రామాయణంలో లక్ష్మణుడు స్పృహ కోల్పోయినప్పుడు హనుమంతుడు సంజీవని అనే మొక్కను తెచ్చి, దానిని ఉపయోగించి లక్ష్మణున్ని స్పృహలోకి తెచ్చాడన్నది పురాణగాథ. అదేదో వాస్తవమనుకుని, ఆ మొక్కను గుర్తించి దాని ఔషధ లక్షణాలపై ప్రయోగాలు చేయాల్సిందిగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇదే పద్ధతిలో పరిశోధనలు చేయదలిస్తే ఇంకా చాలా విషయాలున్నాయి. రావణాసురుడు విదేశీయుడు వదిలేద్దాం. మరి మన శ్రీరాముడికి లక్ష్మణుడికి సీతకు ఆధార్ కార్డులుండేవా లేవా? పరిశోధన చేసి తేల్చుకోవాలి. మనదేశానికీ శ్రీలంకకూ మధ్య వానరాలు కట్టాయని చెప్పబడుతున్న 'వారధి' వెనక గల శాస్త్ర సాంకేతికను కనుక్కోవాల్సి ఉంది. అందుకు కూడా నిధులు కావాలి. ఈ శాస్త్రజ్ఞులేమిటీ అది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందేనని అంటున్నారూ? ఈ సారి హిందూత్వ పండితుల్ని పంపి అసలు విషయం నిగ్గు తేల్చాలి. అలాగే భూదేవికి సీత ఎలా పుట్టిందీ? పరిశోధనలు చేయాలి. అందుకు నిధులు కేటాయించండి. అంతకంటే ముందు దశరధుడు తన ముగ్గురు భార్యలకు సంతానప్రాప్తి కోసం పాయసం పంచాడు. పాయసంతో కూడా పిల్లలు పుడతారన్నది నిరూపించాలి. దీనికి నేటి కేంద్ర ప్రభుత్వం నిధులివ్వాలి. కాదంటే వారి ఏలుబడిలో ఉన్న ఏ రాష్ట్రం నుండైనా నిధులిప్పించాలి. ఎలాగైతేనేం? మనకు పరిశోధన ముఖ్యం!
మనుషుల వలె కోతులు కూడా పెండ్లి చేసుకుని సంసారాలు చేసినట్టు, రాజ్యాలేలినట్టు రామాయణంలో ఉంది. వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. వారు యుద్ధం చేస్తుండగా మ హా వీరుడైన రాముడు చెట్టుచాటున నిలబడి దొంగబాణం వేసి వాలిని హతమార్చాడు. వాలి భార్య సుగ్రీవుని స్వంతమవుతు ంది. ఈ సామాజిక నియమాలు మనుషుల నుండి కోతులు నేర్చుకున్నాయా లేక కోతుల నుండి మనుషులు నేర్చుకున్నారా? దీనికీ పరిశోధన అవసరమే! నిధులు కావల్సిందే! ఈ రోజు రామభక్తులే పెద్ద ఎత్తున రేప్లు చేస్తున్నారు కదా? వారికి స్ఫూర్తి ఎవరన్నది బయటికి తీయాలి. బంగారు లేళ్లు మనదేశంలోని అడవుల్లో ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి వన్యప్రాణి పరిశోధకుల్ని పురమాయించాలి. వారి ద్వారా రిపోర్టులు తెప్పించాలి. ఇక కనీసావసరాల మాటంటారా? అవి ఎప్పుడూ ఉండేవే. ఈ జనాలు ఒకనాటికి సంతృప్తి పడరు. అందువల్ల అలాంటి విషయాలు పక్కనపెట్టండి. ఇలాంటి విషయాలు దేశానికి చాలా ముఖ్యం. ప్రపంచ దేశాలు విస్తుపోవాలంటే మన పరిశోధనలు ఇలాగే ఉండాలి.
రావణుడి మరణానంతరం శ్రీరామచంద్రుడు పుష్పక విమా నమెక్కి అయోధ్య చేరతాడు. ఆ పుష్పక విమానంలో ఎంతమం ది కూర్చున్నా మరొకరికి చోటు ఉంటూనే ఉంటుంది. మనకున్న డిమాండ్ను బట్టి ఇంజన్ లేని విమానాలు, సీట్లు పెరుగుతూ పోయే విమానాలు ఇప్పుడు అవసరం! ఇప్పుడున్న విమాన సర్వీసుల్ని ఆపి, పుష్పక విమాన సర్వీసుల్ని ప్రారంభించాలి. ఇకపోతే రాముడు వేల సంవత్సరాలు ఎలా బతికాడు? ఎలా రాజ్యమేలాడు? రామరాజ్యంలోని సుగుణాలేమిటీ? తెలుసుకో వాలంటే పరిశోధనలే శరణ్యం! మరి ఎలా? నిధులు కావాలి కదా? అంత గొప్ప ప్రజారంజకుడైన రాముడు ఓ రజకుడి మాటలకు చలించిపోయి, భార్య సీతను అడవులకు పంపాడు. ఎందుకూ? ఆయన మానసిక స్థితిగతులపై తక్షణమే మానసిక నిపుణులు పరిశోధనలు ప్రారంభించాలి!
బ్రహ్మవల్ల ఈ సృష్టి జరిగిందని మన భారతదేశంలో బాగా ప్రచారం జరిగింది. ఈ సృష్టికి మూలకారకుడు సృష్టికర్త బ్రహ్మ అన్న రహస్యం అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, జపాన్ లాంటి ఏ ప్రపంచ దేశాలకూ తెలియదు. అందుకే మనదేశం ప్రపంచంలోనే నెంబర్వన్! మూఢనమ్మకాల కేతనం ఇక్కడ ఎగిరినంత ఎత్తుగా మరేదేశంలోనూ ఎగరదు. మత సహనం, భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశ ప్రత్యేకతలని ఒకప్పుడు చెప్పుకునే వాళ్లం. ఇప్పుడు అవి అడుగున పడిపోయాయి. ఏకత్వాన్ని చిన్నాభిన్నం చేసేవారే పాలకులైనప్పుడు జనం 'అసహన-సంతోషం'లో తలలు బాదుకుంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో పరిశోధనలు చేయించాలి. ఇందుకు అఘోరాలని, నాగబాబాలని ప్రత్యేకంగా నియమించాలి. వారైతేనే భూస్థాపితమైన పవిత్ర అనాగరిక సంప్రదాయాల్ని నిష్టతో పైకి తెస్తారు. 'మనకు మోక్షం రాదు, ఎందుకంటే మన భక్తి తొమ్మిది తమలపాకులు, ఐదు కొబ్బరి కాయలు, ఏడు ఖర్జూరాలు, ముప్పావు కిలో గోధుమ పిండి దగ్గరే ఆగిపోయింది' అని ఎవరో అజ్ఞాని సెలవిచ్చాడట! ఇందులో కొంత నిజం ఉంటే ఉండొచ్చు గాక, కానీ, అవన్నీ కలిపితే తయారయ్యే, మహాప్రసాదం రుచి, ప్రపంచంలో మరోచోట మనకు లభిస్తుందా చెప్పండి! జ్ఞాన రుచి తెలియని మనుషులకు ఏం చెప్పగలం?
జాకీర్ అనే మత బోధకుడు కొలంబస్ చేసినంతటి పరిశీలన చేసి శ్రమించి ఒక గొప్ప అద్భుత దివ్య విషయాన్ని బహిర్గతం చేశాడు. అదేమంటే సైన్సు విభాగాలన్నీ మొత్తానికి మొత్తంగా ఖురాన్ నుండి తీసుకున్నవేనని తేల్చాడు. అందుకు ఒక ఉదాహరణ కూడా ఇచ్చాడు. ''క్వాంటమ్ ఫిజిక్స్లోని క్యు.యు అనే రెండు ఇంగ్లీషు అక్షరాలు, ఖురాన్లోని మొదటి రెండక్షరాలే కదా?'' అని అన్నాడు. అబ్బో ఎంత తెలివో!'' జనవరి 8, 1942న ఉత్తర నక్షత్రం కన్యరాశిలో పుట్టిన స్టీఫెన్ హాకింగ్ని ప్రపంచానికి ఏదో తెలియజేయాలని, అంటే సైన్సును అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఒక మేధావిగా తయారుచేసిన కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామివారికి నమస్సుమాంజలి'' అని ప్రకటించారు ఓ రాజకీయ, సినీ జ్యోతిష్యులవారు. చూశారా! ఎంత పరిశోధన చేసి కనుగొన్నారో ఆయన? అదే ఈ స్వామి అనే జ్యోతిష్యుణ్ణి ఆ దేవుడు పరాన్నజీవిగా, ఒక వ్యర్ధప్రాణిగా ఎందుకు తీర్చిదిద్దాడూ? అనేది మరెవరైనా పరిశోధించి చెప్పాలేమో! ఆయన మీద ఆయన పరిశోధన చేసుకోలేడు కాబట్టి!! సాధువు, సన్యాసి, బాబా, గురువు అంటే సర్వసంగ పరిత్యాగి అని ఒకప్పుడు అపార్థం చేసుకున్నారు. అసలైతే వారు సర్వభోగాలు అనుభవించేవారన్నది నేడు మనం చూస్తున్న వాస్తవం. అందుకే వారు మంత్రులై, ముఖ్యమంత్రులై జనాన్ని 'సమాధి'లోకి తీసుకుపోతున్నారు.
శనేశ్వరాలయంలో శనిత్రయోదశినాడు 'అఘోర పాశుపత హోమం' చేస్తారు. అది విద్య, ఆర్థిక, వివాహ, కోర్టు, వ్యాపార, వ్యవహార జయమునకు జరుపుతామని ప్రకటిస్తారు. జీవన సమస్యలన్నీ ఇందులో కుదించి, చక్కగా జనాలందరినీ పాపులను చేసి, పక్షపాతం లేకుండా అందరికీ శనిపట్టించి పూజలు చేస్తారన్నమాట. రాశుల ప్రకారం శని ఎలా ఉంటుందో ఒకసారి వీక్షించండి. 1.వృషభరాశి - అష్టమ శని, 2. కన్యరాశి - అర్దాష్టమ శని, 3.వృశ్చిక రాశి - ఎలినాటి శని, 4.ధనస్సు రాశి - ఎలినాటి శని, 5. మకర రాశి - ఎలినాటి శని, 6. మిథునరాశి - సప్తమ శని, 7.సింహరాశి - పంచమ శని ఇలా అన్నమాట! ప్రజలెవ్వరూ తమకు శనిలేదేమని నిరాశా నిస్పృహలకు లోను కాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. అసలు ఈ శని పూజలే జనానికి పట్టిన పెద్దశని అని - ఇది శని పేరుతో సాగే వ్యాపారమని గిట్టనివాళ్లెవరో అంటే గింటే ఏమవుతుంది? గవర్నర్లు, ముఖ్యమంత్రులు, వీవీఐపీలే ఈ దేశానికి శనిలా పట్టారని.. అబ్బే ఇప్పుడప్పుడే ప్రజలు గ్రహించలేరు.
జింకను బాణంతో చంపిన రాముడు దేవుడైతే, ఇప్పుడు అదే జంతువును తుపాకీతో చంపిన బాలీవుడ్ నటుడేమిటి నేరస్తుడయ్యాడూ? అని అన్నదానికి ఒక సంప్రదాయ పండితుడు చక్కని వివరణ ఇచ్చాడు.. 'సంప్రదాయాలు పాటించకపోతే దోషాలు ఇలాగే ఉంటాయనీ, అతను బాణం ఉపయోగించి ఉంటే ఫలితం వేరుగా ఉండేదని' వివరించాడు. సంప్రదాయాలు తు.చ. తప్పక ఎందుకు పాటించాలో జనం అర్థం చేసుకోవాలన్నాడు. ఇక్కడ మనకు పరిశోధన కోసం రెండు అంశాలు దొరికాయి. 1. శని ఇన్ని రూపాలుగా ఉంటుందా? ఉండదా? 2. సంప్రదాయాలు కచ్చితంగా పాటించకపోతే కలిగే నష్టాలు. ''ఈ దేశంలో సినీ యాక్టర్లకు, ఆటగాళ్లకు ఉన్న గుర్తింపు ప్రజలకు పనికొచ్చే ఉపకరణాలు కనుగొన్న శాస్త్రవేత్తలకు లేదు. ఇది ఎంతో విచారించాల్సిన విషయం కాదు, భోరున దు:ఖించాల్సిన విషయం'' అని కొందరు విలవిలాడుతుంటారు. కానీ, వారు ప్రభుత్వ పాలసీలో వచ్చిన మార్పులు గమనించడం లేదు. పనికిరాని కొద్దిమందిని గౌరవించుకుంటే.. ఇక మిగతావారంతా పనికొచ్చేవారని ప్రభుత్వం గుర్తించినట్టే కదా?
ఐజాక్ న్యూటన్ చలన సూత్రాలన్నీ తమ మంత్రాల్లో ఉన్నాయని నరేంద్రమోడీ మంత్రివర్గంలో ఉన్న సత్యపాల్సింగ్ చెప్పారు. విమానాలు కనిపెట్టిన ఘనత అనవసరంగా రైట్ సోదరులకు దక్కిందని, అసలైతే శివకర్ బాపూజీ తల్పడే అనే అతను తొలిసారి ఎగిరే మోటర్ని కనిపెట్టాడనీ, ఈ విషయం దేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో బోధించాలని అన్నారు. ఇది ఇలా ఉంటే వై.సుదర్శన్రావు అనే హిస్టారికల్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ మరో కొత్త విషయం చెప్పారు. రామాయణ భారత కాలం నాటికే విమానాలున్నాయని, మూలకణాల పరిశోధన అప్పుడే జరిగిందని, కాస్మిక్ వెపన్స్ ఐదువేల ఏండ్ల క్రితమే ఈ దేశంలో ఉన్నాయని సెలవిచ్చారు. నిజమే కాబోలు పరిశోధనలు చేయించి విషయం తేటతెల్లం చేయండి. స్వయాన దేశ ప్రధానే వినాయకుడిది ప్లాస్టిక్ సర్జరీ అనీ, కర్ణుడి పుట్టుకకు ముందే దేశంలో జన్యుశాస్త్రం ఉందనీ దేశ ప్రజలకు ఉపదేశించారు. పరిశోధన కమిటీలు వేసి ఆధారాలు, వెలికితీయండి. జనం చెప్పింది చెప్పినట్టుగా వినరు. ఊరికే అన్నింటికీ 'ఆధార్'లు అడుగుతుంటారు. వారినోరు మూయించాలి కదా?
''ఇంటర్నెట్, సాటిలైట్ కమ్యూనికేషన్ యూరోపియన్లు, అమెరికన్లు ప్రపంచానికి అందించారని అనుకోవడం బుద్దితక్కువ. ఇవి మనదేశంలో భారత కాలానికే ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు రాజభవనంలో అంధుడైన దృతరాష్ట్రుడికి సంజయుడు రన్నింగ్ కామెంటరీ వినిపించాడు. ఇంటర్నెట్, సాటిలైట్ కమ్యూనికేషన్ ఉన్నందువల్లనే కదా సంజయుడు యుద్ధం చూడగలిగాడూ?'' అని ప్రశ్నించాడు త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ (విప్లవ్ దేవ్). వ్యాసమహర్షి ద్వారా సంజయుడికి దివ్యదృష్టి ప్రసాదించబడిందని భారతంలో చెప్పబడింది నిజమే. కానీ, ఆ దివ్యదృష్టి అంటే ఇంటర్నెట్టే అని ధృవీకరించారు ఈ భారతజాతి ఆశాజ్యోతి నలభైఏడేండ్ల ముఖ్యమంత్రి! ఈ విషయం మీద కూడా క్షుణ్ణంగా పరిశోధనలు జరగాలి. దయచేసి నిధులు కేటాయించండి. రాజస్థాన్ ప్రభుత్వం సివిల్స్ పరీక్షలో భగవద్గీతను ఒక అంశంగా పెట్టింది. వేదాల్లో సైన్సు ఉందని చెప్పే కేంద్ర మంత్రులున్నప్పుడు రాష్ట్రాల్లో ఈ మాత్రం చేయలేరా? అయితే ఒకటి మాత్రం నిజం! ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. ప్రభుత్వ పెద్దల మెదళ్లు పనిచేస్తున్నాయా లేదా అన్నది జనం నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉంటారు.
ఐజాక్ న్యూటన్ చలన సూత్రాలన్నీ తమ మంత్రాల్లో ఉన్నాయని నరేంద్రమోడీ మంత్రివర్గంలో ఉన్న సత్యపాల్సింగ్ చెప్పారు. విమానాలు కనిపెట్టిన ఘనత అనవసరంగా రైట్ సోదరులకు దక్కిందని, అసలైతే శివకర్ బాపూజీ తల్పడే అనే అతను తొలిసారి ఎగిరే మోటర్ని కనిపెట్టాడనీ, ఈ విషయం దేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో బోధించాలని అన్నారు. ఇది ఇలా ఉంటే వై.సుదర్శన్రావు అనే హిస్టారికల్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ మరో కొత్త విషయం చెప్పారు. రామాయణ భారత కాలం నాటికే విమానాలున్నాయని, మూలకణాల పరిశోధన అప్పుడే జరిగిందని, కాస్మిక్ వెపన్స్ ఐదువేల ఏండ్ల క్రితమే ఈ దేశంలో ఉన్నాయని సెలవిచ్చారు. స్వయాన దేశ ప్రధానే వినాయకుడిది ప్లాస్టిక్ సర్జరీ అనీ, కర్ణుడి పుట్టుకకు ముందే దేశంలో జన్యుశాస్త్రం ఉందనీ దేశ ప్రజలకు ఉపదేశించారు. పరిశోధన కమిటీలు వేసి ఆధారాలు, వెలికితీయండి. జనం చెప్పింది చెప్పినట్టుగా వినరు. ఊరికే అన్నింటికీ 'ఆధార్'లు అడుగుతుంటారు. వారినోరు మూయించాలి కదా?
- డాక్టర్ దేవరాజు మహారాజు
సెల్: 9573706806
Authorization