మున్సిపల్ కార్మికుల్లో అత్యధికులు దళిత, గిరిజన, బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలు. పారిశుధ్య పనులను సమాజంలో ఇతర కులాలు, వర్గాల వారు అసహ్యించుకొని దూరంగా వుంటారు. అలాంటిది మున్సిపల్ కార్మికులు సమాజహితం కోసం, ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఈ పనుల్లో కొనసాగుతున్నారు. వారికి పనికి తగ్గ వేతనాలు చెల్లించి, వారి ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వున్నది. కానీ వారి గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
రాష్ట్రంలో పని చేస్తున్న మున్సిపల్ కార్మికులందరికీ 10వ పీఆర్సిలో నిర్ణయించిన మినిమమ్ బేసిక్ ఆధారంగా 2014 జూన్ 2 నుండి వేతనాలు పెంచాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం అలా పెంచలేదు. పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యతతో పోరాటం చేస్తున్న కార్మికుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. జిల్లాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచకుండా కేవలం గ్రేటర్ హైదరాబాద్లో పని చేస్తున్న కార్మికులకు మాత్రమే వేతనాలు పెంచారు.
అన్యాయం చేశారు
అప్పట్లో గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ పరిధిలో పని చేస్తున్న కార్మికుల ఓట్లకు గాలం వేసేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. వారికి మాత్రమే వేతనాలు పెంచారు. అయితే జిల్లాల్లో పని చేస్తున్న వారికి వేతనాలు పెంచకుండా అన్యాయం చేశారు. దాంతో ఆ కార్మికులు తమకు కూడా వేతనాలు పెంచాలని ఎన్నో పోరాటాలు చేశారు. దాంతో జిల్లాల్లో పని చేస్తున్న కార్మికులకు కూడా జీవో నెంబర్ 14లో పేర్కొన్న వేతనాలను కేటగిరిలను బట్టి ఇస్తామని ప్రభుత్వం మాట ఇచ్చింది. ఆ మాట ఇచ్చి ఇప్పటికి ఏడాది కావొస్తుంది. అయినా ఇంత వరకు వేతనాలు పెంచలేదు. జీవో జారీ చేయలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకిచ్చిన మాట తప్ప కుండా వెంటనే జీవో జారీ చర్యలు తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు.
చేతులు దులుపుకుంటున్నారు
రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంపు కోసం కార్మికులు పోరాడినప్పుడల్లా తూతూమంత్రంలా చర్చలు జరిపి, హామీలిచ్చి చేతులు దులుపుకొని తరువాత మోసం చేస్తున్నది. మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సారైనా సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్ళీ ఐదేండ్ల వరకు పాలకులు తమ గురించే పట్టించుకోరు. అందుకే ఈసారి తాడోపేడో తేల్చుకోడానికి మున్సిపల్ కార్మికులు నిర్ణయించుకున్నారు. వేతనాలు జీతాల పెంపు జీవో విడుదలయ్యే వరకు పోరాడాలని, సమ్మెతో సహా అన్ని రకాల ఆందోళనలకు పూనుకోవాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కార్మికుల సంఘం నిర్ణయించింది.
కార్మికుల పట్ల వివక్ష
హైదరాబాద్ జీహెచ్యంసీలో పని చేస్తున్న వారికి 2015 జూలై నెలలో వేతనాలు రూ.8,500 ల నుండి రూ.12,500లకు పెంచారు. మళ్ళీ 2017 మే 23న మరోసారి రూ.1500లు పెంచి, నెలకు 14,000లు చెల్లిస్తున్నారు. కేవలం జీహెచ్యంసీలో పని చేస్తున్న వారికి మాత్రమే వేతనాలు పెంచి జిల్లాల్లో పనిచేస్తున్న మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, నగర పంచాయితీ కార్మికులకు వేతనాలు పెంచకపోవడం అన్యాయం. ఇది చట్ట విరుద్ధం. వివక్ష కిందికే వస్తుంది. సుప్రీంకోర్టు ఒకే రకమైన పనులు చేస్తున్న వారి మధ్య వేతన వ్యత్యాసాలుండరాదని, కాంట్రాక్ట్ కార్మికుడికి సైతం పర్మినెంట్ ఉద్యోగితో పాటు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని తీర్పునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఒకే పనులు చేసే కాంట్రాక్ట్ కార్మికులకు జీహెచ్ఎంసీ హైదరాబాద్లో ఒక రకంగా, జిల్లాలో మరో రకంగా వేతనాలివ్వడం మరీ దారుణం. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి కార్మికులదరికి సమాన పనికి సమాన వేతనాలివ్వాలి.
నష్టపోయిన కార్మికులు
సుదీర్ఘ పోరాటం తరువాత రాష్ట్రంలో వివిధ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ వారికి వేతనాలు పెంచుతూ, ప్రభుత్వం జీవో నెం. 14ను తేది.19.2.2016న విడుదల చేసింది. దాని ప్రకారం మున్సిపాల్టీల్లో పని చేస్తున్న వారికి కేటగిరీలను బట్టి పారిశుద్ధ్య కార్మికుడికి రూ.12,000లు, డ్రైవర్కి రూ.15,000లు, బిల్ కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్కి రూ.17,500లు వేతనం ఇవ్వాలి. జీవో నెంబర్ 14 విడుదలై రెండున్నరేండ్లు గడుస్తున్నా అది నేటికీ అమలుకాలేదు. ఈ జీవో అమలుకాకపోవడంతో 24 నెలల్లో మున్సిపాల్టీలో ఒక పారిశుద్ధ్య కార్మికుడు రూ.88,800లు, నగర పంచాయితీలో రూ.1,12,800లు, మున్సిపాల్టీల్లో డ్రైవర్ రూ.1,60,800లు, నగర పంచాయితీలలో రూ.1,84,800లు, మున్సిపాల్టీలో ఒక బిల్ కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్ రూ.2,20,800లు, నగర పంచాయితీలో రూ.2,44,880లను నష్టపోయారు.
బహిరంగంగా ప్రకటించి
రాష్ట్ర ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి గతంలో 'మాది మాట తప్పే వంశం కాదు, అవసరమైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం తలనైనా నరుక్కుంటాం' అని అనేకసార్లు బహిరంగంగానే ప్రకటించారు. కాబట్టి మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపు విషయంలో కూడా మాటతప్పకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి వుండాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
చిత్తశుద్ది లేదు
2015లో సమ్మె చేసినప్పుడు ముఖ్యమంత్రిగారే స్వయంగా సమ్మె విరమించి కొంత సమయం ఇస్తే వేతనాలు పెంచుతామని మాట ఇచ్చారు. మాటిచ్చి ఇప్పటికి సుమారు మూడేండ్లు. జిల్లాల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాల పెంపుతో పాటు ఇతర సమస్యల్ని పరిష్కరించాలని 2017 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వానికి జేఏసీ సమ్మె నోటీసు ఇవ్వగా, మున్సిపల్శాఖ మంత్రి జేఏసీ నాయకులతో చర్చలు జరిపారు. జీవో నెంబర్ 14లో పేర్కొన్న వేతనాలను కేటగిరీల వారీగా అమలు చేస్తామని మాట ఇచ్చారు. మంత్రిగారి మాట ప్రకారం జేఏసీ సమ్మెను విరమించింది. మంత్రి గారు మాట ఇచ్చి ఏడాది కావొస్తున్నా వేతనాల పెంపు జీవో విడుదల కాలేదు. ఇలా ప్రతి సారి ఇచ్చిన మాటను పాలకులు తప్పుతున్నారు. ఈ ప్రభుత్వానికి కార్మికుల పట్ల నిజంగా చిత్తశుద్ధి వుంటే ఇప్పటికైనా తక్షణమే జీవో విడుదలకు చర్యలు తీసుకోవాలి.
ఆందోళన చేయాల్సిందే
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేండ్లు దాటింది. ఈ నాలుగేండ్లలో మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపు, పర్మినెంట్ విషయంలో మాటలు దాటవేస్తూ మోసం చేస్తున్నది. ఇంతకాలం ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు విని నష్టపోయారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం మొదలుకొని బతుకమ్మ, దసరా, దీపావళి, సంక్రాంతి, కేసీఆర్ జన్మదినం, చివరకు శివరాత్రి పండుగకైనా వేతనాలు పెంచుతారేమోనని కండ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఇన్నేండ్లుగా ఎదురు చూసిన కార్మికులకు నిరాశే మిగిలింది. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. అధికారంలో ఉన్న నాయకులతో పాటు, ప్రతిపక్ష నాయకులు ఎన్నికల యాత్రలు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వేతనాల సంగతి ఇక అంతే. అందుకే కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లయిన పర్మినెంట్, వేతనాల పెంపు కోసం యూనియన్లు, జెండాలతో నిమిత్తం లేకుండా గత మూడు రోజుల నుంచి పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.
ప్రభుత్వం స్పందించడం లేదు
రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల వేతనాలు గతం కంటే భారీగా (163శాతం) పెరిగాయి. మున్సిపల్ కార్మికులకు మాత్రం పైసా వేతనం పెరగలేదు. రోజురోజుకు పెరిగే నిత్యవసరాల ధరలతో కుటుంబాలు గడవడం లేదు. పస్తులతో పని చేయలేకపోతున్నారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సినంత సమయం ఇచ్చినా స్పందించడం లేదు. అనివార్య పరిస్థితుల్లో మళ్ళీ పోరుబాట పట్టనున్నారు.
Authorization