ఎదుగు బొదుగు లేకుండా ఉన్న ఉద్యోగరంగంలోనూ, ఇటు నానాటికీ కుచించుకుపోతున్న విద్యా రంగంలోనూ ఈ రెండింటిలో కొత్తగా వస్తున్న 10శాతం రిజర్వేషన్ ఆధిపత్య కులాల పేదలకు చేయబోయే మేలు ఏమీ లేదు. తమకు దక్కవలసినది మరొకరు ఆక్రమిస్తున్నారని ఒకరి మీద ఒకరు అనుమానపడుతూ, కత్తులు దూస్తూ విభిన్న ప్రజా సమూహాలు తమ ఉమ్మడి శత్రువును వదిలేసి, తమ మధ్య తాము వైరుధ్యాలు పెంచుకోవడానికి మాత్రమే ఈ విధానం దారి తీస్తుంది.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క వ్యక్తిత్వానికి సమకాలీన దేశ రాజకీయాల్లో చాలా ప్రాధాన్యత వచ్చింది. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రాజకీయ ఫలితాలను పొందడానికి అన్ని రాజకీయ పార్టీలు పోటీలు పడుతున్నాయి. కానీ ఆయన ప్రతిపాదించి రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లను మాత్రం కాలరాసేందుకు కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అందరూ అంబేద్కర్ గురించే మాట్లాడుతున్నారు. రకరకాల దృక్ఫథాల నుంచి రకరకాలుగా అంచనా వేస్తున్నారు. ఆయన మౌలిక ఆలోచనల్ని తమ అవసరాలకు అనుగుణంగా కుదించి, కొంతమంది వక్రీ కరించి ప్రచారం చేస్తున్నారు. ఆయన జీవించిన కాలంలో అనేక మంది ఆయన భావాలను పూర్తిగా తిరస్కరించారు. ఆయన అహర్నిశమైన కృషిని కూడా వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు ఆయనను తిరస్కరించిన, వ్యతిరేకించిన సంస్థలకు, భావాలకు వారసులుగా ఉన్నవారు ఇప్పుడు అంబేద్కర్ని ఆకాశానికి ఎత్తి బ్రహ్మరథం పడుతున్నారు.
అంబేద్కర్ ఆలోచనలపై దాడి చేయడం వల్ల అనుకున్న ఫలితాలను పూర్తిగా సాధించడం సాధ్యం కానందువల్లనే మరోవైపు నుంచి అంబేద్కర్ ఆలోచనల్ని వక్రీకరించి, తమకు అనుగుణంగా తీర్చిదిద్ది, ఆయనను తమ వాడిగా చేసుకొనే ప్రయత్నాలను ఆర్ఎస్ఎస్, సంఫ్ుపరివార్ శక్తులు గత కొంత కాలంగా చేస్తున్నాయి. అంబేద్కర్ హిందూ మతాన్ని సంస్కరించి, మెరుగు పరచడానికి కృషిచేసిన సంఘ సంస్కర్త అని, ఇస్లాం, క్రైస్తవ మతాలను తిరస్కరించిన ఉత్తమ జాతీయవాది అని ప్రచారం చేస్తూ, సంఫ్ు పరివార్ సిద్ధాంతకర్తల సరసన అంబేద్కర్కి స్థానం ఇచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. ఇంతకాలం బీజేపీ గుజరాత్లో సర్దార్ పటేల్ని మోసిమోసి భంగపడింది. ఇప్పుడా చూపును బెంగాల్లో నేతాజీ సుభాష్చంద్రబోస్ వైపు మళ్ళించింది. కానీ ఆ మాయాజాలం పశ్చిమబెంగాల్లో ఎటువంటి ప్రయోజనాలను తెచ్చి పెట్టలేకపోయింది. ప్రస్తుతం ఆపార్టీని ఇప్పుడు దళిత ఓటు బ్యాంకును మాయావతి-బహుజన్ సమాజ్పార్టీ గుప్పిట్లో నుంచి లాక్కోవడానికి బాబాసాహెబ్ తమకు ఆప్తుడన్నట్టు నటిస్తున్నారు. దళిత ఓట్లను తమ బుట్టలో వేసుకునే ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నారు.
అంబేద్కర్ భావాలు హిందూత్వ శక్తుల భావాలకు పూర్తిగా వ్యతిరేకం. కుల వ్యవస్థను నాశనం చేయడానికి ఆ వ్యవస్థకు ఆలంభనగా ఉన్న హిందూ మత భావాల్ని, బోధనల్ని, తుత్తునియలు చేయడానికి ఆయన జీవితాంతం కృషిచేశారు. హిందూ మతం ఉన్నంత వరకూ కులం, అంటరానితనం పోవని, హిందుమతాన్ని వదిలేస్తేనే దళితులకు విముక్తి లభిస్తుందని అంబేద్కర్ బలంగా నమ్మారు. అంబేద్కర్ని వేనోళ్ల పొగుడుతూనే ఆయన ప్రతిపాదించిన, రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు మాత్రం కాలరాసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ రంగాల్లో ఉన్న అట్టడుగు వర్గాల రిజర్వేషన్లు తొలగించాలనే బలమైన డిమాండ్ని తెరమీదకు తీసుకొచ్చి, వివాదం చేసి, కులాల వైషమ్యాలను మరింత రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వర్ణాశ్రమ ధర్మాన్ని, కుల వ్యవస్థను, ఆధిపత్య వర్గాల అధికారాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న సంఫ్ుపరివార్లో వివిధ విభాగాలు ఎంతోకాలంగా రిజర్వేషన్ల విధానం పట్ల తమ అసంతృప్తి ప్రకటిస్తూనే ఉన్నాయి. నిచ్చెన మెట్ల వ్యవస్థలో తమను అట్టడుగుకు పరిమితంచేసి, అణిచిపెట్టిన కులాలు రిజర్వేషన్ల పుణ్యమా అని ఏ కొద్దిగానో అవకాశాలు పొందు తుండటం ఆధిపత్య కులాలకు, వారి ప్రతినిధి అయిన సంఫ్ు పరివారానికి ఎప్పటి నుంచో కంటగింపుగానే ఉంది. ఆధిపత్య శక్తులకు చెందిన మేధావు లు, సంఫ్ు పరివార్ నాయకులు కొన్ని సందర్భాల్లో రిజర్వేషన్లను నేరుగానే వ్యతిరేకించారు. ఏడు దశాబ్దాల రిజర్వేషన్లు సక్రమంగా అమలుకాలేదని, ఆయా కులాల ఆర్థిక సమస్యలను తీర్చలేదని, కాబట్టి రిజర్వేషన్లు తొలిగించాలనే డొంక తిరుగుడు వాదనలకు కొనసాగింపుగా, ప్రస్తుతం ఆధిపత్య కులాల పేదలకు రిజర్వేషన్ కల్పించే పేరుతో రిజర్వేషన్ల స్ఫూర్తినే భంగపరిచే విధానం తీసుకువచ్చారు.
ఈ కొత్త రిజర్వేషన్ విధానం కోసం రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుంది కాబట్టి బీజేపీలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ బిల్లును తయారు చేసింది. ఆఖరి శీతాకాల సమావేశాల్లో జనవరి 8న ఆ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ''124వ రాజ్యాంగ సవరణ బిల్లు 2019'' అనే పేరుతో ఉన్న ఆ బిల్లును కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ మంత్రి డాక్టర్ ధావర్చంద్ గెహ్లాట్ జనవరి 9న లోక్సభలో ప్రవేశపెట్టారు. అదే బిల్లు ఆ మర్నాడే రాజ్యసభలో చర్చకు రాగా 8గంటల పాటు చర్చించి ఆమోదించారు. కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిన సమయం నుంచి మొత్తంగా 48గంటల లోపే అసాధారణ స్థాయిలో, అసాధారణ వేగంతో రాజ్యాంగ 103వ సవరణ చట్టంగా మారింది.
జనవరి 12న రాష్ట్రపతి ఆమోదం కూడా పొంది, జనవరి 14నుంచి అమల్లోకి వచ్చింది. అంతే వేగంతో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఈ పదిశాతం రిజర్వేషన్ను రానున్న రెండేండ్లలో సంపూర్ణంగా అమలు చేయాలని, అలా అమలు చేయడానికి ప్రణాళికను గతమార్చి 31కల్లా రూపొందించాలని దేశంలోని ఉన్నత విద్యా సంస్థలన్నింటిని ఆనాడే ఆదేశించింది.
గత ఏడుదశాబ్దాలలో తీవ్రమైన ప్రజల ఒత్తిడి తర్వాత తయారు చేయక తప్పని బిల్లులెన్నో సంవత్సరాలు, దశాబ్దాలు గడిచినా అంగుళం కూడా ముందుకు కదలని నేపథ్యంలో ఈ బిల్లు మాత్రం చట్టమయిన వేగం, అమల్లోకి వస్తున్న వేగం చూస్తే దీని వెనుక పాలకవర్గ, పాలకపక్ష ప్రయోజనాలేవో ఉన్నాయని అనుమానించక తప్పదు. సహజంగానే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ కొత్త రిజర్వేషన్ విధానం దేశ వ్యాప్తంగా చర్చలకు కందిరీగల తుట్టెను కదిలించింది. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తే అగ్రవర్ణ పేదలను దూరం చేసుకుంటామనే అనుమానంతో ఏ ఒక్క పక్షమూ ఈ విధానాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించలేదు గానీ ఈ విధానాన్ని ప్రవేశపెట్టడంలో బీజేపీ అత్యుత్సాహంగా తొందరపాటును ప్రదర్శించిందని, ఇది కేవలం ఎన్నికల ఎత్తుగడ అని, ఈ విధానం అమలుకు విధించిన నిబంధనలు సరిగా లేవని అనేక సన్నాయి నొక్కులు నొక్కాయి.
ఈ వ్యవహారాన్ని మొత్తంగా అనేక కోణాల నుంచి విశ్లేషించి అర్థం చేసుకోవాల్సి ఉన్నది. ఆధిపత్య కులాల్లో పేదలు ఉన్నారనేది ఒక వాస్తవమంటూ అంగీక రిస్తూనే, వారి ఆర్థిక వెసులుబాటు తనాన్ని పరిష్కరిండానికి ప్రభు త్వం ఏవైనా ప్రత్యేక సదుపాయాలు కల్పిం చవచ్చని అంటూనే, ఈ కొత్త రిజర్వేషన్ విధానం పట్ల విమర్శనాత్మక వైఖరి తీసుకోవాల్సియున్నది. ఎందుకంటే ఈ క్రొత్త రిజర్వేషన్ విధానం ప్రధానంగా పాత రిజ ర్వేషన్లను పలచనబర్చి అంతిమంగా రద్దుచేసే దారిలో ఒక అడుగుగా వస్తున్నది. అందువల్ల దీనిని తీవ్రంగా ఖండించాల్సి ఉంది. సామాజిక వివక్ష ప్రాతిపదిక మీద చారిత్రాత్మకంగా రూపొందిన రిజర్వేషన్లను ఆర్థిక వెనుకబాటు తనం అనే తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల ప్రాతిపదికతో సమానం చేయడం ఎంతటి ప్రమాదకరమైన ఫలితాలకు దారితీసే ఎత్తుగడో నిశితంగా పరిశీలించాల్సి యున్నది. ఈ కొత్త రిజర్వేషన్ విధానం వాస్తవంగా ఆధిపత్య కులాలలోని పేదలకు కూడా ఒనగూర్చే ప్రయోజనాలు ఏమీ ఉండబోవని, ఇది కేవలంవారిలో భ్రమలు కల్పించే ఎన్నికల ఎత్తుగడగా వస్తున్నదని గమనించాలి.
వాస్తవం చెప్పాలంటే ఆధిపత్య కులాలలోని పేద యువతీ, యువకులు ఈ కొత్త రిజర్వేషన్ విధానం వల్ల తమకేదో మేలు జరుగుతుందని ఆశించడానికి కూడా ఏమీ లేదు. అసలు ప్రభుత్వోద్యోగాలే లేనప్పుడు, తగ్గిపోతున్నప్పుడు ఉద్యోగాలలో కొత్తగా మరికొన్ని రిజర్వేషన్లు కల్పిస్తామని వాగ్దానం చేయడం ఉద్యోగార్థులలో, నిరుద్యోగులలో ఆశలు, భ్రమలు పెంచడానికే తప్ప మరెందుకు ఉపయోగపడదు. ఇప్పటి వరకు దళితులకు, వెనుకబడిన కులాలకు రిజర్వ్ చేయబడిన ఉద్యోగాల ఖాళీలే పూర్తిగా నింపనప్పుడు, రిజర్వేషన్ కోటాలోనే నింపని లక్షలాది ఉద్యోగాల బ్యాక్లాగ్లు ఉన్నప్పుడు, కొత్త రిజర్వేషన్ ఇస్తానని వాగ్దానం చేయడం ఆధిపత్య కులాల నిరుద్యోగులను వంచించడానికి తప్ప ఎందుకూ పనికి రాదు. ఇంతకాలం పేదరికం వల్ల ఉన్నత విద్యలో అవకాశాలు పొందలేక పోయిన వారికి ఈ కొత్త రిజర్వేషన్ విధానం ద్వారా అవకాశాలు ఇస్తామని ప్రభుత్వం నమ్మబలుకుతుంది.
మొత్తంగా విద్యారంగమే దయనీయ స్థితిలో ఉన్నప్పుడు, నిధుల కొరతతో విద్యా సంస్థలు కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏ విద్యాసంస్థలు ఎప్పుడు మూత పడతాయో తెలియని స్థితి ఉన్నప్పుడు, ప్రయివేటు విద్యావ్యవస్థ నానాటికీ లాభార్జనే ధ్యేయంగా విద్యావ్యాపారం సాగిస్తున్నప్పుడు ఈ కొత్త రిజర్వేషన్ విద్యారంగంలో సక్రమంగా అమల్లోకి రావడానికి గానీ, ఆధిపత్య కులాల పేద విద్యార్థులకు అవకాశాలు ఇవ్వడానికి గానీ వీలే లేదు.
అంటే అటు ఎదుగు బొదుగు లేకుండా ఉన్న ఉద్యోగరంగంలోనూ, ఇటు నానాటికీ కుచించుకుపోతున్న విద్యా రంగంలోనూ ఈ రెండింటిలో కొత్తగా వస్తున్న 10శాతం రిజర్వేషన్ ఆధిపత్య కులాల పేదలకు చేయబోయే మేలు ఏమీ లేదు. తమకు దక్కవలసినది మరొకరు ఆక్రమిస్తున్నారని ఒకరి మీద ఒకరు అనుమాన పడుతూ, కత్తులు దూస్తూ విభిన్న ప్రజా సమూహాలు తమ ఉమ్మడి శత్రువును వదిలేసి, తమ మధ్య తాము వైరుధ్యాలు పెంచుకోవడానికి మాత్రమే ఈ విధానం దారి తీస్తుంది.
ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవత్ 2015 బీహార్ శాసనసభ ఎన్నికలకు ముందు ప్రచారంలో రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలని అన్నాడు. రిజర్వేషన్ విధానాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుతున్నారని, అసలు ఈ రిజర్వేషన్లు అవసరమా, ఎంతకాలం అవసరం అని విచారించడానికి రాజకీయేతర నిపుణుల కమిటీని ఏర్పాటు చేసారు. సంఘ్ పరివార్ అసలు ఉద్దేశం ఇది. ఆ ఉద్దేశాన్ని ఆచరణలో పెట్టడానికే నరేంద్రమోడీ ప్రభుత్వం ఇప్పుడీ కొత్త రిజర్వేషన్ విధానాన్ని తీసుకొచ్చింది.
- నాదెండ్ల శ్రీనివాస్
సెల్: 9676407140
Authorization