కోప్ర
నియంతలకు ప్రశ్నలంటే ఇష్టముండదు. ప్రశ్నించే స్వరాలంటే పరమ కసి. పొగిడే గొంతులను తప్ప ప్రశ్నించే గళాలను అస్సలు సహించరు. ప్రజాస్వామ్యమంటే వారికి పరమద్వేషం. ఏదో ఒక సాకుచూపి, ఏ సాకూ దొరక్కుంటే తామే సృష్టించి ఆ ప్రశ్నించే గొంతులను, ప్రజాస్వామ్య ప్రియులను కటకటాల వెనక్కు నెట్టేంత వరకు వారికి నిద్రపట్టదు. ఇందుకు తాజా సాక్షమే అనీల్ తేల్ తుంబ్డే.
మనదేశంలో అప్రజాస్వామిక వాదుల, నియంతల జన్మస్థలి కుల వ్యవస్థ. కుల వ్యవస్థ ద్వారా జన్మతహా అధికారాన్ని, ఆధిపత్యాన్నీ సొంతం చేసుకున్నవారు సహజాతిసహజంగానే నియంతలుగా మారిపోతారు. అలాంటి వారి ఏలికలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లడం అసాధ్యం. అందుకే, 1953 జూన్ 23న బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో 'భారత్లో ప్రజాస్వామ్యం విజయవంతమవుతుందా?' అన్న ప్రశ్నకు అంబేద్కర్ ''అవ్వదు'' అని ఖరాఖండీగా సమాధానమిచ్చారు. 'ఎందుకంటే-ఇక్కడి సామాజిక వ్యవస్థ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఏమాత్రం అనుకూలమైనది కాదు' అని వివరించారు. అలాగే, ''వివక్షతో కూడిన ఈ వ్యవస్థను అంతమొం దించాలి. ఇందుకు వట్టి మాటలు కాకుండా, గట్టి చర్యలు చేపట్టాలి. ఈ ప్రయత్నాలు ఫలించకపోతే.. కమ్యూనిజమే ప్రత్యామ్నాయం అవుతుంది'' అని కుండబద్దలుకొట్టారు.
దళిత మేధావిగా ప్రపంచ ప్రసిద్ధుడు, స్వ యానా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు మనుమడు అయిన ప్రొఫెసర్ అనీల్ తేల్ తుంబ్డేను బీజేపీ పాలనలోని మహారాష్ట్ర పోలీసులు 'అర్బన్ నక్సల్' పేరున అరెస్టు చేయడం, నాటి అంబేద్కర్ మాటలను తిరిగి నేడు మననం చేసుకోవాల్సిన అవసరం కలిగిస్తోంది. నిజానికి అనీల్ తేల్ తుంబ్డే అరెస్టు వార్తవిని యావత్ దేశం విస్తుపోయింది. ఇందుకు ఒక కారణం ఒక దళిత మేధావిగా గుర్తింపు పొందిన వ్యక్తిని దేశ చరిత్రలో మున్నెన్నడూ 'ఉపా' లాంటి ఉగ్రవాద వ్యతిరేక చట్టంక్రింద ఏ ప్రభుత్వమూ అరెస్టు చేయకపోవడం అయితే, మరొక కారణం ఒక దళిత మేధావిపై నిషేధిత తీవ్రవాద సంస్థద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరచే చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలు మోపి చెరసాలలో సుదీర్ఘ బందీని చేయాలనుకోవడం.
తుంబ్డే అరెస్టు ఏవో తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలను ఆశించి జరిగిందనుకుంటే పొరపాటు అవుతుంది. ఇందులో చాలా విషయం దాగుంది. భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలన్న సంఫ్ పరివార్ లక్ష్యం ఉంది. తమ లక్ష్యానికి అడ్డుపడే ఏకైక శక్తి కమ్యూనిస్టు భావజాలమేనన్న అవగాహన ఇమిడి ఉంది.
అంబేద్కర్ను కులానికి మాత్రమే పరిమితం చేయగలిగామని సంబరపడుతున్న హిందూత్వ వాదులకూ, పాలకవర్గాలకు తేల్ తుంబ్డే లాంటి వారు తేలు కన్నా ప్రయాదకారులు. 'సామాజిక-ఆర్థిక-రాజకీయ సమానత్వం' అన్న అంబేద్కర్ ఆశయ సాధనకు కమ్యూనిస్టు భావజాలన్ని సాధనం చేసుకోకతప్ప దన్న సత్యాన్ని బోధించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ బోధన ఈ దేశ పీడితుల బుర్రకెక్కితే ఆపై పాలకవర్గాల భవిషత్ గల్లంతే. కాబట్టే అణుక్షణం బీజేపీపై నిప్పులు చెరుగుతూ, అంబేద్కర్ను భుజాలకెత్తుకుని ఊరేగించే కాంగ్రెస్తో సహా బీజేపీ యేతర పాలకపక్షాలన్నీ అంబేద్కర్ మనుమడు అన్న సెంటిమెంట్ను సొమ్ము చేసుకునే ప్రయత్నమే తప్ప తుంబ్డే మీద అణ చివేతను ఖండిం చలేకపోతున్నాయి. సిద్ధాంతాలకాడ సెంటిమెంట్లు పనిచేయవన్న సత్యం వారికి తెలుసు!
తుంబ్డే అత్యంత పేద దళిత కుటుంబం నుంచి ఎదిగివచ్చిన వ్యక్తి. ఎన్నో అననుకూల పరిస్థితుల మధ్య అత్యున్నత ఖరగ్పూర్ ఐఐటీలో చదువుకుని, అక్కడే ప్రొఫెసర్గా పనిచేసి, ఇప్పుడు గోవా మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్లో ఫ్రొఫెసర్గా పనిచేస్తున్నారు. స్వయానా అంబేద్కర్ మనుమరాలని వివాహమాడటం ద్వారా ఆ కుటుంబంలో సభ్యుడయ్యారు. కుల-వర్గ సమస్యలపై 26పుస్తకాలు రాశారు. ఇవి దేశంలోనే కాక, ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాశం అయ్యాయి. తుంబ్డే రాసిన 'రిపబ్లిక్ ఆఫ్ క్యాస్ట్' అన్న గ్రంథం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. అంతేకాకుండా దళితుల, అణగారిన ప్రజల హక్కులకోసం సాగుతున్న ఉద్యమాలలో ప్రత్యక్ష భాగస్వామిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో భీమాకోరేగాం ఘటన సంభవించింది. భీమాకోరెగాం యుద్ధం జరిగి 200ఏండ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఉత్సవాలు జరుపుకుంటారు. అందులో భాగంగానే 2017 డిసెంబర్31 వేలాది దళితులు అక్కడకు చేరుకోవడంతో హింస చెలరేగింది. ఈ హింసకు కారణం ఇద్దరు సంఘీయులని భావించి పోలీసులు కేసునమోదు చేశారు. అందులో ఒకరు శంభాజీ భిడే. ఈయన గురించి ప్రధాని మోడీ 'మేం ఎప్పుడైనా సమాజంకోసం ఏదైనా కార్యక్రమం చేయదలచుకుంటే, అప్పుడు భిడే గురూజీ మాముందు ఉదాహరణగా నిలిచేవారు' అని వ్యాఖ్యానించారు. కోరెగాం హింసకు సంఘీయులే కారణమని నిర్ధారణ అయినప్పటికీ, ఆ తరువాత పరిస్థితులు మారిపోయాయి. మహారాష్ట్రను పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం దీనిని 'అర్బన్ నక్సల్స్'పేరుతో మేధావులను అణచివేసేందుకు వాడుకోదలచుకుంది. హేతువాదులు, హక్కుల కార్యకర్తలు, మార్క్సిస్టు దృక్ఫథంతో కుల సమస్యను చూస్తోన్న వ్యక్తులు.. ఒక్కమాటలో చెప్పాలంటే సంఫ్ భావజాలానికి, బీజేపీ ప్రభుత్వానికీ వ్యతిరేకులైన ప్రతి ఒక్కరికీ గంపగుత్తగా అర్బన్ నక్సల్స్ అని పేరు పెట్టారు. ఒక్కసారి ఆ ముద్ర పడిన తరువాత ఇక వారిని ఏమైనా చేసుకోవచ్చు. ఏ ఆధారాలు లేకున్నా కేవలం అనుమానంతో కనీసం 6నెలలు జైలులో పెట్టేందుకు అవకాశం ఇచ్చే 'ఉపా' లాంటి నల్ల చట్టంద్వారా కటకటాలలో కుక్కేయవచ్చు. ఇప్పుడు అదే జరుగుతోంది.
సంఫ్ పరివార్ రెండు నాల్కల ధోరణికి పెట్టింది పేరు. ప్రతి విషయంపై రెండు అభిప్రాయాలను వ్యక్తం చేయడం వారి నైజం. ముఖ్యంగా కులం విషయంలో వీరు ఏనాడూ ఏకాభిప్రాయాన్ని ప్రకటించి ఎరుగరు. కుల వివక్షను నిర్మూలించి, హిందూ సమాజాన్ని ఏకంచేయడమే తమ లక్ష్యమని ప్రకటించు కుంటారు. అదే నోటితో 'ప్రపంచంలోని ఏ దేశంలోనూ రిజర్వేషన్ వ్యవస్థ లేదు. ఇది మంచిది కాదు. అందరికీ సమాన అవకాశాలు లభించాలి' (మన్మోహన్ వైద్య- ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త) అని డిమాండ్ చేస్తారు. దళితుల ఓట్ల కోసం తాము వారి పక్షమేనని వాగాడంబరత ప్రదర్శిస్తారు. తమ మనువాద భావజాల పరిరక్షణకోసం దళితులపై వివక్షను ప్రదర్శించే వారిని అంతర్గతంగా ప్రోత్సహిస్తారు. రక్షించుకుంటారు. వివక్షతో కూడిన సామాజిక దొంతరులు పటిష్టంగా కొనసాగుతున్న భారతీయ సమాజంలో అన్ని దొంతరలకూ సమాన న్యాయం అందించడం అసాధ్యం. ఈ విషయం వారికీ తెలుసు. అందుకే దళితులలోనుంచి ఉదిత్రాజ్, సావిత్రి ఫూలే, రామ్దాస్ అథవాలే, రాంవిలాస్ పాశ్వాన్ లాంటి కొందరిని ఎంచుకుంటారు. వారి వ్యక్తిగత అవసరాలను తీర్చి అందలాలు ఎక్కించడం ద్వారా తమ అమ్ములపొదిలో ఆయుధాలుగా మార్చుకుని అవసరమైనప్పుడు అదే దళితులపై ప్రయోగిస్తారు. ఇక ఇతర బూర్జువా పార్టీలలోని దళిత నాయకులతో కూడా వారికి పేచీ లేదు. ఏ బూర్జువా పార్టీ నాయకుడూ గుడిలో పూజలు జరుపకుండా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించలేని వాతావరణం దేశంలో సృష్టించబడ్డ తరువాత పాలకవర్గ పార్టీల నాయకుల ద్వారా మతతత్వ వాదులకు ఎదురయ్యే ప్రయాదమేమీ లేదు.
ఈ నేపథ్యంలో కులాన్ని కమ్యూనిస్టు భావజాలంతో తప్ప పూర్తిగా తుదముట్టించలేమని, మనువాదుల హింసను ఎదుర్కోలేమని భావిస్తున్న వారితోనే కమలనాధులకు ప్రమాదం. కమలనాధులు తమ మనుగడ సాగించేందుకు అనునిత్యం వీరితో యుద్ధం చేయకతప్పదు. భావజాలరంగంలో వారిని ఓడించడం హిందుత్వవాదులకు అసాధ్యం. భావజాలరంగంలో వారిని ఎదుర్కోకుంటే ఆ భావజాలం క్షేత్రస్థాయి కార్యాచరణగా మారి తమ ముందరి కాళ్ళకు బంధమేస్తుంది. తమ పయనాన్ని అడ్డుకుంటుంది. అంతిమంగా తమ ఉనికికే ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టే, తుంబ్డే లాంటి వారిని ఆదిలోనే తుంచేయాలని సంఫ్పరివార్ శక్తులు ఉవ్విళ్లూరుతున్నాయి.
మన దేశంలో మెజారిటీ ప్రజలైన అణగారిన కులాలకు చెందిన ప్రజలను వేల ఏండ్లుగా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో అణచివేస్తూ ఉన్న కుల వ్యవస్థను నాశనం చేసేందుకు మార్క్సిజమే సరైన ఆయుధమన్న స్పృహ ఇటీవలికాలంలో అణగారిన కులాలలో పెరుగుతూ వస్తోంది. ఈ అవగాహనలో మేధావులు ముందు వరుసలో ఉన్నారు. వివిధ రంగాలకు చెందిన మేధావులు మార్క్పిజాన్ని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఎలా ఎక్కుపెట్టాలి? అన్న దానిపై కమ్యూనిస్టులతో కలిసి కృషిచేస్తున్నారు. కుల సమస్యకు పరిష్కారాన్ని బూర్జువా పార్టీల చేతుల్లో పెట్టేయకుండా, కేవలం రిజర్వేషన్లకు, కొన్ని సంక్షేమ పధకాలకే పరిమితం కాకుండా ఆ రక్కసిని తుదకంటా పెకళించాలని ప్రయత్నిస్తున్న తుంబ్డే లాంటి వారి ఆలోచనలను మరింతగా పరిష్టపరచి, ఆచరణను విస్తృత పరచడం ద్వారానే హిందుత్వ వాదుల ఆధిపత్యాన్ని, అణచివేతను ఎదుర్కోగలం. అందుకు, మార్క్సిస్టు భావజాలం ఈ దేశంలో ఇప్పుడు మరింతగా బలపడాల్సిన అవసరముంది. కమ్యూనిస్టుల ప్రజాపునాది విస్తృతమవ్వాల్సి ఉంది. ఒకప్పుడు కమ్యూనిస్టులకు పెట్టని కోటలుగా ఉన్న పశ్చిబెంగాల్ , త్రిపుర, కేరళలలో త్రిపుర, బెంగాల్లు చేజారాయి, కేరళను కూడా కబళించేందుకు హిందుత్వ శక్తులు విశ్వ ప్రయ్నతం చేస్తున్నాయి. దేశంలో కమ్యూనిస్టుల ఉనికి లేకుండా చేస్తే తప్ప తమకు ఎదురుండదని భావిస్తున్న శక్తులు అందుకోసం ఎంతకైనా తెగిస్తున్నాయి. అయినా, సమస్య గర్భంలోనే పరిష్కార బీజమూ అతర్భాగమై ఉంటుంది. ప్రజావ్యతిరేక శక్తుల విజయ పరంపరలోనే వారి అంతిమ పరాజయమూ దాగుంటుంది. దోపిడీ ఉన్న చోట వర్గపోరాటం ఉంటుంది. అణచివేత ఉన్నచోట తిరుగుబాటూ ఉంటుంది. క్రమంగా బలోపేతమవుతూ ఉన్న కష్టజీవులు, కులపీడితులు, మేధావులు, ప్రజాతంత్రవాదుల ఐక్యతే ఈ చారిత్రక సత్యాన్ని సాటి చెబుతుంది.
సెల్: 6301289321
Authorization