నూతన సంవత్సర ప్రారంభం రోజునే ఐదు మిలియన్ల మహిళలు తమకు కూడా పురుషులవలెనే అయ్యప్ప సన్నిధిలో ప్రార్థనలు చేసుకునే హక్కు కావాలని కోరుతూ 620 కి.మీ. పొడవునా బలమైన ''మహిళా కుడ్యం'' నిర్మించారు. 2019లో నిర్మించిన ఈ గోడ 1927 నాటి మహాద్ పాదయాత్రను గుర్తుచేయటం లేదూ? అవును సరిగ్గా అలాగే ఉంది. ''మార్చి 20, 1927న అంబేద్కర్ నాయకత్వంలో వేలాదిమంది మహార్లు చేసిన ప్రదర్శన భారతదేశ చరిత్రలో ఒక కొత్త మలుపు'' అని మహాద్ సత్యాగ్రహ నిర్వాహకులలో ఒకరైన ఆర్.బి.మోరే రాసారు. 30 ఏండ్ల అనంతరం అక్టోబర్ 1956లో నాగపూర్లో ఐదు లక్షల మంది బౌద్ధమతంలోకి మారడానికి అంబేద్కర్ను అనుసరించారు. అతడు వారందరికీ హిందూమతాన్ని, అది ఇచ్చిన కులవ్యవస్థ, వివక్షను కూడా వదిలేయమని కోరాడు. కానీ కేరల్లోనైనా ఇంకెక్కడైన మహిళలు కేవలం మహిళలైనందున వారిని అణచివేస్తున్న, వివక్ష చూపుతున్న పితృస్వామ్య భావజాలం నుండి, మతపరమైన నేపథ్యం నుండి బయటపడి సామూహిక మతమార్పిడికి పాల్పడలేరు. జెండర్, కులం రెండూ హిందూ సమాజంలో పునాదులు. ఏ మతంలోనైన ఇదే వర్తిస్తుంది. అయితే ఈ రెండు రకాల వివక్షలకు గురవుతున్న వారి ప్రతిస్పందన అన్ని సమయాలలో ఒక్కటిగా ఉండదు. హిందూమతంలో కులాన్ని అంగీకరించనివారు అంబేద్కర్లాగా బౌద్ధాన్నో మరో మతన్నో స్వీకరించగలరు కానీ జెండర్ వివక్షకు గురవుతున్న మహిళలు ఏమి చేస్తారు? ఇండియాలోని మహిళా ఉద్యమాలు, కేరళలో సుదీర్ఘకాలంగా వెళ్లూనుకున్న కమ్యూనిజం, సుప్రీంకోర్టు తీర్పు, వివిధ రకాల వేదికలు - శబరిమలలో న్యాయం జరగాలని కోరుకుంటున్న మహిళలకు చేయుతనిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అంబేద్కర్ అనుసరించిన మతమార్పిడి మనకు ఎటువంటి మార్గం చూపించదు.
జనవరి 2న బిందు అమ్మిని, కనకదుర్గ అనే మహిళలు శబరిమల అయ్యప్ప గుడిలోకి ప్రవేశించారనే కారణంతో గుడి పూజారులు ''శుద్ధి'' కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయం వింటే 1927లో మహారాష్ట్రలో చోటుచేసుకున్న సంఘటన గుర్తుకొస్తోంది. 1927లో డా.బిఆర్.అంబేద్కర్ అంటరానితనానికి నిరసనగా ఊరేగింపుగా వెళ్లి మహాద్లోని చెరువులోకి దిగి నీరు తాగారు. దానితో చెరువు అపవిత్రమైపోయిందని ఆగ్రహించిన బ్రాహ్మణులు108 బిందెల ఆవు పంచాదికాలు అంటే ఆవు పాలతోపాటు పేడ, మూత్రం మొదలైన వాటిని కుమ్మరించారు.
మహాద్ జ్ఞాపకాలు
మార్చి 19-20, 1927 మరియు డిసెంబర్ 25, 1927 - రెండు దఫాలుగా అంబేద్కర్ మహాద్లో సత్యాగ్రహం చేశారు. అంబేద్కర్తో సహా మహార్లందరు సామూహికంగా చెరువు నీరు తాగటం ఆచారాలు ఉల్లంఘనకు చిహ్నంగా భావించారు. రెండు దశల్లోనూ నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా, క్రమశిక్షణతో నిర్వహించాలని వారు ప్రయత్నించినా సంప్రదాయవాదులు హింసాత్మక సంఘటనలతో దానిని భగం చేశారు. మహార్ సత్యాగ్రహులను చెదరగొట్టే పేరుతో ముకదాడులు జరిపేవారితో పోలీసులు కుమ్మక్కయ్యారు. సామాజిక పెత్తనం, రాజకీయ పలుకుబడి కలిగిన హిందూ మతస్తుల మనోభావాలను గాయపరిస్తే నష్టమని తలచిన బ్రిటిష్ పాలకులు కూడా వారి వైపే వత్తాసు పలికారు.
''హిందూ ఛాందసవాదులు మానవత్వానికి పెద్ద గుదిబండ వంటివారు'' అంబేద్కర్ జీవితచరిత్ర రాసిన ధనుంజయ కౌర్ మహాద్లో జరిగిన సంఘటనలు వివరిస్తూ అన్న మాటలివి. ఊరిలో ఇతర ప్రజలందరికీ చెరువులోని నీరు ఎంత అవసరమో అస్పశులుగా పిలవబడే వారికి కూడా అంతే అవసరం. అది మనుషులుగా వారి హక్కు. అందువల్లనే దీన్ని సాధించటం కోసం ఆ సమయంలో అంబేద్కర్ దృష్టి, కృషి మొత్తం మంచినీటి చెరువు పైనే కేంద్రీకరించారు. అప్పుడు పక్కనే ఉన్న వీరేశ్వర్ గుడిలోకి ప్రవేశించటంపైన ఆయనకు ఆసక్తి లేదు. అయితే దాని తరువాత కాలంలో జరిగిన ఆలయ ప్రవేశ సత్యాగ్రహంలో అంబేద్కర్ తన పాత్ర పోషించారు. 1929లో పుణేలోని పార్వతీ ఆలయంలోకి, 1930 నుండి1934 వరకు నాసిక్లో జరిగిన కాలరాం ఆలయ ప్రవేశ దీక్షలోను ఆయన భాగస్వామి అయ్యారు. చివరికి ఈ ప్రచారాలు, ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. బ్రహ్మణవాదంలోని అధికారం, బహిష్కారం, వ్యక్తిగత ఆస్తి మొదలైన అధిక్షేపణలన్నీ ఉపయోగించి అగ్రకులస్థులు దళితులను అడ్డుకున్నారు. ప్రత్యక్షంగా భౌతిక దాడులకు దిగటమే కాదు వలస పాలకుల లా అండ్ ఆర్డర్ యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా వాడుకున్నారు. తమకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా మొదట శుద్ధి కార్యక్రమం చేశారు. తరువాత ప్రభుత్వ అధికారుల నుండి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆపైన చట్టపరంగా కేసులు బనాయించారు. పైగా బెదిరింపు ఎత్తుగడలకు పాల్పడటానికి కూడా వారు తటపటాయించలేదు.
గాంధీగారి మాటలతో స్ఫూర్తి పొందిన అంబేద్కర్ మహాద్లో సత్యాగ్రహాన్ని ఎంచుకున్నారు. తరువాత 1924లో ట్రావెన్కోర్ సంస్థానంలో జరిగిన ఒక పోరాటం అంబేద్కర్లో చైతన్యాన్ని రగిల్చింది. తమకు వైకోమ్లోని శివాలయంలో ప్రవేశం కల్పించాలని కోరుతూ అత్యంత వివక్షకు గురవుతున్న ఎఝావ, పులయా కులస్తులు సంస్కరణవాద నాయకులు టికె.మాధవన్, కె.పి.కేశవ మీనన్ నాయకత్వంలో పెద్ద ఉద్యమం చేపట్టారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ అభిప్రాయంలో ఈ ఉద్యమం ఆధునిక భారతదేశ చరిత్రలోనే అపూర్వమైనది. అభ్యుదయ కాముకులు, వ్యతిరేక గొంతుకలు, విభిన్న రాజకీయ సమూహాలు, వివిధ ప్రాంత ప్రజలు అందరూ ఒకే వేదికపైకి వచ్చారు. కేరళకు చెందిన శ్రీనారాయణ గురు, తమిళ నాయకుడు ఈ.వి.రామస్వామి పెరియార్, మహాత్మాగాంధీ వీరందరూ ఒకే లక్ష్యంగా ఏకమయ్యారు. ''వారి గుడిలో దేవుని పూజించటానికి ప్రవేశించకుండా ఈ భక్తులను ఎందుకు నిరాకరిస్తున్నారో తెలపాలని గాంధీ, నంబూద్రి బ్రాహ్మణులను సూటిగా ప్రశ్నించారు.
కానీ ఒక దశాబ్దం తరువాత గాంధీ కులవివక్షను పరోక్షంగా సమర్ధిస్తున్నట్టు గ్రహించిన అంబేద్కర్ గాంధీపైన అయిష్టతతో అతని నుండి వేరుపడ్డారు. అలాగే సత్యాగ్రహానికి అంత రాజకీయ సామర్ధ్యం లేదనే విషయం అర్థం కావటంతో ఆ భ్రమలనుండి బయటకొచ్చారు. అలాగే 1935 అక్టోబర్లో నాసిక్ నగర శివారులోని ఐయోలాలో ''తాను హిందువుగా జన్మించినప్పటికీ హిందువుగా మాత్రం చనిపోనని'' ప్రకటించాడు. చెరువులు, దేవాలయాల్లో ప్రవేశానికి గతంలో తాను నిర్వహించిన పోరాటాల్లో కూడా హేతుబద్ధత లేదని భావించాడు. కరుడుగట్టిన మత పెత్తందారీ విధానాలు వివక్షాపూరిత పద్ధతులు ఎప్పటికి అందరికీ సమానత్వం, గౌరవం, మర్యాద కలగకుండా అడ్డుపడుతూనే ఉంటాయని భావించిన ఆయన తరువాత ఎటువంటి మతపరమైన విధానాలను కోరుకోలేదు.
విభిన్న రకాల వివక్షలు
శబరిమలలో జరిగిన శుద్ధీకరణ కార్యక్రమాన్ని పరిశీలిస్తే 1927నాటి మహాద్ సంఘటనతో పోలినట్టు, పోలనట్టు కూడా అనిపిస్తుంది. ఈ రెండు కేసుల్లోనూ ఒక ప్రత్యేక గ్రూప్ను వెలివెయ్యాలని (దూరంగా ఉంచాలని) ప్రయత్నించారు. ఇప్పుడు బహిష్టు కారణం చూపి 10-50 ఏండ్ల బాలికలు, మహిళలను శబరిమలలో అడ్డుకుంటున్నారు. శతాబ్దం క్రితం చావదర్ చెరువు వద్ద దళితులను అడ్డుకున్నారు. అయితే ఉన్న తేడల్లా నేటి స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగంలోని ఆర్టికల్14 అందరికి సమానత్వాన్ని కల్పించింది. దీనికి మరింత బలాన్ని చేకూరుస్తూ ఏ వయసు మహిళలైన 41 రోజులు దీక్ష తీసుకుని శబరిమల గర్భగుడిలో ప్రవేశించడానికి హక్కు ఉన్నదని సెప్టెంబర్ 2018లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దేశంలోనూ, మన జీవితాల్లోనూ అంబేద్కర్ ప్రవేశంతో మనకు సరైన రాజ్యాంగం, బలమైన న్యాయవ్యవస్థ ఏర్పడ్డాయి. అతడు కులానికి వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న సమయంలో మద్దతుగా నిలబడటానికి ఆ రోజున ఈ వ్యవస్థలు లేవు. ఈ అనుభవంతోనే అంబేద్కర్ గణతంత్ర భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించాడు. దానిద్వారా అంటరానితనం చట్టవిరుద్ధం చేశారు. కుల లైంగిక వివక్ష లేకుండా అందరికీ సమాన పౌరసత్వం, ప్రాథమిక హక్కులు మొదలైనవి కల్పించారు. వలసవాద కాలంనుండి వైకోమ్ సంఘటనతో సహా దశాబ్దాల నుండి అనేక అభ్యుదయ పోరాటాలకు, రాజకీయాలకు పేరుగాంచిన కేరళలో మత ఛాందస, కులతత్వ, పితృస్వామ్య ఆనవాళ్లు తిరిగి మొలకెత్తటం జీర్ణించుకోలేని విషయం.
నూతన సంవత్సర ప్రారంభం రోజునే ఐదు మిలియన్ల మహిళలు తమకు కూడా పురుషులవలెనే అయ్యప్ప సన్నిధిలో ప్రార్థనలు చేసుకునే హక్కు కావాలని కోరుతూ 620 కి.మీ. పొడవునా బలమైన ''మహిళా కుడ్యం'' నిర్మించారు. 2019లో నిర్మించిన ఈ గోడ 1927 నాటి మహాద్ పాదయాత్రను గుర్తుచేయటం లేదూ? అవును సరిగ్గా అలాగే ఉంది. ''మార్చి 20, 1927న అంబేద్కర్ నాయకత్వంలో వేలాదిమంది మహార్లు చేసిన ప్రదర్శన భారతదేశ చరిత్రలో ఒక కొత్త మలుపు'' అని మహాద్ సత్యాగ్రహ నిర్వాహకులలో ఒకరైన ఆర్.బి.మోరే రాసారు. 30 ఏండ్ల అనంతరం అక్టోబర్1956లో నాగపూర్లో ఐదు లక్షల మంది బౌద్ధమతంలోకి మారడానికి అంబేద్కర్ను అనుసరించారు. అతడు వారందరికీ హిందూమతాన్ని, అది ఇచ్చిన కులవ్యవస్థ, వివక్షను కూడా వదిలేయమని కోరాడు. కానీ కేరల్లోనైనా ఇంకెక్కడైన మహిళలు కేవలం మహిళలైనందున వారిని అణచివేస్తున్న, వివక్ష చూపుతున్న పితృస్వామ్య భావజాలం నుండి, మతపరమైన నేపథ్యం నుండి బయటపడి సామూహిక మతమార్పిడికి పాల్పడలేరు. జెండర్, కులం రెండూ హిందూ సమాజంలో పునాదులు. ఏ మతంలోనైన ఇదే వర్తిస్తుంది. అయితే ఈ రెండు రకాల వివక్షలకు గురవుతున్న వారి ప్రతిస్పందన అన్ని సమయాలలో ఒక్కటిగా ఉండదు. హిందూమతంలో కులాన్ని అంగీకరించనివారు అంబేద్కర్లాగా బౌద్ధాన్నో మరో మతన్నో స్వీకరించగలరు కానీ జెండర్ వివక్షకు గురవుతున్న మహిళలు ఏమి చేస్తారు? ఇండియాలోని మహిళా ఉద్యమాలు, కేరళలో సుదీర్ఘకాలంగా వెళ్లూనుకున్న కమ్యూనిజం, సుప్రీంకోర్టు తీర్పు, వివిధ రకాల వేదికలు - శబరిమలలో న్యాయం జరగాలని కోరుకుంటున్న మహిళలకు చేయుతనిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అంబేద్కర్ అనుసరించిన మతమార్పిడి మనకు ఎటువంటి మార్గం చూపించదు.
సంస్కరణ- పునరుద్ధరణ
శబరిమలలో భారతీయ జనతా పార్టీ, సంఫ్ు పరివార్ శక్తులు మహిళల కోరికకు వ్యతిరేకంగా మతఛాందసవాద మంటను రాజేస్తున్నాయి. అత్యంత తిరోగమి శక్తులైన మితవాద హిందూ జాతీయ వాద రాజకీయ సంస్థల నుండి అంతకన్నా ఏమి ఆశించలేం. కాంగ్రెస్ కూడా ఈ విషయంలో అవకాశవాద నిర్ణయం తీసుకోవటం చాలా నిరాశ కలిగించే అంశం. కేరళలో ప్రముఖ కాంగ్రెస్ నాయకులు తాము రెండు బలమైన రాజ్యాంగ సూత్రాలు - ఆర్టికల్14 సమానత్వం, ఆర్టికల్ 25 మతస్వేచ్ఛ మధ్య అడకత్తెరలో పోకచెక్కలాగా నలుగుతున్నామని చెబుతుండటం హాస్యాస్పదం. ఈ వాదనను ముందుకు తెస్తున్నవారికి అటు రాజ్యాంగంపైన, ఇటు హిందూ మతం మీద కనీస అవగాహన లేదన్న సంగతి స్పష్టం అవుతోంది.
మతస్వేచ్ఛ అంటే అర్థం తమ స్వంత, ఇష్టమైన మతాన్ని అనుసరించటం. అంతేకానీ ఇతరుల ప్రాథమిక హక్కులను అణచివేసే స్వేచ్ఛ కాదు. లేకపోతే శబరిమలకి పూజలు జరుపుకునేందుకు సుప్రీంకోర్టు మహిళల పక్షాన ఇచ్చిన తీర్పును, హక్కును వారించటం కాదు. నిజానికి హిందూమతం ఉన్నతమైన ఆత్మవిమర్శ, స్వీయదిద్దుబాటు, స్వీయాభివృద్ధి మొదలైన విలువలు, భిన్నత్వాన్నీ, నిరంతరం పురోగమించే తత్వాన్ని కలిగివుంది. ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో ఈ అంశాన్ని నిర్ధారించి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇక్క ఆండాళ్ మరియు నందనార్, బసవన్నా మరియు అక్కమహాదేవి, అయ్యాంకలి మరియు నారాయణ గురు వంటి అత్యంత స్ఫూర్తిమంతులైన మహానుభావులు ఛాందసత్వాన్ని ఎదిరించారు. కుల, లింగ సంకెళ్లు తెంచేశారు. శతాబ్దం కిందటే చరిత్రాత్మక సంస్కరణ ఉద్యమాలను ఎక్కుపెట్టారు.
మనందరం గాంధీ, అంబేద్కర్ ఆశయాలు సిద్ధాంతాల గురించి వింటూ పెరిగిన ఆధునిక పౌరులం. ఏ మతాన్ని ఆచరించేవారిమైన మనం వారి వారసులుగా గతకాలపు రెచ్చగొట్టే ఆచారాలకు భిన్నంగా ప్రగతిశీలంగా ఆలోచించాలి. ప్రజాస్వామ్య భారతీయులుగా ''ఎవరైతే అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించి అక్కడ పూజలు నిర్వహించుకోవాలని కోరుకుంటున్నారో వారందరికీ తలుపులు తెరవబడాలని'' మనస్ఫూర్తిగా కోరుకుందాము.
- అనన్య వాజపేయి, సీఎస్డీఎస్, న్యూ ఢిల్లీ
అనువాదం: పద్మశ్రీ
Authorization