ప్రస్తుత దేశ ఆర్ధిక విధానాలు రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికుల బతుకుల్ని దిగజారుస్తున్నాయి. ఉన్నోడి ఆస్తుల్ని అనేక రెట్లు పెంచాయి. కేంద్రంలో బీజేపీ సర్కార్ రాకతో ఇది మరింత స్పీడందుకుంది. దాదాపు నాలుగింట మూడొంతుల సంపద ఒక్క శాతంగా వున్న వారి దగ్గరికి చేరింది. రైతుల బతుకులు దిగజారుతున్నాయని చెప్పేందుకు మధ్యప్రదేశ్లో బీజేపీ సర్కార్పై దండెత్తిన మందస్సోర్ రైతులే ఉదాహరణ. ముంబరులో మర్లబడ్డ 'మహా' పాదయాత్ర మరో ఉదాహరణ. రైతుల స్థితే ఈవిధంగా ఉంటే వ్యవసాయ కార్మికులు, కూలీల పరిస్థితి చెప్పక్కర్లేదు. కార్మికుల్లో నూటికి 93 మంది అసంఘటిత రంగాల్లో ఉన్నారు. అంటే ఎప్పుడు పోతాయో తెలీని కొలువులన్న మాట. ప్రభుత్వాలవలంబించే విధానాల వల్ల బాధలనుభవిస్తున్న కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు ఒక్కటయ్యారు. 2018 సెప్టెంబర్ 5న జరిగే 'చలో పార్లమెంటు'లో మన రాష్ట్రం నుండి పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయల్సిందిగా సీఐటీయూ కోరుతున్నది.
1991 నుండి ఇప్పటివరకు దాదాపు కాంగ్రెస్, బిజెపి లే మార్చి మార్చి పరిపాలిస్తున్నాయి రైతుల ఆత్మహత్యలు ఆగట్లేదు. వ్యవసాయ కార్మికుల ఆకలి చావులు ఆగట్లేదు. ఫ్యాక్టరీల మూసివేతలు, కార్మికుల తీసివేతలు ఆగట్లేదు. ఖాళీ పోస్టుల భర్తీలేదు. కార్మిక చట్టాలను అడ్డగోలుగా మారుస్తున్నారు. 93శాతంగా ఉన్న అసంఘటిత కార్మికులు దుర్భర జీవితం గడుపుతూనే ఉన్నారు. పార్టీలు మారుతున్నాయి. పాలకులు మారుతున్నారు. కానీ అవే విధానాలు అమలౌతున్నాయి.
సామాన్య ప్రజల చెమటతో...
కార్మికులకు, రైతులకు పట్టం కట్టే విధానాలు కావాలంటే స్వామినాథన్ కమిషన్ సూచించినట్లు కనీస మద్దతు ధర నిర్ణయించాలి. 2014 ఎన్నికల్లో ఎన్డిఏ ఎన్నికల మేనిఫెస్టోలో రాసిన వాగ్దానాన్ని అమలుచేయాలి. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చేందుకు మోడీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలి. ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలి. అప్పుడే వ్యవసాయ కార్మికులు, ఇతర అసంఘటిత కార్మికులు కనీసం నిత్య జీవితావసర వస్తువులు కొనుక్కోగలుగుతారు. దేశ సామాన్య ప్రజల చెమటతో నిర్మించుకున్న ప్రభుత్వరంగ పరిశ్రమలను, బ్యాంకులు, ఇన్సూరెన్స్ రంగాన్ని అంబానీ, అదానీల చేతిలోకి పోకుండా కాపాడుకోవాలి.
కనీస వేతనాలు పెంచితే పెట్టుబడులు రావంట..!
తెలంగాణ రాష్ట్రంలో దేశవిదేశ పెట్టుబడిదార్లకు ఉపయోగపడే విధానాలు తప్ప రైతులకు, కార్మికులకు ఉపయోగపడేవి లేవు. తనని ఎన్నికల్లో గట్టెక్కిస్తుందని మన ముఖ్యమంత్రి మురిసిపోతున్న 'రైతుబంధు' పథకం కౌలు రైతులకు గానీ, పోడు రైతులకు గానీ, అసైన్డ్ భూములు, దేవాదాయ భూములు సాగుచేసే వారికి వర్తించట్లేదు. ఆచరణంలో భూస్వాములకు, ధనిక రైతులకు ఉపయోగపడింది తప్ప కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. కేంద్ర ప్రభుత్వం అమలుచేసే స్కీములన్నింటిని అటకెక్కించడానికి కేంద్రం చేసే ప్రయత్నాలకు వంతపాడుతున్నది. రాష్ట్రంలో కనీస వేతనాలు పెంచితే పెట్టుబడులు రావంటున్నది.
కార్పొరేట్ల గుప్పెట్లోకి
అనేక జిల్లాల్లో గతంలో ఉపాధిహామీ కింద చేసిన పనులకే కూలీలకు బకాయి లక్షల్లో వుంది. పనుల దగ్గరకు వెళ్ళే క్రమంలో చనిపోయిన కూలీలకు రూ.10లక్షల ఎక్స్గ్రేషయా ఇవ్వాలి. విద్యా, వైద్య సౌకర్యాలను మెరుగుపర్చాలి. వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన కూడా చేయడం లేదు. దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమిస్తానన్న కేసీఆర్ ఎన్నికల వాగ్దానం గురించి, పేదలందరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం గురించి మళ్ళీ ఎన్నికలొస్తేనే గుర్తొస్తుంది. రాష్ట్రంలో విద్యా, ఆరోగ్య రంగాలు కార్పొరేట్ల గుప్పిట్లోకి వెళ్ళి పేదలను పీల్చిపిప్పి చేస్తున్నాయి. దేశంలో, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాల కోసం కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పోరాడాలి.
ఇదే కార్యాచరణ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ ఆగస్టు 9 (క్విట్ ఇండియా ఉద్యమం 1942లో ప్రకటించిన రోజు) అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్దఎత్తున జైల్ భరో నిర్వహించారు. ఆగస్టు 14 రాత్రంతా జాతీయోద్యమ లక్ష్యాలేమిటి? వాటికి నేడు పట్టిన గతేంటి? వంటి అంశాలపై ఉపన్యాసాలు, ఆట, పాటల్తో 'జనజాగరణ' జరిగింది. సెప్టెంబర్ 5న 'చలోపార్లమెంట్ ఆందోళన చేయబోతున్నారు..
కార్మికుల కోసం
2016లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. నిరంతర శ్రమ చేసే కార్మికులకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి పర్మినెంట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుగుణంగా 47 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చే పద్దతిని తీసుకురావాలని చూస్తుంది, దాన్ని రద్దు చేయాలి. 2018 మార్చి 18 న నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసిన ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లారుమెంట్ ఆర్డర్ను అపసంహరించుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్కీముల్లో పని చేస్తున్న శ్రామిక మహిళలందరికీ కనీస వేతనం సాంఘిక భద్రత, పీఎఫ్, ఇఎస్ఐ, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు 2004 నుంచి అమలు చేస్తున్న నేషనల్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి. పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలి. దేశంలో 93 శాతంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టాన్ని అమలు చేయాలి. దేశ రాష్ట్ర స్థాయిల్లో కార్మిక సంక్షేమాన్ని పర్యవేక్షించే ద్వ్రైపాక్షిక కమిటీలను బలోపేతం చేయాలి.
వ్యవసాయ కూలీలు, కార్మికుల కోసం
స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా రైతులకు ఉత్పత్తి ఖర్చుపై మరో 50 శాతం కలిపి రుణాలు ఇవ్వాలి. కనీస మద్దతు ధరను నిర్ణయించాలి. రైతాంగానికి కావల్సినటువంటి రుణ, పరమతి సౌకర్యాన్ని ప్రభుత్వ బ్యాంకుల ద్వారా కల్పించాలి. ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా విస్తరింప చేయాలి. సంవత్సరానికి 200 రోజుల పని గ్యారెంటీ కల్పించాలి. ఉపాధి హామీ కూలీలకు రోజుకు 600 రూపాయలు కూలీగా ఇవ్వాలి. భూ నిర్వాసితుల చట్టం 2013ను పకడ్బందీగా అమలు చేయాలి. దీన్ని నిర్వీర్యం చేస్తున్న రాష్ట్రాల్లో నియంత్రణ తేవాలి. దేశంలో రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రైవేటు రుణాలను రద్దు చేయాలి. వ్యవసాయానికి ప్రభుత్వమే రుణ సౌకర్యం కల్పించాలి. వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి.
సామాన్యుల కోసం
పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కనీస వేతనం, నెలకు 18 వేలు ఇవ్వాలి. వినియోగ దారుల సూచీకి అనుసంధానం చేస్తూ వీడిఏను అమలు పరచాలి. ప్రభుత్వ రంగం సంస్థలో పెట్టుబడులద ఉపసంహరణను. వ్యూహాత్మక అమ్మకాలను నిలిపివేయాలి. రక్షణ, రైల్వే, కమ్యూనికేషన్,ఫార్మా తదితర కీలక రంగాల్లో విదేశీ పెట్టు బడులను నియంత్రించాలి. దేశంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల రక్షణకు వాటి మార్కెటింగ్కు తగిన సౌకర్యాలు కల్పించాలి. యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలి. ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యం చేసే నగదు బదిలీ లాంటి పద్ధతిని మానుకోవాలి. 14 రకాల నిత్యావసర వస్తువులను చౌకదుకాణాల ద్వారా అందించాలి. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలి. డీజిల్, పెట్రోల్ తదితర పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు బ్యాంకిగ్ రంగాన్ని ప్రైవేటీకరించడం మానుకోవాలి. దేశ సార్వభౌమత్వానికి నష్టం కలిగించే విధంగా విదేశాలతో చేసుకున్న రక్షణ ఒప్పందాలను రద్దు చేయాలి.
Authorization