పాలకుర్తిలో 1945లో శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభను దేశముఖ్ అనుచరులు భగం చేశారు. దేశ్ముఖ్ అనుచరులను సంఘం నాయకులు చితకబాదటంతో దేశ్ముఖ్ ఆగ్రహం చెంది సంఘం నాయకులు, ఐలమ్మ కుటుంబంపై తప్పుడు కేసులు బనాయించారు. అయితే అందరూ నిర్ధోషులుగా బయటపడగా తన ఓటమిని జీర్ణించుకోలేని దేశ్ముఖ్ పలుమార్లు పాలకుర్తి గ్రామంపై దాడులుచేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. పాలకుర్తి పోలీసు పటేల్ వీరమనేని శేషగిరిరావు దేశ్ముఖ్ను ప్రేరేపించి ఐలమ్మ పండించిన పంటను స్వాధీనం చేసుకోవడానికి కుట్రపన్నాడు. భూమి తనదేనంటూ తప్పుడు కాగితాలు సృష్టించాడు. దీంతో ఐలమ్మ కమ్యూనిస్టు పార్టీ నల్లగొండ జిల్లా నాయకత్వం సహకారం తీసుకొని పార్టీ నాయకత్వంతో పాలకుర్తిలో మకాంపెట్టించి భూపోరాటానికి కార్యకర్తలను సిద్ధం చేసింది.
గుమ్మడిరాజు నరేష్
కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు నిజాం నవాబు నిరంకుశత్వాన్నీ, దేశ్ముఖ్ల ఆగడాలు, నిరంకుశత్వాన్ని ఎదిరించారు. భూస్వాముల దోపిడీకి, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగింది. దొరల ఆగడాలు, అన్యాయాన్ని ఎదిరించి సమరశంఖం పూరించిన అగ్నికణం చాకలి (చిట్యాల) ఐలమ్మ. జనగామ జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నడుం బిగించి పోరాడింది. రాచరిక పాలనపై స్వారీ చేయడానికి ఎర్రజెండా చేతబట్టి పోరాటానికి సై అంటూ ముందుకు సాగింది. భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం నిజాం నిరంకుశ క్రూరత్వపు పాలనలో దోపిడీకి వ్యతిరేకంగా ఐలమ్మ చూపిన తెగువ, ధైర్య సాహసాలు ఎర్రజెండా నీడలో ఆమె సాగించిన వీరోచిత పోరాటమే ఆమెకు చరిత్రలో సమున్నత స్థానం కల్పించింది.
సెప్టెంబర్ 10న పోరాటాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఐలమ్మ 34వ వర్ధంతి. ప్రపంచ పోరాటాల్లో చరిత్ర పుటల్లోకి ఎక్కిన పోరాటంగా పేరుగాంచింది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఐలమ్మ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పోతిరెడ్డిపల్లి శివారులో క్రిష్టాపురంలో 1895లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఓరుగంటి మల్లమ్మ, సాయిలు. ఐలమ్మకు 13వ ఏటనే పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు సంతానం. ఐలమ్మ మల్లంపల్లి జమీందార్ వద్ద వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని పంట సాగుచేసింది. అదే సమయంలో ఆంధ్ర మహాసభలోనూ చురుకుగా పాల్గొన్నది. అప్పటికే పాలకుర్తి పోలీస్ పటేల్తో ఐలమ్మకు విరోధం ఏర్పడింది. 1944లో పేదరైతులను భూముల నుంచి వెళ్లగొట్టాలని రైతులు పండించుకున్న పంటలను దేశముఖ్ గుండాలు దౌర్జన్యంగా కోసుకెళ్లడం, అడ్డుకున్న రైతాంగాన్ని చితకబాదడం అత్యంత క్రూరమైన వెట్టిచాకిరీ అమలు జరుగుతున్న రోజులవి. ఆర్థికంగా వెనకబడిన వృత్తిదారుల కుటుంబాల స్త్రీలు దొరల పొలాల్లో వెట్టిచాకిరీ చేయాల్సిందే. అంతటి క్రూరమైన పరిస్థితులను ఎదిరించిన ఐలమ్మ కుటుంబం ఆర్థికంగా చాలా వెనుకబడింది. ప్రధానంగా కులవృత్తే జీవనాధారం. చిన్నతనం నుండి చురుగ్గా ఉండేది. పుట్టింది పేద రజక వృత్తిదారుల కుటుంబంలోనైనా తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూనే సంఘం కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేది. పాలకుర్తిలో 1945లో శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభను దేశముఖ్ అనుచరులు భగం చేశారు. దేశ్ముఖ్ అనుచరులను సంఘం నాయకులు చితకబాదటంతో దేశ్ముఖ్ ఆగ్రహం చెంది సంఘం నాయకులు, ఐలమ్మ కుటుంబంపై తప్పుడు కేసులు బనాయించారు. అయితే అందరూ నిర్ధోషులుగా బయటపడగా తన ఓటమిని జీర్ణించుకోలేని దేశ్ముఖ్ పలుమార్లు పాలకుర్తి గ్రామంపై దాడులుచేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. పాలకుర్తి పోలీసు పటేల్ వీరమనేని శేషగిరిరావు దేశ్ముఖ్ను ప్రేరేపించి ఐలమ్మ పండించిన పంటను స్వాధీనం చేసుకోవడానికి కుట్రపన్నాడు. భూమి తనదేనంటూ తప్పుడు కాగితాలు సృష్టించాడు. దీంతో ఐలమ్మ కమ్యూనిస్టు పార్టీ నల్లగొండ జిల్లా నాయకత్వం సహకారం తీసుకొని పార్టీ నాయకత్వంతో పాలకుర్తిలో మకాంపెట్టించి భూపోరాటానికి కార్యకర్తలను సిద్ధం చేసింది. ఆ సమయంలో దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి ఐలమ్మ పంటను దోచుకురావాలని గూండాలను ప్రేరేపించారు. విషయం తెలుసుకున్న నాయకులు దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీంరెడ్డి నర్సింహారెడ్డి, కల్కూరి రామచంద్రారెడ్డి, చకిలం యాదగిరి, వెంకటరెడ్డి, ధర్మభిక్షం, ఆవుల పిచ్చయ్య, నీలం విశ్వనాధం, నిత్యాల కృష్ణమూర్తి, సుల్ల ప్రతాపరెడ్డి పాలకుర్తికి చెందిన 28 మంది వాలింటర్లు దేశ్ముఖ్ కిరాయి మూకలను అడ్డుకున్నారు. పంట పొలంలో అడుగు పెట్టనీయకుండా, ఎదురొడ్డి పోరాడారు.
ఆంధ్రమహాసభకు జై, దేశ్ముఖ్ దౌర్జన్యాలు నశించాలంటూ కమ్యూనిస్టులు నినాదాలు చేస్తూ పంటను కోసి ఐలమ్మ ఇంటికి చేర్చారు. దేశ్ముఖ్ అక్రమ కేసులు బనాయించినా ఐలమ్మ కుటుంబం అధైర్యపడకుండా ఇంటిని పార్టీ కార్యాలయంగా మార్చుకుని పోరాటాలు నిర్వహించింది. అంతేకాకుండా ఆ అమ్మ పోరాట పటిమకు ఆకర్షితులైన ప్రజలు పోలీస్ పటేల్ గడీపై దాడిచేశారు. అదే స్థలంలో మొక్కజొన్న పంట వేశారు. పాలకుర్తి గ్రామం నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రముఖపాత్ర పోషించింది.
ఐలమ్మకు వ్యవసాయం అంది వచ్చింది. అనతికాలంలోనే ఆసామిగా ఎదిగింది. ఒక భవంతి నిర్మించుకుంది. అణగారిన ప్రజలకు ఆదర్శమైన ఒక పెద్దదిక్కుగా నిలిచింది. తాత్కాలికంగా వచ్చిన ఈ ఆర్థిక హోదా సాంస్కృతిక హోదా చూసి ఓర్వలేని భూస్వాములు పాలకుర్తికి మూడు కిలోమీటర్ల దూరాన ఉన్న విస్నూర్ గ్రామ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి వద్దకు చేరి ఎలాగైనా ఐలమ్మను పతనం చేయాలని పథకాలు వేశారు. సాగుచేస్తున్న భూమి స్వంతదారు కొండల్రావును పిలిపించి ఆ భూమిని తానే కొన్నట్టు దేశ్ముఖ్ కాగితాలు సృష్టించాడు. అదునుకోసం ఎదురు చూస్తున్న విస్నూర్ దొర ఐలమ్మ పొలంలో పంట చేతికొచ్చే సమయానికి ఆ పంట తనకే చెందుతుందని పండిన పంటను కోసుకురావాల్సిందిగా భూమిపైకి గూండాలను పంపారు. ఐలమ్మలో కోపం కట్టలు తెంచుకుంది. సంఘం నాయకులు ఐలమ్మ పంటను కాపాడటానికి జనాన్ని సమీకరించారు. దీంతో గూండాలు కాలికి బుద్ధి చెప్పారు. అది తెలుసుకున్న పుచ్చలపల్లి సుందరయ్య పాలకుర్తిలోని ఐలమ్మ ఇంటికి చేరి ఆమె ఇంటి ఆవరణలోనే అరుణపతాకాన్ని ఎగురవేశారు. అప్పటి నుండి ఐలమ్మ కుటుంబమంతా ధైర్య సాహసాలతో కమ్యూనిస్టు పార్టీ అండ చేరారు. ఆ కుటుంబం పార్టీతోనే ఎదుగుతూ వచ్చింది.
ఐలమ్మకు వచ్చిన పరపతి (సహకార, అండ) ధిక్కారం చూసి విసునూరు దేశ్ముఖ్ సహించలేకపోయాడు. ఆమెపై అక్రమ కేసులు బనాయించారు. ఐలమ్మ భర్త కొడుకులను సైతం అకారణంగా జైల్లో పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. అయినా ఐలమ్మ ధైర్యంగా పోరాడింది. తన ఇంటిని సంఘం కార్యాలయానికి ఇచ్చి సంఘం కార్యకలాపాలకు తోడ్పడింది. యుద్ధ వ్యూహాలు నేర్చిన ఆర్గనైజరైంది. ఆయుధమెత్తిన గెరిల్లానే కాదు. జన సమీకరణ జరిపే నాయకురాలైంది. ఆమె బుర్రకథలు, నాటకాలు, కళాకారిణిగా ప్రజలను చైతన్యం చేయడంలో కూడా తన వంతు కృషి చేసింది. ఎంతోమంది యువతీయువకులను చైతన్యపరచి వాలంటీర్స్గా తయారు చేసింది.
అదే ప్రాంతంలో పనిచేసిన భీంరెడ్డి నర్సింహారెడ్డి, చకిలం యాదగిరిరావు, కల్కూరి రాంచంద్రారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, నల్ల నర్సింహులు, మల్లు స్వరాజ్యం మద్దికాయల ఓంకార్ లాంటి వారితో కలిసి ఆమె పార్టీ కోసం పూర్తిగా అంకితమైంది. ఆమె చేసిన అన్ని పోరాటాల్లో వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం సాగించిన పోరాటమే అత్యంత ప్రధానమైనది. కాని నేడు భూస్వామ్య భావజాలంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రశ్నించే హక్కు లేదంటూ నిర్బంధానికి గురిచేస్తోంది. భూస్వామ్య పోకడలు, రాచరికపు వ్యవస్థ లక్షణం ప్రదర్శిస్తోంది. కల్లబొల్లి మాటలతో గారడీచేస్తూ, ప్రజలను మోసం చేస్తున్నారు. ఎన్నికల ముందు డబుల్బెడ్రూమ్ ఇండ్లు, ఉచిత విద్యా, 3 ఎకరాల భూమి వంటి అనేక హామీలు ఇచ్చి, ఏ ఒక్క హామీనీ అమలు చేయకుండా దాటవేస్తోంది. స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలైనా ఇక్కడి అణగారిన ప్రజలకు స్వేచ్ఛలేదు. సామాజికంగా రాజకీయంగా, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వివక్షకు గురవుతున్నారు. మహిళలకు రక్షణ లేదు. పసిపిల్లలపై లైంగికంగా దాడిచేసి హత్యలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని మద్యం మత్తులో ముంచారు. ఉపాధి, విద్యా, వైద్య సదుపాయాలు కరువవుతున్నాయి. హక్కుల కోసం పోరాడే వారిపై వారి ఉపాధిని దెబ్బతీస్తూ, ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు. కోర్టు తీర్పులను సైతం లెక్క చేయకుండా ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా డబ్బులతో వ్యాపారం చేస్తున్నారు.
వీటన్నింటిని ఎదుర్కొని నిలబడాలంటే ఐలమ్మ సాగించిన పోరాటమే ఆదర్శం. ఐలమ్మ దొరల గడీలమీద యుద్ధం చేసే ధైర్యం చేసింది. ఆ అమ్మ పోరాటం ఆ గ్రామంలోని వారినేగాక చుట్టుపక్కల గ్రామాలైన బమ్మెర, దర్ధపల్లి, విస్నూర్, లక్ష్మక్కపల్లి, ముల్లంపల్లి, వావిలాల, ముత్తారం, ఏడునూతుల, కొడకండ్ల, మొండ్రాయి, తమ్మడపల్లి, జఫర్గడ్డ, గూడూరు, ఇప్పగూడెం, తొర్రూర్, సిర్సన్నగూడెం, ఇరవెన్నుల లాంటి గ్రామాల్లో ప్రజలను ఎంతగానో ఉత్తేజపరిచింది. మూడువేల గ్రామాలలో గ్రామరాజ్యాలు స్థాపించి 10 లక్షల ఎకరాలకు పైగా పేద ప్రజలకు భూమి పంపిణీ చేసిన, ఆ మహత్తర పోరాటానికి తొలిఘట్టం చాకలి ఐలమ్మ పోరాటం. ఆ పోరాటంలో మహిళగా ధైర్యంతో ముందు నిలబడింది. ఐలమ్మ పోరాట పటిమ నేటికీ, భవిష్యత్తు తరాలకు ఆదర్శం. అలాంటి వీరవనిత విగ్రహం ట్యాంక్బండ్పై పెట్టాలని ప్రజలు కోరుతుంటే ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు.
ఐలమ్మ స్ఫూర్తితో ప్రజలు హక్కులకోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 10 సెప్టెంబర్ 1985న ఐలమ్మ కన్నుమూసింది. వీరవనిత ఆశయ స్ఫూర్తిని కొనసాగించాలి. నేటికీ గ్రామాల్లో, పట్టణాల్లో భూస్వాములు, పెత్తందార్లు, పెట్టుబడిదారులు, గ్రామీణ ప్రజలను అన్ని విధాలుగా దోచుకుంటున్నారు. అడుగడుగునా కుల వివక్ష, మహిళల పట్ల వివక్ష కొనసాగుతున్నది. దోపిడీకి వ్యతిరేకంగా, వివక్షకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి పోరాడటమే ఐలమ్మకు నిజమైన నివాళి.
సెల్ : 9491039520
Authorization