నవతెలంగాణ-మెండోరా శ్రీరాంసాగర్ జలశయానికి వరద ఉధృతి కొనసాగుతుందని ప్రాజెక్టు అధికారులు సోమవారం తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కూరుస్తున్న వర్షాలతో సోమవారం 17,642 క్యూసెక్కులకుపైగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఇన్ఫ్లో ఉదయం కాస్తా తగ్గుముఖం పట్టినప్పటికీ మధ్యాహ్నం మళ్లీ ఎక్కువగా వరద వచ్చి చేరిందని అన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, (90.31టీఎంసీలు). ప్రస్తుత నీటిమట్టం 1069 అడుగులు ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గతేడాది ఇదే రోజు ప్రాజెక్టులో 1073.70 అడుగులు కాగా (36.741 టీఎంసీలు) నీరు ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు 50 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. జూన్ నెల నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి వచ్చి చేరిన నీరు (20,401 టీఎంసీలు) అని ప్రాజెక్టు ఏఈఈ మహేందర్ తెలిపారు. లక్ష్మి కాలువ ద్వారా రెండు మూడు రోజుల్లో నీటిని విడుదల చేసే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు వివరించారు.