భారతదేశం ఎన్నెన్నో చారిత్రక ఘట్టాలకు, చారిత్రక పోరాటాలకు నెలవు. నాటి ఆంధ్రప్రదేశ్లో, నేటి తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా అంటేనే ప్రకృతివన రులు, జంతుజాలం, దట్టమైన అరణ్యా లతో మమేకమైన ఆదివాసుల జిల్లాగా పేరొందినది. గోండ్వానా రాజ్యం మొదలుకొని బ్రిటిష్, నైజాం పాలనతో పాటు ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా ఆదివాసులు తమ అస్థిత్వం, స్వయంపాలన కోసం పోరాటమే జీవితంగా మారుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోని ఆదిమ జాతి సంక్షేమం గురించి పరితపించిన రాజకీయ నేతలలో కోట్నాక భీమ్రావు ఆదివాసీలలో తొలితరం నాయకుడు. గిరిజనులలో మొట్టమొదటి ఆదివాసీ మంత్రి. గోండు తెగకు చెందిన భీమ్రావు ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని బంజార గూడెంలో కోట్నాక జంగు మొకాసి, బాదుబాయిలకు రెండవ సంతానంగా జన్మించాడు. తన జీవితాన్ని (1933-2002) బడుగు బలహీన వర్గాలు, పేదల ఉన్నతికి అంకితం చేసిన నిస్వార్థ సేవా పరాయణుడు. భీమ్రావు 1972-76, 1989-93 కాలంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవిలో ఉండగా ఆదివాసుల సర్వతోముఖాభివృద్ధికి అహర్నిషలు కృషి చేసిన ఆదర్శమూర్తి. స్వాతంత్య్రం సిద్ధించిన మలిరోజుల్లో (1948-56) బీఏ, ఎల్ఎల్బీ చదివిన భీమ్రావు గోండు గిరిజనులలో ప్రథమ పట్టభద్రుడు. గోండులలో ఏకైక ఐఏఎస్ దివంగతమడవి తుకారాం కంటే పూర్వమే (1957) గ్రూప్-1 పరీక్షలలో ఉత్తీర్ణుడైన తొలి ఆదివాసీ విద్యావంతుడు ఆయన. ఉద్యోగాన్వేషణను విరమించుకొని ప్రజాసేవ సంకల్పంతో తన జీవిత గమ్యాన్ని రాజకీయ దిశగా మార్చుకొని నిస్వార్థ రాజకీయ నేతగా ఖ్యాతినర్జించాడు. 1952లో మొదటి సారిగా ఆదివాసీ తెగల నుండి పాడేరు ఎంపీగా ఎన్నికైన గాంమల్లుదొర పార్లమెంటులో అరంగ్రేటం చేయగా, 1962లో అసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన కో ట్నాక భీమ్రావు రాష్ట్ర శాసనసభలోకి అడుగుపెట్టిన తొలి ఆదివాసీ ఎమ్మెల్యే.
పివి.నర్సింహ్మారావు మంత్రివర్గంలో (1972) గిరిజనులకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఆవిర్భవించింది. భీమ్రావు తొలి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. 1989లో కానాపూర్ ఎమ్మెల్యేగా (రెండోసారి) గెలిచిన తర్వాత మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో, నేదురుమల్లి జనార్దన్రెడ్డి హయాంలో (1990), కోట్ల విజయభాస్కర్రెడ్డి ప్రభుత్వంలో (1992-93) గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పని చేయడం భీమ్రావు ప్రతిభకు, సేవాతత్పరతకు నిదర్శనం. రాష్ట్రంలోని గోండు, కోలాము, కోయ, పరధాను, మన్నేవార్లు, నాయకపోడు మొదలైన గిరిజన తెగలు అభివృద్ధి ఫలాలు అందింపుచ్చుకోవడానికి అవసరమైన కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. 1973-74 మధ్య రాష్ట్రంలో ఆదిమ గిరిజనులు నివసించే 5,948 షెడ్యూల్డ్ ఏజెన్సీ గ్రామాల పరిధిలో తొమ్మిది సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు (ఐటీడీఏ) ఏర్పాటుకు కృషి చేసిన ఐటీడీఏ రూపశిల్పి. ప్రస్తుతం ఐటీడీఏలు ఏటూరు నాగారం (వరంగల్), శ్రీశైలం (కర్నూలు), ఉట్నూరు(ఆదిలాబాద్), పార్వతీపురం (విజయనగరం), రంపచోడవరం (తూర్పూ గోదావరి), సీతంపేట(శ్రీకాకులం,) పాడేరు (విశాఖపట్నం), భద్రాచలం (ఖమ్మం) తదితర తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. గిరిజనులలో అక్షరాస్యతను పెంచి, చైతన్యవంతులను చేసేందుకు 1974-75 మధ్య ఐటీడీఏల ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను, తదుపరి గిరిజన వసతి గృహాలను ప్రారంభించారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా అనేక ఆదిమవాసీ గ్రామాల్లో విద్యుత్, పారిశుధ్యం, వ్యవసాయం, గృహ నిర్మాణాల పట్ల అత్యంత శ్రద్ధకనబరిచారు. భీమ్రావు హయాంలోనే ఆదివాసులు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు. గిరిజనుల్లో జీవన ప్రమాణాలు పెరిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుకాబడినవి.
భీమ్రావు భారీ, బంబార జాగీరు, మొకాసీఖాన్దాని వ్యక్తి ఐనందున గోండ్వానా రాజ్యం నుండి దేశానికి స్వాతంత్య్రానంతరం గోండుల పోరాటాలు, చరిత్రను పరిశోధించిన అధ్యయనశీలి. 1940, సెప్టెంబర్ 1న నిజాం మూకల దాడిలో అమరుడైన ఆదివాసీల ఆశాజ్యోతి కొమురంభీం చరిత్రను తొలుత 'సామాల సదాశివ్' చేత లోకానికి పరిచయం చేసిన ఘనత భీమ్రావుకే దక్కుతుంది. తర్వాత భీం చరిత్రను అల్లం రాజయ్య, సాహూ, దేశ్పాండే నవలలుగా రచించారు. ఒక మంత్రి హోదాలోనూ గోండు గిరిజనుల పండుగలు, సంస్కృతీ సాంప్రదాయాలను ఆరాధించిన భీమ్రావు ఆదివాసుల ఆత్మబంధువు.
మారుతున్న సమాజంలో వచ్చే నూతన మార్పులను, కుటుంబ తగాదాలను స్వయంగా పరిష్కరించుకునేందుకు హైమండార్ప్- ఎలిజబెత్ల ఆధ్వర్యంలో 'గోండ్వానా, రారు సెంటర్, రాజ్గోండ్ సేవా సమితి, అవ్వల్ కమిటీలను ఏర్పాటు చేశారు. నిజాం పాలనలో ''హీస్ ఎక్సలెన్సీ ఆఫ్ హైనెస్'' అనే (నిజాం-7) సర్కారు ఏర్పాటు చేసిన 'ఖదీ ఆభ్యాం' శాఖ అనేది సోషల్ సర్వీస్, సోషల్ వెల్ఫేర్గా ఉండేది. దీని నుండి ప్రత్యేకంగా ట్రైబల్ వెల్ఫేర్ (గిరిజన సంక్షేమ శాఖ)గా అవతరించింది. ఆదివాసీల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన భీమ్రావు 2002 ఆగస్టు 29న కన్నుమూశారు. ఆదిలాబాద్ జిల్లాలో సిడాం అర్జు, కోవలక్ష్మిల (ప్రస్తుత ఆసీఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ) ఆధ్వర్యంలోని ''భీమ్రావు స్మారక సంక్షేమ సంఘం'' భీమ్రావు స్ఫూర్తితో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఐటీడీఏల రూపకల్పనకు భీమ్రావు చేసిన కృషి అనన్యమైనది. కాబట్టి భీమ్రావు విగ్రహాలను అన్ని ఐటీడీఏ ప్రాంగణాలలో నిర్మించి ఐటీడీఏ స్థాపకోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తే సబబుగా ఉంటుంది.
గుమ్మడి లక్ష్మీనారాయణ
సెల్ : 9951430476