మిషన్ భగీరథó, భూ సర్వే, కేసీఆర్ కిట్లు, రైతుబంధు మొదలైన రాష్ట్ర ప్రభుత్వ పథకాలు విజయవంతంగా అమలు కావడానికి వెనుక కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కృషి ఎంతో ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వీరి గురించి ఆలోచనే లేదు. పీఆర్సీ కోసం ఇప్పటికే కమిటీని వేశారు. కానీ ఈ ఉద్యోగుల ప్రస్తావనే లేదు. అందుకే వీరంతా ఈ నెల 15వ తేదీన శంఖారావం పూరించనున్నారు.
తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వ్యవస్థ రద్దు.. వంటి అనేక ఆకాంక్షలు నెరవేరతాయని ప్రజలు ఆశించారు. ఆచరణలో దానికి భిన్నమైన పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగులకు 10వ పీఆర్సీ 2014లో అమల్లోకి వస్తే వీళ్ళకు మాత్రం రెండేండ్లు కొట్లాడిన తర్వాత 2016 ఫిబ్రవరిలో జీవో 14 విడుదలైంది. ఇప్పటికీ 80 శాతం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీవో నెం.13 అమలు కావడం లేదు. 2018 జూలై 1 నుండి పర్మినెంట్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ద్వారా జీతాలు పెరగాల్సి వున్నది. ఈ పరిస్థితిలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు వీరికీ జీతాలు పెరగాలి. ఇతర సమస్యలు ఎన్నో పరిష్కారం కావాలి. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిర్ణయించింది.
ప్రభుత్వానికి వినపడేలా
పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న వీరికి సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన హక్కు. దానిని సాధించుకోవాలంటే ఐక్యంగా పోరాటం చేయడం ఒక్కటే మార్గం. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జూలై 15న శంఖారావం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, టైమ్ స్కేల్ ఉద్యోగులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి తమ డిమాండ్లు వినిపించబోతున్నారు.
కల్లబొల్లి హామీలిచ్చి
''పర్మినెంట్ చేస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పింది. ఉమ్మడి 10 జిల్లాల్లోని సిబ్బందినే 31 జిల్లాలకు సర్దుబాటు చేసారు. ఖాళీగా వున్న 90వేల కొత్త పోస్టులు నింపడానికి మాత్రం చర్యలు తీసుకోవట్లేదు. జీతాలు రెండు, మూడు నెలల వరకూ చెల్లించకుండా సతాయిస్తున్నారు. సెలవు రోజుల్లో కూడా అధికారులు ఆదేశిస్తే డ్యూటీ చేయాల్సిందే. అధికారం కోసం కల్లబొల్లి హామీలిచ్చి ద్రోహం చేయడం పాలక రాజకీయ పార్టీల నిజస్వరూపం. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే మార్గంలో పయనిస్తున్నది. ఈ స్థితిలో మనం నిరాశకు గురౌదామా? పిడికిలి బిగించి పోరాడదామా? తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైనది'' అంటూ పోరుబాట పట్టనున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు.
బతుకుల్లో మార్పు కోసం
పెరిగే ధరలు, ఇంటి కిరాయిలు, విద్య, వైద్యం వంటి భారాలతో ఈ ఉద్యోగులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ప్రతి కుటుంబం నెలకు వేల రూపాయలు అప్పులు చేయాల్సి వస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో 3.70 కోట్ల మందికి సేవలందిస్తున్న వీరి బతుకుల్లో మార్పు కోసం 2018 జూలై 15న జరిగే శంఖారావంలో పాల్గొనబోతున్నారు. ''ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి, హక్కులు సాధించుకుందాం. విజయాలు సాధిద్దాం'' అంటూ నినదిస్తున్నారు.
కోర్టు అడ్డుకుంటుందంటూ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు హయాంలో ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరినీ పర్మినెంట్ చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఇచ్చిన ఉపన్యాసాలు విని నిజంగానే వీరి జీవితాల్లో వెలుగు నిండుతాయనుకున్నారు. కానీ రాష్ట్రం వచ్చి నాలుగేండ్లు గడిచిపోయాయి. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగిని కూడా పర్మినెంట్ చేయలేదు. మేనిఫెస్టోలో మాత్రం పర్మినెంట్ చేస్తామని పెట్టారు. అప్పటి నుండి వీరు ఎదురుచూస్తూనే ఉన్నారు. ''మేం చేయాలనుకుంటున్నాం, కానీ కోర్టు అడ్డుపడుతుంది'' అంటూ తప్పించుకుంటున్నారు.
కడుపు నిండా తిండి అంటూ...
ఒక్క ఎస్ఎస్సీ బోర్డులోనే 2008 నుండి ఇప్పటి వరకు రెండు సార్లు కొంత మందిని ఉద్యోగాల నుండి తొలగించారు. సాక్షరభారత్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఇలాగే తొలగించారు. పర్మినెంట్ చేసే లోపు వీరి ఉద్యోగాలు ఉంటాయో లేదో తెలియక అభద్రతా భావంలో బతుకుతున్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. ''ఇకపై తెలంగాణలో ఒక్కటే రిజిస్టర్ ఉంటుంది. నాలుగైదు రిజిస్టర్లు ఉండనే ఉండవు'' అంటూ ఉపన్యాసాలు ఇచ్చారు. ఏడాది కింద ''కాంట్రాక్ట్ ఉద్యోగులకు కడుపు నిండా తిండి పెడతాను'' అంటూ చెప్పుకొచ్చారు. మాటలు ఎన్ని చెప్పినా ఇప్పటి వరకు వీరికి ఉద్యోగ భద్రత లేదు. సమాన పనికి సమాన వేతనం లేదు. అందుకే పోరాటం తప్ప మరో మార్గం లేదని ముందడుగు వేశారు.
ఉద్యోగులమా? నిరుద్యోగులమా?
15 ఏండ్ల నుంచి పని కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఉన్నాను. ప్రస్తుతం ఎస్ఎస్సీ బోర్డులో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నాను. నాలాగే వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రాష్ట్రంలో ఉన్నారు. ఈ ఉద్యోగంలో చేరేటప్పుడు నా వయసు 20ల్లో ఉంది. ఇప్పుడు 40 ఏండ్లు దాటాయి. ఇప్పుడు ఈ ఉద్యోగం పోతే ఏ ప్రభుత్వ ఉద్యోగానికీ ప్రిపేర్ అయ్యే అవకాశం లేకుండా పోయింది. పర్మినెంట్ చేస్తామని మాట ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తున్నారు. అసలు మేము ఉద్యోగులమా? నిరుద్యోగులమా? తెలియని స్థితిలో ఉన్నాం. సెలవు పెట్టి పెండ్లి చేసుకుని వచ్చే లోపు ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు. అందరం పీజీలు చేసి వచ్చినవాళ్ళం. అక్రమంగా ఈ ఉద్యోగంలో చేరలేదు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే వచ్చాము. ఇప్పుడు మా బతుకులు అటు ఇటు కాకుండా ఉన్నాయి. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పని చేస్తున్నాం. కానీ వాళ్ళ బేసిక్ మా జీతంగా నిర్ణయించారు. వేతనాల విషయంలో మాపై ఇంత దారుణంగా వివక్ష చూపుతున్నారు. అందుకే ఈ నెల 15వ తేదీన ప్రభుత్వానికి మా సమస్యలు వినిపించేలా శంఖారావం పూరిచబోతున్నాం. - సైదులు, ఎస్ఎస్సీ బోర్డ్, జూనియర్ అసిస్టెంట్
మాట నిలబెట్టుకోవాలి
2013లో ఈ ఉద్యోగంలో చేరాను. పై అధికారులు ఏం పని చెబితే అది చేయాలి. మొదట్లో ఇఎస్ఐ, పీఎఫ్ కటింగ్లు పోను 7వేల రూపాయలు మా చేతికి వచ్చేవి. ఇప్పుడు 13 వేలు వస్తున్నాయి. ఇందులో వెయ్యి రూపాయలు బస్ పాస్కే పోతాయి. ఇక మిగిలిన వాటితోనే కుటుంబం గడవాలి. నేనూ నా భర్త ఇద్దరం పని చేసినా ఖర్చులకు చాలడం లేదు. పిల్లల చదువులకూ సరిపోవు. అప్పులు చేయవల్సి వస్తోంది. ఇప్పుడు ఉద్యోగం నుండి తొలగిస్తే చావు తప్ప మరో పరిష్కారం కనిపించడం లేదు. ముఖ్యమంత్రి తలచుకుంటే ఏమైనా చేస్తారు. సీఎల్ తీసుకోవాలంటే నలుగురి పర్మిషన్ తీసుకోవాలి. ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా ఆబ్సెంట్ పెడతారు. జీతం కట్ చేస్తారు. ఇలా చిన్న చిన్నవి, చెప్పుకోలేని సమస్యలు ఎన్నో ఎదుర్కొంటున్నాం. కేసీఆర్ పర్మినెంట్ చేస్తారనే నమ్మకంతోనే ఉద్యోగంలోకి వచ్చాం. తెలంగాణ కోసం మేమంతా కొట్లాడాం. ఓట్ల కోసం పని చేశాం. ఇప్పటికైనా పర్మినెంట్ చేస్తే మా బతుకులు బాగుపడతాయి.
- అన్నపూర్ణ, వెటర్నరీ బయోలాజికల్ అండ్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్(వీబీఆర్ఐ), జూనియర్ అసిస్టెంట్
డిమాండ్లు
- 2018 జూలై 1 నుండి రెగ్యులర్ ఎంప్లాయీస్ పీఆర్సీతో పాటే ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలి.
- ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, కార్పోరేషన్లు, యూనివర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చెయ్యాలి.
- సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.
- మహిళలకు 6 నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చెయ్యాలి.
- ప్రతినెలా 5వ తేదీలోగా జీతం చెల్లించాలి. పే స్లిప్లు ఇవ్వాలి.
- ప్రభుత్వ డిపార్టుమెంట్ ఐడి కార్డు ఇవ్వాలి.
- బస్పాస్ సౌకర్యం కల్పించాలి.
- ప్రమాద, జీవిత బీమా సౌకర్యం అందివ్వాలి.
- వేధింపులు ఆపాలి.
- ఆంధ్రప్రదేశ్కు కేటాయించబడ్డ తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తేవాలి.
- తొలగించబడిన సాక్షర భారత్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తిరిగి పనిలోకి తీసుకోవాలి.
Authorization