తెలంగాణ ప్రభుత్వం వచ్చాక తమకు పర్మినెంట్ అవుతుందని, తమ బతుకులు మారుతాయని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సంబర పడ్డారు. మొదటి ఐదేండ్ల పాలనతో కాంట్రాక్ట్ కార్మికులకు ఒరిగిందేమీ లేదు. రకరకాల మాయమాటలు చెప్పి, ఈ సారి అధికారంలోకి వస్తే తప్పక న్యాయం చేస్తామంటూ కబుర్లు చెప్పి మళ్ళీ అందలమెక్కారు. రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీలు ఆచరణకు నోచుకోవట్లేదు. ఆశా వర్కర్లు తమ వేతనాలు పెంచాల్సిందిగా, పర్మినెంట్ చేయాల్సిందిగా నెలల తరబడి పోరాటం చేసినా ప్రభుత్వం వారి సమస్యలన పట్టించుకోలేదు. వేతనాలు పెంచుతున్నట్టు వారితో మీటింగులు పెట్టి మీడియాలో ప్రచారమైతే చేసుకున్నారు. కానీ ఆచరణలో మాత్రం ఏమీ లేదు. మరోవైపు 25 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే శాఖల వారీగా ఖాళీలను గుర్తించి నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. దీంతో నిరుద్యోగులే ఎంతో ఆశపడ్డారు. ఏండ్లు గడిచినా నిరుద్యోగుల కోరిక మాత్రం తీరలేదు. ఉద్యోగం రాలేదు. ఏండ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ప్రభుత్వం చెప్పినా అందులో సీనియారిటీ అనీ, ఔట్ సోర్సింగ్ అనీ, స్థానికత అని రకరకాల అడ్డంకులు ఎదురవుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారిలో నాలుగో తరగతి ఉద్యోగులు, రెండో ఎఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు ఏండ్ల తరబడి పని చేస్తున్నారు. ఇందులో చాలామంది నియామక నిబంధనల మేరకు తీసుకున్నవారు ఉన్నారు. గత ప్రభుత్వాలు కూడా వీరిని పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చాయి. కానీ చేయలేదు. కేసీఆర్ హామీతో తెలంగాణలోనైన తమ ఆశలు నెరవేరుతాయని వీరు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే పనిచేస్తున్న వారు కూడా కొత్తగా వేసే పోస్టులకు దరఖాస్తు చేసుకోమంటున్నారు. దాంతో వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తమను పర్మినెంట్ చేస్తారా? లేదా? చేస్తే ఏ విధంగా చేస్తారో తేల్చాలని వారు అడుగుతున్నారు. తమకు సర్వీసు, అర్హత, అనుభవం అన్నీ ఉన్నాయి. కాబట్టి వెంటనే పర్మినెంట్ చేయాలని కోరుతున్నారు. అలాగే విద్యుత్ శాఖలో ఏండ్ల తరబడి అతితక్కువ వేతనంతో రాష్ట్ర వ్యాప్తంగా 20 వేలమందికిపైగా పనిచేస్తున్నారు. వీరంతా నైపుణ్యం సంపాదించారు కూడా. వీరిని కూడా ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులుగా అపాయింట్ చేయాల్సి వుంది. వీరిని పర్మినెంట్ చేస్తామంటూ మాటలు చెబుతున్నారే తప్ప ఇప్పటి వరకు ఆచరణలో చూపలేదు. ఏపీఎస్ఇబీ రూల్స్ ప్రకారం తమని పర్మినెంట్ చేయాలని విద్యుత్ కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.
Authorization