రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి ఆరోగ్య సౌకర్యాలు అందించేందుకు ఈ కార్యాలయం కేంద్ర బిందువు. కానీ ఇందులో పని చేసే కార్మికులకు మాత్రం ఏ సమస్య వచ్చినా పట్టించుకునే వారు లేరు. అదే కోఠీలోని డీఎంహెచ్ ఓ కార్యాలయం.. తెలంగాణ వైద్య విధాన పరిషత్. ఈ కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలు నేటి కొలువులో...
డీఎంఇ, డీహెచ్ మలేరియా, ఎయిడ్స్ కంట్రోలర్ లాంటి మొదలైన ఆఫీసులు ఈ డీఎంహెచ్ఓ ఆఫీస్ పరిధిలోనే ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందించాల్సిన వైద్యానికి సంబంధించిన విషయాలపై రెగ్యులర్గా ఫంక్షనింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ ఆఫీసులో రాష్ట్రంలోనే అతి పెద్ద కాంట్రాక్ట్ కంపెనీ అయిన ఏజిల్ కాంట్రాక్టు పరిధిలో హౌస్ కీపింగ్ చేసే వారు మొత్తం 35 మంది కార్మికులు ఉంటారు. వారిలో మహిళలు 30 మంది. వీరిలో 5 గురు సెక్యురిటీ గార్డ్స్గా గత 15 సంవత్సరాల నుండి పని చేస్తున్నారు.
వలస కార్మికులు
సాధారణంగా హైదరాబాద్లో పని చేసే కార్మికులందరు వివిధ జిల్లాల నుండి నగరానికి వస్తుంటారు. గ్రామాల్లో అప్పుల వ్యవసాయం చేయలేక పని వెదుక్కుంటూ ఇక్కడికి వస్తుంటారు. ఈ కార్మికులు కూడా అలాంటి వలస కార్మికులే. మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, పరిగి, వికారాబాద్, ముంబయి నుండి బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకుని వచ్చిన వలస కార్మికులు. ఇందులో చాలా మంది ఒంటరి మహిళలున్నారు. భర్తలు తాగుబోతులుగా మారి కష్టం చేయరు. ఇల్లు పట్టించుకోరు. కన్న పిల్లల్ని, కట్టుకున్న వాళ్లను గాలికి వదిలేసి వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకుం టుంటారు. తాగుడుకు బానిసలుగా మారిన చాలా ఇళ్ళల్లో ఆ కుటుంబ భారం కచ్చితంగా మహిళలపైనే పడుతుంది. కుటుంబం గడవాలంటే ఏదో ఒక పని చేసుకోక తప్పదు.
ఇల్లు గడుస్తుందనే ఆశతో...
ఇలా వలస వచ్చిన కార్మికులందరూ నిరుపేదలు. అందులోనే ఎస్టీ, ఎస్సీ, బీసీ సామాజిక తరగతులకు చెందిన వాళ్ళు. సరైన చదువు లేక దొరికిన పని చేసుకుంటూ బతికే వాళ్ళు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి వీరిది. అలా పని వెదుక్కుంటూ నగరానికి వచ్చిన వారిని కాంట్రాక్టర్లు ఆఫీసుల్లో పని ఉందని చెప్పి తీసుకెళతారు. ఆఫీస్లో పని కదా చెప్పుకునేందుకు గొప్పగా ఉంటుంది, వచ్చిన జీతంలో ఇల్లు గడుస్తుందనే ఆశతో పనిలో చేరిపోతారు. చేరిన తర్వాతనే అసలు సమస్యలు మొదలవుతాయి.
సంబంధం లేని పనులు
అందులో పనిచేసే ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఎన్నో సమస్య లతో సతమతమవుతున్నారు. ఒకపక్క కాంట్రాక్టర్ ఒత్తిళ్ళు. సెలవులు పెట్టకపోయినా జీతం కట్ చేస్తారు. వీళ్ళ పని గార్డెనింగ్, క్లీనింగ్ చేయడం మాత్రమే. అయితే అధికారులు, కాంట్రాక్టర్లు ఏ అవసరం వచ్చినా వీళ్ళతోనే పని చేయించుకుంటారు. టీలు, టిఫిన్లు తీసుకు రావడం, వాళ్ళు తిన్న గిన్నెలు కడగడం లాంటి పనులు కూడా చేస్తారు. ఇలాంటి పనులు చేస్తున్నందుకు వీరికి జీతం తక్కువ కాబట్టి ఎవరైనా ఆఫీసర్లు దయదలచి ఎంతో కొంత సాయం చేస్తుంటారు.
ఉద్యోగ భద్రత లేదు
కాంట్రాక్ట్ మాత్రమే కాకుండా సూపర్ వైజర్లు కూడా వీరిని బెదిరిస్తుంటారు. ఇదేంటని ప్రశ్నించాలంటే భయం. 'ఇష్టం ఉంటే చెయ్యి లేకపోతే పో' అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతారు. అందుకే వీరంతా పని భదత్ర లేక బానిసలుగా బతుకుతున్నారు. రోజూ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటలకు వరకు పని పచే యాలి. ఈ టైంలో వారు ఏం చెబితే అది చేయాల్సిందే.
పని ఎక్కువ జీతం తక్కువ
ఇంత కష్టపడితే వీరికి ఇచ్చేది తొమ్మిది వేలు. అందులో ఇఎస్ఐ, పీఎఫ్ కటింగ్లు పోను 7 వేల రూపాయలు చేతికి వస్తాయి. ఇంత తక్కువ వేతనాలతో కుటుంబం ఎలా గడుస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. కనీసం బోనస్ కూడా ఉండదు. పనిలో ఉన్నప్పుడు ఏ ఉద్యోగికైనా ఆరోగ్య సమస్య వచ్చినా, జరగరానిది ఏమైనా జరిగినా ప్రభుత్వంగానీ, కాంట్రాక్టర్కు కానీ ఎలాంటి సంబంధం ఉండదు. ఎలాంటి నష్టపరిహారం చెల్లించరు. అత్యవసరం వల్లనో, ఆరోగ్య సమస్యల వల్లనో ఎప్పుడైనా సెలవులు పెడితే జీతం కట్ చేస్తారు. ఒక్కోసారి కరెక్టుగా వచ్చినా సెలవులు పెట్టకపోయినా జీతం కట్ చేస్తారు. అడగాలంటే పనిలో నుండి తీసేస్తారేమో అని భయం.
డిమాండ్స్
1. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
2. కాంట్రాక్టర్, సూపర్ వైజర్ వేధింపులు ఆపాలి.
3. ఉద్యోగ భద్రత కల్పించాలి.
4. కార్మికులకి ప్రమాదం జరిగితే నష్టపరిహారం చెల్లించాలి.
జీతాలు నెలనెలా ఇవ్వరు
మాకు ఇద్దరు పిల్లలు. మా ఆయన కూలిపని చేస్తాడు. చాలీ చాలని బతుకులే. ఇల్లు గడవక అప్పులు చేయాల్సి వస్తుంది. ఎన్నో ఏండ్ల నుండి ఇక్కడే పని చేస్తున్నాం. ఎప్పటికైనా మా జీతాలు పెంచకపోతారా అని ఆశతో ఎదురు చూస్తున్నాం. కానీ ఇవ్వాల్సిన జీతాలు కూడా సరిగా ఇవ్వరు. ఒక్కోసారి రెండు, మూడు నెలలైనా జీతాలు రావు. ఎప్పుడైనా గట్టిగా జీతాల గురించి అడిగితే ఒక నెలది ఇచ్చి రెండు నెలలది ఆపేస్తారు. పని చేసుకుంటే తప్ప ఇల్లు గడవని పేదవాళ్ళం. వచ్చేదే ఏడు వేలు. అది కూడా సరిగ్గా ఇవ్వకపోతే కష్టం.
- నర్సమ్మ
కనీస వేతనాలు ఇవ్వాలి
పది సంవత్సరాల నుండి చేస్తున్నా. గార్డెనింగ్ వర్క్ మొదలుపెడితే, క్లీనింగ్ చేయడం, ఆఫీసర్లకు టీలు, టిఫిన్లు అందించడం లాంటి పనులు చేస్తాం. అలాగే లోడింగ్ అన్లోడింగ్ కూడా చేయాలి. ఎంత పని చేసినా జీతాలు మాత్రం పెంచరు. జీతం సరిగా రాకపోతే ఇల్లు గడవడం కష్టం. ఏమైనా అడగాలంటే భయం. ఉద్యోగం పోతుందేమో అని ఏమీ మాట్లాడకుండా నోరు మూసుకొని పని చేస్తున్నాం. మా సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవాలి. మా అందరికి కనీస వేతనం అమలు చేయాలి.
- సరిత
ప్రభుత్వం ఆలోచించాలి
ఊళ్ళో వ్యవసాయం లేక పనులు లేక కుటుంబం గడవక సిటీకి వచ్చాను. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నా భర్త నన్నూ, నా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక్కదాన్నే ఇల్లు చూసుకోవాలి. సాయం చేసేవారు ఎవ్వరూ లేరు. పని చేసుకుంటేనే ఇల్లు గడిచేది. 17 ఏండ్ల నుండి డీఎంహెచ్లో స్వీపర్గా పని చేస్తున్నాను. ఇద్దరు పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, ఇంకా ఎన్నో ఖర్చులు మాకు వచ్చే ఏడు వేల జీతం సరిపోదు. అప్పులు చేసి గడుపుతున్నాం. మా వేతనాలు పెంచితే మా జీవితాలు బాగుపడతాయి. కానీ మా గురించి పట్టించుకునే వారు ఎవరూ? వయసు పెరుగుతుంది. పని చేయలేకపోతున్నా. కాళ్ళ నొప్పులు. ప్రభుత్వం మా సమస్యల గురించి ఆలోచించాలి.
- కళమ్మ
ఎలా బతకాలి?
నా భర్త అడ్డా మీద కూలి పనికి పోతాడు. అడ్డా కూలీ ఒకరోజు ఉంటే రెండు రోజులు ఉండదు. ఆయనకు ఎప్పుడు పని దొరుకుతుందో ఎప్పుడు దొరకదో చెప్పలేం. ఇద్దరం పని చేసుకుంటే తప్ప ఇల్లు గడవదు. అందుకే డీఎంహెచ్ఓ ఆఫీసలో చేరాను. గవర్నమెంట్ ఆఫీసులో పని దొరికినందుకు సంతోషంగా అనిపించింది. కానీ మాకు వచ్చే జీతాలు చాలా తక్కువ. అందులోనే కటింగ్లు పోతాయి. వచ్చే 7 వేలతో ఎలా బతకాలి. బయట ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.
- సక్కు బాయి