- మద్యం మత్తులో భర్తే కడతేర్చాడు : బంధువుల ఆరోపణ
నవతెలంగాణ-ధర్పల్లి
కలకాలం కలిసుంటానని మూడుముళ్లు వేసి ఏడడుగులతో ప్రారంభించిన జీవితాన్ని కట్టుకున్న భర్త భార్యను కడతేర్చిన ఘటన మండలంలోని దుబ్బాక గ్రామంలో చోటుచేసుకుంది. దుబ్బాక గ్రామానికి చెందిన ప్రవీణ్ మోర్తాడ్ మండలం రామన్నపేట్కు చెందిన సింధూజ(32)ను మూడేండ్లక్రితం వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా వీరి దాంపత్య జీవితం సాఫీగా కొనసాగింది. ఇదేసమయంలో ప్రవీణ్ విదేశాలకు వెళ్లాడు. అక్కడ రెండేండ్లు ఉండి తిరిగి వచ్చాడు. అప్పటినుంచి మద్యంతాగివస్తూ ఇంట్లో గొడవలు పడేవాడని, గ్రామంలోని మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలియడంతో మృతురాలు భర్తను అనేకసార్లు మందలించింది. ఈవిషయంలోనూ ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని తెలిసింది. ఆదివారంరాత్రి భోజనం అనంతరం నిద్రపోయారు. ఉదయంచూసే సరికి స్లాబ్కు ఉన్న ఊచకు సింధూజ ఉరేసుకుని మృతిచెందింది. మృతురాలి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిచ్పల్లి సీఐ తిరుపతి, ఎస్ఐ సురేష్ సంఘటన స్థలాన్ని చేరుకుని విచారణ చేపట్టారు. భర్త పరారీలో ఉన్నాడు. కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.
వివాహేతర సంబంధం వల్లే చంపేశాడు..
వివాహేతర సంబంధంవల్లే సింధూజాను భర్తే ఉరేసి చంపేసి ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరిస్తున్నాడని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అడిగినంత కట్నం ఇచ్చి పెళ్లి చేశామని, అయినా అదనపు కట్నం తేవాలని అత్త, మామ, భర్త వేధించారని తెలిపారు. భర్తను తమకు అప్పగించే వరకూ మృతదేహాన్ని కదలనిచ్చేది లేదని పట్టుబట్టారు. పోలీసులతో మృతురాలి బంధువులు వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామంలో అలజడి వాతావరణం నెలకొంది.
Authorization