''తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందుకు సంతోషం. కానీ తమ బతుకుల్ని అయోమయం చేస్తున్నందుకు బాధపడుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే మా సమస్యలు పరిష్కరిస్తామని అనేకసార్లు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కటి పరిష్కారం కాలేదు. పర్మినెంట్, కనీస వేతనం, పెన్షన్, ఇఎస్ఐ సౌకర్యాలు లేవు. ఉద్యోగ భద్రత లేదు'' అంటున్న అంగన్వాడీలు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశారు. వారి సమస్యల గురించి ఈ వారం కొలువులో...
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించక పోగా ఉన్న ఉద్యోగం నుండి తొలగించేందుకు జీఓ నెం.14ను తెచ్చారు. వయసు పైబడ్డవారిని పెన్షన్ లేకుండా ఇంటికి పంపించడానికి జీఓ నెం.19ని తెచ్చారు. మోయలేని పని భారాన్ని పెంచారు. ఐసీడీఎస్ నిర్వహణకు అయ్యే రోజువారి ఖర్చులన్నింటినీ బెదిరించి మరీ అంగన్ వాడీలతోనే పెట్టిస్తున్నారు. ప్రతినెలా వేతనాలు చెల్లించడం లేదు. సంవత్సరాల తరబడి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఐసీడీఎస్ కుదింపు, స్వచ్ఛంద సంస్థలు ఇషాన్, అక్షయపాత్రలకు అప్పగిస్తూ ఐసీడీఎస్లను వేగవంతంగా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఒకవైపు పనిభారం, మరోవైపు ఆర్థిక భారం.. చివరికి ఉన్న ఉద్యోగానికే గ్యారంటీ లేకపోవటంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి అంగన్ వాడీలు గురౌతున్నారు. దీంతో రోజురోజుకు అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.
కేంద్రాలకే సప్లై చేయాలి
ఇప్పటికే పనిభారంతో అంగన్వాడీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం పని భారాన్ని పెంచే మరో కొత్త నిర్ణయం చేసింది. 2019 ఫిబ్రవరి 1 నుండి రేషన్ షాపుల ద్వారా అంగన్ వాడీ కేంద్రాలకు బియ్యాన్ని సప్లై చేస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అంగన్ వాడీలే రేషన్ షాపులకు వెళ్ళి బియ్యాన్ని తెచ్చుకోవాలి. ఇప్పటికే అనేక ఇతర అదనపు పనులు చేస్తున్న అంగన్ వాడీలకు మరింత పనిభారం పెరుగుతుంది. అంగన్ వాడీ సెంటర్ సమయం వృధా అవుతుంది. క్వింటాళ్ళ బరువులు అంగన్ వాడీలు మోయటం సాధ్యంకాదు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. రేషన్ డీలర్లే అంగన్ వాడీ కేంద్రాలకు బియ్యాన్ని సప్లై చేసేవిధంగా ప్రభుత్వం నిర్ణయం చేయాలి.
బకాయిలు వెంటనే చెల్లించాలి
అనేక పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం అంగన్ వాడీ టీచర్లకు రూ.1,500/-లు, హెల్పర్లలకు రూ.750/-లు, మినీవర్కర్లకు రూ.1,250/-లు వేతనాలు పెంచింది. 2018 అక్టోబర్ నుండి పెంచిన వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయాలని ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఐదు నెలలు గడుస్తున్నా తెలంగాణ ప్రభుత్వం పెరిగిన వేతనాలు ఇంకా చెల్లించలేదు. ఈ విషయంపై రాష్ట్ర అధికారులను సంప్రదించినపుడు 'ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నాం, ఇవి కూడా అడుగుతారా?' అంటున్నారు. రెండవసారి అధికారంలోకి వస్తే అంగస్ వాడీలకు మళ్ళీ వేతనాలు పెంచుతామని స్వయంగా ముఖ్యమంత్రి బహిరంగ సభల్లో ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం పెంచిన వేతనాలు కూడా చెల్లించేందుకు సిద్దపడటం లేదు.
ప్రభుత్వమే డబ్బులు ఇవ్వాలి
తల్లిపాల వారోత్సవాలు, పోషకాహార వారోత్సవాలు, బాలల దినోత్సవం, అన్నప్రాసన, ఫ్రీస్కూల్ పిల్లల బర్త్ డేలకు చాక్లెట్లు, కేకులు ఇవ్వాలి. కిశోర బాలికలకు ఐరన్ ఫుడ్ కొనివ్వటం, ఆటల పోటీలు నిర్వహించి, గిఫ్ట్లు ఇవ్వాలి. గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయాలి. చీర, బ్లౌజు, పూలు, పండ్లు, భోజనాలు, గాజులు తదితర మెటీరియల్స్ కొనివ్వాలి. ఇంకా అనేక కార్యక్రమాలు అంగనవాడీలు నిర్వహిస్తున్నారు. ప్రతి కార్యక్రమానికి బ్యానర్స్ చేయించాలి. వచ్చిన సభ్యులకు టీలు, స్నాక్స్ ఇవ్వాలి. ఫొటోలు తీసి అధికారులకు పంపించాలి. ప్రెస్లో వచ్చేలా చూడాలి. వీటి నిర్వహణకు వేలల్లో ఖర్చు అవుతున్నాయి. ఇవన్నీ చేయకపోతే జీతాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పటివరకు పెట్టిన ఖర్చులకు ప్రభుత్వం వెంటనే డబ్బులు చెల్లించాలి.
మెటీరియల్ వెంటనే సప్లై చేయాలి
అంగన్ వాడీ కేంద్రాలకు ఫ్రీస్కూల్ కిట్స్ ఇవ్వటం లేదు. చార్ట్స్ కూడా సప్లై చేయటం లేదు. కానీ అంగన్ వాడీ కేంద్రంలో అన్నీ ఉండాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. బకెట్స్, బిందెలు, సోప్స్, అవసరమైన వంటపాత్రలు, వెయిటింగ్ మిషన్స్ తదితర మెటీరియలను ప్రభుత్వం ఇవ్వటం లేదు. సంవత్సరానికి 20 వైట్ పేపర్లు ఇచ్చి వాడుకోవాలని చెప్తున్నారు. ఇవి ఒక నెలకు కూడా సరిపోవడం లేదు. రిజిష్టర్లు కూడా అంగన్ వాడీలే కొనుక్కోవాలి. సగం జీతం ఈ ఖర్చులకే అయిపోతుంది.
అదనపు పనులు చేయించకూడదు
ఐసీడీఎస్కు సంబంధంలేని అనేక పనులను ప్రభుత్వం అంగన్ వాడీలతో చేయిస్తున్నది. రైతుబంధు పాస్ పుస్తకాల పంపిణీ, బతుకమ్మ చీరల పంపిణీ, గ్రామ సభలు, అనేక సర్వేలు, మన టీవి ప్రోగ్రామ్, అవసరం లేని రిజిష్టర్సు, రికార్డు వర్క్ బాగా పెంచారు. ఇవన్నీ మళ్ళీ ఆన్లైన్లో చేయించే డబుల్ పని పెట్టారు. ఆన్ లైన్లో రిపోర్టు ట్యాలీ అయ్యే వరకు రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాలి. దీనివల్ల అంగన్ వాడీ టీచర్ల పట్ల ప్రజలకు నమ్మకం పోతున్నది. ఫ్రీస్కూల్ పిల్లలకు అన్యాయం జరుగుతున్నది.
జిఓ నెం.14ను సవరించాలి
టీచర్లకు 10 అంశాలపైన, హెల్పర్లకు 5 అంశాలపైన క్రమశిక్షణా చర్యలు ఇందులో రూపొందించారు. ఏదైనా పొరపాటు జరిగితే, జరిగిన పొరపాటు సరైందా? కాదా? అని ఎంక్వైరీ చేసే పద్ధతి ఈ జిఓలో లేదు. అంటే అధికారులు కానీ, అంగన్ వాడీలంటే పడనివారు కానీ ఏది చెబితే అదే నిజం. ఒక్క కంప్లయింట్ ఇస్తే చాలు క్షణంలో అంగన్ వాడీల ఉద్యోగం పోతుంది. ఈ పద్దతి సరైంది కాదు. ఏ ఉద్యోగికైనా, కార్మికునికైనా క్రమశిక్షణా చర్యలుండాలి. ఏకపక్షంగా ఇష్టానుసారంగా ఇంటికే పంపించే చర్యలుండకూడదు. పొరపాటును సరిచేసుకునే అవకాశాన్ని కూడా కల్పించాలి. కానీ జిఓ నెం.14లో ఈ విధంగా లేదు. దీంతో ఏ క్షణాన ఉద్యోగం పోతుందోననే భయంలో అంగన్వాడీలు బతుకుతున్నారు.
ఆధార్ లింకును తొలగించాలి
అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరికాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మాతా శిశు మరణాలు, పోషకాహారలోపం తగ్గించాలనే లక్ష్యాలతో ఐసీడీఎస్ ఏర్పడింది. ఈ లక్ష్యానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. పోషకాహారాన్ని ఆధార్తో లింకు చేసింది. దీంతో చాలామంది లబ్దిదారులకు అన్యాయం జరుగుతుంది. 6 నెలలు దాటిన పిల్లలకు ఆధార్ కార్డు రావడానికి చాలారోజులు పడుతుంది. దీంతో పిల్లలు పోషకాహారానికి దూరం అవుతున్నారు. అందుకే ఆధార్ లింకును ప్రభుత్వం వెంటనే తొలగించాలి.
డిమాండ్స్
- అంగన్ వాడీ కేంద్రాలకే బియ్యాన్ని సప్లై చేయాలి.
- కేంద్రం పెంచిన వేతనాల బకాయిలువెంటనే చెల్లించాలి.
- అదనపు పనులుచేయించకూడదు.
- ఐసిడిఎస్నురక్షించాలి.
- జఓ నెం.14, 19 లను సవరించి, అంగన్ వాడీలకు నర్వీసు రూల్స్ రూపొందించాలి.
- పెన్షన్ సౌకర్యం కల్పించాలి.
- వేతనంతో కూడిన మెడికల్ సెలవులు మంజూరు చేయాలి.
ఆయాల సమస్యలు...
తెలంగాణ రాకముందు ఆయాలకు, టీచర్లకు మధ్య వేతనంలో వ్యత్యాసం రూ.2,000/-లు మాత్రమే ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ వ్యత్యాసం బాగా పెరిగింది. వీరిద్దరి మధ్య రూ.4,500/-ల వేతనం వ్యత్యాసం ఉంది. దీంతో ఆయాలు అతి తక్కువ వేతనంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ప్రాజెక్టు మీటింగ్స్ కూడా పెట్టడం లేదు. అదనపు పనులపై టీచర్లు బయటికి వెళ్ళినప్పుడు వీరికి పనిభారం పెరుగుతున్నది. ప్రమోషన్ సౌకర్యం కూడా ప్రభుత్వం సక్రమంగా అమలుచేయడం లేదు. ఆయాలకు వెంటనే వేతనం పెంచాలి. ప్రమోషన్ సౌకర్యం తదితర సమస్యలు పరిష్కరించాలి.
మినీ వర్కర్ల సమస్యలు...
మినీ వర్కర్స్తో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటుంది. హెల్పర్స్తో సమానంగా వేతనం చెల్లిస్తున్నది. పనిమాత్రం టీచర్, హెల్పర్ ఇద్దరు చేసే పనిని ఒక్క మినీ వర్కర్తో చేయిస్తున్నారు. ఇప్పుడు పెరిగినవి కాకుండా కేంద్ర ప్రభుత్వం గతంలో రూ.2,250/-లు వేతనం పెంచింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పెంచిన వేతనాలు కూడా చెల్లించలేదు. ఇందులో కేవలం రూ.1,500/-లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం మినీలకు చెల్లిస్తున్నది. మినీ అంగన్ వాడీ వర్కర్లకిచ్చే వేతనాన్ని యధావిధిగా చెల్లించకుండా, తగ్గించి చెల్లిస్తున్నారు. ఆయా ఉండదు కాబట్టి వీరికి సెలవులు కూడా ఇవ్వరు. సౌకర్యాలు తక్కువ, పనిభారం ఎక్కువతో మినీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
Authorization