మడూరి శ్రీరామ్
ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు... కలిసి జీవితం పంచుకుందామన్న ఆ ప్రేమ జంటకు కులాలు అడ్డుగా మారాయి. దీంతో వారు కలిసి బతకలేమని భావించారో... తమ పెండ్లికి పెద్దలు అంగీకరించరని అనుకున్నారో గానీ ఆ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. కలిసి బతకలేమని నిర్ణయించుకొని మరణంలోనైనా కలిసే ఉందామని భావించి తనువు చాలించారు. ఈ విషాద సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది.
వారిద్దరూ కలిసి చదువుకున్నారు.. చదువుకున్న చోటే పరిచయం ఏర్పడింది.. వారి ఇద్దరిదీ ఒకటే ఊరు.. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం.. పెండ్లి చేసుకుని కలిసి జీవించాలనుకున్నారు.. కానీ కులాలు అడ్డొచ్చాయి. వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో రెండేండ్ల కిందట ఇద్దరినీ మందలించారు. అబ్బాయికి జరిమానా కూడా విధించారు. అయినా ఇద్దరి మనసులు మారలేదు. ప్రేమను విడిచిపెట్టలేక, పెద్దవాళ్లను కాదనలేక ప్రేమ చిగురించిన గదిలోనే ఉరేసుకుని ప్రాణాలు వదిలారు.
లకుడారం గ్రామానికి చెందిన రాచకొండ మడేల్ రేనవ్వలకు ముగ్గురు కూతుళ్లు. వీరి రెండో కూతురు తార (19) రజక, ఇదే గ్రామానికి చెందిన మంజ మల్లేశం నర్సవల్ల కుమారుడు కనకయ్య (21) ముదిరాజ్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆ క్రమంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ విషయం రెండేండ్ల క్రితం పెద్దలకు తెలియడంతో గ్రామ పెద్దలు మందలించి కనకయ్యకు రూ.30 వేల జరిమానా విధించారు. అయినా ఒకరినొకరు విడిచి ఉండలేక కలుసుకుంటూనే ఉన్నారు. కులాలు వేరు కావడంతోనే ఇరువురి కుటుంబాల్లో పెండ్లికి ఒప్పుకోరని భావించి గత బుధవారం ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఎటువెళ్లినా మనల్ని కలిసి ఉండనీయరని భావించి తీవ్ర మనస్థాపానికి గురై లకుడారం స్టేజీ వద్ద రాజీవ్ రహదారి పక్కనున్న వారు చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్దకెళ్లారు. ముందుగా వారు పరిచయమైన ఎనిమిదవ తరగతి గదిలోకి వెళ్లారు. వెంట తెచ్చుకున్న విషం తాగి ఆపై ఒకే తాడుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా బుధవారం బయటకెళ్లిన వారు రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఇరు కుటుంబీకులు వెతికినా లాభం లేకపోయింది. మరుసటి రోజు ఉదయం పాఠశాల ఆవరణలో మొక్కలకు నీరుపోసేందుకు వెళ్లినవారు పైఅంతస్తు వైపు చూశారు. గది తలుపులు తెరిచి ఉండడంతో వెళ్లి చూడగా కనకయ్య, తార ఉరేసుకుని కనిపించారు. వెంటనే గ్రామస్థులకు తెలిపి పోలీసులకు సమాచారమందించారు. కనకయ్య పదిరోజులక్రితం హనుమాన్ మాలదీక్ష తీసుకున్నాడు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉన్నత పాఠశాల వద్దకొచ్చి స్నానం చేసి వెళ్లేవాడు. రోజు మాదిరిగానే ఇంట్లో నుంచి వెళ్లాడని కుటుంబీకులు అనుకున్నారు.
కులం మన దేశాన్ని పట్టిపీడిస్తున్న ఓ దిక్కుమాలిన జబ్బు. ఇప్పటికి కులాల పేరుతో అణిచివేత, ఆటవీక పోకడలు చాలదన్నట్టు కులం పిచ్చి రోజురోజుకూ మరీ ముదిరిపోతోంది. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉందనడానికి నిలువెత్తు నిదర్శనమే లకుడారం గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్య సంఘటన. కులం కాదు మనసు గొప్పనుకున్న ప్రేమజంటకు పెద్దలు మనసు కాదు కులమే గొప్పంటూ హెచ్చరికలు చేస్తూ జరిమానా విధించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. అప్పుడు తెరుకున్నారేమో పెద్దలు ఆయ్యో నా కొడుకా... నా బిడ్డా అంటూ ఎడ్వటం మొదలు పెట్టారు. ఇదే ముందు ఆలోచించి ఉంటే వార్దిదరు బతికి ఉండేవారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ కుల నిర్మూలనకు పాటుపడాలి. ఆ దిశగా ఆలోచన విధానం పెరగాలి. కులాల కట్టుబాట్లను దిక్కరించి నేటి యువత సమానత్వ భావాలతో కులాంతర వివాహాలకు సిద్ధమైనప్పుడు అందరూ సహకరించాలి. అప్పుడే ఈ కులాల కుంపట్లు మననుంచి దూరమవుతాఇ.
సెల్ :9951829299
Authorization