ఆయనో దళిత ఉపాధ్యాయుడు. విద్యార్థుల్లో మానసికోల్లాసం నింపేందుకు పీడీగా ఉద్యోగోన్నతి పొంది పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం పాటుపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే వాలీబాల్, అథ్లెటిక్స్లో 40 మంది రాష్ట్రస్థాయి, ఒకరు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అభివృద్ధి దిశగా వెళ్తున్న క్రమంలో 'పెద్దలు' జోక్యం చేసుకుని ఏడాదికాలంగా పీడీని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఏకంగా ఇంక్రిమెంట్లు నిలిపి, డిప్యూటేషన్పై పంపించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ ఎమ్మెల్యే.. అదీ ప్రభుత్వ చీఫ్విప్ ఇలాకాలో న్యాయం కోసం ఆ ఉపాధ్యాయుడు నేటికీ పోరాటం కొనసాగిస్తున్నాడు.
కరీంనగర్ జిల్లాకు చెందిన కనుకుంట్ల లక్ష్మణ్ 2001 డీఎస్సీ రాసి, 2002లో చందుర్తి మండలం (ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా) రుద్రంగిలో పీఈటీగా విధుల్లో చేరారు. ఏడున్నరేండ్లు పనిచేసి బదిలీలో భాగంగా 2009 ఎలిగేడు మండలం (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా) సుల్తాన్పూర్కు వచ్చారు. అనంతరం 2015 జూలైలో ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీడీ)గా ఉద్యోగోన్నతిపై వెల్గటూర్ మండలం ఎండపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వచ్చారు. అప్పటికే వాలీబాల్కు ఆ ఊర్లో ఎనలేని ఆదరణ ఉన్నది. కొందరు 'పెద్దలు' టోర్నమెంట్లకు ఆహ్వానిస్తూ క్రీడల పేరుతో పలువురు డోనార్ల నుండి వసూళ్లకు పాల్పడేవారు. ఇలా క్రీడల్లో వారి ఆధిపత్యం కొనసాగేది. లక్ష్మణ్ పీడీగా రావడంతో అలాంటి వాటికి ఫుల్స్టాప్ పడుతున్నదని భావించిన అధికార పార్టీకి చెందిన నాయకులు అతనిపై కక్షగట్టారు. ఏదో ఒక రూపంలో నిరంతరం వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే గతేడాది గంగాధరలో జరిగిన పోటీలకు వచ్చిన లక్ష్మణ్ను 'గ్రామ పెద్దాయన అక్కడికి వస్తే నీవు కనీసం నమస్తే పెట్టలేదంట' అని మరుసటి రోజు గ్రామ సర్పంచ్ గంగాధర్ పీడీ లక్ష్మణ్ను నిలదీశాడు. పెద్దలు చెప్పినట్టే స్కూల్లో నడుచుకోవాలని హెచ్చరించాడు. గత నవంబర్లోనూ వాలీబాల్ అసోసియేషన్ గేమ్స్ కరీంనగర్లో జరుగుతుండగా.. విద్యార్థులను తీసుకెళ్లేందుకు పీడీ సిద్ధమయ్యారు. ఒకరోజు ముందు రాత్రి సమయంలో ఫోన్ చేసిన సర్పంచ్.. 'విద్యార్థులను తీసుకెళ్తున్నావంట. ఊర్లో గందరగోళం అవుతోంది. మమ్మల్ని కాదని నువ్వొకడివి ఎలా తీసుకెళ్తావ్' అంటూ ప్రశ్నించాడు. అంతటితో ఆగకుండా మరికొందరితో ఫోన్ చేయించి బెదిరించేందుకు పూనుకున్నారు. ఈ విషయాన్ని తన పైఅధికారులకు చెప్పుకున్నా లక్ష్మణ్కు న్యాయం జరగలేదు.
పీడీని అవమానిస్తూ మరొకరికి స్కూల్లో సన్మానం..
క్రీడల్లో విద్యార్థులకు పూర్తిస్థాయి తర్ఫీదునిస్తూ తీర్చిదిద్దుతున్న ప్రభుత్వ పీడీ లక్ష్మణ్ను కాదని గ్రామంలోని మరో ప్రయివేటు వ్యక్తికి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. అథ్లెటిక్స్ పోటీలకు అదే వ్యక్తిని పంపించేవారు. క్రీడాకారులు విజయంతో వస్తే పత్రికల్లో పీడీ పేరు లేకుండా రాయించుకునేవారు. అంతేగాక 2016లో డిజిటల్ తరగతుల ప్రారంభం సందర్భంగా లక్ష్మణ్కు ఊహించని మరో అవమానం ఎదురైంది. పాఠశాలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఎంపీపీ ద్వారా ప్రయివేటు పీఈటీకి సన్మానం చేశారు. గతంలో పనిచేసిన ప్రభుత్వ పీఈటీలను సైతం చిన్నచూపు చూసేవారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పాఠశాల విధుల్లో గ్రామపెద్దల జోక్యం
ఈ ఏడాది మార్చి 23న నూతన విద్యా సంవత్సరం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యాయులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇంగ్లీష్ టీచర్ గణేష్, పీడీ లక్ష్మణ్ పాఠశాల అభివృద్ధికి, ఉపాధ్యాయుల సమన్వయానికి సంబంధించి పలు సూచనలు చేశారు. రెండ్రోజుల తర్వాత సర్పంచ్ గంగాధర్, ఎస్ఎంసీ చైర్మన్ నాగరాజు ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకొని లక్ష్మణ్ను నిలదీశారు. పనితీరు బాగోలేదని, తాము చెప్పినట్టు వినకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారు. 'సీసీ కెమెరాలతో మీ పనిని పరిశీలిస్తున్నాం జాగ్రత్త' అంటూ హెచ్చరించారు. ఈనేపథ్యంలోనే డీఈవోకు ఫిర్యాదుచేయడంతో లక్ష్మణ్కు మెమోలు జారీచేశారు. ఈ పరిణామాలన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే ఏప్రిల్లో గణేష్ ఇంక్రిమెంట్ నిలిపేశారు. డీఈవో ఆదేశాల మేరకు జూన్లో పునరుద్ధరించారు. కానీ లక్ష్మణ్కు జూలైలో రావాల్సిన ఇంక్రిమెంట్ ఇప్పటివరకు అందలేదు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిలిపివేయడం గమనార్హం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి లేఖలు ఇవ్వకున్నా ఇంక్రిమెంట్లు అందజేయాల్సి ఉంటుంది. హెడ్మాస్టర్, గ్రామపెద్దలు మాత్రం లక్ష్మణ్పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.
పీడీపై దాడికి యత్నం
పాఠశాలలోనే పలు కాంట్రాక్టు పనులు చేస్తున్న సర్పంచ్ ఓ కుంటిసాకుతో పీడీ లక్ష్మణ్పై దాడికి యత్నించాడు. జూలై 20న ఫోన్లో 'గడ్డపారను స్టోర్ రూంలో దాచుకుని వెళ్తావా' అంటూ మాట్లాడుతూనే నేరుగా పాఠశాలకు వచ్చి అందరి ముందే దుర్భాషలాడాడు. ఒకానొక సందర్భంలో తీవ్ర ఆగ్రహానికి లోనై లక్ష్మణ్పైకి చేయిలేపి భౌతికదాడికి ప్రయత్నించాడు. సహ ఉపాధ్యాయులు, అటెండర్ అడ్డుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం పోలీస్స్టేషన్లో సర్పంచ్పై ఫిర్యాదు చేయగా.. మరుసటిరోజే 50 మంది అనుచరులతో వచ్చిన సర్పంచ్ పాఠశాల తరగతులను బహిష్కరించారు.
లోకాయుక్తలో ఫిర్యాదు.. డిప్యుటేషన్పై బదిలీ
తరచూ వేధిస్తుండటంతో సహనం కోల్పోయిన బాధితుడు.. ఇంక్రిమెంట్ విషయంలో ఆర్జేడీకి, స్కూల్లో అంశాలపై డీఈవోకు గతంలో ఫిర్యాదు చేశారు. అనంతరం న్యాయం కోసం లోకాయుక్తను కూడా ఆశ్రయించాడు. పదిరోజుల క్రితమే లోకాయుక్త నుండి హెడ్మాస్టర్కు నోటీసులు కూడా అందాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే ఆగస్టు 2న డిప్యుటేషన్పై వెళ్లాలంటూ లక్ష్మణ్కు ఆదేశాలు వచ్చాయి. స్కూల్తో సంబంధం లేకుండా ప్రస్తుతం జగిత్యాల జిల్లా ఎస్జీఎఫ్ సెక్రెటరీ అటాచ్ అసిస్టెంట్గా లక్ష్మణ్ విధులు నిర్వర్తిస్తున్నాడు.
గ్రామపెద్దల జోక్యాన్ని నియంత్రించాలి
పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య చిచ్చు రగిలిస్తూ గ్రామ పెద్దలు సమన్వయాన్ని దెబ్బతీస్తున్నారు. స్కూల్లో, ప్రధానంగా ఆటల్లో గ్రామపెద్దల జోక్యాన్ని నియంత్రించాలి. కేవలం అభివృద్ధికి మాత్రమే వారి సూచనలు, సలహాలివ్వాలి. గతంలో పనిచేసిన పీఈటీ, పీడీలను కూడా అవమానాలకు గురిచేశారు. డీఈవోకు సమాధానం ఇచ్చినప్పటికీ ఇంక్రిమెంట్లు నిలిపివేశారు. నా విధుల్లో ఎలాంటి లోటుపాట్లు లేకున్నప్పటికీ అనేక రకాల వివక్ష, పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన ఏఈ శ్రీకాంత్ (ఎస్సీ) అగ్రకుల ఉన్నతాధికారుల వేధింపుల వల్ల రెండు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అయినప్పటికీ ఈ గ్రామ పెద్దలకు కనువిప్పు కలగకపోవడం బాధాకరం.
కనుకుంట్ల లక్ష్మణ్, పీడీ
- పులి లక్ష్మణ్
సెల్ : 7730900980
Authorization