2005లో అప్పటి అధికారులు హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్ వ్యాపారాలు, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, రిక్షాలు, టాంగాలు రోడ్లపై తినగవద్దు అని నిషేధం పెడితే ఆనాడు సీఐటీయు ఎడ్ల బండ్లు, తోపుడు బండ్లు, రిక్షాలతో ప్రదర్శన నిర్వహించి వేలమందితో ఇందిరాపార్క్ వద్ద ధర్నా, రాస్తారోకోలు నిర్వహించారు. దాంతో అప్పటి అధికారులు దిగివచ్చి నిషేధాన్ని ఎత్తివేశారు.
- 2004లో జాతీయ స్థాయిలో గల అన్ని రాష్ట్రాలలోని చిరువ్యాపారుల సంఘాలను కలుపుకొని వీధి వ్యాపారులకు సమగ్ర చట్టం కావాలని కేంద్రంపై నిరసన కార్యక్రమాలు చేపడితే 2012లో సుప్రీం కోర్టు ఆయా రాష్ట్రాలు వీధి వ్యాపారస్తులకు సమగ్ర చట్టం చేసే వరకు వీరికి అదే స్థలంలో వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
చట్టం తెచ్చారు
- ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీఐటీయూ, ఇతర తోపుడు బండ్ల వ్యాపారస్తుల సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగా ''వీధి వ్యాపారస్తుల జీవనోపాధి రక్షణ, వీధి వ్యాపారాల క్రమబద్దీకరణ'' అనే చట్టం - 71, 2014లో తీసుకొచ్చింది. ఈ చట్టం అమలుకై జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులు వివిధ యూనియన్స్ నాయకులతో 2014లో నగర, సర్కిల్స్, జోన్స్వైజ్గా కమిటీలు ఏర్పాటు చేశారు.
గుర్తింపు కార్డులు ఇస్తామని
ఈ కమిటీల ద్వారా నగరాలలోని ప్రతి వార్డులలో వీధి వ్యాపారం చేసుకుంటున్న మహిళలకు, పురుషులకు మున్సిపల్ ద్వారా పర్మిషన్స్, ఐడీ కార్డు కొరకు ఆ వ్యాపారుల నుంచి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డులలో ఏదైనా ఒక జిరాక్స్, పాస్పోర్టు సైజ్ లేదా కుటుంబ గ్రూప్ ఫొటో మున్సిపల్ వారు ఇచ్చి దరఖాస్తు జతచేసి 2014లో సీఐటీయు సంఘాల ద్వారా వేల దరఖాస్తులు మున్సిపల్ అధికారులకు అందజేశారు. దరఖాస్తులను మున్సిపల్ అధికారులు వెరిఫికేషన్ కూడా చేశారు. వెంటనే గుర్తింపు కార్డులు జారీ చేస్తామని మున్సిపల్ అధికారులు చెప్పి సంవత్సరాలు దాటినా అందరికీ గుర్తింపు కార్డులు మాత్రం రాలేదు.
అమలు చేయడం లేదు
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక పర్యాయాలు మున్సిపల్ అధికారులను వీధి వ్యాపారస్తులకు చట్టం -71 ప్రకారం గుర్తింపు కార్డులు ఇవ్వాల్సిందిగా సీఐటీయూగా ఎన్నో పోరాటాలు చేశారు. అయితే గట్టిగా పోరాడిన చోట, సంఘం బలంగా ఉన్న ప్రాంతాల్లో, అక్కడక్కడ మాత్రమే కార్డులు ఇచ్చారు. అలాగే కోర్టు తీర్పు ప్రకారం 2014లో సర్కిల్ వారీగా కమిటీలైతే ఏర్పాటు చేశారు గానీ అవి నామమాత్రంగానే పని చేస్తున్నాయి. కోర్టు చెప్పిన ఒక్క నియమాన్ని కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదు.
డిమాండ్లు
- వీధి వ్యాపారస్తులంరికీ వ్యాపారం చేసుకునే స్థలంలోనే మున్సిపల్ పర్మిషన్, ఐడీ కార్డులు ఇవ్వాలి.
- 2014 చట్టం -71 ప్రకారం వీధి వ్యాపారస్తుల జీవనోపాధి రక్షణ, క్రమబద్దీకరణ జరిపించాలి.
- 2012 సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఎక్కడి వ్యాపారస్తులకు అక్కడనే స్థలం కేటాయించాలి.
- వీధి వ్యాపారస్తులందరికీ సులభ పద్ధతిలో బ్యాంక్ రుణాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.
- మున్సిపల్, పోలీస్ అధికారులు, యూనియన్ నాయకులతో టౌన్ వైండింగ కమిటీలను పునరుద్దరణ చేయాలి.
- 60 సంవత్సరాలు దాటిన వీధి వ్యాపారస్తులందరికీ వెయ్యి రూపాయల పింఛన్ ఇవ్వాలి.
- సొంత ఇల్లులేని వీధి వ్యాపారస్తులందరికీ డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ కింద ఇల్లు ఇవ్వాలి.
- వీధి వ్యాపారస్తుల పిల్లలకు కళ్యాణలక్ష్మి పథకం అమలు చేయాలి.
- మున్సిపల్, ట్రాఫిక్ పోలీసు అధికారుల వేధింపులు నిలిపి వేయాలి.
- వీధి వ్యాపారస్తుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి.
చట్టాన్ని తుంగలో తొక్కేశారు
మాది బోరుబండ. 90వ సర్కిల్. ఈ మధ్య కాలంలో చాలా ప్రాంతాలలో మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీరెవ్వరికీ గుర్తింపు కార్డులు లేవు. కోర్టు తీర్పు ప్రకారం ఈ మార్కెట్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగినట్లయితే ప్రభుత్వమే వీరికి మరో ప్రదేశాన్ని చూపించాలి. ఇదేదీ ప్రభత్వుం చేయడం లేదు. అలాగే వ్యాపారం చేసుకోడానికి బ్యాంకు లోన్లు ఇవ్వాలి. అలాగే ట్రాఫిక్ పోలుసులు, అధికారుల నుండి వీరికి ఎలాంటి వేధింపులే లేకుండా చూడాలి. కానీ ఇవేవీ పట్టించుకోవడం లేదు. అసలు ప్రభుత్వం కోర్టు చెప్పిన 71వ చట్టాని తుంగలో తొక్కేసింది. దీనిపై అసలు చాలా మంది వ్యాపారులకు అవగాహన లేదు. దీని గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి.
- సి.శేషగిరి, బోరబండ,ప్రజాసంఘాల నాయకులు