''మీరు కులం తక్కువోళ్లు, ఇక్కడి మంచి నీళ్లు ముట్టుకోవద్దు. కనీసం మా ఆఫీస్ గదిలోకి కూడా రావద్దు'' అని వేధించారు. బండ బూతులతో హేలనగా మాట్లాడారు. ''మేము ఉచ్చ పోస్తే, మీరు తక్కువ కులపోళ్లు కాబట్టి ఆ బాత్రూమ్లో మీరే నీళ్లు పోయాలి'' అంటూ నీచమైన పనులన్నీ చేయించుకున్నారు. చివరికి తక్కువ కులం వారు ఎంత వేధించినా సర్దుకుపోతున్నారని, ఉద్యోగం విడిచి పారిపోవడం లేదని మరింత కక్ష గట్టారు. అనేక రకాలుగా హింసించి, వేధింపులకు గురి చేసి, నీచమైన పనులన్నీ చేయించుకొని చివరికి మీరు ఎవరో మాకు తెలియదన్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలన్నారు. నిర్దాక్షిణ్యంగా వారిని 12ఏండ్లుగా చేస్తున్న ఉద్యోగం లోనుండే తొలగించారు. ఈ ఘటన ఎక్కడో కాదు, హైదరాబాద్ నడిబొడ్డున లక్డికపూల్లోని సెంట్రల్ వాటర్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ) ఆఫీసులో చోటు చేసుకుంది.
సెంట్రల్ వాటర్ కార్పొరేషన్ ఆఫీసులో కాంట్రాక్టు పద్ధతిలో గత 12 ఏండ్లుగా హౌస్ కీపింగ్ వర్కర్స్ పని చేస్తున్నారు. జీతమెంత వచ్చినా జాబ్ గ్యారెంటీ అనే ఉద్దేశ్యంతో అణిగిమణిగి ఉంటూ ఇంత కాలం పని చేస్తూ వచ్చారు. కొంతకాలం క్రితం టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ వీరిని తొలగించి కొత్త వారిని నియమించుకునే ఉద్దేశ్యం తో కుట్ర చేయగా కార్మిక జెండా సీఐటీయూను ఆశ్రయించారు. దీంతో ఆ కాంట్రాక్టు వీరికే వచ్చేలా సీఐటీయూ ఆధ్వర్యంలో బిల్డింగ్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ పేరుతో సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు. టెండర్ దక్కించుకున్నారు. కార్మికులే టెండర్ దక్కించుకోవడంతో విధి నిర్వహణ హాయిగా సాగిపోతోంది. ఇంతలో పై అధికారులైన అగ్రకులాల వారికి వీరిపై కన్నుపడింది. వీరంతా దళితులు కావడం తో వారి చైతన్యాన్ని చూసి ఓర్వలేకపోయారు. ఎలాగైనా ఈ పోస్టుల లో నుంచి వీరిని తొలగించి కొత్త వారిని నియమించుకుంటే పోస్టుకు ఇంత అని అమ్ముకోవచ్చని భావించారు. ఆ విధంగా రూ.లక్షలు సంపాదించుకోవచ్చని కుట్ర పన్నారు. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా కులం పేరుతో, అసభ్య పదజాలంతో దూషించడం మొదలు పెట్టా రు. ఆ కార్మికులు అక్కడ 12 ఏండ్ల నుంచి పని చేస్తున్నారు. దీంతో వారిని తొలగించేందుకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అయిన వీరవాణి, గంగాభవాణిలు అనేక రకాలుగా కుల వివక్షకు గురిచేశారు. ముందుగా టెండర్ వారికి రాకుండా చేశారు. ఓ అధికారి నమ్మిన బంటుగా నటిస్తూ టెండర్ వేస్తానని మోసం చేశాడు. దీంతో ఆ టెండర్ చేజారిపోయింది. ఏం జరిగిందని కార్మికులు ప్రశ్నిస్తే మీ టెండర్ లాక్ అయిందని, ఓపెన్ కాలేకపోవడంతో వేరొకరికి టెండర్ వెళ్లిందని చెప్పుకొచ్చారు. టెండర్ పోయినా ఉద్యోగం ఉంది కాదా అని ఆ కార్మికులు సర్దుకుపోయారు. అప్పటికీ వీరి జీతం రూ.12వేలే. కానీ ఉన్నట్టుండి ఒకరోజు ''రేపటి నుంచి మీరు పనిలోకి రానక్కరలేదని, మిమ్మల్ని తొలగించామ''ని తెలిపారు. ఎలా తొలగిస్తారని కార్మికులు ప్రశ్నిస్తే.. ''మీ వల్ల కాంట్రాక్టర్కు గిట్టుబాటు కావడం లేదని, మీ జీతాలు ఎక్కువగా ఉండటంతో తొలగించాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు. అదే క్రమంలో రూ.9వేల జీతంతో కొత్త వారిని వీరి స్థానంలో తీసుకున్నారు.
నిత్యం వేధింపులే...
సెంట్రల్ వాటర్ కార్పొరేషన్ ఆఫీసులో ఉన్నతాధికారులంతా అగ్రకులాలకు చెందినవారు. అయితే వారికి కుల పిచ్చి విప రీతంగా ఉండటం గమనించాల్సిన విషయం. ఆ దళిత కార్మికుల తొలగింపునకు ముందు అనేక రకాలుగా వేధింపులకు గురి చేశారు. కులం పేరుతో ఇష్టమొచ్చినట్టు తిట్టేవారు. ఆ కార్మికుల పని పరిధి దాటి అధికారుల బాత్రూ ములు కూడా కడిగించుకున్నారు. ఇలా అనేక రకాలుగా వేధింపులకు గురి చేయడంతో కార్మికులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నించడాన్ని సహించలేని ఉన్నతాధికారులు ఆ కార్మికులను తొలగించేందుకు నిర్ణయించారు. 2009- 10లో తీసేస్తేనే తొలగించిన ఆ కార్మికులు ఐక్యంగా నిలబడి యూనియన్ ఏర్పాటు చేసుకున్నారు. బిల్డింగ్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ పేరుతో సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు. వారు పని చేస్తున్న కాంట్రాక్టు టెండర్ను కూడా వారే దక్కించుకున్నారు. దీంతో అధికారుల వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. మీరు యూనియన్ను తీసుకురావద్దని పదేపదే వేధించేవారు. తరచూ బూతులతో తిట్టేవారు. వారిని తిట్టాలని జీఎస్ రావు (సబ్ డివిజనల్ ఇంజనీర్)
తోటి సిబ్బంది (ఉద్యోగుల)ని రెచ్చగొట్టేవారు
మధ్యాహ్న భోజనం చేసేందుకు కాంట్రాక్టు కార్మికులకు ఓ గదిని కేటాయించారు. ఎన్నో ఏండ్లుగా అక్కడే భోజనం చేసేవారు. అయితే కార్మికులకు భోజనానికి కూడా గది కావాలా? అంటూ కేటాయించిన గదిని కూడా లాగేసు కున్నారు. దీంతో ఆరుబయటే చెట్ల కింద టిఫిన్ బాక్సులు పెట్టుకునేవారు. భోజనాలు కూడా అక్కడే చేసేవారు. దీంతో కోతులు ఆ భోజనాలు ఎత్తుకెళ్లిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కోతుల వల్ల మధ్యాహ్న భోజనం లేక ఆకలికి మాడుతూ కూడా ఆ కార్మికులు పని చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. అధికారులు కొంతమంది తమ బంధువులు, సన్నిహితులను నియామకం చేసుకున్నారు. వారికి ఇచ్చిన ప్రాధాన్యత ఈ దళిత కార్మికులకు ఇచ్చేవారు కాదు. అక్కడి ఉద్యోగు లకు కులం పిచ్చి బాగా ఉండటంతో తీవ్రమైన వివక్ష కొనసాగు తోంది. ఆఫీసర్స్ బాత్రూమ్కు వెళ్తే కూడా కులం తక్కువ వాళ్లు వెళ్లి నీళ్లు పోయాలని వేధించేవారు. కార్మికులకు ఎంత అత్యవసరమైనా బాత్రూమ్కు వెళ్లనిచ్చేవారు కాదు. తాగే మంచినీళ్లు కూడా ముట్టు కోనివ్వలేదు. ''దళితులు మా నీళ్లు ముట్టుకోవద్దు, మా గదిలోకి రావ ద్దు'' అని ఆంక్షలు విధించేవారు. బాత్రూమ్లకు తాళాలు వేయిం చారు. ఇలా అనేక రకాలుగా వేధింపులకు గురిచేశారు. ఓసారి ఏకం గా ''మీకు ఈ నెల వచ్చిన జీతం తిరిగి ఇచ్చేసే యాలని పట్టుబట్టారు. జీతం ఎక్కువగా వస్తుంది, తగ్గించుకోవాలని ఒత్తిడి తెచ్చారు. కార్మి కులు అందుకు అంగీకరించకపోవడంతో వీరికి ఈ సారి ఎలాగైనా టెండర్ రాకుండా చేయాలని వారి ముందే ముందే ఉన్నతాధికారులు మాట్లాడుకున్నారు. అనుకున్నట్టుగానే టెండర్ రాకుండా చేశారు. ఆ తర్వాత ఒకరోజు మీరు రేపటి నుంచి పనిలోకి రానవసరం లేదన్నా రు. మిమ్మల్ని పనిలో నుంచి తొలగించారని చావు కబురు చల్లగా చె ప్పారు. ప్రస్తుతమున్న కాంట్రాక్టర్కు మీవల్ల బెనిఫిట్ లేదంటూ ఆ ప దిమంది దళిత కార్మికులను తొలగించారు. గత 12 ఏండ్లుగా పని చేస్తున్నాం. చెప్పా పెట్టకుండా ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తే '' అసలు మీరెవరో మకు తెలియదు. రేపటి నుంచి ఆఫీసులోకి రావద్దు'' అంటూ వెళ్లగొట్టారు. గత కొంతకాలంగా ఎన్నో అవమానాలు ఎదు ర్కొని, ఎంతో మానసిక వేధకనకు గురి చేసినా ఉద్యోగం కోసమే ఆ దళిత కార్మికులు భరిస్తూ వచ్చారు. కానీ చివరికి వారిని ఉద్యోగం లో నుంచి కూడా తొలగించడంతో వెంటనే సీఐటీయూ నాయకత్వంలో ఆందోళనకు దిగారు. గత నెల రోజుల నుంచి ఆందోళన చేస్తూనే ఉన్నారు. మరోవైపు తమకు జరిగిన అన్యాయంపై కార్మికశాఖను ఆశ్రయించారు. కుల వివక్షపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ను కలిశారు. అయినా నేటికీ వారి సమస్య పరిష్కారం కాలేదు.
ఆ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు
మమ్మల్ని అనేక రకాలుగా వేధింపులకు గురిచేశారు. తరచూ కులం పేరుతో దూషించారు. నీచమైన పనులన్నీ చేయించారు. మమ్మల్ని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు అనేక రకాలుగా హింసించారు. అయినా రెక్కాడితే డొక్కనిండని మేము భరిస్తూ వచ్చాం. అయినా మాపై పెంచుకున్న కక్షసాధింపు చర్యలు మానుకోలేదు. కాంట్రాక్టు మాకు రాకుండా చేశారు. చివరికి మమ్మల్ని ఉద్యోగాల నుండే తొలగించారు. దీనికంతటికీ అగ్రకుల ఆధిపత్యమే కారణం. ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్థాయి పోస్టులో ఉన్న అధికారులు ఇలాంటి కువ వివక్ష పాటిస్తూ మమ్మల్ని హింసించారు. మమ్మల్ని తొలగించి ఆ ఉద్యోగాలను లక్షల రూపాయలకు అమ్ముకున్నారు.
- శ్యామలీల, బాధితురాలు
ఓగోటి కిరణ్కుమార్
సెల్ : 9666011107
Authorization