ప్రశ్న : మనిషి చనిపోతే అస్థికలు నదిలో కలుపుతారు. పిండ పూజ చేస్తారు. ఇలా చేస్తే పితృ దేవతలు స్వర్గంలో సంతోషిస్తారని చెబుతారు. ఇదెంతవరకు నిజం?
- శంకరలింగం, శ్యాయంపేట, పరకాల, భూపాలపల్లి జిల్లా
జవాబు: మన వర్తమాన సమాజంలో భారతదేశంలో మూడు రకాలైన నమ్మకాలు లేదా విశ్వాసాలు ఉన్నాయి. ఒకటి: మారుతున్న లేదా ప్రాయోగికంగా నిర్ద్వంద్వంగా తెలిసి పోయిన శాస్త్ర పరిశోధనా ఫలితాల ద్వారా నిగ్గుతేలిన నిజాల (వాస్తవాల) ఆధారంగా మనిషి ఏర్పర్చుకునే నమ్మకాలు. వీటిని శాస్త్రీయ విశ్వాసాలు లేదా శాస్త్రాధారిత విశ్వాసాలు అంటాం. ఇవి ఎప్పుడూ మారనే మారవన్న నిబంధన లేదు. పాత శాస్త్ర నియమాల స్థానే కొత్త నియమాలు బయటపడ్డపుడు తదనుగుణంగా ఈ శాస్త్రాధారిత నమ్మకాలు మార తాయి. ఇలాంటి దృక్పథం, మానసిక ధోరణి ఉన్నవాళ్లకు శాస్త్రీయ దృక్పథం (Scientific temper) వుందని అంటాం. మనం ప్రజలు కోరుకొనేది ఇలాంటి దృక్పథాన్నే. ఇలాంటి దృక్పథమే దేశం లోని ప్రజలందరిలో ఉన్నట్టయితే ఆ సమాజం అప్రతి హతంగా అభివృద్ధి చెందుతుంది. ప్రకృతి గురించిన శాస్త్రీయ అవగాహననతో పాటు సమాజంలో ఉన్న అశాస్త్రీయతను కూడా వారు ప్రశ్నించగలుగుతారు. తద్వారా దేశంలో అన్యాయం తగ్గి ప్రజల మధ్య సమభావం, మానవతా దృక్పథం, సిసలైన దేశభక్తి, కష్టించే ప్రవృత్తి, నిస్వార్థ తత్పరత పెరుగుతాయి. తోటి మానవుడు, పర్యావరణం, సమతులాభివృద్ధి (Sustainable Develo pment) మొదలయిన అంశాలే ఆ వ్యక్తి చేష్టల్ని, జీవన విధా నాన్నీ నిర్దేశిస్తాయి. అలాంటి మనుషులున్న దేశాన్నే, ప్రపంచాన్నే సోషలిస్టులు, కమ్యూనిస్టులు కోరుకుంటారు. రెండవ రకమైన విశ్వాసం/ నమ్మకం : ఆచారానికి లేదా సంప్రదాయాని (Tradition) కి సంబంధించింది. ఈ రకమైన నమ్మ కాలకు శాస్త్రం చెబుతుందన్న విష యాల పట్ల ఏమాత్రం పట్టింపు ఉండదు. తరతరాలుగా తమ కుటుంబంలోనో తోటి సమాజంలోనో జరిగే పద్ధతుల్ని ఆచరిస్తారు. మీరు చెప్పిన అస్థిక నిమజ్జనం, పిండపూజ ఇలాంటి కోవలోకే వస్తాయి. నిజానికి శవాన్ని దహనం చేశాక ఆ శవం తాలూకు భౌతిక స్వరూపానికి కారణమైన రసాయనిక పదార్థాలయిన నీరు, ప్రోటీన్లు, కణజాలాలు చాలామటుకు వాతావరణంలో కలిసిపోతాయి. ఇక మిగిలిన ఘన రూప పదార్థాలు బూడిద, బూడిదగా మారని కొన్ని బొక్కలు (ఎముకలు). ఈ ఎముకల రసాయనిక, భౌతిక ధర్మాలు బ్రతికున్నప్పుడు ఉన్న ఎముకల ధర్మాలకు ఏమాత్రం సరిపోవు. మరో మాటలో చెప్పాలంటే ఈ ఎముకలకు పగిలిపోయిన టీ కప్పు ముక్కలకు తేడా లేదు. ఈ ఎముకలు పూర్తిగా నీటిలో కరగలేని (sparingly soluble) కాల్షియం ఫాస్పేటు అనే లవణ పదార్థం. దీనిని Ca3 (PO4)2 గా సూచిస్తారు. ఇక బూడిదలో ఉన్నదల్లా శరీరంలో ఉన్న లోహ పదార్థాల ఆక్సైడులు. ప్రధానంగా కాల్షియం ఆక్సైడు (CaO), సోడియం ఆక్సైడు(Na2O), ఐరన్ ఆక్సైడు (Fe2O3), జింకు ఆక్సైడు (ZnO), కాపర్ ఆక్సైడు (CuO), పొటాషియం ఆక్సైడు (K2O) మొదలైనవి వుంటాయి. ఫెర్రిక్ ఆక్సైడు దక్క మిగిలినవన్నీ క్షార ఆక్సైడులు. అంటే ఏమాత్రం తడి లేదా నీరు తగిలినా అవి వెంటనే హైడ్రాక్సైడులా మారి, ఆ నీటిని క్షార (Alkaline) లక్షణాన్ని సంతరిస్తాయి. దహనం తర్వాత మిగిలిన ఎముకలతో పోలిస్తే ఈ బూడిద మోతాదు చాలా తక్కువ. ఇందులో ఉన్న చిన్నా చితక ఎముకల్ని, కొంత బూడిదను చెంబులో నింపి అస్తికలు అని పేరు పెడతారు. ఈ పదార్థాన్ని దహన సంస్కారం చేసిన వ్యక్తి (సాధారణంగా పెద్ద కుమారుడు) కుటుంబ సమేతంగా వెళ్లి తమకు బాగా యిష్టమైన నదిలోనో లేదా ఆయా పురోహితులు సూచించిన నదిలోనో కలిపేస్తారు. ఆ తర్వాత పిండ ప్రదానం చేస్తారు. మాంసాహారులైతే మాంసం కలిపిన భోజనాన్ని, శాకాహారులైతే పప్పు నెయ్యి కలిపిన భోజనాన్ని ముద్దలు (పిండాలు)గా చేసి నది గట్టు మీదో, పొదల్లోనో ఆరుబయట పెడతారు. ఈ పిండాల్ని అక్కడక్కడ ఆకలితో అలమటిస్తున్న కాకులు, గద్దలు తింటాయి. అలా తినకపోతే అక్కడున్న కుటుంబీకులు తెగ బాధపడిపోతారు. అలా కాకులు తినడం సంభవిస్తే ఆ పిండ పూజ లేదా పిండ ప్రదానం జయప్రదమయినట్టు అర్థం.
ఇలాంటి ప్రవర్తనలు లేదా కార్యకలాపాలలో ఏమాత్రం విజ్ఞాన శాస్త్ర లక్షణాలు వుండవు. ఆ కాకులే పిత దేవతల ప్రతినిధులుగా భావిస్తారు. చనిపోయిన తర్వాత ఏమీ ఆ వ్యక్తికి సంబంధించిన చైతన్య రూపం వుండదు. ఆత్మలు, స్వర్గ, నరకాలకు ఏమాత్రం ఆధారాలు లేవు. ఇక ఇలా చర్చించుకుంటూ వెళితే ఎన్నో అశాస్త్రీయ అంశాలు బయటకొస్తాయి. అయితే ఇలాంటి ఆచారాల వల్ల సమాజానికి నష్టం లేదు. ఎవరి యిష్టాలు వారివి అని సున్నితంగా ఆ సంప్రదాయాల్ని, ఆచారాల్ని మన్నించవచ్చును. కేవలం ఆర్థిక నష్టాలు, నిష్క్రి యాపరమైన కాల హరణం తప్ప సమాజపు గమనాన్ని గణనీయంగా దుష్పరి ణామాల వైప మళ్లించే ధోరణి పెద్దగా వుండదు. పెళ్లిళ్లు, పండుగలు మొదలయినవన్నీ ఈ కోవలోకి వస్తాయి. కాబట్టి వీటిని సదాచారాలు, సత్కార్యాలు, సత్సంప్రదా యాలు అనలేము గానీ సింపుల్గా ఆచారాలని వదిలేస్తాము. కానీ మూడవ నమ్మకాలున్నాయి. వీటిని మూఢనమ్మకాలు, ఛాందసత్వం, అంధ విశ్వాసాలు అంటాము. ఇలాంటి వాటివల్ల సమాజ గమనానికి ప్రమాదం. కులవ్యవస్థ, లైంగిక వివక్షత, మతవిద్వేషాలు, స్వార్థపరత్వం, అమానుషత్వం వంటివి ఇలాంటి విశ్వాసాల వల్ల పెరుగుతాయి. చేతబడి, బాణామతిని నమ్మడం, మనుషులకు అతీత శక్తులున్నట్లు విశ్వసించడం, వాస్తు, జ్యోతిశ్శాస్త్రం వంటి నమ్మకాల వల్ల సమాజం నిష్క్రియా పరత్వానికి చేరువవుతుంది. ఇలాంటి విషయాల పట్ల ఈ శీర్షికలో బాగానే చర్చించుకున్నాం.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక
Authorization