కులం కానోడిని ప్రేమించడమే ఆమెకు శాపంగా మారింది. కట్టుకున్నోడితో సంతోషంగా బతుకుదామనుకున్న ఆమె ఆశలు ఆవిరయ్యాయి. పేగుబంధం ముందు కులమే పైచేయి సాధించింది. నవమాసాలు మోసి, 20ఏండ్లు అల్లారు ముద్దుగా పెంచిన కూతుర్ని తల్లిదండ్రులే కాటికి చేర్చారు. ఇంత జరుగుతున్నా గ్రామస్తులు కండ్లు అప్పగించి చూశారే తప్పా కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. గ్రామాల్లో ఇంకా కుల రక్కసి బుసగొడుతోం దనడానికి ఇటీవల మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన పిండి సత్తన్న (యాదవ, గొల్ల)కు కొడుకు మహేష్, కూతరు అనురాధ(22) సంతానం. ఇదే గ్రామానికి చెందిన లక్ష్మణ్(24) (పద్మశాలి), అనురాధలు మూడేండ్లుగా ప్రేమించుకున్నారు. అనురాధ హైదరాబాద్లో బీఈడీ చదువుతుండగా లక్ష్మణ్ అక్కడే బీటెక్ చదువుకునేవాడు. వీళ్లిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. చదవులు పూర్తయ్యాక ఇంట్లో చెప్పి పెండ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. కానీ అప్పటికే వీరు ప్రేమించుకుంటున్న విషయం ఇంట్లో తెలిసింది. కులం కానోడిని ప్రేమించిందని ఆగ్ర హానికి గురైన అనురాధ కుటుంబ సభ్యులు ఆమెను మానసికంగా వేధి ంచారు. వారి కుల సభ్యుల నుంచి ఒత్తిడి రావడంతో లక్ష్మణ్పై అను రాధతో 509 సెక్షన్ కింద కేసు పెట్టించారు. ఇరు కుటుంబాల సభ్యు లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పటికి గొడవ సద్దుమణిగింది. కానీ వేరే కులంవాడిని ప్రేమించిందనే భావం వారి మెదడును తొలిచేస్తూనే ఉంది. దీంతో తమ కూతురుపై రోజురోజుకూ పగ పెం చుకున్నారు. ఇదంతా పసిగట్టిన అనురాధ తాను ఎలాగైనా లక్ష్మణ్నే పెండ్లి చేసుకుంటానని తేల్చిచెప్పింది. తనకు కుటుంబ సభ్యులతోపాటు మరో ఇద్దరు వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందని స్వయంగా వీడియో తీసి గత అక్టోబర్ 24న సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఆమె కుటుంబ సభ్యుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆమెను మళ్లీ వేధించడం ప్రారంభించారు. దీంతో ఇలా గైతే తమ ప్రాణాలకే ముప్పు ఉందని గ్రహించిన అనురాధ, లక్ష్మణ్లు 2018 నవంబర్ 27న హైదరాబాద్కు వెళ్లిపోయారు. వారం రోజుల అనంతరం డిసెంబర్ మూడో తేదీన స్నేహితుల సహకారంతో హైదరాబాద్లోని ఆర్య సమాజ్లో పెండ్లి చేసుకున్నారు. ప్రభుత్వం నిర్వహించిన ఎస్జీటి పరీక్షలో అనురాధ 1:3లో ఉత్తీర్ణత సాధించింది. జిల్లా స్థాయిలో 415 ర్యాంక్ సాధించింది. అయితే దీనికి సంబంధించిన సర్టిఫికెట్స్ తీసుకుందామనీ, అలాగే గతంలో లక్ష్మణ్పై నమోదైన కేసు విషయమై డిసెంబర్ 22వ తేదీన అనురాధ, లక్ష్మణ్లు స్వగ్రామానికి వచ్చారు. అంతుకుముందే జన్నారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇరుకుటుంబాల సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసుల ముందు మాయమాటలు చెప్పిన అమ్మాయి కుటుంబ సభ్యులు, వారు వెనుదిగిన వెంటనే మరో 15 మందితో కలిసి అబ్బాయి కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. నడిరోడ్డుపైకి తీసుకొచ్చి గొడ్డును బాదినట్టు బాదారు. ఇంత జరుగుతున్నా గ్రామస్తులు మాత్రం జాలిపడలేదు. దెబ్బలకు అనురాధ స్పృహ తప్పింది. వెంటనే ఆమెను అక్కడి నుంచి నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం మల్లాపూర్ వైపు బైక్పై తీసుకెళ్లారు. వెంటనే భర్త లక్ష్మణ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అనురాధ అచూకీ కోసం ఎంత వెతికినా దొరకలేదు. అదే రోజు అర్ధరాత్రి కుటుంబ సభ్యులు అనురాధను చంపి, మృతదేహాన్ని కాల్చి ఆనవాళ్ల లేకుండా బూడిద, బొక్కలను సమీప వాగులో కలిపారు. అనంతరం ఏమీ తెలియనట్టు స్వగ్రామానికి చేరుకున్నారు. మరునాడు పోలీసులు అనురాధ తండ్రి, అన్నలను అదుపులోకి తీసుకుని విచారించగా కులంకానోడిని పెండ్లి చేసుకుందనే కోపంతోనే తమ బిడ్డను చంపామని ఒప్పుకున్నారు. ఈ కేసులో ఇప్పటికి 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అనురాధ సోషల్ మీడియాలో పోస్టు చేసిన దాంట్లో పేరు ఉన్న మరో ఇద్దరు కీలక నిందితులను మాత్రం ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గ్రామాల్లో కులగజ్జి రాజ్యామేలినంత కాలం, తల్లిదండ్రులు పిల్లల ప్రేమను అర్థం చేసుకోనంత కాలం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి గ్రామాల్లో అవగాహనా సదస్సు నిర్వహించాలి. తల్లిదండ్రులు కులాన్ని పక్కన పెట్టి పిల్లల భవిష్యత్పై దృష్టి పెట్టాలి. అప్పుడే కుల రహిత సమాజం సాధ్యం అవుతుంది.
నిందితులను కఠినంగా శిక్షించాలి
నా భార్యను కిరాతకంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. నన్ను నమ్ముకుని వచ్చిన ఆమె కు న్యాయం చేయలేకపోయా. మాకు ప్రాణభయం ఉందని అనురాధ సోషల్ మీడియాలో కూడా పోస్టు చేసింది. తన సర్టిఫికెట్స్, నాపై ఉన్న కేసు విషయమై ఇంటికి వచ్చాం. ఇద్దరి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి వారిని ఒప్పిదామని అనుకున్నాం. కానీ ఇలా జరిగి పోయింది. కండ్ల ముందే ఆమెను గొడ్డును బాదినట్టు బాదినా గ్రామస్తులు ఒక్కరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేసినప్పటికీ మరో ఇద్దరు కీలక నిందితులను అరెస్టు చేయలేదు. వారిని వెంటనే అరెస్టు చేయాలి. వారికి బెయిల్ రాకుండా చేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చొరవ చూపాలి. నాకు, మా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది.
- లక్ష్మణ్, అనురాధ భర్త
ప్రభుత్వమే బాధ్యత వహించాలి
కలమడుగు ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహిం చాలి. నేటి ఆధునిక యు గంలో కూడా గ్రామాల్లో కుల పిచ్చి తగ్గడం లేదు. కన్న తల్లిదండ్రులే కూతుర్ని చంపారంటే వారిలో కుల గజ్జి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామాల్లో అవగాహనా సదస్సు నిర్వహించి, కులరహిత సమాజ నిర్మాణానికి పాటుపాడాలి.
- సంకె రవి,
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, మంచిర్యాల
ఎ.అజయ్
సెల్ : 8297630110