- ఇరవై ఏళ్లపాటు బోస్ కుటుంబీకులపై నిఘా
- దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన విప్లవ సేనానికి అవమానం
- అధికారిక పత్రాల విడుదలతో వెల్లడైన చేదు నిజం
న్యూఢిల్లీ: దేశం కోసం పోరాడిన ఎందరో విప్లవ వీరులకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా తగిన గౌరవం లభించలేదు. మన ప్రభుత్వాలు కూడా స్వతంత్ర యోధుల పట్ల సముచితంగా ప్రవర్తించలేదు. బ్రిటిస్ పాలకుల వలె అడుగడుగునా వారిని అవమానిస్తూనే వచ్చాయి. సాయుధ పోరాటంతో తప్ప స్వాతంత్య్రం లభించదంటూ, ప్రయివేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి పోరాడి విప్లవ సేనాని సుభాష్ చంద్రబోస్ విషయంలో కూడా ఇదే జరిగింది. స్వాతంత్య్రం రాకపూర్వకమే ఆయన అంతర్థానమయ్యారు. విమాన ప్రమాదంలో నేతాజీ అశువులు బాశారనీ.. కాదు, ఆయన జీవించే ఉన్నారని, ఎక్కడో రహస్య జీవితం గడుపుతున్నారని భిన్నమైన ధృవపడని వార్తలు వచ్చాయి. నేతాజీ మాత్రం 1945 తరువాత ఎవరికీ కనిపించలేదు. జీవించి ఉన్నపుడు ఆంగ్లపాలకులు ఆయనపై నిఘా పెట్టని క్షణం లేదు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు కానీ, దేశ స్వాతంత్య్రం తరువాత మన భారతీయ పాలకులే ఆయనపై రహస్య నిఘా పెట్టారన్న విషయం వింటే దిగ్భ్రాంతి కలుగకమానదు. అవును ఇది నిజం.. అది కూడా దేశ ప్రథమ ప్రధాని నెహ్రూ హయాంలో జరిగింది. బోస్ అదృశ్యమయ్యారా.. ఎక్కడైనా బతికే ఉన్నారా. ఏమో.. ఎందుకైనా సరే ఆయన జాడ కనుక్కోవాలి అనుకున్న భారత సర్కారు 1948 నుంచి దాదాపు 20 ఏళ్లపాటు బోస్ కుటుంబీకులు, సమీప బంధువులపై ఓ కన్నేసి ఉంచింది. వారి ఇళ్లపై నిఘా పెట్టింది. వారు ఎప్పుడు ఎక్కడికి వెళతున్నారు. ఏం చేస్తున్నారు. బోస్ను కలుసుకోవడానికి ఏమైనా వెళుతున్నారా చూడండి అంటూ గూఢచారి వర్గాలను పురమాయించింది. ఒక అకళంక దేశభక్తుని, దేశం కోసం సర్వస్వం త్యాగం చేసి పోరాడిన వీరయోధుని ఈ విధంగా అవమానించింది. బోస్ కుటుంబీకులపై రెండు దశాబ్దాల పాటు నిఘా పెట్టినట్లు తెలిపే కీలక పత్రాలు ఇటీవలే ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబి)నుంచి విడుదలయ్యాయి. అవి ఇప్పుడు నేషనల్ ఆర్కియాలజీ విభాగంలో ఉన్నాయి. ఈ విషయం తెలిసి దేశ భక్తులు బాధపడవలసి వస్తోంది. ఆ 20 ఏళ్లలో 16 ఏళ్లపాటు నెహ్రూయే ప్రధానిగా ఉన్నారు. నేతాజీ సోదరుడు శరత్ చంద్రబోస్ కుమారులు శిశిర్ బోస్, అమియనాథ్ బోస్తోపాటు దగ్గరి బంధువుల రాకపోకలపె ఆ కాలంలో గట్టి నిఘా పెట్టారట. నేతాజీ కుటుంబీకులు ఉండే 1, వుడ్బర్న్ పార్క్, 38/2 ఎల్జిన్ రోడ్లోని నివాసాలపై కన్నేసి ఉంచారట. నిఘా కాలంలో ఐబి అధికారులు బోస్ కుటుంబీకులు ఎవరికైనా ఉత్తరాలు రాస్తే వాటిని వారికి తెలియకుండా ఆపి చదివేవారట. కాపీలు తీసుకుని దాచేవారట. వారు విదేశాలకు వెళ్లినపుడు చాటుగా వెంబడించేవారట కూడా. ఈ విషయం తెలియండంతో నేతాజీ కుటుంబీకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధపడ్డారు. ఆ కాలంలో కూడా మన దేశంలో ప్రజాస్వామ్యం ఎలా ఉందన్నదానికి ఈ ఉదంతం నిదర్శనమని వారన్నారు. ఇది కేవలం తమ కుటుంబానికి సంబంధించిన విషయం కాదనీ, స్వాతంత్య్ర సమర యోధుల వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి అని వారు వ్యాఖ్యానించారు. నేతాజీ సతీమణి, మా తండ్రి రాసుకున్న ఉత్తరాలను కూడా వారు అడ్డగించి చదివారంటే అది ఎంతో అవమానకరమైన విషయమన్నారు. స్వాతంత్య్ర పోరాటాన్ని, యోధులను ఈ విధంగా వారు చాలా అగౌరవపరిచారని నేతాజీ మనవడు, తృణమూల్ కాంగ్రెస్ నేత సుగతా బోస్ విమర్శించారు. నాటి ప్రధాని నెహ్రూ ఆదేశాలతోనే ఇదంతా జరిగిందన్నది తమకు విస్మయం కలిగిస్తున్నదని నేతాజీ మరో మనవడు చంద్రకుమార్ బోస్ అన్నారు. ఈ సంగతి తె లియగానే నేతాజీపై పరిశోదన చేస్తున్న అనుజ్ ధర్ ఆ పత్రాలను చూడడానికి ఆర్కియాలజీ విభాగానికి పరుగుపరుగున వెళ్లారు. నెహ్రూ వలె నేతాజీ కూడా లోగడ కాంగ్రెస్లో చాలా ఏళ్లపాటు పని చేశారు. ఆ పార్టీకి అధ్యక్షుడుగా కూడా వ్యవహరించారు. అయితే శాంతియుత పోరాటంతో స్వాతంత్య్రం వచ్చేట్లు లేదని భావించిన ఆయన గాంధీ, నెహ్రూలతో విభేదించికాంగ్రెస్ పార్టీ వీడారు. ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేసి దేశ స్వేచ్ఛ కోసం బ్రిటిష్ పాలకులపై పోరాడారు. అటువంటి ఆప్త మిత్రునిపై, ముఖ్య సహ చరనేతపై, దేశ భక్తునిపై అనంతర కాలంలో నెహ్రూ చాలా ఏళ్లపాటు నిఘా పెట్టించడం శోచనీయం.
Authorization