మహారాష్ట్రలోని కున్భీకాపు వ్యవసాయ కులం (ఓబీసీ)లో 1630 ఫిబ్రవరి 19న పుట్టిన శివాజీ ఏ సింహాసన వారసత్వం లేకుండా స్వశక్తితో ఒక రాజ్యాన్ని స్థాపించిండు. శివాజీ జీవితం ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్న బహుజనులకు వీపు మీద ఒక చరుపులాంటిది. రాజ్యం కాదు ప్రజలు తమదిగా భావించే స్వరాజ్యంలో రైతులు, స్త్రీలు, అస్ఫృశ్యులు, గిరిజనులు, సామాన్యులను ఎలా భాగస్వామ్యం చేయాలి. రాజ్య నిర్మాణం ఎలా ఉండాలి అనే ప్రణాళికకు ఆయన పాలనా విధానం మాతృకలాంటిది.
జాతీయ భావన లేని, దేశ ప్రేమ లేని, విదేశీ ఆర్య బ్రాహ్మణీయ ఆధిపత్య గుంపు, శారీరక శ్రమ తెలియని గుంపు, తమ స్వార్థం కోసం ఎవరు కొత్త రాజుగా వచ్చినా పరుగెత్తి వెళ్లి పాదాల చెంత మోకరిల్లి విధేయతను ప్రకటించుకుంటుంది. కులకర్ణిలుగా (పట్వారీ), దేశముఖ్లు, దేశపాండేలు, జాగీర్దారులుగా తమ పీఠాలకు డోకా లేదనే హామీ తీసుకొని అడుగులకు మడుగులొత్తుతూ, పాదాలను తమ చేతుల్లోకి తీసుకొని తమకు నచ్చిన రీతిలో పాలన సాగిస్తూ దేశాన్ని వేల ఏండ్లుగా బానిసత్వంలో ఉంచుతూ ప్రజలను, రైతులను వేధించుకు చంపుతూ ఖజానా నింపుతుండేవారు. అలా రాజ్యమంటే దోపిడీ అనీ రాజు అంటే క్రూరుడనీ ప్రజలు భావిస్తున్న కాలంలో.., రైతులకు భూములని కొలిపించి న్యాయమైన పన్ను నిర్ణయం చేసి కరువు సమయంలో పన్ను మినహా యింపునివ్వడమే గాకుండా అదనపు సా యాన్ని అందించి దేశముఖ్, దేశపాండేలు తన రాజ్యంలో గతంలోలాగా అరాచకా లకు పాల్పడితే సహించేది లేదనీ వాళ్లు కూడా ఏ హంగు, ఆర్భాటాలు లేకుండా రైతుల వలే సాధారణ ఇండ్లల్లో నివాసం ఉండాలనీ హుకుం జారీ చేశాడు. సామాన్య ప్రజలకు ఈ దేశం మీద ప్రేమ కల్పించిన భారతదేశ అతి సామాన్య వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్.
శూద్రుడైన ఛత్రపతి శివాజీ సైన్యం లో ఉన్న వారు ఒక తరం చచ్చిపోతే మళ్లీ పిల్లలు పుట్టి పెరిగేదాకా వేచి చూసే బలహీన తక్కువ సంఖ్యగల క్షత్రీయ సైన్యం కాదు. అది ఈ దేశమూల వాసులైన ముస్లింలు (మతం మారిన వారు) ఆస్పృశ్యులు ( మహర్ మాంగ్ ), గిరిజనులు (రా మోషి), మంగలి, చాకలి, సకల కులాలు మొదలు పంట పూర్తైనంక ఆక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు సైన్యంలో ఇష్టంగా పెద్ద ఎత్తున పని చేసిన రైతులది. శ్రమతో సంబంధం గల ఈ మట్టి మనుషులు, రైతులు బయట స్త్రీలు కనిపిస్తే తమ ఇండ్లల్లో తల్లి కూతుళ్లను గుర్తుకు తెచ్చుకుంటారే తప్ప మానభంగం చేయరు. పంటలు గొల్లగొట్టరు. నాశనం చేయరు. తమ రాజు ఇస్తున్న సరిపోయే జీతాలవల్ల రాజు ఆజ్ఞ ప్రకారం డబ్బులివ్వకుండా ఎవరి దగ్గర వస్తువులు తిండి పదార్థాలు జబర్దస్తీగా తీసుకోరు.
శివాజీ దళితులని సైన్యంలోకి తీసుకొని వారిని దుర్గాధిపతులని చేసిండు. అలా సైన్యంలోకి చేరిన తొలితరం సైనికులనుండే తర్వాతి కాలంలో మహార్ కులానికి చెందిన బాబాసాహెబ్ అంబేద్కర్ తండ్రి రామ్జీ సక్పాల్ సైన్యంలో సుబేధార్ స్థాయికి చేరిండు. శివాజీ గూఢాచారి విభాగం (ఇంటెలిజెన్స్) అధిపతి బాహిర్జీ నాయక్ గిరిజన రామోషి తెగ వ్యక్తి (బంజారా ఇక్కడ లంబాడా). ఇతని వారసుడు క్రాంతివీర్ మాజీ నాయక్ మరాఠ సామ్రాజ్యం కుప్పకూలిన దశలో బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి ఉరితీయబడ్డడు. నౌకాదళంలో సముద్రంలో చేపలు పట్టే కోలీ (ముదిరాజ్), సొంకాలీ, భండారీ లాంటి బెస్త కులాల మట్టి మనుషులని నావికాదళ సైన్యంగా మార్చిండు. అది జాతీయ సైన్యం. అది దేశమంటే తమ రాజ్యమంటే ప్రేమ గల నిజమైన సైన్యం. బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి. క్షత్రీయులు మాత్రమే యుద్ధాలు చేయాలి, రాజ్యమేలాలి. వైశ్యులు మాత్రమే వ్యాపారం చేయాలి. శూద్రులు పై మూడు వర్గాలకు సేవ చేయాలన్న భావనలు బలంగా ఉన్న కాలంలో నాలుగు శాతం ఉన్న క్షత్రీయులు మాత్రమే యుద్ధం చేస్తే ఈ దేశాన్ని కాపాడుకోలేమని గ్రహించిన వ్యవసాయ కులానికి చెందిన మరో కున్భీకాపు సంత్ తుకారాం ( భక్త తుకారాం) గురువుగా ఛత్రపతి శివాజీకి హితబోధ చేస్తాడు. తన తల్లి జిజావు కుల, మత బేధం లేని తమ పూర్వీకుడైన బలిచక్రవర్తి రాజ్యాన్ని ఈ దేశంలో తిరిగి తీసుకురావాలని ఉగ్గుపాలతో బోధిస్తుంది. ఆ మేరకు శివాజీ రాజ్యంలో జూన్ నుండి అక్టోబర్ నాటికి పంట చేతికి వచ్చినంక రైతులందరు దసరాకి సైనిక శిక్షణ తీసుకొని సంక్రాంతి నుండి యుద్ధాలలో పాల్గొని శివాజి సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తరు.
శివాజీ సైన్యంలో పెద్ద ఎత్తున రైతులతోపాటు మిగతా శూద్రులు, అతిశూద్రులు (దళితులు), ఆదివాసీ రామోషి లాంటి తెగలు, ముస్లింలు (మతం మారిన ఈ దేశ మూలనివాసీలు) పనిచేసిండ్రు. ఆంగ్లేయులు మన దేశాన్ని వదిలి పోయి డెబ్బై సంవత్సరాలు అవుతున్నా పరిపాలనా / అధికార భాషగా ఆంగ్లమును కొనసాగిస్తూ సాధారణ గ్రామీణ ప్రజలనుండి గ్రాడ్యుయేట్ వరకు బ్యాంక్లో ఖాతా ఎలా ఓపెన్ చేయాలో తెలియని ప్రస్తుత పరిస్ధితిని పోల్చుకుంటే... ఛత్రపతి శివాజీ తన కాలంలో పరిపాలన భాష అయినా పర్షియన్ని తొలగించి ప్రజల భాష మరాఠీనే పరిపాలన భాషగా చేసిండు. స్వదేశీ వాణిజ్యం పరిశ్రమలు కాపాడేందుకు విదేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువుల మీద ఆ రోజుల్లోనే భారీ సుంకాలు విధించిండు. భారతదేశంలో స్త్రీ, పురుషులని సంతల్లో అమ్మడం, కొనడం చేసే రోజుల్లో బానిస వ్యాపారాన్ని నిషేధించిండు.
స్త్రీల విషయంలో శివాజీ చాలా ఉన్నతమైన వైఖరి కలిగి ఉన్న వ్యక్తి. 1678లో సైన్యాధిపతి శకూజీ గైక్వాడ్ చేలాది దుర్గం ముట్టడించి సావిత్రిబాయి దేశారు అనే ఆ దుర్గాధిపతిని మానభంగం చేస్తే శివాజీ కండ్లు పీకించి యావజ్జీవ కారాగారవాసం విధించిండు. కళ్యాణ్ సుబేదార్ని ఓడించాక ఆమె కోడలిని ఒక యోధుడు శివాజీకి కానుకగా సమర్పిస్తే ఆమెని చూసి శివాజీ 'మా అమ్మ ఇంత అందంగా ఉంటే నేనెంత అందంగా ఉండేవాడినేమో!' అని ఆమెని తిరిగి సగౌరవంగా వెనక్కి పంపిస్తాడు. రాంజ గ్రామ అధికారి పాటిల్ ఓ పేద రైతు కూతురిని మానభంగం చేస్తే ఆత్మహత్య చేసుకుంటది. అది తెలిసిన శివాజీ పాటిల్ కాళ్లు చేతులు ఖండించే తీవ్రమైన శిక్షని విధించి వెంటనే అమలు చేస్తాడు. శివాజీ తీర్పు విన్నంక రంగే పాటిల్ అక్కడ ఉన్న దాదాజి కొండదేవ్తో 'అర్హత ఉన్న వాళ్లే తీర్పు చెప్పాలి, ఆ అధికారం బ్రాహ్మణుడికి ఉంటుంది లేదా రాజుకి ఉంటుంది కాని శూద్రుడైన శివాజికుండదు' అని శివాజీ కులాన్ని ప్రశ్నిస్తాడు. ఒక సువిశాల మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన శివాజీకి పట్టాభిషేకం చెయ్యడానికి ఏ బ్రాహ్మణుడు ముందుకు రాలేదు. కారణం శివాజీ శూద్రుడు కాబట్టి. హిందు ధర్మశాస్త్రాల ప్రకారం బ్రాహ్మణులకు, క్షత్రీయులకు మాత్రమే రాజయ్యే హక్కు ఉంది. దాంతో శివాజీ పట్టాభిషేక కార్యక్రమానికి కాశీ నుండి గగాభట్ అనే బ్రహ్మాణున్ని అతని బరువుకు సరితూగే బంగారం ఇస్తానని ఒప్పించి రాజ్యాభిషేకం చెయ్యడానికి పిలిపిస్తే కాలి బొటన వేలుతో గగాభటుడు శివాజీ నుదిటికి తిలకం దిద్ది రాజ్యాభిషేకం చేస్తాడు. వ్యక్తిగతంగా శివాజీకి బ్రాహ్మణులు అందరు వ్యతిరేకం కాకపోవచ్చు. కానీ బ్రాహ్మణ ధర్మం కులం పేరిట ఒక మహా చక్రవర్తిని అవమా నించింది. శూద్రులు రాజులు కాకూడదని చెప్పింది. ముసల్మాన్ రాజు కావచ్చు కానీ శూద్రుడు కాలేడు. మహా చక్రవర్తి ఐన శివాజీని జీవితాంతం వెంటాడిన బ్రాహ్మణ వాదం ఆ తర్వాత కాలంలో తన పబ్బం గడుపుకునేందుకు శివాజీని ముస్లిం వ్యతిరేకిగా కరుడుగట్టిన హిందూ మతాబి óమానిగా చిత్రించి చరిత్రని వక్రీకరించింది. శివాజీని స్వయం శక్తి లేని వాడుగా భవానీ మాత ఖడ్గం ప్రసాదించినట్టు మూఢవిశ్వాసాన్ని ప్రచారం చేసారు. నిజానికి ఆధునికవాది (మోడ్రన్) అయిన శివాజీ ఆ కత్తిని పోర్చుగల్లో తయారు చేయించిండు. శివాజీ వాడిన ఆ ఖడ్గం ప్రస్తుతం సతారా మ్యూజియంలో ఉంది. దానిపై పోర్చుగీస్ లిపి ఉంది. ఛత్రపతి బ్రాహ్మణమతానికి లోబడి పని చేసిండు. అవలంభించిండు. కానీ మత దురాభిమాని కాదు. అప్పటి మొఘల్ చక్రవర్తికి వ్యతిరేకంగా స్వరాజ్య స్థాపన కోసం పని చేసిండే తప్ప ముస్లిములకు వ్యతిరేకంగా కాదు. శివాజీని ముస్లిం మత వ్యతిరేకిగా ప్రచారం చేసి తప్పుడు జాతీయవాదానికి ప్రతీకగా నిలబెట్టారు. శివాజీ ముస్లిం వ్యతిరేకి ఐతే తన సైన్యంలో మూడోవంతు ముస్లిములెలా ఉంటారు? శివాజి ముస్లిం వ్యతిరేకి అయితే శివాజీ సాయుధ దళాలలో ముఖ్యమైన ఆయధాగార అధిపతిగా ఇబ్రహీం ఖాన్ని ఎలా నియమించుకుంటాడు ?
శివాజీ నౌకాదళాధిపతి దౌలత్ ఖాన్ ఒక ముస్లిం. శివాజీ అంగరక్షకుడు మదాని మెహతర్ ఒక ముస్లిం. ఈ మదాని మెహతర్ శివాజీని ఔరంగజేబ్ ఆగ్రాలో బంధించినపుడు మారు వేషంలో శివాజీ కోసం తన ప్రాణాలొడ్డి తప్పించుకునేందుకు సాయం చేస్తాడు. శివాజీకి సన్నిహితుడు, విదేశీ వ్యవహారాల మంత్రి ముల్లా హైదర్ ఒక ముస్లిం. సలేది యుద్ధం తర్వాత ఔరంగజేబు సైన్యాధికార్లతో సత్సంబంధాల కోసం శివాజీ తన తరపున దూతగా కాజీ హైదర్ అనే ముస్లింని పంపిస్తాడు. శివాజీ తన రాజభవనం ముందు ప్రార్థన కోసం దర్గాని కట్టించిండు. ఉర్దూ నిఘంటువును అభివృద్ధి పరిచిండు. అటువంటి గొప్ప ఈ దేశ బహుజన మూలవాసి చక్రవర్తి శివాజీని ఈ రోజు బ్రహ్మానీకరణం చేసి, మనల్ని మోసం చేస్తుంటే దాన్ని తెలుసుకోకుండా మతం మత్తులో ఆధిపత్య హిందూత్వ మాయాజాలంలో నిండా మునిగి తెలివిలేక పావులా బీసీలు మారడం విచారకరం.
ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధి కోసం నెల రోజులు నడక ద్వారా పోయి 12 ఫిబ్రవరి, 1874న రాయగఢ్లో వెలికితీసి, శుభ్రం చేయించి భారతదేశంలో తొలిసారిగా శివాజీ చరిత్ర వెలికి తీసి, సేకరించి శివాజీని ''కుల్వాడీ భూషణ్'' ( రైతులలో శ్రేష్టుడు) అని పిలిచి ''ఛత్రపతి శివాజీ రాజే భోసలేయాంచా'' అనే గేయ కావ్యం (1885) ద్వారా శివాజీ చరిత్ర రాసి 1885లో శివాజీ ఏకాదశ ఉత్సవాలు ప్రారంభించిండు మహాత్మ జ్యోతిబాఫూలే. అటు విదేశీ పాలకులైన బ్రిటీష్ వారికి ఇటు పరిపాలనలో విద్యలో మిగతా కులాలకి వాటా దక్కనివ్వని మునవాదులకు వ్యతిరేకంగా శివాజీ స్ఫూర్తితో బహుజన శక్తిగా, తృతీయ శక్తిగా (తృతీయ రత్న) ఈదేశంలో ఎన్నటికైనా ఎదుగుతామని మొదట్లో శివాజీ ఏకాదశ (11) ఉత్సవాలని ప్రారంభించిండు మహాత్మ జ్యోతిబాఫూలే. అయితే ఆ వేడుకల్లో బహుజన స్ఫూర్తిని గమనించిన బాల గంగాధర తిలక్ క్రమంగా శివాజీ ఉత్సవాలను కనుమరుగు చేసి ఆ స్థానంలో గణేష్ ఉత్సవాలని ప్రారంభించిండు. గణేష్ ఉత్సవాలకు మనం వ్యతిరేకం కాదు కానీ మన చరిత్ర మనం మరచిపోకూడదు, ఎవరి చరిత్ర వారు తెలుసుకోవాలి.
- ఇట్యాల వెంకటకిషన్ శాక్య
సెల్ : 9908198484