ముహమ్మద్ ముజాహిద్
అసెంబ్లీ, పార్లమెంటుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు జైశ్రీరామ్ అని నినదిస్తుంటే వారి భక్తులు బయట ముస్లింల నోట ఆ నినాదాలు అనిపించాలని బలవంతపెడుతున్నారు. తలకెక్కిన ఈ మతోన్మాదంతో జై శ్రీరామ్ అని చెప్పిస్తూ అమానుషంగా చంపేసి పైశాచికానందం పొందుతున్నారు. పశ్చిమ బెంగాల్లోనూ ఓ మదర్సా టీచర్ హాఫిజ్ ముహమ్మద్ షారూఖ్ను రైలులో జై శ్రీరామ్ అనమని దౌర్జన్యం చేశారు. ఆ టీచర్ ఎదురుతిరిగితే అతనిపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. కదులుతున్న రైలులోనుంచి కిందికి తోసేశారు. జార్ఖండ్లో తబ్రేజ్ అన్సారీ ఘటన జరిగిన మూడు రోజుల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయవాదం, దేశభక్తితో మొదలైన నినాదాలు ఇప్పుడు మతమౌఢ్యంతో చెలరేగిపోతున్నాయి. యుగపురుషుడిగా భారతకోటి ప్రజానీకం మన్ననలందుకున్న శ్రీరాముడి పేరును విధ్వేషానికి, హింసకు ప్రతీకగా మారుస్తున్న మతోన్మాదుల ఆగడాలకు కత్తెరపడేదెన్నడు?
దేశంలో భీతావహపరిస్థితులు నెలకొన్నాయి. మైనారిటీలను భయ భ్రాంతులకు గురిచేసేలా జరుగుతున్న దాడులపై ప్రభుత్వమూ చేష్టలుడిగి చూస్తోంది. ప్రజాసంఘాలు, బాధితులు ఎంతగా గొంతు చించుకున్నా పాలకులకు చీమ కుట్టి నట్టు కూడా లేదు. దుండగులపై చట్టపరమైన చర్యలు మృగ్యమయ్యాయి. జార్ఖండ్లో తబ్రేజ్ అన్సారీ హంతకులను కటకటాల పాలు చేయాల్సిందిపోయి బాధితుడిపైనే దొంగతనం కేసు నమోదు చేశారు. అదుపులో ఉన్న హంతకులను బయటికి తెచ్చేందుకు పోలీసులు కుట్రపన్నారని బాధితులు మండిపడుతున్నారు. భర్తను కోల్పోయి రోడ్డున పడ్డ తబ్రేజ్ భార్యకు పోలీసులు అండగా ఉండి, హంతకులను శిక్షించాల్సిందిపోయి నిందితులకే కొమ్ము కాయడం సిగ్గుచేటు. తబ్రేజ్ అన్సారీ హత్య ఘటన పార్లమెంటు ఉభయసభల్లోనూ దూమారం రేపింది. ప్రధాని ఈ ఘటనను చాలా సులువుగా కొట్టిపారేశారు. జార్ఖండ్లో తబ్రేజ్ హంతకులను కాపాడేందుకు కేసును మసి పూసి మారేడు కాయచేస్తున్నారు. తబ్రేజ్పై బైకు దొంగతనం ఆరోపణలు మోపి హంతకులను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. దొంగతనం చేసినంత మాత్రానికే జై శ్రీరామ్, జై హనుమాన్ అని బలవంతంగా చెప్పించి అమానుషంగా చంపేసే అధికారం వీళ్లకెవరిచ్చారు? 300కుపైగా ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని అయిన మోడీ జార్ఖండ్లో తబ్రేజ్ ఘటన విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపించి మాట్లాడితే ఇలాంటి ఘటనలు దేశంలో మరెక్కడా పునరావృతం కాకుండా ఉండే అవకాశముండేది.
పూనాలో ఉంటూ వెల్డింగ్ పని చేసుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్న తబ్రేజ్ మరణంతో ఆ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. పార్లమెంటు సభల్లో ట్రిపుల్ తలాక్ను రద్దుచేసే బిల్లును మతం దృష్టితో చూడవద్దని చెప్పే ప్రధాని మోడీకి మూకదాడుల్లో తమ భర్తలను కోల్పోయి వితంతువులుగా మారుతున్న ముస్లిం మహిళల కన్నీళ్లు కానరావడం లేదా? తలాక్ కంటే కూడా మూకదాడులు ముస్లిం మహిళలకు తీరని దు:ఖాన్ని కలిగిస్తున్నాయి. దీనిపై చట్టం ఎందుకు చేయడంలేదు? తలాక్ వివాదం ముస్లింల అంతర్గత సమస్య. ఈ సమస్యను ముస్లిం మత సంస్థలు చర్చల ద్వారా ఓ కొలిక్కి తెచ్చుకోగలవు. ఇందులో ప్రభుత్వ జోక్యం అవసరమేలేదు. దేశంలో పెట్రేగిపోతున్న మూకస్వామ్యాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఒక వర్గం వారు మైనారిటీ వర్గానికి చెందిన వారి ప్రాణాలు తోడేస్తున్నా ఈ ప్రమాదకరమైన సంస్కృతికి తక్షణమే అడ్డుకట్టవేసే బాధ్యత ప్రభుత్వానిది కాదా? గోహత్య అనుమానంతో, జైశ్రీరామ్ అని అనమంటూ ప్రాణాలు తోడేస్తున్నా ప్రభుత్వం పట్టనట్టు మౌనంగా వ్యవహరించడం దేనికి సంకేతం? ముమ్మారు తలాక్ వల్ల ముస్లిం మహిళలకు ఏదో అన్యాయం జరిగిపోతుందంటూ మొసలికన్నీరు కార్చే ప్రధాని, మూకదాడుల్లో ప్రాణాలు తీస్తూ ఆ కుటుంబాలను దిక్కులేనివారిని చేస్తున్న గో ఉగ్రవాదులపై ఎందుకంత మెతకవైఖరి కనబరుస్తున్నారు.
గోహత్య నిషేధం, గుంపుదాడుల దాకా, దేశభక్తి నిరూపించుకోవడం నుంచి వందేమాతరం దాకా, జాతీయ వాదం నుంచి యోగా దాకా, జై శ్రీరాం నుంచి జై హనుమాన్ ఇవీ వీరి నినాదాలు. ఈ నినాదాలు ముస్లింలను భయభ్రాంతులకు గురిచేసి తమ చెప్పుచేతుల్లో పెట్టుకోవడానికే. మోడీ గత ఐదేండ్ల పాలనలో పలు రాష్ట్రాల్లో గోహత్యపై నిషేధం విధించారు. దీనికోసం చాలాచోట్ల చట్ట సవరణలూ చేశారు. కానీ గో మాంసం ఎగుమతిలో ప్రపంచంలోనే మనదేశం మొదటి స్థానంలో ఉంది. గోహత్య నిషేధం అమలులో ఉన్నప్పటికీ ఇదెలా సాధ్యమైందో ఈ రహస్యమెవరికీ తెలియదు. దేశంలో ఉన్న గోమాంస ఎగుమతిదారులంతా హిందువులే కాబట్టి ఈ విషయం బయటికి పొక్కదు. ఆవు స్లాటర్ హౌస్లపై ఎలాంటి దాడులూ జరగవు. ఎలాంటి చర్యలూ ఉండవు. కానీ సమాజం లో విధ్వేషాన్ని, హింసను రాజేసి రాజకీయాలు చేసేందుకు మాత్రం గోహత్య అంశాన్ని సాకుగా చేసుకుంటారు. గోవులను దొంగిలించారనీ, ఆవులను చంపేస్తున్నారనే అనుమానంతో ఎంతోమంది దళితులు, ముస్లింల ప్రాణాలను తోడేశారు. అల్వార్లో అక్బర్ను, జార్ఖండ్లో తబ్రేజ్ అన్సారీని హతమార్చిన ఘటనలు, దాద్రిలో అఖ్లాక్... ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ముస్లింలు, దళితులు ప్రాణాలు కోల్పోయారు.
అసెంబ్లీ, పార్లమెంటుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు జైశ్రీరామ్ అని నినదిస్తుంటే వారి భక్తులు బయట ముస్లింల నోట ఆ నినాదాలు అనిపించాలని బలవంతపెడుతున్నారు. తలకెక్కిన ఈ మతోన్మాదంతో జై శ్రీరామ్ అని చెప్పిస్తూ అమానుషంగా చంపేసి పైశాచికానందం పొందుతున్నారు. పశ్చిమ బెంగాల్లోనూ ఓ మదర్సా టీచర్ హాఫిజ్ ముహమ్మద్ షారూఖ్ను రైలులో జై శ్రీరామ్ అనమని దౌర్జన్యం చేశారు. ఆ టీచర్ ఎదురుతిరిగితే అతనిపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. కదులుతున్న రైలులో నుంచి కిందికి తోసేశారు. జార్ఖండ్లో తబ్రేజ్ అన్సారీ ఘటన జరిగిన మూడు రోజుల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయవాదం, దేశభక్తితో మొదలైన నినాదాలు ఇప్పుడు మతమౌఢ్యంతో చెలరేగిపోతున్నాయి. యుగపురుషుడిగా భారతకోటి ప్రజానీకం మన్ననలందుకున్న శ్రీరాముడి పేరును విధ్వేషానికి, హింసకు ప్రతీకగా మారుస్తున్న మతోన్మాదుల ఆగడాలకు కత్తెరపడేదెన్నడు?
1999 జనవరి 22న మొట్టమొదటి మూకదాడి ఒడిశాలో జరిగిందని అనుకోవచ్చు. భజరంగ్దళ్ అల్లరి మూక ఆరోజు రాత్రి ఒడిశా రాజధానికి 250కి.మీ. దూరంలో ఉన్న ఓ గిరిజన గ్రామంలో కుష్టు రోగుల సేవ పేరుచెప్పి క్రైస్తవమత ప్రచారం చేస్తున్నారని గ్రాహమ్ స్టీన్ అతని ఇద్దరి పిల్లల్ని సజీవ దహనం చేశారు. ఈ హత్యారోపణ భజరంగ్ దళ్ నాయకుడు దారాసింగ్పై మోపబడింది. ఈ నేరం రుజువై అతనిపై ఉరి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఆ తరువాత అతని విజ్ఞప్తి మేరకు ఈ శిక్ష జీవిత ఖైదుగా మార్చబడింది. మోడీ కేబినెట్లో మంత్రిగా ఉన్న ప్రతాప్ చంద్రసారంగి అప్పటి భజరంగ్ దళ్ కోర్డినేటర్గా ఉన్నాడు. ఒడిశా మోడీగా అతన్ని పిలుస్తారు. ఇప్పుడు ఘనతవహించిన సారంగి వందేమాతరం చెప్పని వారికి ఈ దేశంలో ఉండే హక్కులేదని హెచ్చరికలు చేస్తున్నారు. ఒడిషాలో మొదటి మూకదాడి జరిగి ఇరవై ఏండ్లు గడిచిపోయినప్పటికీ తప్పుడు వార్తలు, బూటకపు వార్తలు ప్రచారం చేసి పథకం ప్రకారం మైనారిటీల ప్రాణాలు తోడేస్తున్న ఘటనలు నేటికీ జరుగుతున్నాయి. గోహత్య, పిల్లలను ఎత్తుకెళ్తున్నారని, జైశ్రీరామ్ అనమని చెప్పి ముస్లింలను లక్ష్యంగా చేసుకుని దాడులు, హత్యలు జరుగుతున్నాయి. తన భర్త, పిల్లల హత్యానంతరం కూడా ఆస్ట్రేలియాకు చెందిన గ్రాహమ్ స్టీన్ భార్య భారతగడ్డపైనే ఉంటూ కుష్టు రోగులకు సేవచేస్తోంది. ఆ తరువాత ఆమె చేసిన సేవలకు గాను పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారామె. గత మూడేళ్లక్రితం ఇండియాను వదిలి తమ స్వదేశానికి వెళ్లిపోయింది.
జార్ఖండ్లో తబ్రేజ్ అన్సారీపై జరిగిన అమానుషం మొదటిదేం కాదు. దశాబ్దకాలంగా వందలాది దాడులు జరిగాయి. ఇందులో 98మంది మృత్యువాతపడ్డారు. ఇందులో 60శాతం మంది ముస్లింలే ప్రాణాలు కోల్పాయారు. ఈ ఘటనలన్నీ ఎక్కువశాతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరిగాయని నివేదికలు చెబుతున్నాయి. తబ్రేజ్ ఘటన కూడా బీజేపీ పాలిత రాష్ట్రంలోనే జరిగింది. ఒక్క ఘటన జరిగినంత మాత్రానికే జార్ఖండ్ ముఖ్యమంత్రి బాధ్యుడు కాడని ప్రధాని మోడీ అంటున్నారు. మోదీజీ కేవలం ఒక్క ఘటనగానే దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఒక్క జార్ఖండ్ రాష్ట్రంలోనే 19 మూకదాడులు జరిగిన విషయం తెలియదా?
ఈ మూకదాడులకు బాధ్యులెవరు? రానున్న సమీప భవిష్యత్తులో ఈ ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? రాజకీయ సాధికారతతోనే సామాజిక, ఆర్థిక పురోభివృద్ధి సాధ్యమవుతుంది. ఏ సమాజమైనా బలమైన రాజకీయ శక్తిగా ఎదిగినప్పుడే సామాజిక, ఆర్థిక పురోగతి సాధించగలదు. ఈ దేశానికి ప్రాణపదమైన మత సామరస్యం ఇప్పుడు ప్రమాదంలో ఉంది. దానిని కాపాడుకోవడానికి అవసరమైన రాజకీయ చైతన్యం ఇప్పుడు మన కర్తవ్యం కావాలి. చదవండి, ఏకమవ్వండి, గళమెత్తండి అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు మార్గం కావాలి.
సెల్: 9640622076
Authorization