- టీడీపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సుభాష్రెడ్డి
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
- బోధన్-హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో
నవతెలంగాణ-నాగిరెడ్డిపేట్
మండలంలో ముంపునకు గురై నష్టపోయిన పంటలకు పరిహారం, ఫసల్బీమా ఇన్సూరెన్స్ డబ్బులను చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కామారెడ్డి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒడ్దెపల్లి సుభాష్రెడ్డి విమర్శించారు. సోమవారం మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం రైతులతో తహసీల్దార్ కార్యాలయంఎదుట సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో భారీ వర్షాలు కురియడంతో మంజీర నది పరివాహకప్రాంత గ్రామాల్లో 2,500 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. దీనికి కోటీ 19 లక్షల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ రావాల్సి ఉందన్నారు. మూడు సంవత్సరాలుగా రైతులు కరువుతో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరం గడుస్తున్నా పంటలకు పరిహారం నయా పెసా చెల్లించకపోవడం దారుణమన్నారు. ఎకరానికి 13500రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫసల్ బీమా పేరుతో బ్యాంకుల్లో రైతుల ఖాతాల నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులను జమ చేసుకున్నా పంటలు నష్టపోయిన తర్వాత ఇన్సూరెన్స్ చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన విమర్శించారు. అనంతరం రైతుల నాయకులు బోల్లు నరసింహారెడ్డి మాట్లాడుతూ పంటలకు నష్టపరిహారం చెల్లించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహార్రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు ధనుంజరు, నాయకులు రవిగౌడ్, క్రిష్ణ, రైతులు పాల్గొన్నారు.
Authorization