష్ట్రంలో మాత్రం సరిగ్గా పని దొరకడం లేదు. మేము అడిగితే పని కల్పిస్తామని నాన్చుతున్నారు. అధికారులను ఎన్ని సార్లు కలిసినా పని చూపిస్తామంటున్నారు. మాటలు చెబుతున్నారు కానీ చేతల్లో ఏమీ లేదు'' అంటున్నారు కె.లీలావతి.
Authorization