అనంతోజు మోహన్ కృష్ణ
'నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి' అని మనువు ఏనాడన్నాడో, ఆనాటి నుండి భారత స్త్రీ పరిస్థితి అధోగతే అయింది. వీరేశలింగం చిన్నతనంలో తన ఇంట నాలుగు తరాల స్త్రీలను చూశాడు. వారు పెరిగిన తీరుతెన్నులన్నీ ఆయన పరిశీలించాడు. అందుకే ఆయనకు చిన్నతనం నుంచే స్త్రీల పట్ల గౌరవం వారి అసహాయ స్థితికి జాలి, వారిని పైకి తీసుకురావటానికి ఏదో చేయాలనే తపన సహజ గుణాలయ్యాయి.
స్త్రీలు అభివృద్ధి చెందాలంటే ముందుగా వారికి విద్య నేర్పించవలసిన అవసరం ఉందని గ్రహించి వీరేశలింగం విద్యార్థిగా ఉన్నప్పుడే స్త్రీల పక్షం వహించి పత్రికలకు రచనలు చేశారు. స్త్రీల స్థితిగతులు బాగుపడితే కానీ యావత్ దేశం బాగుపడదని గట్టిగా నమ్మిన వ్యక్తి. అందుకే స్త్రీకి విద్య అత్యంతావశ్యకం అని వాదించాడు. విద్య లేకపోవడం వలనే వారిలో మూఢ నమ్మకాల వంటివి పెరిగి అనారోగ్యం పాలవుతున్నారని తన తల్లిని దగ్గర నుండి చూడటం వలన మరింత బలంగా నమ్మాడు. అందుకే ఆయన స్త్రీలను విద్యావంతులను చేయడానికి నడుం కట్టాడు. అధ్యాపకునిగానే కాక, విద్యాదాతగా కూడా మారి ధవళేశ్వరంలో బాలికా పాఠశాలను ప్రారంభించేటట్టు చేశాడు. బహుశా తెలుగునాట ఇదే ప్రప్రథమ బాలికా పాఠశాల కావచ్చు.
స్త్రీలకు విద్య అవసరమా లేదా అనే చర్చలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో సంజీవని పత్రికలో, పురుషార్ధ ప్రదాయిని పత్రికలో స్త్రీ విద్యకు అనుకూలంగా కథనాలు రాసేవాడు వీరేశలింగం. స్త్రీ విద్యను శ్లాఘిస్తూ ''ముద్దియ విద్దియ పెద్ద కార్యమనుట ప్రసిద్ధము'' అనే వ్యాసాన్ని పురుషార్ధ ప్రదాయిని పత్రికలో రాశారు. ఇది సంప్రదాయ వాదులకు వ్యతిరేకంగా ఉండటంతో వివాదంగా మారి ఆయనపై దాడి చేసే పరిస్థితులను ఎదుర్కొన్నాడు. స్త్రీలను చైతన్యం చేయడానికి సులభశైలిలో అందరికి అర్థమయ్యేట్టుగా అనేక వ్యాసాలు రాశారు. స్త్రీ విద్య, దయ్యములు, విద్య, వైద్యములు, వైశ్యు లు, ఐకమత్యం, సత్యం, ప్రమాణ విచారణము, ఈశ్వర సద్భావము, యదార్థజ్ఞానము, ఆత్మ, భగవద్గుణములు, బ్రహ్మణులు వారి వత్తులు, సుగుణ దుర్గుణములు అనే వ్యాసాలు ప్రముఖమైనవి. 1874లో వివేకవర్ధని అనే పత్రికను ప్రారంభించి స్త్రీ విద్య అవసరంపై అనేక రచనలు చేశాడు. ఒకవైపు పత్రికా ముఖంగా పోరాటం చేస్తూనే క్షేత్ర స్థాయిలో ఆచరణలోకి దిగాడు కందుకూరి. బాలికా విద్యాభ్యాసం వలన లాభాలను వివరిస్తూ దవళేశ్వరంలోనే అనేక సభలు నిర్వహించడం ద్వారా క్రమంగా విముఖత చెందిన ప్రముఖులు కూడా బాలికా విద్య అవశ్యకమనే నిర్ణయానికి వచ్చి తమ స్వయం సంపాదనతో బాలికా పాఠశాలను నడిపించారు. ఈ విద్యా సంస్థ కుందుకూరి వారికి ''మానస పుత్రిక'' అనడంలో సందేహం లేదు.
స్త్రీలు కూడా పురుషులతో సమానంగా విద్యావివేకాలతో వృద్ధిలోకి వచ్చినప్పుడే ఉన్నత స్థితికి చేరుతారని నమ్మిన వ్యక్తి. ఇది గమనంలో లేకపోతే స్త్రీలతోపాటు పురుషులు కూడా పాతాళంలోకి పోతారనడంలో సందేహం లేదు అన్న అభిప్రాయం పంతులుగారిది. స్త్రీలకు తెలుగు భాషలో చదువుకొనటానికి, విజ్ఞానం పొందటానికి తగిన మంచి పుస్తకాలు లేవని గ్రహించి వారికోసమే ప్రత్యేకంగా సతీహిత బోధిని అనే పత్రికను 1883లో ప్రారంభించి ఎన్నో వ్యాసాలు, కథనాలు రాశారు.
కందుకూరి వీరేశలింగం తెలుగుజాతిని ముందుకు నడిపించిన ఘనుడు అనడంలో అతిశయోక్తి లేదు. తాను ఎన్నుకున్న మార్గంలో కడవరకు నడిచిన వీరుడు. ఆయన జీవితం బహుముఖీనం. వ్యక్తిగా తనను తాను సంస్కరించుకొంటూనే సంఘాన్ని సంస్కరించదలిచిన సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం. భాషను నవీన మార్గాలు పట్టించి, సంఘంలోని దురాచారాలపై కన్నెర్రజేసి, ప్రజోపయోగ భావాలను జనంలో నింపి, మతంలోని మర్మాలను విప్పిచెప్పి, తెలుగుజాతిని తట్టిలేపి, జనాన్ని జాగృతం చేసి, అభివృద్ధికి వారు ఏమార్గంలో నడవాలో తెలుపుతూ తెలుగుజాతికి ఒక కొత్త బాటవేసిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం.
'' మరణమునకు దక్క మరి తీరుబడిలేక
కలము దించనట్టి కవి వరుండు''
అని జాషువా అన్నట్టు ఆయన చివరి వరకు తన రచనలను ఆపలేదు. రచనలో విశిష్టత ఉండాలని నిత్యం తపించే వ్యక్తి కాబట్టే ఆయన చేతికి ఎముక లేదు అన్నట్టుగా రచనా వ్యాసాంగాలు కొనసాగించారు. ఆయన ఆలోచనలెప్పుడూ ఉన్నతమైన పదాల కోసం ప్రయాణిస్తుండేవి. ప్రాచీన కావ్యాలు చదివేటప్పుడు మహాకవియై ఉత్తమ కావ్యాలు రాయాలనే కోరిక బలంగా ఉండేది. కానీ ఐశ్వర్య, అధికారాలపై ఏనాడు మోజుపడలేదు. ముందుతరం వారైనా పొన్నగంటి, తిమ్మన, మరింగంటి సింగరాచార్యుల రచనలను చూసి వాటిలో మేడు లక్షణాలు ఒకే కావ్యంలో కూర్చి అనితర సాధ్యమైన కొత్త తోవను తొక్కాలని ఆయన సంకల్పం. ఆ సంకల్పంలో 1870లో 'శుద్దాంధ్రనిరోష్ఠ్య నిర్వచన నైషధం' అనే నలచరిత్ర కావ్యాన్ని రచించారు. అదే సమయంలో 'రసిక జన మనోరంజన' అనే మిత్ర ప్రబంధాన్ని రాశారు. దాని లో అచ్చతెలుగులో ఐదు అశ్వాసాల కావ్యంగా శుద్ధ ప్రబం ధాన్ని ప్రథమశాస్త్ర పరీక్షకు పాఠ్యగ్రంథంగా పెట్టారు.
పంతులు గారి రచనలు చదివిన అనేకమంది విద్యాధికులు, పండితులు ఆయనను 'అభినవ తిక్కన' అని పిలిచేవారు. ఆయన ఛాందసభావాలను వదిలించుకుని క్రమంగా అభ్యుదయ భావాలను అలవర్చుకున్నారు. స్త్రీ విద్యపై ఆయన వ్యాసాలు రాశారు. వివాదాలు తెచ్చిపెట్టినప్పటికి స్త్రీ విద్యకు అనుకూలంగా తన వాదాన్ని మరింత బలంగా వినిపించే రచనలు చేశారు. అందులో 'ముద్దియ విద్దియ పెద్దకార్యమనుట ప్రసిద్ధము'' అనే రచన చాలా గొప్పది. సంప్రదాయ వాదులకు ఆయన అంటే పొసగదు. వీరేశలింగం గద్యరచనలైన నవల, కథలు, స్త్రీ, పురుష జీవిత చరిత్రలు, వ్యాసాలు, ప్రవాసనములు, గ్రంథ విమర్శనములు, చారిత్రక గ్రంథాలు, పత్రికారచనలు, శాస్త్ర గ్రంథాలు, ఉపన్యాసాలు రాసి 'గద్యతిక్కన' బిరుదు అందుకున్నారు. 1872లో కోరంగిలో ప్రధానోపాధ్యాయునిగా పని చేస్తూనే 'శుద్ధాంధ్ర ఉత్తర రామాయణం', 'సంగ్రహ వ్యాకరణం' అనే తెలుగు వ్యాకరణాన్ని పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రాశారు. ఇది ఆంగ్ల వ్యాకరణ రచనా పద్ధతిలో రాయడంతో పాఠశాలలకు పాఠ్య గ్రంథంగా ఉంది. 1902 నాటికి 11సార్లు ఆ వ్యాకరణ గ్రంథం ముద్రితమైంది. తిరిగి 1994లో పునర్ముద్రణ జరిగింది. వీరేశలింగం చిన్నతరగతుల పిల్లల కోసం నీతి భాష అవసరాన్ని, ఉపయోగాన్ని సరైనా పద్ధతిలో అర్థం చేసుకున్న తొలి తెలుగు వ్యక్తి. పండితులకే పరిమితం కాకూడదనీ పామరులకూ అర్థమయ్యే భాషలో రాయాలని భావించే వ్యక్తి. 1876లో హాస్య సంజీవని అనే మరో పత్రికను స్థాపించారు. 'అభాగ్యోపాఖ్యానం'ని రాశారు. 'రసికజన మనోరంజనం' అనే అచ్చతెలుగు కావ్యం రాశారు. సంఘంలోని మూఢ విశ్వాసాలపై కలమెత్తి 'రాజశేఖర చరిత్ర'ను రాశారు. ఇది 1878లో వివేకవర్థిని పత్రికలో ప్రచురించబడి అనంతరం పుస్తకరూపంలో వచ్చింది. ఇది తెలుగులో వెలువడిన తొలి నవలగా చెప్పవచ్చు. దీని ఆంగ్ల అనువాదం ఇంగ్లండులో ఒక పత్రికలో ప్రచురించారు. ఇది కన్నడ భాషలోకి అనువదించబడింది. 1878లో 'శుద్ధాంద్ర భారత సంగ్రహం' కావ్యాన్ని, సంభాషణ రూపంలో 'బ్రాహ్మ వివాహం' అనే రూపకాన్ని రాశారు. అయితే ప్రజలలో ఇది 'పెద్దయ్యగారి పెండ్లి పుస్తకం' పేరుతో ప్రచుర్యంలోకి వచ్చింది. బాల్య వివాహం, వృద్ధ వివాహం, కన్యాశుల్కం మొదలైన దురాచారాల వలన కలిగే అనర్ధాలను తెలిపి జనులను వాటి నుంచి విముక్తులను చేయాలనే ఆలోచనతో 'ధర్మబోధిని' గ్రంథాన్ని రాశారు. దీనికి 'ఫ్లీడరు నాటకం'గా ప్రజలలో మంచి ఆదరణ లభించింది.
చిన్నయసూరి రచించిన నీతిచంద్రికలో మిత్రలాభం, మిత్రభేదం మాత్రమే ఉండటంతో, అది అసంపూర్తి గ్రంథంగా ఉందని అందులో సంధి, విగ్రహ అనే భాగాలను రాయాలని భావించిన పంతులుగారు విగ్రహం పేరుతో రెండో భాగాన్ని 'సంధి' అని మూడో భాగాన్ని రచించారు.
1880లో ధార్వాడ నాటక సమాజం వారు రాజమండ్రి వచ్చి నాటక ప్రదర్శనలు ఇచ్చి వెళ్లేవారు. అందుకోసం వేసిన పందిళ్లు తీయకముందే తన శిష్యుల చేత తాను రాసిన నాటకాలను వేయించేవారు పంతులు గారు. కాళిదాసు సంస్కృతంలో రాసిన 'అభిజ్ఞాన శాకుంతలం'ను తెలుగులో నాటకంగా రాసి ప్రదర్శించారు. శ్రీహర్షదేవ రాసిన 'రత్నావళి', షేక్స్పియర్ రాసిన 'కామిడీ ఆఫ్ ఎర్రర్స్' తెలుగులోకి అనువదించి నాటక ప్రదర్శన ఇచ్చేవారు. ఆ తరువాత 'రత్నావళి' నాటకం పాఠ్యాంశమైంది. రాగమంజరి, గోగ్రహణ, హరిశ్చంద్రోపాఖ్యానం, తిర్యగ్యిద్యన్మహాసభ, మహారణ్య పురాధినత్యము, ఆక్షేపగర్భ వంటి నాటకాలు రాసి ప్రదర్శించారు. అందుకే అనంతర కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కందుకూరి జయంతిని 'నాటక రంగ ' దినోత్సవంగా ప్రకటించింది.
సతీహిత బోధిని కోసం షేక్స్పియర్ నాటకాలను తెలుగులో రాసి ప్రచురించేవారు. ఇక్కడి ప్రాంతానికి తగిన విధంగా వాటిలోని పాత్రలను, సన్నివేశాలను మార్పులు చేసి 'పద్మినీ ప్రభాకరం', 'మాలతీమధుకరం' వంటి పేర్లతో రాసిన రచనలు అటూ స్త్రీలను, ఇటూ పురుషులనూ రంజింపచేసినవి.
''విద్యవలన జ్ఞానంబువెలయుగాన
నవని 'నిదిమంచి' 'యిది చెడ్డ' యనుచు దెలియ
బాలురును బోలె దప్పక బాలికలును
విద్యనేర్వంగవలయును హ ద్యముగను''
వీరేశలింగం ఒక్క స్త్రీవిద్యకే పరిమితం అవ్వలేదు. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా బాల్యవివాహాలు జరుపుతుంటే అవి సరికాదంటూ వారిని చైతన్యం చేసాడు. చిన్న వయసులోనే ఆడపిల్లలకు ముసలివాళ్లతో వివాహాలు చేయడం మంచిది కాదని చెప్పేవాడు. భర్త చనిపోతే వారి బతుకు అంధకారం కావద్దు. చిన్న వయసులోనే వితంతువులుగా మారి జీవితాంతం అందరిచేత మాటలు పడే వారి వ్యధను గమనించిన పంతులుగారు బాల్యవివాహాలపై తిరుగుబాటు చేశారు. తన దగ్గర చదువుకున్న విద్యార్థులను చైతన్యం చేసి వారి సహకారంతో అనేక బాల్య వివాహాలను అడ్డుకున్నాడు. అంతేకాదు బాల వితంతువులను చేరదీసి తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించి వారి బాధ్యతనంతా ఆయనే చూసుకున్నారు. ఆయన భార్య రాజ్యలక్ష్మమ్మ కూడా ఆయనకు పూర్తి చేయూతనిచ్చి ప్రతి విషయంలోనూ అండగా నిలబడింది. అందుకే ఆయన ఇన్ని పనులు చేయగలిగాడు. తన ఇల్లే వితంతు శరణాలయంగా మార్చివేశారు. ఆయన ప్రార్థనా సమాజాన్ని నిర్మిస్తే అందులోనే ఆమె మహిళలకు ఒక ప్రత్యేక మందిరాన్ని నెలకొల్పింది. అదే తొలి మహిళా ప్రార్థనా సమాజం. తన దగ్గరే ఆశ్రయం పొందుతున్న బాల వింతువులను చదివించడం కోసం తనే స్వయంగా విక్టోరియా బాలికా పాఠశాలను స్థాపించారు. వారికి వివాహం చేసి వారి కాపురం కుదురుకునే వరకు వారి బాగోగులు కూడా ఆయనే చూసేవారు. హితకారిణి సమాజాన్ని స్థాపించి మహిళా సమస్యలపై వారికి అండగా నిలిచాడు. వీరేశలింగం ప్రతి అడుగులోను ఆయన భార్య రాజ్యలక్ష్మమ్మ, ఆయన విద్యార్థులు, యువకులు చేయూతనందించారు. నిరంతరం మహిళా అభివృద్ధిని కాంక్షించిన కందుకూరి శత వర్థంతి సందర్భాన మహిళలపై జరుతున్న దాడులను అడ్డుకుంటూ వారికి అండగా నిలబడటమే కందుకూరికి సరైన నివాళి.
సెల్ : 8897765417
Authorization