అంగన్వాడీల డిమాండ్స్
- ఐసీడీఎస్కు బడ్జెట్ పెంచాలి, ఐసీడీఎస్ను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించకూడదు. ఐసీడీఎస్లో నగదు బదిలీ, ప్యాకెట్ ఫుడ్ పంపిణీ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి.
- అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం 18 వేల రూపాయలుగా నిర్ణయించాలి.
- ఉద్యోగ భద్రత, ఇ.ఎస్.ఐ సౌకర్యాలు కల్పించాలి.
- కేంద్రం పెంచిన వేతనాలు వెంటనే చెల్లించాలి.
- అంగన్వాడీలకు నష్టం కలిగిస్తున్న జీ.ఓ 14.19 లను సవరించాలి.
- అసంఘటితరంగ, వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి, అందరికీ కనీస పెన్షన్ ఆరు వేల రూపాయలు అమలు చేయాలి.
- కార్మిక చట్టాల సవరణను ఆపాలి, ఉన్న వాటిని పకడ్బందీగా అమలు చేయాలి.
ఆషావర్కర్ల డిమాండ్స్
- ఎన్.హెచ్.ఎం. స్కీంలో ప్రైవేటీకరణ ఆపాలి.
- ఆషా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం 18 వేల రూపాయలు నిర్ణయించాలి.
- ఉద్యోగ భద్రత, ఇ.ఎస్.ఐ సౌకర్యాలు కల్పించాలి.
- రాష్ట్రంలో ఆషాలను చెల్లిస్తున్న 7,500 రూపాయలను పారితోషికాలుగా కాకుండా గౌరవ వేతనంగా చెల్లించాలి.
- పది సంవత్సరాలు పని చేసిన ఆషాలను ఇంటికి పంపించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
- కంటి వెలుగు తదితర అదనపు పనులకు పారితోషికాలు నిర్ణయించాలి.
- అసంఘటితరంగ, వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి. అందరికీ కనీస పెన్షన్ ఆరు వేల రూపాయలు అమలు చేయాలి.
- నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి, అదపులో పెట్టాలి.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు దాటింది. ఈ కాలంలో కార్మికులు, ఉద్యోగులు, రైతులు ప్రజలెదుర్కొంటున్న ఏ ఒక్క సమస్యని కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయలేదు. సమస్యల పరిష్కారం కోసం అనేక సార్లు సమ్మెలు, పోరాటాలు నిర్వహించినా కేంద్ర ప్రభుత్వం స్పందించటం లేదు. పైగా మరింత వ్యతిరేక విధానాలు వేగవంతంగా అమలు చేస్తున్నది.
ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజల అసంతృప్తిని పక్కదారి పట్టించడానికి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నది. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, ఉద్యోగ, రైతుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు భారత కార్మిక వర్గం మరో సమరానికి సన్నద్ధమైనది. జనవరి 8,9 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించాలని, కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల ఫెడరేషన్లు, స్వతంత్ర సంఘాలు, ఆషా వర్కర్లు, అంగన్వాడీల ఫెడరేషన్లు నిర్ణయం చేశాయి. ఈ సమ్మెలో తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లందరూ పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు కోరుకుంటున్నాయి.
మాతా శిశుమరణాలను, పోషకాహార లోపాన్ని తగ్గించడంలో ఐసీడీఎస్ పథకం కీలకపాత్ర పోషిస్తున్నది. ఈ పథకం పేద ప్రజలు గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు అత్యంత అవసరం. దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరుగుతున్న ఈ క్రమంలో ఐసీడీఎస్ పథకాన్ని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అనేక సర్వేలు చెబుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించటం లేదు. ఐసీడీఎస్ను బలోపేతం చేయకపోగా మరింత నిర్వీర్యం చేస్తున్నది. బడా కార్పొరరేట్లకు ప్రతి సంవత్సరం ఐదు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్కు మాత్రం సగానికి పైగా బడ్జెట్లు తగ్గించింది. దీనివల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుంది.
ఉద్యోగ భద్రతకు ప్రమాదం
పోషకాహారం, టీఏ, డీఏలు, సెంటర్ అద్దెలు, వేతనాలు సకాలంలో రావటం లేదు. ఈ నిర్ణయం ఐసీడీఎస్ సేవలకు ఆటంకంగా మారింది. దీంతోపాటు ఐసీడీఎస్ను ముఖ్యమైన పథకం నుండి సాధారణ పథకంలోకి మార్చారు. ఈ పథకాన్ని ఎప్పుడైనా నిలుపుదల చేసే అవకాశాన్ని కూడా ప్రభుత్వం తన వద్ద ఉంచుకుంది. ఐసీడీఎస్ లక్ష్యానికి భిన్నంగా నగదు బదిలీ, పోస్టాఫీసుల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని చూస్తున్నది. ఇది అమలు జరిగితే మళ్ళీ మాతా, శిశుమరణాలు, పోషకాహార లోపం పెరగటంతో పాటు అంగన్వాడీల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడుతుంది. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం, పెన్షన్, ఇ.ఎస్.ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని అనేక సమ్మెలు, పోరాటాలు చేశారు. అతి తక్కువ వేతనం పెంచి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. ఈ వేతనాలు మూడు నెలలు గడిచినా నేటికీ అమలుకావడం లేదు. ఈ విషయంపై రాష్ట్ర ఐసీడీఎస్ అధికారులను అడిగితే, ఇప్పటికే తెలంగాణలో ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నామని అన్నారు. పెరిగిన వేతనాలు వస్తాయా? రావా? ప్రశ్నార్థంగా ఉంది. ఇక జీవోలు 14,19 మెడమీద కత్తిలాగ వేలాడుతున్నాయి. దీనికి తోడు పని భారం విపరీతంగా పెరిగింది.
ప్రజలకు ప్రాథమిక డాక్టర్లుగా
ఎన్.హెచ్. ఎం.స్కీములో భాగంగా ఆషా వర్కర్లను 2005లో కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆస్పత్రిలో డెలివరీల సంఖ్యను పెంచటం ద్వారా మాతా, శిశు మరణాలను తగ్గించటం ఈ స్కీం లక్ష్యం. ఈ పనిలో ఆషా వర్కర్లు విజయవంతం అయ్యారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. వీటితో పాటు ఇంకా అనేక వ్యాధులకు మందులు పెంచటం, తగిన సలహాలు ఇవ్వటంతో పాటు, కొత్తగా వచ్చే వ్యాధులను గుర్తించి హాస్పిటల్కు పంపించటం తదితర అనేక సేవలు ఆషా వర్కర్లు పేద ప్రజలకు అందిస్తున్నారు. పేద ప్రజలకు ప్రాధమిక డాక్టర్లుగా ఆషా వర్కర్లు గ్రామాల్లో పని చేస్తున్నారు. ఇంతటి ముఖ్యమైన పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్విర్యం చేయాలని చూస్తున్నది.
ఎప్పుడైనా నిలిపివేయాలని
ఈ స్కీంకు బడ్జెట్ను తగ్గించింది. ముఖ్యమైన పథకం నుండి సాధారణ పథకంలోకి మార్చారు. ఈ స్కీంను ఎప్పుడైనా నిలుపుదల చేసే అవకాశాన్ని కూడా ప్రభుత్వం తన వద్ద ఉంచుకుంది. ఈ నిర్ణయాలు అమలు జరిగితే ఆరోగ్య సేవలు పేద ప్రజలకు అందని ద్రాక్షగా మారుతాయి. ఈ స్కీంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆషా వర్కర్లతో కేంద్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటుంది. పనిని బట్టి పారితోషికం పేరుతో ఆషా వర్కర్ల శ్రమను ప్రభుత్వం దోచుకుంటుంది. పారితోషికాల పద్ధతిని రద్దు చేయాలని, ఆషాలను కార్మికులుగా గుర్తించి, కనీస వేతనం 18 వేల రూపాయలు చెల్లించాలని, పెన్షన్, ఇ.ఎస్.ఐ తదితర సౌకర్యాలు కల్పించాలని దేశవ్యాప్తంగా అనేక పోరాటాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో 106 రోజులు ఆషా వర్కర్లు సమ్మె చేశారు. కానీ ప్రభుత్వం కేవలం పారితోషికాలను మాత్రమే పెంచింది. ఇతర డిమాండ్స్ను పరిష్కరించలేదు. పైగా 10 సంవత్సరాలు పని చేసిన ఆషా వర్కర్లను ఇంటికి పంపించడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. పారితోషికాలు లేని అనేక పనులను ఆషాలతో చేయిస్తున్నారు.
పోరాటం చేయక తప్పదు
అంగన్వాడీలు, ఆషావర్కర్లులతో పాటు ఇతర రంగాల కార్మికులు, ఉద్యోగులు, రైతులు సమస్యలు కూడా కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయటం లేదు. పైగా అనేక త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా సవరించి యాజమాన్యాలకు అనుకూలంగా మార్చాలని చూస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలైన రక్షణ, రైల్వే, బ్యాంకులు, ఇన్సూరెన్స్, బిఎస్ఎన్ఎల్, ఫార్మా తదితర రంగాలను ప్రైవేటీకరణ చేస్తున్నది. విద్యా, వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది. ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నది. ఈ విధానాలనే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. ఇప్పుడు బిజేపీ ప్రభుత్వం మరింత వేగవంతంగా అమలు చేయాలని చూస్తున్నది. ఇంతటి దుర్మార్గమైన నిర్ణయాలకు అడ్డుకట్ట వేయాలంటే పోరాటం తప్ప మరో మార్గం లేదు.
Authorization