- పొడ్సి సంపుతం బిడ్డా...!
ఊరి మధ్యలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు దళితులు స్థలాన్ని చూశారు. విగ్రహం పెట్టకుండా అడ్డుకునేందుకు పెత్తందారులు శతవిధాలా ప్రయత్నించారు. దళితులు ఐక్యంగా ఉండి అక్కడే పెట్టించారు. దీనిని పెత్తందార్లు జీర్ణించుకోలేకపోయారు. దళితులపై కక్షగట్టారు. ఊర్లో ఉన్న వెయ్యి బర్ల జంగిడిని విభజించారు. అణగారిన, మాదిగ, మాల కులాలోళ్ల బర్ల జంగిడి వేరు, ఆధిపత్య కులాల జంగిడి వేరు చేశారు. రెండు జంగిడిలకు వేర్వేరు పెండ పెద్దమనుషులను ఏర్పాటు చేయించారు. ఊర్లో ఓ పురాతన దేవాలయ కమిటీలోనూ దళితులకు చోటు కల్పించలేదు. వరుస ఘటనలతో కొంతకాలంగా దళితులు, పెత్తందార్ల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమన్న చందంగా పరిస్థితి నెలకొంది.
'మా ఎన్కపొంట ఎమ్మెల్యే ఉన్నడు బిడ్డా. ఎక్వజేస్తే కత్తులతో పొడ్సి సం పుతం మాదిగ ల.. కొడుకుల్లారా. మీ మాదిగ, మాలోల్లతో ఏమైతది రా' అం టూ ఇస్సాపల్లిలో పెత్తందార్లు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ అండ ఉందని నోటికొచ్చినట్టు దూషిస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. కేసులెందుకు పెట్టారంటూ ఫోన్లో దళితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఇస్సాపల్లిలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం గ్రామ జనాభా 2,873. వీరిలో 120 మాల, 60 మాదిగ కుటుంబాలున్నాయి. వీరి జనాభా దాదాపు 599 మంది. వీరంతా నిరుపేదలే. కొందరు వ్యవసాయం చేసుకుంటుండగా, చాలావరకు కూలీ పనులు చేసుకుంటూ, డప్పు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఐదేండ్ల కింద ఊర్లో అంబ్కేదర్ విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించారు. ఊరి మధ్యలో (ఆధిపత్య కులాల ఇండ్ల పక్కన) అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు దళితులు స్థలాన్ని చూశారు. విగ్రహం పెట్టకుండా అడ్డుకునేందుకు పెత్తందారులు శతవిధాలా ప్రయత్నించారు. దళితులు ఐక్యంగా ఉండి అక్కడే పెట్టించారు. దీనిని పెత్తందార్లు జీర్ణించుకో లేకపోయారు. దళితులపై కక్షగట్టారు. ఊర్లో ఉన్న వెయ్యి బర్ల జంగడిని విభ జించారు. అణగారిన, మాదిగ, మాల కులాలోళ్ల బర్ల జంగిడి వేరు, ఆధిపత్య కులాల జంగిడి వేరు చేశారు. రెండు జంగిడిలకు వేర్వేరు పెండ పెద్దమను షులను ఏర్పాటు చేయించారు. ఊర్లో ఓ పురాతన దేవాలయ కమిటీలోనూ దళితులకు చోటు కల్పించలేదు. వరుస ఘటనలతో కొంతకాలంగా దళితులు, పెత్తందార్ల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమన్న చందంగా పరిస్థితి నెలకొంది. ఈనేపథ్యంలో గతేడాది సీపీఐ(ఎం) మహాజన పాదయాత్ర సందర్భంగా ఇస్సాపల్లి పరిస్థితిని అధ్యయనం చేసిన 'నవతెలంగాణ' ప్రభుత్వం దృష్టికి అనేక విషయాలు తీసుకెళ్లింది.
నిమజ్జనం రోజు ఏం జరిగిందంటే...
వినాయక చవితి సందర్భంగా దళితులు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నిమజ్జనం సందర్భంగా శోభాయాత్రలో కోలాటం ఆడుతూ...డప్పు నృత్యాలను ప్రదర్శిస్తుండగా... ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద వెనుకనే వచ్చిన పెత్తందార్లు దారి ఇవ్వాలనే సాకుతో గొడవకు యత్నించారు. కోలాటమాడుతున్న మహిళలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. అలా చేయొద్దని దళిత యువకుడు నిఖిల్ వారించాడు. ఇది తట్టుకోలేని పెత్తందారులు నోటికొచ్చినట్టు మాట్లాడారు. బూతులు తిట్టారు. అడ్డొచ్చిన ఆడవాళ్ల చీర కొంగులు లాగారు. నిమజ్జనం తర్వాత కూడా వారి మూడు డీజే వాహనాలను తీసుకొచ్చి దళితులకు అడ్డంగా నిలిపారు. నిఖిల్ను కొట్టేందుకు సుమారు 30 బైకులపై 50 మందికిపైగా అతని ఇంటికెళ్లారు. నిఖిల్ లేకపోవడంతో తల్లి లక్ష్మిని, తండ్రి ఎర్రన్న, నానమ్మ సాయమ్మపై దాడికి దిగారు. దీంతో దళితులు మంగళవారం ఉదయమే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిందితులు మూడ్రోజులు పరారీలో ఉన్నారు. దీనిపై కక్షపెంచుకున్న గ్రామ పెత్తందార్లు అధికార పార్టీ పేరు చెబుతూ ఫోన్లలో బెదిరింపులకు దిగారు. దీంతో గురువారం ఆ గ్రామాన్ని సందర్శించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
న్యాయం చేయండి : కట్కూరి ఎర్రన్న. బాధితుడు
నా కొడుకును కొట్టడానికి 50మంది వచ్చారు. మా వాడు ఇంట్లో లేడన్నా వినకుండా నన్ను, నా భార్యను, మా అమ్మను బయటకు లాక్కొచ్చి కొట్టారు. మాపై దాడి చేసిన కాపు కులస్తులను శిక్షించి మాకు న్యాయం చేయాలి. ఇకపై దాడులు జరగకుండా భద్రత కల్పించాలి.
కావాలనే గొడవ పెట్టుకున్నారు : నిఖిల్
కోలాటం ఆడుతున్న మాతో కావాలనే గొడవకు దిగారు. మా వాహనాన్ని పక్కకు తీశాం. అయినా ఇష్టమొచ్చినట్టు బూతులు తిట్టారు. ప్రశాంతంగా పండుగ నిర్వహించుకుందా మన్నందుకు దాడి చేయడానికి ప్రయత్నించారు. నేను లేకపోయే సరికి మా తల్లిదండ్రులను కొట్టారు.
ఇరువర్గాలను శాంతింపజేశాం : మిట్టు నరేష్, సర్పంచ్
నిమజ్జనం సందర్భంగా చిన్నపాటి తోపులాట జరిగింది. గ్రామస్తులను కలిసి శాంతింపజేశాం. తర్వాత ఇంటికెళ్లిన. దాడి చేసిన విషయం నాకు ఆ రోజు తెల్వదు. ఇంత జరిగినా గ్రామస్తులు సమాచారం ఇవ్వలే. నేను ఉప సర్పంచ్ ముత్యంరెడ్డి, ఎంపీటీసీ జీవన్ కలిసి పోలీస్స్టేషన్కు వెళ్లి వివరాలు తెలుసుకున్నాం.
దళితులకు న్యాయం చేయాలి
సాయిలు, దళితుడు, ఇస్సాపల్లి
ఇస్సాపల్లి ఘటనలో దళితులపై దాడి చేసిన నిందితులపై చర్యలు చేపట్టాలి. అకారణంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసం. డివిజన్లో జరుగుతున్న దాడులను అరికట్టాలి. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
దళితులపై దాడులను అరికట్టాలి
ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రవికిరణ్
జిల్లాలో దళితులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలి. దళితులపై దాడి చేసిన అగ్రవర్ణాలపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అట్రాసిటీ కేసు నమోదు చేసిన నిందితులను అరెస్టు చేయాలి. ఇస్సాపల్లి ఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలి.
- సొక్కల తిరుపతి
సెల్ : 9032390776
Authorization