విజయ్ కృష్ణ బత్తిని:
శూద్రులను మనువాదుల చెర నుండి కాపాడటమే ఫూలే ఉద్యమ ముఖ్య ఉద్దేశ్యం. ఫూలే రచనలలో ముఖ్యమైనది గులాంగిరి. అమెరికాలో బానిసత్వాన్ని రద్దు చేసిన లింకన్ స్ఫూర్తితో ఉత్తేజితుడై 1973లో ఈ రచనను ప్రచురించాడు. సమాజంలో వెనుకబడిన వర్గాల ప్రజలు, మహిళల అభ్యున్నతికి నిరంతరం పరితపిస్తూ ఆయన చేసిన కృషికి గాను ప్రజలు ఆయనను మహాత్మ జ్యోతిరావుఫూలేగా కీర్తించారు. అలా ఆయన మహాత్ముడయ్యాడు.
నవభారత నిర్మాణానికి నాంది పలికిన సామాజిక దార్శనీకుడు ''మహాత్మా జ్యోతిరావు ఫూలే. జీవితకాలం కింది జాతుల విముక్తికోసం పోరాటం చేసిన మహానుభావుడు. భారతదేశ చరిత్ర కులాల మూలాలను వివరించిన తాత్వికుడు. 150 ఏండ్ల కిందటే స్త్రీ విద్యకోసం పాటుపడిన మేధావి. మనం చీకట్ల నుండి వెలుగులోనికి రావాలని నిరంతరం పరితపించిన ప్రజల మనిషి. 19వ శతాబ్దంలో మన దేశంలో ఉన్న సామాజిక అసమానతలపై అతనొక యుద్ధం. ఈయన తండ్రి గోవిందరావు. ఒక కూరగాయల వ్యాపారి. కాలక్రమేణా ఆయన పూల వ్యాపారిగా మారారు. ఫూలే పసిప్రాయంలోనే తల్లి మరణించింది. అప్పటికి ఫూలే వయసు 9 నెలలు మాత్రమే. మొదటినుండి పూల వ్యాపారం చేయడం వల్ల ఫూలే ఇంటిపేరు గోనె నుండి ఫూలేగా మారింది. ఫూలే ప్రాథమిక విద్య పూర్తి చేసిన తరువాత తండ్రితో వ్యవసాయం చేసేవాడు. అయినా ఆయనకు విద్య పట్ల ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. అలా 1841లో పూణేలోని స్కాటిష్ మిషన్లో పూర్తిచేశారు. చిన్నతనంలోనే ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. థామస్ రచించిన మానవ హక్కులు అనే పుస్తకం ఆయన ఆలోచనలకు పదును పెట్టింది. పుస్తక ప్రభావంతో సమాజాన్ని భిన్న కోణంలో చూడటం ప్రారంభించారు. జ్యోతిరావుకు చిన్నప్పటి నుండి శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజీ, జార్జ్ వాషింగ్టన్లో జీవిత చరిత్రలు ఫూలేను ప్రభావితం చేయడం వలన దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయి. అందుకే భారతదేశంలో వేళ్లూనుకున్న అగ్రకులాల ఆధిపత్యాన్ని ఆయన ప్రశ్నించగలిగాడు. ఆయన పుట్టేనాటికి కులం, మతం , సామాజిక అసమానతలకు నిలయంగా ఉంది. కులంతోపాటు మతోన్మాదంపై నిరంతరం పోరాడుతూ ఫూలే పోరాట స్ఫూర్తి అమోఘమైనది. బడిలో కలిసి చదువుకున్న బ్రాహ్మణ స్నేహితుడి పెండ్లిలో కుల వివక్షకు గురయ్యాడు. స్వాతంత్రోద్యమంలో పోరాడాల్సిన ఫూలే ఆ ఘటనతో దేశంలో నాటుకుపోయిన కుల వివక్ష, మతోన్మాదంపై తిరుగుబాటు ప్రారంభించారు. స్వాతంత్య్రం కంటే ముందు కులం కోరల నుండి దేశాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆధి పత్యంపై యుద్ధం ప్రకటించాడు. వేదాలను పవిత్రంగా భావించడాన్ని వ్యతిరేకించాడు. విగ్రహారాధనను ఖండించాడు. కులం గుట్టును శాస్త్రీయంగా వివరించాడు.
''చదువు లేనిదే జ్ఞానం లేదు జ్ఞానం లేనిదే పురోగతి ఉండదు'' అన్న ఈ అక్షర సత్యాన్ని పందొమ్మి దవ శతాబ్దం తొలినాళ్లలోనే గుర్తించినవాడు ఫూలే. అందుకే నిమ్నజాతి, దళితులకు ప్రప్రథమంగా పాఠశాలలను స్థాపించారు. 1848లో దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను పూణేలో ప్రారంభించారు. ఆ పాఠశాలలో తనభార్యతో పాఠాలు చెప్పించిన ఘనత ఫూలేది. భారతదేశంలో దళితులకు పాఠశాల పెట్టిన ఘనత కూడా ఫూలే దంపతులదే. స్త్రీలకు విద్య కావాలని అభ్యర్థించిన మొదటి భారతీయుడు మహాత్మ జ్యోతిబాఫూలే. స్త్రీలను బానిసలుగా చూసే రోజుల్లో ఆయన భార్యను విద్యావంతురాలిని చేశాడు. తను స్థాపించిన పాఠశాలల్లో సావిత్రి గారి చేత పాఠాలు చెప్పించారు. అంతేకాదు, ఆమెలో పోరాట స్ఫూర్తి తీసుకురావడంలో ఫూలే ఒక చారిత్రాత్మక బాధ్యత నెరవేర్చాడు. ఇది సహించలేని ఆధిపత్యవర్గాలు 1849లో తన తండ్రిచేత కుటుంబం నుంచి బహిష్కరింపజేశారు. అయినా కలత చెందక మొక్కవోని ధైర్యంతో, పట్టుదలతో మరింత ముందుకు వెళ్లారు ఫూలే. జీవిత భాగస్వామి సావిత్రిబాయి సహకారంతో అనేక సాంస్కృతిక పోరాటాల్ని నిర్మించారు మహాత్మా జ్యోతి ఫూలే. బ్రిటిష్ ప్రభుత్వం ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడాన్ని ఎదిరించాడు.
విద్యావ్యాప్తి ద్వారా కుల నిర్మూలనకు, సాంఘిక దురాచారాలు నిర్మూలించేందుకు కృషి చేశారు. శూద్రులు అంటే అగ్రవర్ణాల వారికి సేవ చేయడానికి పుట్టారన్న భావనను బద్దలుకొట్టారు. ఆర్యులపై అనార్యులపై చేసిన దండయాత్రలనే దశావతారాలుగా చిత్రించారని విశ్లేషించాడు. భారత రామాయణ మహాభారతాలలో హిందూ వర్ణవ్యవస్థను సమర్ధించని వాళ్లను రాక్షసులుగా ప్రచారం చేసి, వారిని నిందించడం, చివరకు హతమార్చడం జరిగిందని అందుకు రావణుడు, నరకాసురుడి ఘటనలే నిదర్శనంగా నిలిచాయని ఎలుగెత్తి చాటిన మొదటి పోరాటయోధుడు ఫూలే. ఆధునిక యుగంలో కులాన్ని వ్యతిరేకించిన ప్రబోధకుడు ఫూలే. మానవ సమాజం తొలిదశలో కుల భేదం లేదని ఆయన వాదించారు. పక్షులు, జంతువులకు లేని కుల, మత భేదాలు మనుషుల్లో ఎందుకని ప్రశ్నించారు. అగ్రకులాల వారికి బానిసలుగా బతుకుతున్న కింది కులాల వారిలో తమ బానిసత్వం పట్ల చైతన్యం రగిలించారు. దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలన కావాలని ఆయన కోరుకున్నాడు. తన ఇంటి వద్ద ఉన్న స్నానాల తొట్టి వద్ద స్నానం చేసేందుకు అంటరాని వారికి కూడా అనుమతి ఇచ్చాడు ఫూలే. కేవలం శూద్ర వర్ణాలలో అణచివేతకు గురవుతున్న కులాల ప్రజల పక్షాన పోరాడటమే కాకుండా అగ్రవర్ణ వితంతువుల పునర్ వివాహానికి కూడా గొప్ప కృషి చేశారు.
1855లో ఫూలే రాసిన తృతీయ రత్న నాటకం ద్వారా కులాధిపత్య వ్యవస్థను వ్యతిరేకించారు.1864లో గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించి, వితంతువులైన గర్భిణులకు అండగా నిలిచారు. దేశంలో ఇటువంటి కేంద్రం స్థాపించడం ఇదే మొదటిసారి. 1872లో ఈ కేంద్రంలో బ్రాహ్మణ వితంతువుకు జన్మించిన పుత్రుడిని దత్తత తీసుకొని యశ్వంత్గా నామకరణం చేశారు. 1869లో పౌరోహిత్యం యొక్క బండారం, జిత్తులమారి బ్రాహ్మణత్వం వంటి రచనలు కూడా చేశారు. 1870లో భావజాల ప్రచారాన్ని, కార్యాచరణగా మార్చడానికి సార్వజనిక సభ స్థాపించారు. 1873 సెప్టెంబరు 24న సత్య శోధక సమాజాన్ని ఫూలే స్థాపించి ప్రజలను పోరాటాల వైపు మళ్లించిన యోధుడు ఫూలే. అగ్రవర్ణాల సాహిత్యాన్ని ప్రశ్నించిన ప్రతిసారీ ఫూలేపై దాడులు జరిగాయి. ముఖ్యంగా స్త్రీలకు, అంటరాని వారికి విద్య చెప్పినందుకు గాను మహాత్మ ఫూలే దంపతులపై అనేకసార్లు దాడులు జరిగాయి. సత్య శోధక్ సమాజం తరఫున దీనబంధు వార పత్రికను ప్రారంభించారు. 1880లో భారత ట్రేడ్ యూనియన్ ఉద్యమ పితామహుడు లోఖండేతో కలిసి రైతులు, కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించాడు. 1882లో హంటర్ కమిషన్కు శూద్రాతి శూద్రులకు చదువు చెప్పించాల్సిన అవసరం ఉందని నివేదిక ఇచ్చాడు. 1883లో సేద్యగాని చర్మ కోలా అనే పుస్తక రచన చేసాడు. 1885లో సత్య సారాంశం ప్రచురించారు. 1891లో పులే రచించిన సార్వజనిక్ ధర్మ పుస్తక్ ఆయన మరణాంతరం వెలువడింది. భావి తరాలకు ఆయన జీవితం గొప్ప స్ఫూర్తి. నేడు కులం, మతం, జమిలిగా విజంభిస్తున్న నేపథ్యంలో ఆ స్ఫూర్తిని అందుకోవడం మనందరి కర్తవ్యం.
సెల్ : 9100400850
Authorization