ఆగస్టు 7... దేశ వ్యాప్త సమ్మెతో రవాణా రంగం స్థంబించి పోయింది. ఆరోజు బస్సులు, ఆటోలు, క్యాబ్లు లేక రోడ్లన్నీ బోసి పోయాయి. ప్రయాణీకులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ రోజు వారీ పనులకు ఆటంకం కలిగించిన ఈ సమ్మెను ఎంతో మంది తిట్టుకొని ఉంటారు. ''వీళ్ళకు పనీ పాటా ఏమీ ఉండదు. చీటికీ మాటికీ సమ్మెలంటరూ, జనం బాధలు వీరికి అర్థం కావా?'' అని ఎన్నో అనుకొని ఉంటారు. కానీ ఆ రోజు సమ్మె జరిగింది సాధారణ జనం బాగు కోసమే అని చాలా మందికి తెలియదు. అసలు ఆ రోజు సమ్మె ఎందుకు, ఎవరికోసం జరిగిందో నేటి కొలువులో...
రవాణా రంగంలో పని చేసే కార్మికులకు సంక్షేమ చట్టాన్ని ఏర్పాటు చేయాలని కొన్ని ఏండ్లుగా పోరాడుతున్నారు. ప్రమాదబీమా, కుటుంబ పెన్షన్, పిల్లల చదువులకు స్కాలర్షిప్ వంటివి అందులో ఉండాలని అడుగుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రావాణా రంగం మొత్తాన్ని పెద్ద పెద్ద సంస్థలకు కట్టబెట్టాలన్న ఎంవీ యాక్టు సవరణ బిల్లును రాజ్యసభలో తీసుకువస్తున్నది. అందుకే ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశంలోని రవాణా కార్మికులందరూ భాషలకు, ప్రాంతాలకు అతీతంగా ఆగస్టు 7 మూకుమ్మడిగా సమ్మె చేశారు.
బిల్లు రాకముందు కష్టాలు
ఎంవీ యాక్టు సవరణ బిల్లు వల్ల రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని వేల మంది లైసెన్సులు రద్దయినాయి. వందల మంది జైళ్ళపాలయ్యారు. ఈ చర్యలన్నింటికీ మూలం కేంద్రం తెస్తున్న ఎంవీ యాక్టు సవరణ బిల్లే. ఈ బిల్లు ఇంకా ఆమోదం కాకుండానే కొన్ని రాష్ట్రాల్లో అందులోని అంశాలను జీఓలుగా, గెజిట్ నోటిఫికేషన్లుగా ఇచ్చి అమలు చేస్తున్నాయి. అటువంటి బిల్లు చట్టమైతే వీరి పరిస్థితి ''పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు'' అవుతుంది. అందుకే ఈ బిల్లులను రవాణా కార్మికులందరూ వ్యతిరేకించాలి.
మునుపెన్నడూ లేని విధంగా
అధికారంలోకి రాకముందు బీజేపీ పార్టీ దేశ ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరలు భారం కాకుండా తగ్గిస్తామని హామీ ఇచ్చింది. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రిస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక విపరీతంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచింది. గతంలో 4-5 నెలలకు ఒక్కసారి పెరిగే ధరలు ఇప్పుడు ఏ రోజుకారోజు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మునుపెన్నడు లేనంత తక్కువగా ముడి చమురు ధరలు తగ్గాయి. అయినా మన దేశంలో, రాష్ట్రంలో ధరలు పెరుగుతున్నాయి.
ఇప్పటికే ఎన్నో సమస్యలు
ఉపాధి మార్గం లేక కుటుంబ పోషణకై ఎంతో మంది ఆటోలు నడుపుకుంటున్నారు. వచ్చే సంపాదనతో బతకడం కష్టమౌతుంది. ''పుండుపైన కారం చల్లినట్లుగా'' పోలీసులు, ఆర్టీఏ అధికారుల దాడులు, కేసులు, వేల రూపాయలు పెనాల్టీలు నిత్య కృత్యం అయ్యాయి. నగరాలు పెరుగుతున్నాయి కాబట్టి గ్రామాల నుంచి ఆటోలు నగరాల్లోకి రానివ్వమని నగర శివారుల్లోనే పోలీసులు ఆపేస్తున్నారు. అనేక నగరాల్లో ఈ దుస్థితికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. అవి చాలవన్నట్లుగా పైనాన్స్ సంస్థల వేధింపులు పెరుగుతున్నాయి.
పెనాల్టీలు చట్టబద్దమౌతాయి
కేంద్ర ప్రభుత్వం తేబోతున్న ఈ ఎంవీ చట్టం వల్ల రాబోవు రోజుల్లో ఆటో కార్మికులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తున్నది. వేల రూపాయల పెనాల్టీలు చట్టబద్దమౌతాయి. చిన్న పొరపాటుకు జరిమానాగా లైనెన్సు రద్దుయ్యే ప్రమాదం ఈ చట్టం వల్ల వస్తుంది. అనుకోకుండా జరిగే చిన్న చిన్న తప్పులకు సంవత్సరాల పాటు జైల్లో పెట్టాలని చట్టంలో ఉన్నది. కాబట్టే ఈ ఎంవీ యాక్టు సవరణ బిల్లును వ్యతిరేకించాలని కార్మికులందరూ దేశవ్యాప్తంగా ఏకమయ్యారు.
కార్పొరేట్ కంపెనీల కోసమే
రోడ్డు రవాణా రంగంలో ఉపాధి పొందుతున్న ఆటోరిక్షా, టాక్సీ, ప్రైవేట్బస్, స్కూల్ బస్లూ, ట్రాక్టర్, ఆర్టీసీలు, డ్రైవింగ్ స్కూల్స్, ప్రైవేట్ మెకానిక్ వర్క్షాప్ల్లో విడిభాగాలు అమ్మె దుకాణాలు, వినియోగించిన కార్లను అమ్మే వారందరూ నేడు తీవ్రమైన సంక్షోభంను ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ కూడా భారతదేశ ప్రజలకు అనేక రకాలుగా తమ సేవలందిస్తున్నాయి. కోట్లాది మంది కోసం పని చేస్తున్న వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందకపోగా, అనేక రకాల భారాలు మోపడంతో పాటు విపరీతమైన వేధింపులకు గురవుతున్నారు. ఇప్పటికే ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న ఈ ట్రాన్స్పోర్టు కార్మికులకు మరో పెద్ద సమస్య వచ్చిపడబోతున్నది. కోట్లాదిమంది వాహన యజమానులను, కార్మికులను వీధులపాలు చేసి, దేశ రోడ్డు రవాణా రంగాన్ని విదేశీ, స్వదేశీ బహుళజాతీ కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేందకు ఎంవీ యాక్టు సవరణల బిల్లును కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది.
తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు
అత్యధిక మంది ఆటోరిక్షాలు, టాక్సీ, లారీలు, ప్రైవేట్ బస్ల యజమానులు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల నుంచి అప్పుతీసుకుని, వాటిపైన వస్తున్న అతి తక్కువ ఆదాయంతో తమ జీవితాలను గడుపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంధన ధరలు పెరుగుతుండటం, రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, లైసెన్స్ రెన్యువల్ వంటి సర్వీస్ చార్జీలను విపరీతంగా పెంచడంతో పాటు మొత్తం రోడు రవాణా రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడుతున్నది. తమ వాహనాల కొనుగోలు కిస్తీలను కట్టలేక తమ వాహనాలు సీజ్ చేయబడుతున్నాయి. చిన్న చిన్న పొరపాట్లుకు కూడా వేల రూపాయలు వసూలు చేయడమేకాక, పోలీసుల వేధింపులు తీవ్రం అవుతున్నాయి.
ఇన్సూరెన్స్ కంపెనీల లాభాలకోసం
బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఈ 4 ఏండ్లలో ధర్డ్పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంను 100 శాతం పెంచి వాహన యజమానులపై తీవ్రమైన ఆర్థిక భారం మోపారు. ఆభారం భరించలేమనుకుంటుంటే పెద్ద, చిన్న వాహనాల 3, 5 ఏండ్ల ఇన్సూరెన్స్ను ఒకేసారి చెల్లించాలన్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. వాహన ఇన్సూరెన్స్ రంగంలోకి వచ్చిన స్వదేశీ, విదేశీ ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభాలు గ్యారెంటీ చేయడం కోసమే వాహన యజమానులపై తీవ్రమైన భారాలు మోపుతూ మోసం చేస్తున్నారు.
సామాజిక భద్రత లేదు
రోడ్ రవాణా రంగంలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులకు ఎంవీ యాక్టు అమలు చేయడం లేదు. పీఎఫ్, ఇఎస్ఐ వర్తింపచేయడం లేదు. వారు జబ్బుపడ్డా, ప్రమాదాలకు గురయినా, ముసలితనంలో ఆదుకోవడానికి, సార్వత్రిక సమాజిక పథకం ఏదీ అమలు చేయడం లేదు. వి.వి.గిరి నేషనల్ ఇనిస్టిట్యూట్ అధ్యయనం చేసి సమాజిక భద్రతతో పాటు కార్మిక చట్టాలలో మార్పులు ప్రతిపాదిస్తూ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి 11 సంవత్సరాలు అయింది. పాలకులు మారినా ఆ సిఫార్సులు మాత్రం అమలు చేయడం లేదు.
ఆర్టీసీలన్నీ కుప్పకూలిపోతాయి
రాష్ట్రాల అభివృద్ధిలో ఆర్టీసీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. దాదాపు రోడ్డువున్న ప్రతి గ్రామానికి బస్ సౌకర్యం కల్పించి ప్రజలకు సేవచేస్తున్నాయి. సమాజంలో అట్టడుగున వున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్ను కచ్చితంగా అమలు చేస్తూ వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఎంవీ యాక్టు సవరణ జరిగితే, ఆర్టీసీలన్ని కుప్పకూలిపోతాయి. చట్టంలో వున్న లొసుగులు వినియోగించుకొని, బస్ల ఆపరేషన్స్ కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి పోతాయి. ఆర్టీసీ బస్ల స్థానంలో కార్పొరేట్ కంపెనీల బస్సులు వచ్చి ప్రజలను నిలువునా దోచుకుంటాయి. రాష్ట్రాల సమగ్రాభివృద్ధి క్షీణిస్తుంది. ఆర్టీసీలలో పని చేస్తున్న 7 లక్షల మందికిపైగా ఉద్యోగులు, పరోక్షంగా ఆదారపడ్డ కోట్లాది మంది తమ ఉపాధిని కోల్పోతారు.
ఈ రంగాన్ని రక్షించడం కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిన కేంద్రం ఆపని చేయకపోగా ఎంవీ యాక్టు సవరణ ద్వారా ఓలా, ఉబర్ల లాంటి విదేశీ కంపెనీల చేతుల్లోకి నెడ్తుతున్నది. నిర్ధేశించిన కంపెనీల విడిభాగాలనే వాడాలని, ఆయా కంపెనీలను గ్యారెంటి చేస్తుంది. లక్షల మంది మెకానిక్లను, విడిభాగాలమ్మే షాపు యజమానులను నిర్ధాక్షిణ్యంగా ఈ రంగం నుండి నెట్టివేస్తున్నది. ఇంతటి ఘోరమైన బిల్లు సవరణను రద్దు చేయాలనే రావాణా కార్మికులు ఆగస్టు 7న దేశ వ్యాప్తంగా సమ్మె చేశారు.
కార్మికుల డిమాండ్స్
- రవాణా రంగాన్ని సర్వనాశనం చేసి, కార్మికుల కడుపుకొట్టే ఎంవీ యాక్టు సవరణ బిల్లును రద్దు చేయాలి.
- రవాణా రంగ కార్మికులకు సమగ్రమై సంక్షేమ చట్టం చెయ్యాలి.
- ప్రయివేట్ పెనాన్స్ సంస్థల వేధింపులు ఆపాలి.
- డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలి.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ల నుంచి రంగాలు ఇవ్వాలి.
- నగరాల్లోకి ఆటోలను అనుమతించాలి.
- పోలీసు, ఆర్టీఏ అధికారుల వేధింపులు ఆపాలి.
- థర్డ్పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలి.
Authorization