పల్లెలో వీడీసీల ఆగడాలు పంజా విసురుతున్నాయి. గ్రామాల్లో విషసర్పాల వలే అణగారిన వర్గాలపై విషం చిమ్ముతున్నాయి. పెత్తందార్ల వ్యవస్థ నుంచి విముక్తి పొందిన తెలంగాణలో వీడీసీల రాజ్యం పరిఢవిల్లుతోంది. అభివృద్ధి ముసుగులో భూదందాలు, వేధింపులు, మోసపూరిత నిర్ణయాలు ఏమీ తెలియని పల్లె జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల నిరకుంశ నీడలో పెచ్చుమీరుతున్న ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఈ విష సంస్కృతిలో శ్రామికుల జీవన మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడింది. వారు చెప్పిందే వేదం, చేసిందే పని అనే ధోరణిలో గ్రామాలను పాలిస్తున్నారు. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు పల్లెలో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో వీడీసీ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. ఊరిలో గొర్రెలను మేపాలంటే డబ్బు చెల్పించాలని ఆ గ్రామ యాదవులపై దౌర్జన్యం చెలాయించారు. ధిక్కరించిన వ్యక్తిని ఏకంగా గ్రామ బహిష్కరణ చేశారు. తన ఊరిలో ఎవరూ సహాయ సహకారాలు అందించకూడదని హుకూం జారీ చేశారు. తన కుటుంబ సభ్యులకు కూడా కూలి పని ఇవ్వకూడదని వీడీసీ పెద్దలు ఆదేశాలు జారీ చేశారు.
తిమ్మాపూర్ గ్రామంలో యాదవుల కుటుంబాలు 75 ఉన్నాయి. అందులో ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన గొర్రెలు, అంతకుముందున్న గొర్రెలను మేపుకోవడానికి గ్రామాభివృద్ధి కమిటీ అడ్డుకట్ట వేసింది. గొర్రెలను మేపాలంటే రూ.60వేలు ఇవ్వాలని వీడీసీ సభ్యులు యాదవులకు సూచించారు. దీంతో తాము అంత చెల్లించలేమని గొల్లకుర్మ యాదవులు బదులు సమాధానమిచ్చారు. మాట దిక్కరించినందుకు వీడీసీ సభ్యులు కక్షపూరితంగా రూ.లక్ష చెల్లించాలని మరోసారి హుకూం జారీ చేశారు. అదే గ్రామానికి చెందిన ఓ రైతు తోటలో గొర్రెలను మేపితే ఆ గొర్రెల కాపరి బల్కం శ్రీనివాస్ను 20 రోజులపాటు బహిష్కరించారు. 'గ్రామంలో ఎవరూ శ్రీనివాస్తో మాట్లాడవద్దు, హోటల్లో చారు ఇవ్వవద్దు, దుకాణంలో వస్తువులు అమ్మవ్వద్దు. తన తల్లికి కూడా కూలిపని ఇవ్వొద్దని' వీడీసీ పెద్దలు హుకూం జారీ చేసినట్టు బాధితుడు తెలిపాడు.
తహశీల్దార్ చెప్పినా ఆగని అరాచకం
ఈ విషయం ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సుజాతకు తెలుపగా ''మీరు ఇలా చేయడం చట్టపరంగా తప్పు'' అని, వీడీసీ సభ్యులకు నచ్చజెప్పి బహిష్కరణ నుంచి విముక్తి కల్పించింది. అయినా వీడీసీల అరాచకం ఆగలేదు. గ్రామంలో సుమారు 1800 గొర్రెలుండగా ఒక్కొక్క గొర్రెకు రూ.100 చెల్లించి మేపుకోవాలని, లేదంటే మేపవద్దని గ్రామాభివృద్ధి క మిటీ సభ్యులు తెలిపారు. దీంతో తిమ్మాపూర్ గొల్లకుర్మ యాదవులు తీ వ్ర ఆందోళన చెందుతూ అక్టోబర్ 25న ఇబ్రహీంపట్నం మండల కేం ద్రంలోని ఓ సంఘ భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గొ ల్లకుర్మ యాదవుల ఇబ్బందులను, గ్రామంలో జరుగుతున్న అన్యాయాన్ని తెలిపారు.
300 గొర్రెల నిర్బంధం..
గ్రామంలో గొర్రెలను మేపేందుకు రూ.లక్ష కట్టనిదే అనుమతినిచ్చే ప్రసక్తే లేదని ఏకంగా మైకులో చాటింపు వేయిస్తూ గొల్లకుర్మలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బీడు భూముల్లో ఇటీవల గొర్లను మేపుతుండగా వీడీసీ సభ్యులు తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. సుమారు 300 గొర్రెలను బలవంతంగా తీసుకెళ్లి స్థానిక ఓ కల్యాణ మండపంలో నిర్బంధించారు. ఈనేపథ్యంలో గత శనివారం నవతెలంగాణలో ప్రచురించిన కథనంతో స్పందించిన జిల్లా కలెక్టర్ ఆ సమస్యపై ఆరాతీశారు. ఉన్నతాధికారులను గ్రామానికి పంపి గొర్రెలను విడిపించారు. అయితే అభివృద్ధి పేరుతో ఏర్పడిన వీడీసీలు.. శ్రామికులు, అణగారిన వర్గాలపై అజమాయిషీ చేయడమే విధిగా పెట్టుకున్నాయి. 'బంచెన్ కాల్మొక్త' అనే స్థితి నుంచి బల్లెం పట్టుకుని దొరలను గడీల నుంచి పారదోలిన చరిత్ర తెలంగాణ పల్లెలకు ఉన్నది. వీడీసీల నుంచి విముక్తి కోసం మరో ఉద్యమం చేసే చైతన్యం గ్రామాల్లో రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
యాదవులను ఇబ్బంది పెట్టొద్దు
గ్రామాభివృద్ధి కమిటీ ఈ రకంగా గొల్లకుర్మ యాదవులను ఇబ్బంది పెట్టడం సరికాదు. గ్రామాల్లో ఉన్న చుట్టుపక్కల భూముల్లో గొర్రెలను మేపకపోతే ఎక్కడికి వెళ్లి మేపుతారు. గ్రామంలో సామరస్యంగా మాట్లాడకుండా బహిష్కరణకు పాల్పడటం శోచనీయం. తెలంగాణ ప్రభుత్వం బహిష్కరణలు జరుగకుండా చర్యలు తీసుకోవాలి. గ్రామంలో ఆరాచకాలు సృష్టిస్తున్న వీడీసీని రద్దుచేయాలి.
- కట్ట మనోజ్, గొల్లకుర్మ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
వీడీసీల దౌర్జన్యాలు అరికట్టాలి
గొర్రెలను మేపడానికి డబ్బులు అడగడం దారుణం. ప్రభుత్వ భూములు కేటాయించకుండా, మరోవైపు హరితహారం అంటూ ఫారెస్టు అధికారులు ఆంక్షలు విధించడం సరికాదు. గొల్లకుర్మలపై వీడీసీ పెత్తనం చెలాయించడంతో లబ్దిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతంలోనూ పలువురిని బహిష్క రించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీడీసీ దౌర్జన్యాలను అరికట్టాలి. గొల్మకుర్మలకు భూములు కేటాయించి మేతకు ఇబ్బందుల్లేకుండా చూడాలి.
భూతం సారంగపాణి, సీపీఐ(ఎం) జగిత్యాల జిల్లా కార్యదర్శి
20 రోజులు బహిష్కరించారు
ఓ రైతుకు చెందిన భూమిలో గొర్రెలను మేపానని 20 రోజులు తిమ్మాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు నన్ను బహిష్కరించారు. నాతో ఎవరు మాట్లాడవద్దని, హోటల్లో చారు కొనుక్కోవద్దని, మా అమ్మను కూలిపనికి పిలవద్దని బహిష్కరించడంతో నరకయాతన భరించాను. విషయం తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా వీడీసీ సభ్యులతో మాట్లాడి బహిష్కరణ ఎత్తివేయించారు. అయినా ఇప్పటికీ వారి పెత్తనం కొనసాగుతోంది.
- బల్కం శ్రీనివాస్
నేమూరి ఏసురత్నం
సెల్ : 9948163703
Authorization