- పంచాయతీ ఎన్నికలపై విపక్షాల పోరు
- బీసీలకు 34 శాతం రిజర్వేషన్కు పట్టు
- సమ్మెకు సన్నద్దమవుతన్న కార్మిక రంగం
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రతినిధి
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెల రోజులైనా కాలేదు.. అప్పుడే జిల్లాలో ఆందోళనల పర్వం మొదలైంది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్పై కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు, బీసీ సంఘాల ఉద్యమ బాట పట్టాయి. అందులో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టారు. ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన విపక్షాలకు రిజర్వేషన్ అంశం ఒక ఆయుధంగా మారింది. ఇదే అంశం ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఓ ఉద్యమాన్ని లేవనెత్తేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. పంచాయతీ పోరులోనూ ఇది ఓ ఆయుధంగా మలుచుకోవాలని పార్టీలు భావిస్తున్నాయి. అయితే ఈ రిజర్వేషన్ అంశం కొన్ని దశాబ్దాలుగా పెండింగ్లో ఉంది. అయితే ఈ అంశంపై ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్ ఇతర విపక్షాల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. ఒకరిపైఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అవకాశవాదంగా వ్యవహరిస్తున్నాయి. 50 శాతం రిజర్వేషన్లు దాటొద్దన్న సుప్రీంకోర్టు ఆంక్షల నేపథ్యంలో.. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈ అంశం ఒక రాజకీయ ఆయుధంగానే పని చేస్తోంది తప్ప చిత్తశుద్దిగా సమస్య పరిష్కారానికి రాజకీయ పక్షాలు యోచించడం లేదు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో వందల సంఖ్యలో బీసీలు పంచాయతీలు కోల్పోయారు. ప్రతియేడు పంచాయతీ ఎన్నికల సమయంలో ఎవరోఒకరు కోర్టును ఆశ్రయించడం, ఆ తరువాత సుప్రీంకోర్టుకు వెళ్లడం షరామమూలే అయ్యింది. అయితే గత ఎన్నికల సమయంలో సుప్రీంకోర్టు 'స్టేటస్కో' విధించడంతో అంతకముందు జరిగినట్టుగా 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరిగాయి. కానీ ఈసారి ఊహించని విధంగా కోర్టు 50 శాతానికి పరిమితం చేసింది.
సార్వత్రిక సమ్మెకు సమాయత్తం..
జనవరి 8,9వ తేదీల్లో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెకు జిల్లాలో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రంగాలవారిగా కార్మికులు ఆయా విభాగాల్లోని ఉన్నతాధికారులకు సమ్మె నోటీసు అందజేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఆచరణసాధ్యం కాని హామీలు ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ.. గత నాలుగున్నర సంవత్సరాలుగా చేసింది శూన్యం. విద్వేష రాజకీయాలకు తెరదీస్తూ.. ప్రభుత్వ హామీల నుంచి ప్రజల దృష్టి మరలించారు. ముఖ్యంగా యువతకు ప్రతి యేడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, నల్లధనం వెలికి తీస్తామని ఇచ్చిన హామీలు బుట్టదాఖలయ్యాయి. కార్మిక చట్టాలను సవరిస్తూ.. కార్పొరేట్లకు వంతపాడారు. దీంతో కేంద్ర కార్మిక సంఘాలు ప్రతి యేడాది దేశవ్యాప్తంగా సమ్మెలు చేపట్టాయి. కానీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన కరువైంది. దీంతో మరోసారి జనవరి 8,9వ తేదీల్లో సార్వత్రిక సమ్మెకు కార్మికులు జై కొడుతున్నారు. గత సమ్మె సమయంలోనూ కార్మికుల డిమాండ్లపై చర్చించేందుకు మంత్రుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. సమ్మెను విరమింపచేసేలా చేసిన ప్రయత్నం శూన్యమని చెప్పాలి. దీంతో కార్మికులకు సమ్మె తప్ప మరో దారి దొరకలేదు. గతేడాది జరిగిన సమ్మె నాటి నుంచి కార్మికుల స్థితిగతుల్లో ఎలాంటి మార్పూ జరగలేదు. దీంతో మరోసారి రెండు రోజుల సార్వత్రిక సమ్మెకు కార్మికులు సిద్ధమవుతున్నారు.
విజయవంతంగా బ్యాంకుల సమ్మె..
బ్యాంకుల విలీనం నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగుల సంఘాల పిలుపులో భాగంగా జిల్లాలో చేపట్టిన సమ్మె విజయవంతమైంది. ప్రతి గ్రామానికి బ్యాంకులను విస్తరిస్తామని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. అందుకు విరుద్ధంగా బ్యాంకుల విలీనం పేరిట ఉన్న బ్రాంచీలను మూసేస్తున్నారు. బ్యాంకుల్లో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయకుండా, కార్పొరేటు రుణాల ఎగవేతదారులపై చర్యలు చేపట్టకుండా... ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ రంగ బ్యాంకులను బదనాం చేసే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే ఎస్బీఐ అనుబంధ బ్యాంకులను విలీనం చేసింది. ఆ సమయంలోనే వందలాది మంది ఉద్యోగులకు టోపీ పెట్టింది. ప్రస్తుతం దేనాబ్యాంకు, విజయబ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.
Authorization