గొల్లపల్లి మురళి
నిజామాబాద్ జిల్లాలో మరో కులదురహంకార హత్య చోటుచేసుకుంది? అగ్రకుల అమ్మాయిని ప్రేమించాడని స్నేహితులే కడతేర్చారు?.. జిల్లాలోని భీంగల్ మండలం సికింద్రాపూర్ గ్రామంలో దళిత యువకుడి అనుమానాస్పద మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. హత్య చేసి పొలంలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని మృతుని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో ఘటన ప్రదేశానికి వెళ్లిన ఏఎస్ఐ ఆత్మహత్యగా ప్రాథమికంగా నిర్దారించడం గమనార్హం.
భీంగల్ మండలం సికింద్రాపూర్ గ్రామంలో మాల సామాజిక తరగతికి చెందిన సందీప్(28) అదే గ్రామానికి చెందిన ముటాడి కాపు అమ్మాయిని ప్రేమించాడు. ఇరువురు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలో ఉపాధి నిమిత్తం సందీప్ గల్ఫ్ వెళ్లాడు. మొదట ఒకసారి వెళ్లి రాగా.. తాజాగా రెండు సంవత్సరాల క్రితం మరోసారి గల్ఫ్ వెళ్లి నాలుగు నెలల క్రితం సికింద్రాపూర్ గ్రామానికి వచ్చాడు. అయితే అమ్మాయితో నాటి నుంచి ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత జనవరి 23న బుధవారం ప్రభుత్వ పాఠశాల వద్ద జరుగుతున్న ఆటల పోటీలను తిలకిస్తున్న సందీప్ను తన స్నేహితులు చిన్నారెడ్డి, జగదీష్, శేఖర్, రవిలు 'మాట్లాడదాం రా' అంటూ బైక్పై ఎక్కించుకుని వెళ్లారు. ఆ సమయంలో మృతుని అక్క.. 'ఎక్కడికి తీసుకెళ్తున్నారు' అని ప్రశ్నించింది. 'ఇప్పుడే వస్తాం' అంటూ తీసుకెళ్లారు. కానీ అదేరోజు రాత్రి పొద్దుపోయిన తరువాత కూడా సందీప్ ఇంటికి రాలేదు. కుటుంబీకులు సందీప్కు ఫోన్ చేయగా.. 'స్విచ్ఛాప్ వచ్చింది. ఆయనను తీసుకెళ్లిన వ్యక్తులకు ఫోన్ చేస్తే 'వస్తాడు' అని చెప్పారు. అయినప్పటికీ ఎంతసేపటికి రాకపోవడంతో అనుమానించిన కుటుంబీకులు గ్రామ పరిసరాల్లో, పొలం గట్లల్లో వెతికారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ వచ్చింది. తీరా 24వ తేదీ గురువారం తెల్లవారుజామున సందీప్ మృతదేహం పొలాల గట్ల మధ్య పడి ఉంది. మృతదేహం పక్కనే క్రిమిసంహారక గుళికలుండటం గమనార్హం.
పోలీసుల నిర్లక్ష్యం
ఘటనపై పోలీసులకు సమాచారం చేరవేయగా.. ఎస్ఐ పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉండటంతో ఏఎస్ఐ ఘటనా స్థలానికి వెళ్లాడు. మృతదేహం పక్కన పడి ఉన్న గుళికల ఆధారంగా ఆత్మహత్యగా నిర్ధారించాడు. కానీ కుటుంబీకులు సందీప్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. స్నేహితులే తమ కండ్ల ముందే తీసుకెళ్లి హత్య చేశారని చెబుతున్నా పోలీసులు వినిపించుకోలేదు. ఈ విషయం దళిత సంఘాలకు తెలియడంతో గ్రామంలో ఆందోళన చేపట్టారు. ఈ పరిస్థితుల్లోనే పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతున్ని తీసుకెళ్లిన నలుగురు నిందితుల్లో.. రవికి సంబంధించిన బంధువుల అమ్మాయితో సందీప్ ప్రేమలో ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. కాగా సందీప్ది ముమ్మాటికీ హత్యేనని ప్రజా, దళిత సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. లేకుంటే సందీప్ మృతిచెందిన తర్వాత ఆయన నలుగురు స్నేహితులు ఎందుకు పరారీలో ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు పోలీసుల వద్ద సమాధానం లేకుండా పోయింది. కావాలనే పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని దళిత సంఘాలు, మృతుడి బంధు వర్గం ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సెల్ : 9963304326
Authorization