ఆమె పుట్టింటిలో అల్లారు ముద్దుగా పెరిగి కోటి ఆశలతో, ఎన్నో కలలతో అత్తవారింట్లో అడుగు పెట్టిన కొన్ని రోజులకే ఆ కలలన్నీ ఆవిరై, ఆశలన్నీ అడుగంటి పోయి, సూటి పోటి మాటలతో, లైంగిక, వరకట్న వేధింపులను భరిస్తూ నాలుగు గోడల మధ్య నలిగిపోతుంది. పెద్దల సాక్షిగా అన్యాయం జరుగుతున్నా బయటకు చెప్పుకోలేక మూగ జీవులుగా మిగిలిపోతున్నారు. దీనికి కారణం శతాబ్దాలుగా స్త్రీలకు 'మీరు పురుషుల బానిసలని' నేర్పారు. పితస్వామ్యానికి వ్యతిరేకంగా పోరడకూడదనీ, తమ మీద వేధింపులు, లైంగికదాడులు చేసేవాళ్ల గురించి నిశబ్దంగా ఉండాలని నేర్పారు. మతం చాటున ఏం చేసినా నడుస్తుంది అన్నట్టు వ్యవహరిస్తున్నారు. పురుషాధిక్యానికి తోడు షరియత్ చట్టంలోని కొన్ని తలాక్ పద్ధతుల ద్వారా ఆమె ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండానే.. క్షణాల్లో వైవాహిక బంధం తెంచుకుంటున్నారు. ఒంటరిగా జీవించలేక, పిల్లలను ఆనాధలు చేసి చావలేక, బాధిత మహిళలు నరకయాతన అనుభవిస్తున్నారు. కానీ ఇప్పుడు అతివల సహనం నశించింది, అతడి అహంకారాన్ని ధిక్కరించి ముమ్మారు తలాక్ ( తలాక్ ఎ బిద్దత్ )ను రద్దు చేయాలని, స్త్రీ, పురుషులు సమానమేనని రాజ్యాంగం సాక్షిగా సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది.
సమానత్వం కోసం జరిగిన పోరాటం
వైవాహిక బంధం అనేది ఇరు పక్షాల సమ్మతంతోనే జరుగుతుంది, కానీ విడాకులు (తలాక్ ఎ బిద్దత్ ) ద్వారా ఏకపక్షంగా జరగడం మహిళలపై పురుషాధిక్యతను సూచిస్తోం ది. ఇది సమానత్వపు హక్కుకు విరుద్ధం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ -14 సమాన త్వం గురించి నిర్వచిస్తోంది. అంటే భర్తకు భార్యపై ఎంత హక్కు ఉందో, భార్యకు కూడా అంతే హక్కు ఉంటుంది. ఆర్టికల్ -19 ( భావ ప్రకటన హక్కు) ఆర్టికల్ - 21 ( జీవించే హక్కు, వ్యక్తిగత హక్కు)లకు తలాక్ - ఎ- బిద్దత్ విరుద్ధంగా ఉందని, ఇటీవల సుప్రీంకో ర్టు ఇచ్చిన తీర్పు ముస్లిం మహిళలకు అతడితో ఆమెకు సమాన హక్కును కల్పించింది.
అందరి కోసం.. ఆ కొందరు..
1400 సంవత్సరాల క్రితం ఏ ఉద్దేశంతో షరియత్ చట్టంలో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారో తెలియదు కానీ, దీని వల్ల ఎందరో మహిళల వైవాహిక బంధాలు గాల్లో దీపాలుగా మారాయి. దీంతో పిల్లల జీవితాలు అయోమయంలో పడిపోయాయి. తలాక్ ఏ బిద్దత్ని ఆసరాగా చేసుకొని ఎస్ఎంఎస్, వాట్సాప్, పోస్ట్కార్డు, చరవాణిల ద్వారా వైవాహిక బంధం తెంచుకుంటున్నారు. యూఏఈ, పాక్, ఇరాక్, ఈజిప్ట్ తదితర దేశాలలో ఇప్పటికే ఈపద్ధతిని నిషేధించారు. కానీ మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు అయినా ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల దీన్ని నిషేధించలేదు. ఇప్పటికే ఎందరో మహిళల జీవితాలు నాశనమయ్యాయి. ఇంకా ఎవరి జీవితాలు నాశనం కాకూడదని అబలలకు అండగా షాయరా భానో, అఫ్రీన్ రెహమాన్, గుల్షన్ పర్వీన్, ఇష్రాత్ జహన్, అతియా సబ్రి అనే ఐదుగురు మహిళలే పురుషాధిక్యాన్ని ప్రశ్నించారు. రాజ్యాంగం సాక్షిగా సుప్రీంకోర్టులో తమ హక్కును పొందారు.
అంతం కాదు..ఆరంభం కావాలి..
ముమ్మారు తలాక్ రద్దుతో బాధిత మహిళల్లో చిరునవ్వులు వికసించాయి. మిగతా మహిళలకు బలాన్ని చేకూర్చింది. అణచివేతకు గురవుతున్న మహిళకు ఈ తీర్పు ఆయు ధం కావాలి. ఈ తీర్పుని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి రంగాల్లో మహిళలు విజేతగా నిలవాలి. అంతే కాకుండా ముమ్మారు తలాక్ని క్షేత్రస్థాయిలో అమలు పరచడానికి ప్రాంతాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. స్త్రీలూ, పురుషులన్న తేడా లేకుండా ముస్లిం సమాజంలో యువత కదలాలి. ఆధునిక ఆలోచనా, అభ్యుదయ భావాలూ ప్రదర్శించాలి. ముస్లిం సమాజంలో అంతర్గతంగా మంచి సంస్కరణలకు ఇది దారి తీయాలి.
- యం.డి.ఫరీద్
సెల్ : 9010408286
Authorization