పని దొరక్కా, కుటుంబం గడవక ఉన్న ఊరిని, కన్న వారిని వదిలి వలసలు వెళుతున్నవారు ఎందరో. దొరికిన పని చేసుకుంటూ పొట్టనింపుకుంటున్నారు. ఇలాంటి వారికి ఉన్న ఊరిలోనే ఉపాధి హామీ పథకం కాస్త తిండి పెడుతుందని ఆశపడ్డారు. కానీ పని చేస్తున్న వారికి సమయానికి కూలి దొరక్క, భద్రత లేక ఎన్నో కష్టాలు పడుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని ఆ కూలీల సమస్యల గురించి ఈ వారం కొలువులో...
గ్రామాల్లో పని లేక, తిండిగడవక ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో వామపక్షాలు పోరాడి ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చాయి. ఈ చట్టం ఫలితంగా కొద్దో గొప్పో గ్రామాల్లో ప్రజలకు పని దొరికి కడుపు నింపుకోగలుగుతున్నారు. కాని కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి ఏడాదికేడాది నిధులను తగ్గిస్తుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలను మాయం చేస్తుంది. కోట్లలో ఉపాధి హామీ కూలి డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. దాంతో ఆ కార్మికులకు రావాల్సిన కూలి డబ్బులు చేతికి అందడం లేదు.
చాలీ చాలని జీతాలతో బతుకుతుంటే
తెలంగాణ రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలు ఉపాధి హామీ కూలి పనులపై ఆధారపడి బతుకుతున్నారు. వీరిలో మహిళ సంఖ్య తొంభై శాతం వరకు ఉంటుంది. వీరెవ్వరికీ సరైన సౌకర్యాలు లేవు. ఒకపక్క ఉపాధి హామీ కూలీలు చాలీ చాలని జీతాలతో బతుకుతున్నారు. మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం గుడులకోసం, రకరకాల భవనాల కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెడుతుంది. కాని తిండి దొరకని ఉపాధి కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి మాత్రం ముందుకు రావడం లేదు. అందుకే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆ కూలీలు డిమాండ్ చేస్తున్నారు.
ఆదాయం చాలడం లేదు
ఉపాధి కూలీల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ చిన్న, సన్నకారు రైతులు చాలా మంది ఉన్నారు. వీరితో పని చేయించడానికి సుమారు రెండు లక్షల ఇరవై వేల మంది మేట్లను నియమించారు. వీరంతా ఇంటర్, డిగ్రీ చేసిన వారు. వీరికి కూడా సరైన పని, పనికి తగిన వేతనం ఇవ్వడం లేదు. ముఖ్యంగా వందరోజులు పని అన్నారు. అయితే ఒకే ఇంట్లో నలుగురు పని చేస్తుంటే 20 రోజులకు మించి పని దొరకడం లేదు. మరోపక్క గ్రామాల్లో ఏప్రిల్, మే, జూన్, జులై, ఆగస్టు వరకు వ్యవసాయ పనులు ఉండవు. అందుకే పని చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒక జాబ్ కార్డు ఇస్తే అందరికీ వందరోజుల పని దొరుకుతుంది. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో వంద రోజుల పని అంటే వచ్చే ఆదాయం కుటుంబానికి అస్సలు సరిపోదు అందుకే 200 రోజులు పని చూపించాలి. ప్రస్తుతం వ్యవసాయలో యంత్రాలు బాగా పెరిగిపోతున్నాయి. వాణిజ్య పంటల్లో అధునాతన యంత్రాలు ఉపయోగించడం వల్ల పని దొరకడం లేదు.
ఉపాధి హామీ కూలీల డిమాండ్స్
* పని చేసే వారందరికీ జాబ్ కార్డులు ఇవ్వాలి.
* పని దినాలను 200 రోజులకు పెంచాలి.
* రోజులు 600 వేతనం చెల్లించాలి.
* ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి.
* మహిళలకు ప్రసూతి ఖర్చులు ఇవ్వాలి.
* రైతులకు ఏర్పాటు చేసిన విధంగా ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించాలి.
* నివాస ప్రాంతాల అభివృద్ధి పనులు చేపట్టి ఉపాధి హామీ కార్మికులకు పని కల్పించాలి.
* పని ప్రదేశాలలో భద్రత కల్పించాలి.
* ఉపాధి హామీ కూలీ చనిపోతే ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి.
చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి
ధరలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో సమాన పనికి సమాన వేతన చట్టం ప్రకారం రోజుకు 600 రూపాయలు కూలిగా ఇవ్వాలి. ఉమ్మడి రాష్ట్రంలో పిల్లల రక్షణ కోసం 10 మంది పిల్లలకు ఆయాలను పెట్టేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత దీన్ని ఎత్తేశారు. మళ్ళీ దీన్ని అమలు చేయాలి. ప్రస్తుతం మంచినీళ్ళు ఎవరి బాటిల్ వాళ్ళే తెచ్చుకోవాలి. పని ప్రదేశంలో గ్రూపు సభ్యులకు మంచినీరు ఇచ్చేందుకు గతంలో ఓ మనిషిని పెట్టుకొని కూలీ ఇచ్చేవారు. కానీ దాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తీసివేసింది. దీని వల్ల ఉపాధి కూలీలు తగ్గడమే కాకుండా చాలా మంది మంచినీరు దొరక్క ఇబ్బందులుపడతున్నారు.ఉపాధి హామీ చట్టంలో ఎస్సీ, ఎస్టీ బీడు భూములు బాగు చేసుకోవడం కోసం, చిన్న సన్నకారు రైతుల సాగుభూమి అభివృద్ధి కోసం పెట్టాలి. కానీ ఇది తెలంగాణ ప్రభుత్వం దీన్ని కూడా విస్మరించింది. అలాగే వెనకబడిన వాడలో అభివృద్ది పనుల కోసం అంటే రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మించడంలో వీరికి పని కల్పించాలి. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీ బిల్డింగుల్లు నిర్మించడం కోసం జీవో తెచ్చి వెయ్యి కోట్ల కేటాయించింది. ఇది ఉపాధి హామీ కూలీలకు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. అలా కాకుండా ఈ పనిని ఉపాధి కూలీలకు ఇవ్వాలి. అసలు ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తే అందరికీ చేతినిండా పని దొరుకుతుంది.
- బుర్రి ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు
సమయానికి కూలి ఇవ్వరు
ఇటీవల నేను సర్వే కోసం మెదక్ జిల్లా వెళ్ళాను. అక్కడ అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. కూలీలకు మంచి నీళ్ళ సౌకర్యం ఉండదు. వీళ్ళు కష్టపడి మోసుకొచ్చుకున్నా ఎండకు వేడెక్కిపోతాయి. అందుకే వీరికి తోలు తిత్తులు ఇస్తే బాగుంటుందని డిమాండ్ చేస్తున్నాము. అలాగే గ్లూకోజ్ ప్యాకెట్లు కూడా ఇస్తే పని చేసే క్రమంలో వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ఇప్పటికీ మెదక్ జిల్లాలో ఆరుకోట్ల బకాయిలు ఉన్నాయి. నాలుగు ఐదు నెలల నుంచి కూలి డబ్బులు రావడం లేదు. పోయిన దసరాకు హరితహారం కింద పని చేస్తే ఇప్పటి వరకు కూలి ఇవ్వలేదు. మౌళిక వసతులు మాత్రం అస్సలు లేవు. కమీషన్, మండల అధికారులతో మాట్లాడితే మే నెలలో కొన్ని మెడికల్ కిట్టు ఇచ్చారు. కాని అందులో వీళ్ళకు ఉపయోగపడేవి లేవు. మరో ముఖ్య విషయం ఏమిటంటే గతంలో ఏ గ్రామంలో పని చేసిన వారికి ఆ గ్రామంలోనే పోస్ట్ ఆఫీస్లో కూలి డబ్బులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మెదక్లోని బ్యాంకుకు వెళ్ళి కూలి డబ్బులు తెచ్చుకోవాల్సి వస్తుంది. దీని వల్ల కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే గతంలో మాదిరిగా పోస్ట్ ఆఫీస్ ద్వారానే డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నారు. అలాగే కూలి డబ్బులు కూడా నెలల తరబడి పెండింగ్లో ఉంచుతున్నారు. తట్ట, పార, గడ్డపార వంటి పనిముట్లు 2011లో ఇచ్చారు. పాతవి పాడవ్వడం వల్ల పని సరిగా చేయలేకపోతున్నారు. అలాగే కొత్త మేట్లను పెట్టే సందర్భంలో పాత వాళ్ళను సంప్రదించడం లేదు. దీని వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి.
- పద్మ, ఉపాధి హామీ మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్
చెట్టు నీడ కూడా ఉండదు
గ్రామాల్లో కూలీలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. రెండు వారాలకు ఒకసారి బిల్లులు ఇస్తున్నారు. కాని ఒక్కసారి కూడా ఇవ్వలేదు. నెలకు ఓసారి మాత్రమే ఇస్తారు. మెడికల్ కిట్టు లేదు. పని చేసేటప్పుడు ఎలాంటి ప్రమాదానికి గురైనా పట్టించుకునేవారు లేరు. మంచినీరు ఉండదు. వీళ్ళతో పాటు తెచ్చుకున్న నీరు వేసవిలో వేడిగా అయిపోతాయి. ఒక్కొక్కరు పని కోసం మూడు నాలుగు కిలో మీటర్ల దూరం నుండి వస్తారు. పార, గడ్డపార, తట్ట మోసుకోవడానికే ఇబ్బందిగా ఉంటుంది. ఇక నీళ్ళు ఎలా మోసుకురాగరు. కూలీల సమస్యలను ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. కొన్ని సందర్భాల్లో పని చేసే చోట కనీసం చెట్టు నీడ కూడా ఉండదు. బిల్లులు రాకపోవడం, వంద రోజుల పని లేకపోవడం వల్ల పని చేసే వారి సంఖ్య గతం కంటే చాలా తగ్గిపోయింది. ఉపాధి కూలీల్లో మహిళలు ఎక్కువగా ఉంటారు. వీరికి సరైన సౌకర్యాలు ఉండవు. ప్రస్తుతం జిల్లాలో పది కోట్లు పెండింగ్లో ఉన్నాయి. రోజుకు 205 రూపాయలు ఇస్తామని చెప్పారు. కాని 100 రూపాయలు కూడా సరిగ్గా రావడం లేదు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వేసవిలో పని చేసినందుకు మాత్రం 30 రూపాయలు అదనంగా ఇస్తారు. జూన్ నుండి అది కూడా ఉండదు.
- అగిలి పద్మావతి, సూర్యాపేట
Authorization