పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ''మీకు తప్పక న్యాయం చేస్తాం'' అని చెప్పిన ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ఇచ్చిన హామీ అమలు కోసం 1998 డీఎస్సీ బాధితులందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రగతి నివేదన సభలోనైనా తమకు తీపి కబురు వినిపిస్తుందనుకున్నారు. కానీ పరిస్థితి తిరగబడింది. అసెంబ్లీ రద్దయింది. పాలకులు ఎన్నికల హడావుడిలో పడిపోయారు. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి? అంటూ ఆవేదన చెందుతున్న డిఎస్సీ బాధితుల సమస్యలు నేటి కొలువులో...
అది జనవరి 3, 2016... తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రికి తమ గోడు చెప్పుకునేందుకు వెళ్లిన డి.ఎస్.సి-98 బాధితుల నుంచి ఆయనే స్వయంగా వినతిపత్రాలు తీసుకున్నారు. ఆయన క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన వెంటనే ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శితో ఫోన్ చేయించి మరీ పిలిపించుకున్నారు. రెండున్నర గంటలపాటు ప్రతినిధి బృందంతో చర్చలు జరిపి ''భోజనం చేశారా?'' అంటూ రూ.10 వేలు ఇవ్వబోయారు. పని పూర్తి అయ్యేంత వరకూ మంజీరా గెస్ట్ హౌస్లో బస కల్పించారు. ''ఐదు వేల మంది కాదు బాధితుల సంఖ్య అటూఇటుగా ఇంకో 500 మంది ఉన్నా ఫర్వాలేదు. అధికారులు సహకరించకపోతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి అయినా మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటాను'' అని వారికి స్వయంగా ముఖ్యమంత్రి అభయం ఇచ్చారు. విద్యా శాఖ మంత్రికి ఫోన్ చేసి డి.ఎస్.సి-1998 క్వాలిఫైడ్స్ సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించాలని, వారికి ఉద్యోగాలు ఇచ్చేలా ఫైల్ సిద్ధం చేసి పంపించాలని విద్యా శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ''నోటిఫికేషన్ ఇచ్చి వాస్తవికంగా ఎంతమంది క్వాలిఫైడ్స్ ఉంటారన్న లెక్కలు తేల్చండి'' అంటూ ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు హుకుం జారీ చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి నోటివెంట వచ్చిన ఆ మాటలను విన్నటువంటి బాధితులు, వారి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు.
ముఖ్యమంత్రి ఆదేశించినా బేఖాతర్
1998లో నిర్వహించిన మెగా డీఎస్సీ సమయంలో ఆనాటి విద్యా శాఖ మంత్రి ప్రస్తుతం కూడా అదే శాఖ మంత్రిగా ఉండటంతో కథ మలుపు తిరిగింది. అప్పుడు వరంగల్ , నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో డీఎస్సీ-98 ఎస్జీటీ రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో మెరిట్ అభ్యర్థులకు తీరని నష్టం జరిగింది. అంతేకాదు సున్నా మార్కులు వచ్చిన వారికి టీచర్ ఉద్యోగాలు వచ్చి మెరిట్ అభ్యర్థులు రోడ్డున పడ్డారు. ఆనాటి అవినీతి, అక్రమార్కులు నేడు అదే శాఖలో ఉన్నతాధికారులుగా బాధ్యతల్లో ఉండటం డీఎస్సీ-98 బాధితులకు శాపం అయ్యింది. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించినా ఫలితం శూన్యం.
మాటమార్చారు
''వారికి ఉద్యోగాలు ఇస్తే అన్నీ చిక్కుముల్లే'' అంటూ విద్యా శాఖ మంత్రి మీడియా ముందు వాపోయారు. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్స్ సహా పాత డీఎస్సీ బాధితులుకు సైతం న్యాయం చేస్తామన్నారు. దీనికి సంబంధించి ఓ ప్రకటన చేశారు. 1998 డీఎస్సీ బాధితులకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. ఇది ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందని, వారికి త్వరలోనే న్యాయం చేస్తామని అసెంబ్లీలో విద్యా శాఖ మంత్రి స్వయంగా చెప్పారు. 2016 డిసెంబర్ వరకూ 1998 డీఎస్సీ బాధితులకు ఉద్యోగాలు ఇస్తామని మీడియా సమావేశాల్లో పదే పదే చెప్పిన మంత్రి హఠాత్తుగా మాట మార్చారు. ''డీఎస్సీ-98 బాధితులకు ఉద్యోగాలు ఇవ్వలేం'' అంటూ ఆఫ్ ది రికార్డ్గా వార్త వదిలారు. ఆ తర్వాత కూడా కలిసిన డీఎస్సీ బాధితులకు ''నా వర్క్ కంప్లీట్ అయ్యింది. ముఖ్యమంత్రికి దగ్గరగా వుండే ముఖ్యులకు చెప్పి పని చేయించుకోండి'' అని చెప్పారు.
మానసిక సంఘర్షణతో
అర్హులకు న్యాయం చేస్తాం అంటూ చట్ట సభల్లో విపక్షాలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెబుతూనే మరోవైపు 1998 డీఎస్సీ క్వాలిఫైడ్స్ ''ఔట్ డేటెడ్'' అని సగం ముసలోళ్లు అయ్యారు అంటూ మాట్లాడారు. ఆ తర్వాత ముఖ్యమంత్రికి గోడు చెప్పుకుందామంటే అపాయింట్మెంట్ లభించక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చుట్టూ తిరిగితే 'విద్యా శాఖ మంత్రిని కలవండి' అని చెప్పారు. చెప్పులరిగేలా సెక్రటేరియట్, మంత్రుల క్వార్టర్స్ చుట్టూ తిరిగినా ఉద్యోగాలు ఎండమావిలా మారాయి. క్వాలిఫైడ్స్ బాధితులు, వారి కుటుంబ సభ్యుల్లో మానసిక సంఘర్షణ నానాటికీ తీవ్రతరం అయ్యింది.
ఆశలపల్లకీ నుంచి..మృత్యుపల్లకీపైకి
'' కేసీఆర్ మాట ఇస్తే వెనక్కు తగ్గరు. మెడ అయినా నరుక్కుంటారు కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా ఇచ్చిన హామీని తప్పక అమలు చేస్తారు'' అనేది బయట జరుగుతున్న విస్తృత ప్రచారం. ''బాధితుల సమస్యను స్పెషల్ కేసుగా పరిగణనలోకి తీసుకుని పరిష్కరిస్తా. వారంతా చెప్పులరిగేలా ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు. వయోపరిమితితో సంబంధం లేకుండా వారికి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటాను'' అని ముఖ్యమంత్రి పదే పదే మీడియా ముందు చెప్పిన మాటలు కూడా ప్రజల్లోకి చొచ్చుకుపోయాయి. ఇలా అభ్యర్థులను ఆశలపల్లకీలో ఊరేగించారు. కానీ అదే ఆశ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40 మంది 98 డీఎస్సీ బాధితుల ప్రాణాలు తీసింది.
ఆందోళనకు గురి అవుతున్నారు
ప్రగతి నివేదన సభ అనంతరం కేసీఆర్ అసెంబ్లీ రద్దు నిర్ణయంపై ప్రకటన చేస్తారంటూ మీడియాలో వచ్చిన వార్తలు డి.ఎస్.సి-1998 క్వాలిఫైడ్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. ఇలా అయితే మా సమస్య పరిష్కారం సంగతి ఏమిటని తీవ్ర ఆందోళనకు గురిఅవుతున్నారు. 2014 డిసెంబర్ నుంచి ముఖ్యమంత్రి స్వయంగా ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటాను అని పలుసార్లు మీడియాకు వెల్లడించడంతో తప్పకుండా ఉద్యోగాలు ఇస్తారు అనే నమ్మకాన్ని క్వాలిఫైడ్స్ పెంచుకున్నారు. 1998 డీఎస్సీలో బాధితులుగా ఉన్నవారు సుమారు 2,000 మంది ఉంటే విద్యా శాఖ అధికారులు 4,310 మంది ఉంటారని ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు అని 1998 డీఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కె.శ్రీనివాస్ అన్నారు.
ఇంకెప్పుడు నెరవేరేను మీ హామీ
నాటి నుంచి నేటి వరకూ 20 ఏండ్ల కాలంలో చాలా మంది రిటైర్మెంట్ ఏజ్ పూర్తి కాబోతోందని, ఉద్యోగాలు ఇచ్చినట్లయితే అధికసంఖ్యలో అభ్యర్థులకు తక్కువ ఏండ్ల సర్వీసు మాత్రమే ఉంటుందని, అది ప్రభుత్వానికి ఎంతమాత్రం భారం కాదని తెలియజేశారు. డీఎస్సీ-98 క్వాలిఫైడ్స్ గత పాలకుల హయాంలో అడుగడుగునా అన్యాయానికి గురై తీవ్రంగా నష్టపోయారు. కొత్తగా పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఆ దారిలో ఎట్టి పరిస్థితుల్లో నడవదు అనే ధృడ విశ్వాసాన్ని బాధితులు వ్యక్తం చేశారు. ఏ రకంగా ఉద్యోగాలు కల్పించినా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని శిరసావహిస్తాం అని సమితి నాయకులు పేర్కొన్నారు. 20 ఏండ్ల న్యాయపోరాటంలో అభ్యర్థులు అందరూ మానసిక సంఘర్షణకు గురిఅవుతున్నారు అని, ఆర్థికంగా చితికిపోయి కేసీఆర్ మాత్రమే ఆదుకోగలరన్న ధీమాతో తీపికబురు కోసం ఎదురుచూస్తున్నారు.
- రావుల రాజేశం, కరీంనగర్
ఫోన్: 919848811424
Authorization