టైం పది కావొస్తోంది. చౌరస్తా మొత్తం బాగా రద్దీగా ఉంది. చాలామంది చేతిలో క్యారేజీలు పట్టుకొని అటూ ఇటూ దిక్కులు చూస్తూ ఎదురు చూస్తున్నారు. కొంత మంది గుంపులుగా కూర్చొని ఏవో మాట్లాడుకుంటున్నారు. అలా ఇరవై నిమిషాలు గడిచిపోయింది. మెల్లమెల్లగా అక్కడ రద్దీ తగ్గిపోతోంది. ఎవరో వస్తున్నారు. అక్కడ నిలబడ్డ వారితో మాట్లాడి ఇద్దరు, ముగ్గురిని ఎక్కడికో పంపించేస్తున్నారు.
వేల సంఖ్యలో కూలీలు
ఒక్కహైదరాబాద్ నగరంలోనే ఇటువంటి అడ్డాలు దాదాపు 1200 వరకు ఉంటాయి. ఈ అడ్డాల్లో దాదాపు 25వేల మంది భవన నిర్మాణ కార్మికులుంటారు. అడ్డాను ఆధారం చేసుకొని పని వెతుక్కునే వారేకాక ఎటువంటి అడ్డా లేకుండా ఈ పని చేసేవారు వేల సంఖ్యల్లో ఉంటారు. ఈ భవన నిర్మాణ కార్మికుల్లో అనేక రకాల పనులు చేసేవారు ఉన్నారు. వీరిలో తాపీ మేస్త్రీ నుండి పెయింటర్, కార్పెంటర్, ఫ్లంబర్, కరెంట్ వైరింగ్ వంటి పనులు చేసేవారు. వీరికి హెల్పర్లు కూడా ఉంటారు. వీరే కాకుండా దాల్మిల్లు, ఆయిల్మిల్లు, రైస్మిల్లు, చాక్లెట్, బిస్కెట్, సబ్బులు, ఇంకా చిన్న చిన్న ఫ్యాక్టరీలలో కూడా రోజు కూలి చేసేవారుంటారు. వీరందరిలో ఒక్క భవన నిర్మాణ కార్మికులకు మాత్రం గత ప్రభుత్వం ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ గుర్తింపు కార్డులు జారీ చేసింది. కాని ఇతర పనులు చేసేవారెవరికి మాత్రం ఎలాంటి గుర్తింపు లేదు. వీరంతా తెలంగాణా వస్తే వచ్చే ప్రభుత్వం తమ కోసం కొన్ని సౌకర్యాలు కల్పిస్తుందని ఆశపడ్డారు. కాని గత పాలకుల కంటే తెలంగాణా పాలకుల అరాచకంగా వ్యవహరిస్తున్నారని ఆ కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
దుర్భరమైన జీవితాలు
సరళీకరణ ఆర్థిక విధానాల ఫలితంగా గ్రామాలలో పని దొరక్క నగరాలకు వలస వచ్చిన వారే. మరి కొంతమంది గ్రామంలో వ్యవసాయం గిట్టుబాటు కాక ఉన్న కొద్ది భూమి, ఇల్లు అమ్ముకొని నగరంపై గంపెడాశ పెట్టుకొన్ని కుటుంబంతో కలిసి వలస వచ్చిన వారు ఉన్నారు. మన హైదరాబాద్ నగరంలో మహబూబ్నగర్, నల్గొండ, మెదక్, వరంగల్, రంగారెడ్డి జిల్లాలతోపాటు శ్రీకాకుళం నుంచి వచ్చిన వారు అత్యధికంగా కనిపిస్తారు. వీరి పరిస్థితులపై ఆరాతీస్తే ఒకపక్క పుట్టి పెరిగిన గ్రామంలో, మరోపక్క గంపెడాశతో వచ్చిన నగరంలోనూ పనులు దొరక్క దిక్కు లేని పరిస్థితుల్లో దుర్బరమైన జీవితాలు అనుభవిస్తున్నామని వారు అంటున్నారు. మరోపక్క ఆర్థిక మాంద్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడి పోవడం, అధిక ధరలు, మిషనరీతో పని చేయించడం వంటివి వీరి జీవితాలపై ప్రభావం చూపి నిరుద్యోగ సమస్య మరింత పెరిగింది.
వీరు అడ్డా కూలీలు...
రోజూ ఉదయాన్నే క్యారేజీలు కట్టుకొని అక్కడకొచ్చి నిలబడతారు. మేస్త్రీ వచ్చి ఎక్కడైనా పనుంటే వాళ్ళను తీసుకెళతాడు. కానీ అక్కడ ఉన్న వారిలో ఓ నలుగురికి నాలుగురోజుల నుంచి పని దొరకడం లేదు. వాళ్ళు దిగులుగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రోజూ రావడం, పని దొరక్క వెనక్కు పోవడం ఇదీ వారి పరిస్థితి. ఇంట్లో తిండి గింజల్లేవు. పిల్లలకు కడుపునిండా తిండి పెట్టలేకపోతున్నారు. ఆ నలుగురిలో ఓ మహిళా కూలీ ఉంది. ఆమె బిడ్డ ఫీజు కట్టలేదని కాలేజీకి పోకుండా ఇంట్లోనే ఉంటుంది. చివరకు బస్పాస్ తీసుకోడానికి కూడా ఆమె దగ్గర డబ్బులేదు.
ఎంతో ఆశపడ్డాం
ఆ నలుగురిలో మరో వ్యక్తిని కదిలిస్తే 'మేము కల్వకుర్తి నుంచి సిటీకి వచ్చాం. పదేండ్లవుతుంది మేం ఇక్కడికి వచ్చి. ఇలా రోజూ వచ్చి అడ్డాపై నిలబడతాం. పనికి పిలిస్తే పోవాలి, లేదంటే లేదు. మా కష్టాల గురించి అడిగే వారెవరు? మా గురించి పట్టించునేవారెవరు? తెలంగాణవస్తే ఇండ్లువస్తాయి, మా బతుకులు బాగుపడతాయి, మా పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తారని అశపడ్డాం. కానీ మా బతుకుల్లో ఎలాంటి మార్పులేదు. ప్రభుత్వం మా కష్టాలను పట్టించుకోవడం లేదు. మళ్ళీ రెండో సారి కూడా సీఎం కేసీఆర్ అయ్యాడు. ఏవేవో చేస్తామని చెబుతున్నారు. కానీ మాకు మాత్రం పని దొరకడం లేదు. మా బాధలు ఇంకెవరికి చెప్పుకోవాలి?'' అంటూ దిగులుగా చెప్పాడు భవన నిర్మాణ కార్మికుడు యాదగిరి.
కూలి దొరికితేనే తిండి
యాదగిరి మాదిరిగానే మహబూబ్నగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, మెదక్ వంటి జిల్లాలలో లక్షల మంది పేద ప్రజలు రోజు కూలి కోసం నగరాల్లోని అడ్డాలపై నిలబడి ఎదురు చూస్తుంటారు. ఎవరు వచ్చి ఈ రోజు పనికి పిలుస్తారా..? అని ఆశగా వాళ్ళ కండ్లు వెదుకు తుంటాయి. ఎందుకంటే ఆరోజు కూలి దొరికితే తప్పా తిండి గడవని స్థితి వారిది. ఒక్కొక్క అడ్డా వద్దకు రోజుకు సుమారు వంద మంది నుండి నాలుగు వందల మంది వరకు పని కోసం ఉదయం ఆరుగంటలకే వచ్చి ఎదురు చూస్తుంటారు.
బాధ్యత పట్టని ప్రభుత్వం
గ్రామాల నుంచి పని వెదుక్కుంటూ వలస వచ్చిన కార్మికులను ఆదుకోవలసిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే.కార్మిక సంఘాలు గతంలో 15 సంవత్సరాలుగా పోరాడితే భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారిచేసి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది. కాని ఇతర పనులు చేసే అసంఘటిత కార్మికులకు నేటికీ ఎటువంటి గుర్తింపు లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికైనా అన్నీ రకాల కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పని గ్యారెంటీ, ఇఎస్ఐ, పీఎఫ్, ప్రమాదబీమా, ధరలకు అనుకూలంగా కూలి సౌకర్యాలు కల్పించాలి.
కనీస సౌకర్యాలు కరువు
అడ్డాల వద్ద పనికోసం ఎదురుచూసే కార్మికులకు షెడ్డు, మంచినీటి సౌకర్యం, మహిళలకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని భవన నిర్మాణ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల కూడళ్ళపై వందల మంది నిల్చోవడంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. దీంతో ఎంతో మంది కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారు. మరోవైపు స్థానిక వ్యాపారస్తులు, ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారికి కనీస సౌకర్యాలు వెంటనే కల్పించాలి.
Authorization