లక్ష్మినారాయణ
మానవత్వం మంటగలిసిపోతోంది. చనిపోయిన శవాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్దామంటే కనీసం కనికరించకుండా దారి పొడవునా ముళ్ల పొదలు వేసి అడ్డుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపురం గ్రామంలో ఇటీవల చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి మల్లయ్య (50) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈనెల 4న మృతి చెందారు. దహన సంస్కారాల కోసం ఇంటి నుండి శవాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు దారి ఉన్నప్పటికీ ''మా ఇంటి ముందు నుంచి శవాన్ని తీసుకెళ్లరాదని'' పక్కనున్న ఇంటి యజమానులు అడ్డుతగిలారు. వేరేదారిన తీసుకెళ్దామని వెళ్తుంటే దారిపొడవునా ముళ్లపొదలు వేశారు. ఇలా అనేక ఇబ్బందులు పడుతూ ముళ్లపొదల నుం చే శవయాత్ర నిర్వహించారు. దీంతో వివాదం తీవ్రం కాగా స్థానిక సర్పంచుకు, పోలీసులకు, తహశీల్దార్కు సమాచారం ఇవ్వడంతో అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. శవయాత్ర నిర్వహించడానికి ఉదయం నుంచి రాత్రి వరకు సమయం పట్టింది. అయితే మల్లయ్యకు గ్రామంలో నివాస గృహం ఉండగా ఏదో సమస్యతో ఇతరులకు విక్రయించుకుని గ్రామంలోనే వేరేచోట స్థలం కొనుగోలు చేసి రేకులతో ఇల్లు కట్టుకుని కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. ఊరి ప్రజలకు తన జీవిత కాలమంతా కులవృత్తిలో భాగంగా అనేక సేవలందించిన మల్లయ్యకు ఈ విధంగా ఇరుగుపొరుగు వారే అడ్డుచెప్పడంపై పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. మానవత్వం మంటగలిసేవిధంగా వ్యవహరించిన ఇరుగు పొరుగు వారిపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధునిక యుగంలో ఆచారాలు, ఆనవాయితీలు, వివక్షలు ఏమిటని కొం దరు ప్రశ్నిస్తున్నారు. మానవ విలువలను కాలరాస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా సమాజంలో మార్పు రావాలని మనిషిని మనిషిగా చూడాలే తప్ప కించపర్చడం సమంజసం కాదని పలువురు జరిగిన ఘట న పట్ల విస్మయం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ శ్మశాన వాటికలుంటే?
శ్మశాన వాటికలు వాటికి దారులు ప్రభుత్వం నిర్మించి ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదు. గ్రామాల అభివృద్ధికి, ప్రజల అవసరాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ గ్రామాల్లో ప్రజలకు సమస్యలు తప్పడంలేదు. ప్రతీ గ్రామంలో శ్మశాన వాటికలు, వాటికి దారులు నిర్మించాలి. కొన్ని చోట్ల శ్మశాన వాటికలు నిర్మించి బిల్లులు సకాలంలో రాకపోవడంతో మధ్యలోనే పనులు నిలిచిపోయాయి. సరిపడా బడ్జెట్ కేటాయించి నిలిచిపోయిన శ్మశాన వాటికలను పూర్తి చేసి, నూతన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాల్సిన అవసరముంది. ఇలాంటి పరిస్థితులు మరోసారి ఎక్కడా పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
సెల్ : 9493601339
దారి లేదని అడ్డుపడ్డారు
మా ఇంటి నుంచి శ్మశాన వాటికకు శవాన్ని తీసుకుపోదామంటే మాకు దారి లేదని మా కులస్థులే అడ్డుపడ్డారు. ఎంత బతిమిలాడినా కనికరించలేదు. రోడ్డుకు అడ్డంగా ముళ్ల పొదలు వేశారు. అయినా ఇబ్బందులు పడుతూ శవాన్ని పోలీసుల రక్షణ మధ్య తీసుకుపోయాం.
- గజ్జెగారి రాజమ్మ మతుని భార్య, చిన్నఘనపురం
కనికరించకుండా కులస్థులే అడ్డుపడ్డారు
నాన్న చనిపోయిన రోదనలో మేముంటే మానవత్వం లేని కొందరు తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ఆపై మా మీద దాడులు చేసేందుకు ప్రయత్నం చేశారు. మా ఇంటి నిర్మాణానికి అధికారులే దారి చూపాలి.
- భిక్షపతి, మతుని కుమారుడు చిన్నఘనపురం
మూఢ విశ్వాసాలను పెంచి పోషిస్తున్న పాలకులు
మూఢ విశ్వాసాలను అరికట్టాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్యాత్మిక భావజాలాన్ని పెంచి పోషిస్తూ కుల విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కుల వివక్ష పెద్ద ఎత్తున కొనసాగుతోంది. కుల వివక్షకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. తక్షణమే మృతుడి అంతిమయాత్రకు అడ్డుపడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- ఏ.మల్లేశం, సీపీఐ(ఎం) మెదక్ జిల్లా కార్యదర్శి
Authorization