కోరే రమేష్
మానవుడు ప్రకృతి సృష్టించిన సహజసిద్ధమైన అవరోధాలను అధిగమించి అంతరిక్షాన్ని అందుకోగలిగే స్థాయికి ఎదిగాడు. కాని అతని సాంఘిక జీవనంలో కృత్రిమంగా సృష్టించుకున్న సామాజిక అవరోధాలైన కులం, మతం, అసమానతలు, లింగవివక్షను మాత్రం అదిగమించలేకపోతున్నాడు. కులాలతో ఖండితమైన భారతీయ సమాజంలో కులాంతర వివాహాల దగ్గర నుంచి కుల ప్రాతిపదికన చలరేగే ఘర్షణలకు కుల పెద్దలు నిర్వహించే పంచాయితీల దగ్గర నుంచి దేశ సర్వోన్నత న్యాయ స్థానం కుల రిజర్వేషన్లపై వెల్లడించిన మండల కమిషన్ తీర్పు వరకు పరిణామాలను పరిశీలిస్తే దేశంలో కులం అనే సాంఘిక వ్యవస్థ ఎంత బలంగా నాటుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.
భారతదేశంలో ఈ వర్ణవ్యవస్థ అనేది పురాతన కాలం నుండే ఉందని చెప్పవచ్చు. మనువు తన మనుధర్మ శాస్త్రంలో ఈ చాతుర్వర్ణ వ్యవస్థ గురించి వివరించారు. త్రిముర్తులలో ఒకరైన బ్రహ్మ మొఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు జన్మించారని చెప్పారు. చాతుర్వర్ణంలో చివరి వర్ణమైన శుద్రులను ఇతర మూడు వర్గాల్లో మహిళలను సైతం తక్కువ వర్గంగానే పరిగణించారు. కానీ వేద అనంతర కాలం ప్రారంభమయ్యే నాటికి వర్ణవ్యవస్థలో సంకీర్ణం జరిగి జాతి, ఉపజాతి, పంచములు అనే మరో వర్ణం వారిని చాతుర్వర్ణ వ్యవస్థలో అదనంగా సృష్టించారు.
మధ్యయుగం ఆరంభం నాటి గుప్త యుగంలో వర్ణ వ్యవస్థ ఇంకా బలపడింది. ఎందుకంటే ఈ దశలోనే కులం అని పిలిచే వృత్తి ఆధారిత సాంఘీక వ్యవస్థ వాస్తవ రూపం దాల్చింది. మనదేశానికి బ్రిటిష్ వారి రాకతో ఆధునిక యుగంలో అడుగీడిన భారతీయ సమాజం బ్రిటీష్ వారు అనుసరించిన విభజించు-పాలించు సూత్రంలో భాగంగా ప్రవేశపెట్టిన పాలన పద్ధతుల వల్ల పన్ను వసూళ్లలో మధ్యవర్తి ప్రధానమైన జమిందారి, భూస్వామి విధానాలు అనుసరించటం వల్ల కొన్ని కులాలు ఆర్థికంగా స్థితిమంతులయ్యాయి. దీనికితోడు బ్రిటీషు వారు పరిపాలన సంస్కరణల్లో భాగంగా సంపద, ఆర్థికాంశాల ప్రాతిపదికన ఓటు హక్కు ఇవ్వటం వల్ల వారు రాజకీయంగానూ క్రియాశీలకమయ్యారు.
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి ఆధిపత్య కులాల వారు ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉండి దేశ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించారు. రాజ్యాంగ పరిషత్తులో మొదటి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యత్వ విషయంలో ఆధిపత్య కులాల వారి ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తుంది. రాజ్యాంగ పరిషత్తు భూస్వాముల ఆధిపత్యంలో ఉందని, మార్క్సిస్ట్ విమర్శకులు వ్యాఖ్యానించడాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆర్థిక, సాంఘీక, రాజకీయ వ్యవస్థల్లో మార్పులు ఆధిపత్య కులాల స్థితిగతుల్లో మార్పులకు కారణమయ్యాయి.
స్వాతంత్య్రానంతరం 30 కోట్లుగా ఉన్న భారత జనాభాలో 15శాతం కూడా మించని స్థాయిలో ఆధిపత్య కులం వారు ఉండేవారు. అయినప్పటికీ వ్యవసాయ ప్రధానమైన భారతదేశంలో సంపద సృష్టికి కారణమైన భూయాజమాన్యం అగ్రవర్ణాల (ధనవంతులు) చేతిలో ఉండేది. పైగా శైశవ దశలో ఉన్న భారత ప్రజాస్వామ్యంలో సాధారణ ఎన్నికల్లో వీరు అధిక సంఖ్యలో శాసనసభలకు ఎన్నికయ్యేవారు. ఫలితంగా వారికి ఆర్థికంగా, రాజకీయంగా ఎటువంటి వివక్ష ఎదురయ్యేది కాదు. కానీ 1960 దశకం మధ్యలో హరిత విప్లవం తరువాత దాని ప్రయోజనాల్లో అధిక భాగం ఈ భూస్వామ్య ఆధిపత్య కులాలకే దక్కాయి.
ప్రస్తుత సమాజంలో వర్ణవ్యవస్థకు సంబంధించి ఎన్నో సమస్యలను చూస్తున్నాము. వాటిలో కుల వివక్షత ముఖ్యమైన సమస్య. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చదువుకునే రోజుల్లో కుల వివక్షకు గురయ్యారు. కాబట్టి దళిత వర్గాల ఉన్నతికి రిజర్వేషన్లను రాజ్యాంగంలో పొందుపరిచారు. అయినప్పటికీ మన దేశంలో కుల వివక్ష ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో ఎంతో మంది నామినేషన్లు వేశారు. కానీ ఒక గ్రామంలో పేద వర్గాల వారు నామినేషన్ వేయటంతో ఆ ఊరి ఆధిపత్య కులాల (ధనవంతులు) వారు ఆ పేద వర్గాల ప్రజల మొత్తాన్ని ఆ గ్రామం నుండి వెలివేసి వారందరిని కుల వివక్షకు గురి చేశారు.
వర్ణవ్యవస్థకు సంబంధించి మరిచిపోలేని సంఘటన కారంచేడు. ఆ గ్రామంలో భూస్వాములు, జమిందారులు, ధనవంతులు ఆ ఊరిలో ఉన్న దళిత వర్గాల వారిని ఊచకోత కోశారు. దీనిని బట్టి మన దేశం అభివృద్ధిలో ఎంత వెనుకబడి ఉందో చెప్పవచ్చు. ఈ కుల వ్యవస్థలో మరో ముఖ్య సమస్య ఏమిటంటే కుల దురహంకార హత్యలు. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులతో పాటుగా చదువుకున్న తల్లితండ్రులు కూడా కుల దురహంకార హత్యలను ప్రోత్సహించటం బాధాకరమైన విషయం.
ఈ వర్ణవ్యవస్థలో ఉన్న మరో సమస్య నాయకుడిని ఎన్నుకోవటంలో జాప్యత. ప్రముఖ కవి కాళోజీ అన్నట్టుగా అభ్యర్థి ఏ పార్టీ వాడో కాకుండా ఏపాటి వాడో చూడాలి. కానీ ఇప్పుడున్న సమాజంలో ప్రజలు ఎన్నికల్లో నిలబడిన వ్యక్తి మనకు న్యాయం చేస్తాడా? ప్రజలందరి సమస్యలు తీరుస్తాడా? ప్రజల పక్షాన, న్యాయం పక్షాన ఉంటాడా? అనేది కాకుండా ఎన్నికల్లో ఉన్న వ్యక్తి మన పార్టీ వాడా? మన కులం వాడా? అన్నది చూసి డబ్బులు తీసుకొని ఓటు వేస్తున్నారు. దీనిని బట్టి ప్రస్తుత సమాజం కులం అనే మహమ్మారికి బానిసై ఉందని చెప్పవచ్చు.
సమానత్వమే సమాజ మనుగడుకు ప్రాథమిక సూత్రం. ఏ జాతి మరోజాతిపై ఆధిపత్యం వహించజాలదనీ, ఎవరికీ సామాజిక న్యాయం దూరం కారాదనీ, దీని కోసమే పోరాటమని అంబేద్కర్ పేర్కొన్నారు. అంబేద్కర్ చెప్పినట్టు కులం పునాదులపైన ఒక జాతిని కానీ, ఒక నీతిని కానీ నిర్మించలేము అనే కఠోర సత్యాన్ని ఈ దేశానికి అర్థం కావించడం ద్వారా మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలం.
సెల్ : 8498073181
Authorization