పరిపూర్ణం
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అత్యంత అవమానకర సాంఘిక దురాచారాలైన దేవదాసి, జోగిని, బసవి, మాతంగుల వ్యవస్థ బలంగా సాగింది. మతం ముసుగులో దళిత మహిళలను లైంగిక వాంఛ తీర్చుకోవడానికి అగ్రవర్ణాలు, భూస్వాములు, పూజారులు కలిసి జోగిని వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రపంచంలో ఎక్కడా లేని ఈ ఆచారం ఈ ప్రాంతంలో అధికంగా ఉంది. దీనివల్ల జోగినిగా మార్చబడిన దళిత మహిళలు సమాజం చేత నేడు అవమానాల పాలవుతున్నారు. ఓ తల్లి తమ పిల్లలకు తండ్రి ఎవరని చెప్పలేని పరిస్థితి. వారి పిల్లలను మీ తండ్రి ఎవరో చెప్పాలని నానా మాటలంటూ అధికారులే అవహేళన చేస్తున్నారు. సమాజం ఈసడించుకుంటుంటే ఎవరికి చెప్పాలో తెలియక బాధితులు లోలోపల కుమిలి, కృషించిపోతున్నారు. ఆధునిక టెక్నాలజీవైపు అడుగులు వేస్తున్న ఈ తరుణంలో కూడా ఇలాంటి సాంఘిక దూరాచారాలు కొనసాగడం సిగ్గుచేటు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 5వేల మంది జోగినీలున్నారు. అనధికారికంగా 10 వేల మందికి పైగానే ఉంటారు. వీరిని అదుకుంటామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. అధికారికంగా గుర్తించిన వారిలో ఇప్పటివరకు 500 మందికి మాత్రమే పింఛన్లు అందుతున్నాయి. మిగితా వారికి పింఛన్లు ఇవ్వడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఎలాంటి ఆస్తులు లేని జోగినీలకు ప్రభుత్వ ఆదరణ కూడా లేకపోవడంతో వీరు యాచకులుగా జీవనం సాగిస్తున్నారు. ఉట్కూరు, నారాయణపేట, దన్వాడ, దామరగిద్ద, మక్తల్, సిసికుంట, పొలెపల్లి, బోమ్రాసిపేట, దౌల్తాబాద్, కోయిల్కొండ ప్రాంతాలలో అధికంగా జోగినీలున్నారు. ప్రభుత్వం వీరికి డబల్బెడ్రూములు నిర్మించి ఇవ్వడమే గాక వీరి పిల్లలకు ఉచిత విద్యాబోధన అందిస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ ఇప్పటి అమలుకు నోచుకోలేదు. దీంతో వీరంతా ఆర్ధాకలితో అలమటిస్తున్నారు.
జోగిని వ్యవస్థ గురించి...
భూస్వామ్య వ్యవస్థలో స్థానిక దేవతల సేవకోసం అంటూ... దళిత స్త్రీలను సామాజిక వ్యబిచారం కోసం జోగినీల పేరుతో ఈ రొంపిలోకి దించేవారు. ఒకసారి జోగినిగా మారితే.. ఇక ఆమె జీవితం ఆంధకారమవుతుంది. ముఖ్యంగా ఈమె భూస్వాములకు ఉంపుడుగత్తెగా జీవితాంతం ఉండాల్సిందే. వివాహం కాని ఆడపిల్లలను గ్రామానికి దత్తత ఇవ్వడాన్ని జోగిని అంటారు. ఒకప్పడు ఒకే కుటుంబానికి చెందిన వారిని జోగినీలుగా మార్చేవారు. అనంతరం ఆ గ్రామంలోని దళితులు ఎవరు అందంగా ఉంటే వారిని జోగినీగా మార్చే ఆచారం మొదలైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికంగా వీరుంటారు. లింగంపల్లి జాతరలో జోగినీల నోటికి తాళం వేస్తారు. జనుంపల్లి జాతరలో వీరికి పసుపు పూసి వేపాకు కట్టి గ్రామాలలో ఊరేగింపు చేస్తారు.
ఈ వ్యవస్థ నిర్మూలన కోసం అనేకమంది కృషి చేశారు. ముఖ్యంగా జోగిని వ్యవస్థపై ''మతం ముసుగులో వ్యబిచారం'' అనే పుస్తకాన్ని వకుళాభరణం రచించారు. జోగిని వ్యవస్థపై శాంతప్రబోధ, లక్ష్మికాంతం మోహన్, జగడం బోయ జంగయ్య, మట్టి మనుషులు వైఆర్ దాసాని తదితరులు రచనలు చేశారు. ఈ వ్యవస్థను రూపుమాపడానికి అనేక చట్టాలు కూడా ఉన్నాయి. 1929లో బ్రిటిష్ కాలంలో బాలిక రక్షణ చట్టం తెచ్చారు. 1982లో జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఉద్యమం నడిచింది. 1922లోనే జోగిని వ్యవస్థను రూపుమాపాలని జగన్ మిత్రమండలి సభ్యుడు భాగ్యరెడ్డి కృషి చేశారు. 1956లో యూఎన్ఓ సాధారణ సభ అధికరణం 10 ద్వారా బానిసత్వ నిషేధం పేరతో ఒక చట్టాన్ని తెచ్చారు. 1984లో నిజామాబాద్ కలెక్టర్ ఆశామూర్తి జోగిని వ్యవస్థను రూపుమాపడానికి తన వంతు కృషి చేశాడు. 1987లో నిజామాబాద్ జిల్లాలో వర్ని గ్రామంలో నాస్తిక మిత్రమండలి సభ్యులు మాలిని రామకృష్ణారావు ''చెల్లి నిలయం'' ఏర్పాటు చేశారు.1934లో బొంబాయి దేవదాసి చట్టం, 1940లో మద్రాస్ దేవదాసి చట్టం, 1940లో మైసూర్ దేవదాసి చట్టం, 1947లో దేవదాసి నిషేధం చట్టం, 1982లో ఆంధ్రపదేశ్ జోగిని వ్యవస్థ నిషేధ చట్టం వంటి చట్టాలు తీసుకొచ్చారు. మరికొందరు జోగినీల సంక్షేమ కార్యక్రమాలతోపాటు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. 1988లో అంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోగినీ వ్యవస్థ నిర్మూలన చట్టం చేసింది. జోగినీ వ్యవస్థ వ్యతిరేక సంస్థ పాలమూరులో ఏర్పడింది. ఆ సంస్థకు అధక్షురాలిగా గ్రేస్ నిర్మల, కార్యదర్శిగా హజమ్మ ఉండి పాలమూరులో జోగినీ వ్యవస్థ నిర్మూలనకు అనేక ఉద్యమాలు చేపడుతున్నారు. సంఘ సంస్కర్త నారాయణస్వామి జోగినీ వ్యవస్థను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో కేసు వేశారు. దీంతో జస్టిస్ రఘునాథరావు కమిషన్ను ఏర్పాటు చేసింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం తండ్రి ఆస్తిల్లో వీరికి సమాన హక్కు ఉందని కోర్టు తీర్పు చెప్పింది.
జోగినీలపై భూస్వాముల ఆంక్షలు ఇవి...
జోగినీగా మారిన మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండ్లి చేసుకోరాదు. ఒకవేళ ఊరు నిబంధనలను ధిక్కరిస్తే... గ్రామంలో వారికి తగిన శిక్ష పడుతుంది. ప్రతి మంగళ, శుక్రవారం ఉపవాసం ఉండాలి. ఎవరు ఏమన్నా.. ఎదురు మాట్లాడరాదు. ఎదురుమాట్లాడితే కట్టుబాట్లను ధిక్కరించినవారవుతారు. రోజుకు ఐదు ఇండ్లలో బిక్షాటన చేసి వారు ఇచ్చిన ఆహారాన్ని తీసుకోవాలి, గోవులను తల్లిదండ్రులు, కన్న బిడ్డలకంటే ప్రేమగా చూసుకోవాలని వారిని ఆదేశిస్తారు.
సెల్ : 9490099324
ఊహ తెలియని వయసులోనే మార్చారు
నాకు జోగిని అంటే ఏమిటో తెలియకముందే నన్ను ఈ రొంపిలోకి దించారు. వయసు వచ్చిన తర్వాత నీవు జోగినివి కదా అంటే అప్పుడు తెలిసింది. నా జీవితం అంధకారమైంది. నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. సొంత ఆస్తులు లేక వారు కూడా ఆడుక్కుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నాకు పింఛను, ఇతర సౌకర్యాలు కల్పించాలి.
- గౌరమ్మ, బాధితురాలు, ఉట్కూరు
తండ్రి ఎవరో చెప్పమంటే ఏం చెప్పాలి
బడికిపోయినా, పదిమందిలో తిరిగినా నాబిడ్డను ''మీ తండ్రి పేరు ఏమిట''ని అడుగుతున్నారు. వారు ఏమని సమాధానం చెప్పాలి. మాకు ఇష్టముండి ఈ వృత్తిలోకి రాలేదు. గ్రామ పెద్దల పేరుతో బలవంతంగా రుద్దిన ఈ పనికి శిక్ష మాకెందుకు?. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ మాకు అందడం లేదు. ఇప్పటికైనా మాపై వివక్ష చూపకుండా మమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకోవాలి.
- పుల్లమ్మ, బాధితురాలు, ఉట్కూరు
ప్రస్తుతం జోగినిగా ఎవరూ మారడం లేదు
గతంలో ఇక్కడ జోగినీ వ్యవస్థ బలంగా ఉండేది. ఇప్పుడు ఆ రొంపిలోకి ఎవ్వరూ వెళ్లడం లేదు. సమాజం మారుతూ... వస్తోంది కదా.. ఇలాంటి పనుల్లోకి ఎవరు వెళ్తారు. సమాజంలో ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని అనుకుంటారు.
- భీమయ్య,తహశీల్దార్, ఉట్కూర్
Authorization