ఎన్నో ఏండ్లు ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో పోరాటాలే తప్పుగా కనిపిస్తున్నాయి. రాష్ట్రం వస్తే తమ సమస్యలన్నీ తీరిపోతాయనీ, వేతనాలు పెరుగుతాయని, ఉద్యోగ భద్రత కల్సి ఆకతమంటే అందరూ నమ్మారు. అందులో అంగన్వాడీలు కూడా ఉన్నారు. ఉద్యమ నాయకుడిగా పేరు పొందిన నాయకులే ఇప్పుడు రాష్ట్రాన్ని ఏలుతున్నారు. కానీ తమ సమస్యల పరిష్కారం కోసం, వేతనాల పెంపు కోసం పోరాటం చేస్తే మాత్రం తప్పై పోయింది. ధర్నాలు చేసిన రోజుల్లో వేతనాలు కత్తిరిస్తామంటూ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఓ జీవోలో ప్రస్తావించింది. దీనిపై అంగన్వాడీలో ఆందోళన చెందుతున్నారు. వెంటనే దీన్ని ఉపసంహకరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆగస్టు 5వ తేదీన ప్రభుత్వం సర్క్యులర్ మెమో నె.1357/ ఐసీడీఎస్ -1/2017ను జారీ చేసింది. ఇందులో అంగన్వాడీల వేతనాల చెల్లింపు ఇఎంఎస్ హాజరు వేసే సమయంలో అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు చేశారు. అయితే వీటితో పాటు 3 పాయింట్లో అంగన్వాడీలు ధర్నాలు చేసిన రోజులకు వేతనం ఇవ్వకూడదని రాశారు. సమస్యలు అడిగితే వేతనాలు కట్ చేస్తామనటం దుర్మార్గం. ఇది అంగన్వాడీల హక్కులను కాలరాయడం తప్ప మరొకటి కాదు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ (టీచర్స్) అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటి డిమాండ్ చేస్తున్నది.
వ్యతిరేక నిర్ణయాలే...
రాష్ట్రంలో అంగన్వాడీలు పనేమి లేక సరదా కోసం ధర్నాలు చేయడం లేదు. రాష్ట్ర ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లేదు. కనీస వేతనం లేదు. పెన్షన్ లేదు, ఉద్యోగ భద్రత లేదు. ఏ సౌకర్యాలు ప్రభుత్వం కల్పించలేదు. పైగా ఐసీడీఎస్తో పాటు అంగన్వాడీలకు నష్టం కలిగించే అనేక వ్యతిరేక నిర్ణయాలు ఈ కాలంలో ప్రభుత్వం చేసింది. ఉద్యోగ భద్రత లేకుండా చేస్తూ జీఓ నెం.14ను తెచ్చింది. పెన్షన్ లేకుండా చేస్తూ జీఓ నెం.19ని తెచ్చింది. రేషన్ షాపుల నుండి బియ్యం మోసుకొచ్చుకోవాల్సిందిగా చెప్తున్నది. అంగన్వాడీ కేంద్రాలను పొదుపు సంఘాలకు అప్పగిస్తూ జీఓ నెం.8ని తెచ్చారు. 12 జాతీయ సెలవులు తొలగించారు.
మరో మార్గం లేకనే
5 సంవత్సరాల నుండి ఇంక్రిమెంట్, స్టేషనరీ, యూనిఫామ్స్, ఇన్ఛార్జ్ అలవెన్స్లు ఇవ్వడం లేదు. 2018 అక్టోబర్ నుండి కేంద్రం పెంచిన వేతనాలు నేటికీ చెల్లించలేదు. ప్రభుత్వ ప్రోగ్రామ్స్తో పాటు ఐసీడీఎస్ నిర్వహణకు అయ్యే ఖర్చులన్నింటిని అంగన్వాడీలతో పెట్టిస్తున్నారు. వీటితో పాటు ఇంకా అనేక సమస్యలను ఇప్పటికే అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. ఆఫీసుల చుట్టూ తిరిగి, తిరిగి వాళ్ళ చెప్పులు అరుగుతున్నాయే తప్ప సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. అందుకే మరో మార్గం లేక అంగన్వాడీలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యమే దీనికి కారణం.
ఇది నియంతృత్వం...
''సమస్యలన్నింటిని పరిష్కారం చేయండి. అప్పుడు మాక్కూడా ధర్నాలు చేసే అవసరం ఉండదు'' అంటున్నారు అంగన్వాడీ వర్కర్లు. కానీ పరిష్కారం చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం మర్చిపోయింది. పైగా కార్మికుల ప్రజాస్వామిక హక్కులకు భిన్నంగా అంగన్వాడీలు సమస్యలు అడగొద్దు, అడిగితే వేతనాలు కట్ చేస్తామంటే అర్ధం ఏమిటి? దీనిని ప్రజాస్వామ్యం అంటారా? నియంతృత్వం అంటారా? మేము ఇతర సమస్యలు పరిష్కారించాలని అడుగుతుంటే వేతనాలు కట్ చేసి కొత్త సమస్యను సృష్టించడం సమంజసం కాదు. ''అయినా మేము సమ్మెకు వేతనాలు అడగడం లేదు. గతంలో అనేక దేశవ్యాప్త సమ్మెలో మేము పాల్గొన్నప్పుడు వేతనం మీరు ఎందుకివ్వటం లేదని మేమెప్పుడూ అడగలేదు. అంటే వేతనాలు అడగమని అర్థం కాదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 13 రోజుల సమ్మెకు ప్రభుత్వం వేతనాలు చెల్లించిన పరిస్థితి ఉంది. సమ్మె కాలంలో వేతనాలు చెల్లిస్తారా? లేదా? ఆ సమయంలో జరిగే ఒప్పందాన్ని బట్టి ఉంటుంది'' అంటున్నారు అంగన్వాడీలు.
కేంద్రాలకు ఆటంకం లేకుండానే...
ఇప్పుడు అంగన్వాడీలు చేస్తున్నది సమ్మె కాదు. కేవలం నిరసన కార్యక్రమాలు మాత్రమే. అది కూడా అంగన్వాడీ కేంద్రాలు నడుపుతూ, గర్భిణీ, బాలింతలు, 0-6 సంవత్సరాల వయసు పిల్లలకు పోషకాహారాన్ని అందిస్తూ, రిజిష్టర్స్, రికార్డ్స్ వర్క్ చేస్తూ, ఒక్క మాటలో చెప్పాలంటే అంగన్వాడీ కేంద్రాలను నడుపుతూ ఐసీడీఎస్ నిర్వహణకు ఆటకం లేకుండా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విషయాలను ప్రభుత్వం గమనించాలి. ఏ సంస్థలో పని చేసే కార్మికులైనా ఆ సంస్థలో సమస్యలొచ్చినప్పుడు, వచ్చిన సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలు చేసే ప్రజాస్వామిక హక్కులు కార్మికులకుంటాయనే విషయం ప్రభుత్వం గమనించాలి. కాబట్టి అంగన్వాడీల హక్కులకు నష్టం కలిగించే సర్క్యులర్లోని 3వ పాయింట్ను తక్షణమే తొలగించాలి. ఐసీడీఎస్లో కార్మికుల హక్కులు అమలు చేయాలి.
సీఐటీయూ తోడుగా ఉంటుంది
ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించక పోగా కొత్త సమస్యలను సృష్టిస్తుంది. ఐసీడీఎస్ సంస్థను నష్టం కలిగించే జీఓ నెంబర్ 8ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. 90 రోజులున్న సెలవుల పరిమితిని 180 రోజులకు పెంచుతూ తేది 15.7.19న ప్రభుత్వం జీఓ జారి చేసింది. సెలవుల రోజులు పెంచినందుకు అంగన్ వాడీలకు సంతోషమే. కానీ వేతనం లేకుండా సెలవులు నిర్ణయించడం వల్ల ఉపయోగం ఏముంటుంది. తమకు వచ్చిన వేతనాలతో కుటుంబాలు గడవక అప్పులు చేస్తున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఈ సమస్యలకు తోడు అంగన్వాడీ టీచర్లకు అధికారుల వేధింపులు ఎక్కువగా ఉన్నవి. ఇంకా ఇఎస్ఐ, పీఎఫ్, టీఏ, డీఏలు లాంటివి ఏవీ వీరికి వర్తించవు. కనీస వేతనం అమలు కావడం లేదు. ఉద్యోగ భద్రత లేదు. ఈ సమస్యలన్నీ పరిష్కరించే వరకు సీఐటీయూ అంగన్వాడీకు తోడుగా ఉంటుంది.
- మీనా, హైదరాబాద్ సౌత్ జిల్లా ఉపాధ్యక్షురాలు, సీఐటీయూ
మాకు నష్టం చేస్తున్నారు
నేను తొమ్మిది సంవత్సరాల నుండి అంగన్వాడీ టీచర్గా పని చేస్తున్నాను. నా భర్త కూలి పనులు చేస్తాడు. నాకు ఓ అమ్మాయి, ఓ అబ్బాయి. మాకు వచ్చే వేతనంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఉన్న సమస్యలను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనాలు అమలు చేయమని మేం అడుగుతున్నాం. కానీ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించకపోగా ధర్నాలు చేస్తే వేతనాలు కట్ చేస్తామనటం దారుణం. జీఓ నెంబర్ 8 మాకు నష్టం చేసే విధంగా ఉన్నది. గతంలో అతి తక్కువగా ఉన్న మా వేతనాలు సీఐటీయూ పోరాట ఫలితంగా పెరిగాయి. ఇప్పుడు కూడా మా సమస్యలు పరిష్కరించే వరకు యూనియన్తో కలిసి పోరాటం చేస్తాము.
- విజయలక్ష్మి
సెంటర్లు నడుపుతూనే...
నేను పదకొండు సంవత్సరాల నుండి అంగన్వాడీ టీచర్గా చేస్తున్నాను. నాభర్త కూలి పని చేస్తాడు. నాకు ఇద్దరు అమ్మాయిలున్నారు. పిల్లల్ని చదవిండడం, ఇంటి అద్దెలు వీటన్నింటికీ మాకు వచ్చే వేతనం సరిపోదు. వేతనాలు పెంచమంటే పెంచరు. అలాంటప్పుడు ధర్నాలు చేయకుండా ఎలా ఉంటాము. పైగా మా పని వదిలేసి మేమేమీ ఉద్యమాలు చేయడం లేదు. సెంటర్ నడుపుతూనే మా సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలని ధర్నాలు చేస్తున్నాము. కానీ ప్రభుత్వం మా గోడు పట్టించుకోకపోగా వేతనాలు కత్తిరిస్తామనటం అన్యాయం.
- అఫ్సర్బేగం
Authorization