భర్త ఓ చోట.. భార్య ఓ చోట.. పిల్లలు మరో చోట... ఆర్థిక సమస్యల వల్ల కుటుంబానికి దూరంగా ఉంటూ మానసికంగా కుంగిపోతూ ఉద్యోగాలు చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించమంటూ ఏండ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఫలితం లేదు. ఉద్యోగం కావాలా? కుటుంబం కావాలా? కుటుంబం కావాలనుకుంటే ఉద్యోగం మానుకోండి... ఇది కొంత మంది అధికారుల నుండి వస్తున్న సమాధానం. ఇలా బదిలీల కోసం నిత్య పోరాటం చేస్తున్నారు కాంట్రాక్ట్ అధ్యాపకులు. 'మేమూ మనుషులమే, మాకూ కుటుంబాలు ఉంటాయి. బానిసలం కాదు' అంటున్న వారి సమస్యలు ఈ వారం కొలువులో...
ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా వున్న అధ్యాపక పోస్టులలో పనిచేయడానికి 2000లో అర్హతలు ఉన్న వారిని కాంట్రాక్ట్ లెక్చరర్గా నియమించారు. అప్పటి నుంచి వాళ్ళు ప్రభుత్వ కళాశాలల్లో పూర్తి కాలం పని చేస్తూ విద్యార్థుల అభివృద్ధికి, ప్రభుత్వ కళాశాల ఉన్నతికి ఎంతో కృషి చేస్తున్నారు.
ప్రణాళికలో పొందుపరిచారు
ప్రభుత్వ కళాశాల అభివృద్ది కోసం ఇంతగా కృషి చేస్తున్న వీరికి ఉద్యోగభద్రత, క్రమబద్ధీకరణ లేకపోవడం వలన ఆర్థిక, మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియక ''దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు లా'' బతుకుతున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని గత ప్రభుత్వాల దృష్టికి అనేకసార్లు విన్నవించారు. 2014లో అన్ని రాజకీయ పార్టీలకు వీరి సంఘం తరఫున వినతిపత్రం ఇచ్చారు. అప్పటి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంపై ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచారు. ఇందుకు తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంతో సంతోషించారు.
క్రమబద్దీకరణలో జాప్యం
2014 ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ పార్టీ గెలిచి కేబినెట్ మీటింగ్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ఆమోదించి సూచన (4) ద్వారా సీనియర్ ఐఎయస్లతో ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ సూచనల ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించడానికి సూచన (5) ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో అధ్యాపకుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఆ సమయంలో కొంత మంది విద్యార్థులు క్రమబద్దీకరణకు వ్యతిరేకంగా న్యాయస్థానాలకు వెళ్ళడంతో మధ్యంతర ఉత్తర్వులతో లెక్చరర్ల క్రమబద్దీకరణ ఆసల్యం జరుగుతుంది. దీంతో ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న లెక్చరర్లు మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరి సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళగా సూచన (6), (7), (8) ద్వారా కాంట్రాక్ట్ లెక్చరర్లకు 2015 పీఆర్సీ ప్రకారం (మినిమం ఆఫ్ ది టైం స్కేల్) కల్పిస్తూ 12 నెలల వేతనం ఇచ్చారు. దానికి వారు ఎంతో సంతోషించారు.
క్రమబద్దీకరణ జరిగే వరకు
ఈ మధ్య కాలంలో కొంత మంది రిటైర్మెంట్ నిబంధనలతో కాంట్రాక్ట్ లెక్చరర్లుగానే రిటైర్డ్ అవుతున్నారు. దాంతో పదవీవిరణమన తర్వాత ఆర్థిక పరమైన ప్రయోజనాలు లేక వారి కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు వివిధ కారణాలతో, ప్రమాదాలతో ఆర్ధాంతరంగా మరణిస్తున్నారు.
ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి
కాంట్రాక్ట్ లెక్చరర్లు కూడా మనుషులే. వారికి కూడా కుటుంబాలు ఉన్నాయి. వారి సమస్యలు కూడా పట్టించుకోవాలి. వారిని రెండవ తరగతి ఉద్యోగులుగా చూడటం తగదు. వీరి బదీల విషయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రెజరరీ కంట్రోల్ ఎత్తివేసి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రతినెలా వేతనాలు ఇస్తున్నారు. కానీ తెలంగాణలో 6 నెలలకు ఓసారి మాత్రమే వేతనాలు ఇస్తున్నారు. దాంతో చాలా మంది భార్యల మెడలో పుస్తెలు తాకట్టుపెడుతున్నారు. ప్రభుత్వం వెంటనే నెలనెల వేతనాలు ఇచ్చేటట్లు ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి. ఓ పక్క క్రమబద్దీకరణ జరపక, ట్రాన్స్ఫర్లు జరగక కాంట్రాక్ట్ లెక్చరర్ల కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే క్రమబద్దీకరణ న్యాయస్థానంలో ఉన్నప్పటికీ మిగతా సమస్యలు వెంటనే పరిష్కరించవచ్చు. క్రమబద్దీకరణ జరిగే వరక ఈ కింది సమస్యలు పరిష్కరించవలసినదిగా వారు కోరుతున్నారు.
క్రమబద్దీకరణ జరిగే వరకు డీఏ, హెచ్ఆర్ఏ చెల్లించాలి, ప్రతి నెల వేతనం సక్రమంగా చెల్లించాలి.
మహిళా కాంట్రాక్ట్ లెక్చరర్లకు పర్మినెంట్ మహిళా లెక్చరర్లకు ఇస్తున్న వేతనంతో కూడిన ప్రసూతి - సెలవులు ఇవ్వాలి.
- హెల్త్ కార్డులు ఇవ్వాలి.
- ఆరోగ్య భీమా పథకం వర్తింప చేయాలి.
- నెలకు ఒక (1) సెలవు పెంచాలి.
- ప్యూనల్ / ఆబ్స్క్యూస్ చార్జెస్ వర్తింప చేయాలి.
- కొప్పిశెట్టి సురేష్,
కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి
12 ఏండ్ల నుండి కుంగిపోతున్నా
మా సొంత జిల్లా నల్లగొండ. నా భర్త, ఇద్దరు ఆడపిల్లలు యాదాద్రిలో ఉంటారు. 2008 నుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పని చేస్తున్నా. ప్రస్తుతం కొత్తకోట గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చేస్తున్నా. మా కుటుంబంలో ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. దాని వల్ల ఇంత దూరం వచ్చి ఉద్యోగం చేయాల్సి వస్తుంది. మూడు వందల కిలో మీటలర్లు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. వారానికి ఒక్క సారి వెళ్లివస్తాను. మా మామయ్య అత్తయ్య చనిపోయారు. పిల్లల్ని చూసుకోడానికి ఎవ్వరూ లేరు. పిల్లలకు ఎప్పుడు ఎలా ఉంటుందో అనే టెన్షన్తో మానసికంగా కుంగిపోతున్నా. ఎప్పటికైనా బదిలీ చేస్తారనే ఆశతో ఉన్నా. ఎన్ని సార్లు గవర్నమెంటుకు చెప్పినా ఫలితం లేదు. ఉద్యోగ భద్రత పక్కన పెడితే కనీసం బదిలీ కూడా చేయడం లేదు. ప్రభుత్వం మా సమస్యలను ఎందుకు పట్టించుకోదో అర్థం కావడం లేదు. మా పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు. మా పైన దయవుంచి ఇప్పటికైనా బదిలీ చేయండి.
- పావని
తక్షణమే స్పందించాలి
2012లో 1200 మందిని జోన్లతో సంబంధం లేకుండా బదిలీలు చేశారు. అప్పటి నుండి ప్రతి సారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతూనే ఉన్నాం. కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. మహిళలకు రకరకాల సమస్యలు వస్తున్నాయి. పిల్లలు నెటివిటీని కోల్పోతున్నారు. కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి. విడాకులు తీసుకునే వరకు కూడా పోయారు. అందుకే గత సంవత్సరం నుండి బదిలీ చేయాలని విద్యాశాఖా మంత్రివర్యులు, విద్యాశాఖ అధికార్లను, కమిషనర్లకు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ ఏ మాత్రం స్పందించడం లేదు. గత నెల 25న ఇంటర్ స్పాట్ క్యాంప్ వద్ద లంచ్ అవర్ నిరసన కార్రక్రమం చేపట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం. అయినప్పటికీ అధికార్లు స్పందించలేదు. వెంటనే బదిలీలు చేపట్టాలని ధర్నా చేశాం. అధికార్లు స్పందించకుంటే త్వరలో మరింత ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపాం. వీటితో పాటు ట్రెజరరీ కంట్రోల్ ఎత్తివేసి నెలనెలా వేతనాలు ఇవ్వాలని కోరాం. ప్రస్తుతం రాష్ట్రంలో 3,900 మంది జూనియన్ కాంట్రాక్ట్ లెక్చరర్స్, 900 మంది డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ పని చేస్తున్నారు. వీరందరూ కూడా ప్రభుత్వ సానుకూల నిర్ణయం గురించి ఎదురు చూస్తున్నారు. జూలై 16న తక్షణం బదిలీలు జరపాలని టీచర్స్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆధ్వర్యంలో అధికారులను కలిశాం. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలి.
- శోభన్
జాబ్ మానుకోమంటున్నారు
నేను పని చేస్తుంది మహబూబ్నగర్ గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజీ. ఉండేది హైదరాబాద్. ఐదేండ్ల పాప ఉంది. మా వారికి హైదరాబాద్లో ఉద్యోగం. జాబ్ కోసం రోజూ ఎనిమిది గంటల ప్రయాణం చేస్తున్నా. బస్సులో సీట్లు కూడా దొరకవు. నడుము నొప్పులు. ఆరోగ్యం కూడా పాడైపోతుంది. నాలా సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కుటుంబ పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇంట్లో మగవాళ్ళు కావాలనే బదిలీ చేసుకోవడం లేదన్నట్టు అనుమానంగా మాట్లాడుతున్నారు. మమ్మల్ని బదిలీ చేయడానికి ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా ఖర్చు లేదు. అయినా పట్టించుకోవడం లేదు. సొంత జిల్లాలో ఖాళీలు ఉన్నా మమ్మల్ని బదిలీ చేయకుండా గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకుంటున్నారు. మహిళా లెక్చరర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. అధికారులను కలిస్తే ఫ్యామిలీ కావాలంటే జాబ్ వదిలేసేయండి అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు.
- శైలజ