తాము ఎన్నో ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్నా... ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న గ్రామపంచాయితీ కార్మికులు జూలై 23 ఉండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. వీరి సమ్మెకు రాజకీయాలకు అతీతంగా గ్రామ స్థాయిలో అధికార పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక సంస్థలు, ట్రేడ్ యూనియన్లు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయి. ఎన్ని కష్టాలొచ్చినా సమ్మె డిమాండ్లను పరిష్కరించుకోవాలనే పట్టుదలతో ముందడుగు వేస్తున్నారు. ఆగస్టు 11న హైదరాబాద్లో జరిగిన ఆత్మగౌరవ పోరాట సభలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గంటల తరబడి వేలాది మంది పాల్గొన్నారు. ఆగస్టు 14 అర్ధరాత్రి అన్ని మండల కేంద్రాల్లో పంచాయితీ సిబ్బంది జాగరణలో పాల్గొని జయప్రదం చేశారు. ఇదే పోరాట స్ఫూర్తితో సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగించాలని తెలంగాణ గ్రామ పంచాయితీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది
ప్రభుత్వం వీరి సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నది. రోజుకొక ప్రకటన చేస్తూ గందరగోళ పరుస్తున్నది. జిల్లా కలెక్టర్లు, డీపీఓలను ఉపయోగించి సమ్మెను విరమింపజేయాలని కుట్రలు పన్నుతున్నది. ప్రభుత్వానికి వత్తాసు పలికే నాయకులను ఉపయోగించి సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నది. అయితే ఉద్యోగులు, కార్మికులు ఏకమై ప్రభుత్వం చేసే జిమ్మిక్కులను, కుట్రలను చిత్తు చేయాలని, ఇలాంటి విచ్ఛిన్నకర శక్తులను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా రాష్ట్ర జేఏసి నాయకత్వంతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
గందరగోళ పరుస్తున్నా ప్రభుత్వం
''సమ్మె ప్రారంభించిన మరుసటి రోజే 9,355 మందిని డిగ్రీ అర్హతతో పంచాయితీ రాజ్ శాఖలో కార్యదర్శుల నియామకాలు చేపడతామని, నెలకు వేతనం 15 వేల రూపాయలు ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. వారం రోజులు తిరగకుండానే 6,603 పోస్టులకు కుదించి క్యాబినెట్ సమావేశం నిర్ణయించి ప్రకటించింది. వారం రోజుల్లోనే 3 వేల ఉద్యోగాలు ఎటుమాయం అయినట్లు? కొత్త జిల్లాల ప్రాతిపదికన నియామకాలు చేపడుతాం అంటున్నారు. దీంట్లో నిజమెంత?'' అంటూ జేఏసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ఏకపక్ష నిర్ణయాలు
తెలంగాణలో 10 జిల్లాలకే రాష్ట్రపతి ఆమోదం వుంది. (ప్రెసిడెన్సియల్ ఆర్డర్) 31 జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం లేదు. అలాంటప్పుడు జిల్లాల ప్రాతిపదికపై ఈ ఉద్యోగాలు భర్తీ చేయడం ఎలా సాధ్యం? గతంలో ఉమ్మడి రాష్ట్రంలోను ఒక శాఖలో కొత్త పోస్టులు భర్తీ చేయాల్సి వస్తే అప్పటికే ఆ శాఖలో పనిచేస్తున్న వారికి కొన్ని పోస్టులు కేటాయించే వారు. ఇది సహజ న్యాయ సూత్రం. ఇలా గ్రామ సేవకులను వీఆర్ఓ పోస్టుల భర్తీ సమయంలో 10వ తరగతి విద్యార్హతతో కొన్ని పోస్టులు కేటాయించి, జీఓ నెం. 39 ద్వారా వారిని వీఆర్ఓలుగా నియమించారు. విద్యుత్ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల్ని రెగ్యులర్ ప్రాతిపదికపై జూనియర్ లైన్మెన్గా నియమించారు. వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఏఎన్యంలను పర్మినెంట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక కూడా ఆర్టీసిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ డ్రైవర్స్, కండక్టర్లను పర్మినెంట్ చేశారు. ఈ మధ్య కాలంలోనే ఐసీడీఎస్ శాఖలో సూపర్వైజర్ పోస్టుల భర్తీ సందర్భంగా సర్వీస్లో ఉన్న అంగన్వాడీ టీచర్లకు విద్యార్హతలో మినహాయింపునిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. కొత్తగా పంచాయితీలను క్లస్టర్స్ చేసి పంచాయితీ కార్యదర్శుల నియామకాలు చేపట్టిన సందర్భంలో 2000 పోస్టులను అర్హులైన కారోబార్, బిల్ కలెక్టర్, ఇతర సిబ్బందికి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నియమ నిబంధనలు పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. బిల్కలెక్టర్, కారోబార్, ఇతర సిబ్బందిలో అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని 10వ తరగతి విద్యార్హతతో పంచాయితీ కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
వేతన సంఘం సిఫార్సుల ప్రకారం
గ్రామ పంచాయితీల్లో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వారికి కనీస వేతనాలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కేంద్ర ఏడవ వేతన సంఘం సిఫారసుల ప్రకారం కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలి. రాష్ట్ర కార్మిక శాఖ విడుదల చేసిన జీఓ నెం. 11 ప్రకారం అన్స్కిల్డ్ కార్మికుడికి నెలకు 8658 రూపాయలు, సెమిస్కిల్డ్ కార్మికులకు 10,222 రూపాయలు, స్కిల్డ్ కార్మికులకు 12,544 రూపాయలు, హైస్కిల్డ్ కార్మికులకు 15,649 రూపాయలు ఇవ్వాలి. ఆర్ధికశాఖ జారీ చేసిన జీఓ నెం.14 ప్రకారం పారిశుద్ధ్య కార్మికుడికి 12 వేల రూపాయలు, డ్రైవర్, పంపు ఆపరేటర్కి 15 వేల రూపాయలు, కారోబార్, బిల్ కలెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్కి 17,500 రూపయలు కనీస వేతనంగా ఇవ్వాలి. కానీ గ్రామ పంచాయితీ సిబ్బందికి కనీస వేతనం 8500 రూపాయలు ఇస్మాని ప్రభుత్వం ప్రకటించింది. ఈ వేతనం ఏ జీఓ ప్రకారం ఇస్తున్నారో చెప్పలేదు. దీనికి ఎలాంటి ప్రాతిపదిక లేదు.
ప్రభుత్వమే బడ్జెట్ కేటాయించాలి
ప్రస్తుతం ఇస్తున్న వెయ్యి, రెండు వేల రూపాయల వేతనాలు చెల్లించడానికే పంచాయితీల దగ్గర డబ్బులు లేవు. నెలల తరబడి వేతనాలు బకాయి పెడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన వేతనం 8,500 రూపాయలకు గ్యారెంటీ వుండాలంటే ప్రభుత్వమే బడ్జెట్ (గ్రాంటు) కేటాయించాలి. లేకపోతే ఉపయోగం వుండదు. ఈ మాట అడిగితే 14వ ఆర్ధిక నిధుల నుండి వేతనాలు చెల్లిస్తామని బుకాయిస్తున్నారు. ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వానివి కావు. కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను ఏ విధంగా వినియోగించాలో కొన్ని నిబంధనాలు పెడుతుంది. ఆ నిబంధనల ప్రకారమే వాటిని ఖర్చు చేయాలి. ఒకవేళ వాటి నుండి వేతనాలు చెల్లించాలన్నా రాష్ట్ర ప్రభుత్వం నుండి జీఓ లేదా మార్గదర్శకాలు జారీ చేయాలి. ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు లేకుండా పత్రికా ప్రకటనలు, వీడియో కాన్ఫెరెన్స్లపై ఆధారపడితే మళ్ళీ మోసపోయే అవకాశం ఉంది. 2015 ఆగస్టు 14న అప్పటి పంచాయితీ రాజ్ శాఖమంత్రి వీరికి రాతపూర్వకంగా ఇచ్చిన ఒప్పందాలకే అతీగతి లేదు. ఇక వీడియో కాన్ఫెరెన్స, పత్రికా ప్రకటనలకు గ్యారెంటీ ఏమీ ఉండదని జేఏసీ నాయకులు అభిప్రాయం. ఎలాంటి వత్తిడిలు వచ్చిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. రాతపూర్వక జీఓ లను సాధించుకోవాలని బిడికిలి బిగించారు.
అన్ని పనులు వీరే చాయాలి..!
పంచాయితీ సిబ్బంది పేరు మారుస్తున్నట్టుగా ''మల్టీ పర్పస్ వర్క్ర్''గా నాయకరణం చేస్తున్నట్టుగా చెప్పారు. అంటే ఇతను గ్రామ పంచాయితీలో అన్ని రకాల పనులు చేయాలన్నమాట. ఇప్పటి వరకు గ్రామ పంచాయితీలో కార్యనిర్వాహక పనులు చేస్తున్న బిల్ కలెక్టర్, కారోబార్ (సార్ని! సఫాయి కార్మికుడిగా మార్చడం న్యాయమా?) ఇప్పుడు పారిశుద్ధ్య పనులతో పాటు అన్ని రకాల పనులు చేయాలి. పనిభారం పెంచి బానిసలుగా మార్చడం ఎంత వరకు సమంజసం? ప్రతి 500 జనాభాకి ఒక్క కార్మికుని చొప్పున పని చేయిస్తామని ప్రకటించారు. అంటే ఇప్పటికే ఒకవేళ 500 జనాభాకి ఒక్కరికంటే ఎక్కువ వుంటే వారిని ఇంటికి పంపించడమేనా? పర్మినెంట్, పీఎఫ్, ఇఎస్ఐ, ఇన్సూరెన్స్ మాటేమిటి? వయసు నిబంధనలేమిటి? అంతా గందరగోళం, అస్పష్టత. కార్మికులను బెదిరించి సమ్మె విరమింపజేయాలని ప్రభుత్వం పడరాని పాట్లు పడుతున్నది.
మాకు సహకరించండి
''మన గ్రామం కోసం, గ్రామ ప్రజల కోసం అనేక కష్టాలు భరించి పనిచేస్తున్నాం. మా డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వం నిరంకుశంగా అణిచివేస్తున్నది. విచ్ఛిన్నాలకు పాల్పడుతుంది. మమ్ముల్ని తొలగిస్తామని, కొత్త వారిని పెట్టుకుంటామని బెదిరిస్తున్నది. మన రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలకు, బర్రెలకు కూడా ఇన్సూరెన్స్ చేస్తున్నది. మమ్ముల్ని పశువుల లాగానైనా చూడడం లేదు. మాకు పీఎఫ్, ఇఎస్ఐలు అమలు చేయడం లేదు. ప్రమాదాల్లో మరణిస్తున్న మాకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం లేదు. ఈ స్థితిలో ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయడాలని నిర్ణయించాం. ప్రజలారా! మాకు మీరు సహాయ సహకారాలు అందించండి'' అంటూ గ్రామ పంచాయితీ కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Authorization