చంద్రయాన్.. 2008లో భారత్ పేరును ప్రపంచ దశదిశలా వ్యాపింపజేసిన ప్రయోగం. అంతకు ముందే మూడు దేశాలు చంద్రునిపైకి ఉపగ్రహాలను పంపించాయి కదా.. భారత్ ప్రత్యేకత ఏంటి అంటే.. అప్పటి వరకు చంద్రునిపై ప్రయోగాలు చేసిన అన్ని దేశాలు ఆర్థికంగా ముందంజలో ఉన్న అగ్రదేశాలు.. ఇపుడిపుడే అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశం వాటికి దీటుగా చంద్రయాన్ వంటి ప్రయోగం చేయడం సాహసోపేతమే.. అయినా విజయవంతంగా ప్రయోగించింది. అందుకు కొనసాగింపుగా భారత్ మరో ప్రయోగాన్ని చేసేందుకు ప్రస్తుతం సన్నాహాలు చేస్తోంది.. అదే చంద్రయాన్ 2.
1957లో రష్యా పుత్నిక్ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది. రెండేండ్ల తర్వాత మొట్టమొదటిసారి చంద్రునిపై ప్రయోగాలు చేసేందుకు లూనా శాటిలైట్ను చంద్రుని పైకి పంపించి, ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత 1968 వరకు స్పేస్ రీసెర్చ్ కింగ్గా చెలామణి అయింది. ఈ విషయం అమెరికాకు మింగుడు పడలేదు. 1969లో ఏకంగా మనిషినే చంద్రునిపైకి పంపిన అగ్రరాజ్యం ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకుంది. అమెరికా, రష్యా వంటి సుసంపన్నమైన అగ్ర దేశాలకు ఇది సాధ్యమైనదే. కానీ అభివృద్ధి చెందుతున్న భారత్ చంద్రుని పైకి శాటిలైట్ పంపడం అంటే సవాలుతో కూడుకున్నదే.. అయినా దేశ పరిస్థితులు ప్రయోగానికి సంసిద్ధమయ్యేలా చేశాయి. అందుకు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా పరిస్థితులు అనుకూలించాయి.
అక్కడ ఏముంది ..?
అసలు ఇన్ని దేశాలు చంద్రునిపై ప్రయోగాలు చేయడానికి కారణం ఏంటి అంటే.. చంద్రునిపై ఏమున్నాయో తెలుసుకోవడానికి.. అవి మానవాళికి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకోవడానికి.. ఈ కోవలోనే భారత్తో సహా మిగిలిన దేశాలూ యోచించాయి. రోజురోజుకు పెరుగుతున్న జనాభా కారణంగా ప్రకృతి వనరులు అంతరించి పోతున్నాయి. ప్రజల అవసరాలు తీర్చాలంటే బయట నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆ పరిస్థితి నుంచి బయట పడాలంటే కొన్ని వనరులనైనా సమకూర్చుకోవాలి. అలాంటి వనరులు చంద్రునిపై ఉంటే.. సులువుగా పొందొచ్చు కదా. అందుకే చంద్రునిపై ప్రయోగాలను ప్రారంభించారు. అందులో భాగంగానే.. చంద్రునిపై ఉన్న హీలియం 3, నీటి జాడలను కనుగొన్నారు. హీలియం అనేది నాన్ రేడియో ఐసో యాక్టివ్. ఇది భూమి మీద కంటే చంద్రునిపై 11 లక్షల మెట్రిక్ టన్నులు ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. హీలియం అనేది సూర్యుని నుంచి పుట్టుకొచ్చింది. భూమి మీద ఎందుకు లేదు అంటే అందుకు అనేక కారణాలున్నాయి. భూమి కంటే చంద్రునిపై పరిస్థితులు వేరుగా ఉండడంతో అక్కడ లభ్యమవుతోందని శాస్త్రవేత్తలు తేల్చారు. అందుకే అమెరికా, రష్యా, చైనా, ఇండియాలు ఆ హీలియంను వెలికి తీసుకు వచ్చేందుకు ప్రయోగాలు చేస్తున్నాయి.
ఎలా ఉపయోగించొచ్చు..
శక్తి ఉత్పత్తి కోసం న్యూక్లియర్ ప్లాంట్లో న్యూక్లియన్ ఫ్యూజియన్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. దీనిలో మొదట న్యూక్లియర్ రియాక్షన్ జరుపుతారు. దీని నుంచి వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ వేడితో నీటిని వేడి చేస్తారు. వేడి అవుతున్న నీరు నుంచి వెలువడే ఆవిరితో ఎలక్ట్రిక్ టర్బైన్లను తిప్పుతారు. ఈ పద్ధతిలో చాలా రేడియో యాక్టివ్ ఉత్పత్తులు ఉత్పత్తవుతాయి. కానీ హీలియం ద్వారా చేసే పద్ధతిలో ఇవేమీ చేయవచ్చు.రేడియో యాక్టివ్ ఉద్ఘారాల నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. హీలియంను భూమి మీదకు తీసుకురాగలిగితే మరో 250 ఏండ్ల పాటు ప్రపంచ దేశాలకు సరిపోనూ శక్తిని ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రునిపైకి రోవర్ను పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటితో పాటు అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, వ్యోమగాములను పంపించాలని ఇస్రో లక్ష్యాలుగా పెట్టుకుంది. కానీ హీలియంతో శక్తిని ఉత్పత్తి చేసే పద్ధతులు ఇంకా అభివృద్ధిలోకి రాలేదు.
చంద్రయాన్ 1 చేసినదేంటి?
భారతదేశం మొదటిసారి అక్టోబర్ 22, 2008లో ప్రయోగించిన చంద్రయాన్ 1 చంద్రుని కక్ష్యలోకి చేరి, దాదాపు 3400 కక్ష్యలు చేసి వందల సంఖ్యలో ఛాయా చిత్రాలను భూమి పైకి పంపించింది. చంద్రునిపైకి ఓ ల్యాండర్ను దింపింది. అది చంద్రునిపై నీటి జాడలను గుర్తించింది. మొత్తం 312 రోజులే పనిచేసినప్పటికీ, నిర్దేశించిన ప్రణాళికలో 95 శాతం పూర్తి చేసింది. రూ.386 కోట్ల ఖర్చుతో ప్రయోగించిన ఈ మిషన్కు ఆగస్టు 29, 2009లో అంతరిక్షంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ ప్రయోగానికి మన దేశంతో పాటు విదేశాలు తోడ్పాటునందించాయి. ఈ ప్రయోగం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతోనే రెండో ప్రయోగానికి బీజం పడింది.
ఎందుకు ఆలస్యమవుతోంది..?
చంద్రయాన్ 2ను మొదట్లో రష్యాతో కలిసి పని చేయాలని ఇస్రో యోచించింది. నవంబర్ 12, 2012లో రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ, ఇస్రో అధికారులు కలిసి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం రష్యా చంద్రయాన్ 2లో ఉండే మూడు మాడ్యుల్స్లో ఒకటైన ల్యాండర్ మాడ్యుల్ను తయారు చేయడం, మిగిలిన రెండు మాడ్యుళ్ళ (ఆర్టిటర్, రోవర్)ను భారత్ తయారు చేసుకోవాల్సి ఉంది. దీనికి 2008లో ఆమోదం పొందింది. అనుకున్న సమయానికి భారత్ మాడ్యుళ్ళను తయారు చేసినప్పటికీ 2013లో రష్యా మాడ్యుల్ను అందివ్వలేకపోవడంతో 2016లో ప్రయోగించాలని నిర్ణయించుకున్నారు. అందుకు కారణం తర్వాత రష్యా తయారు చేసిన ఫోకస్ గ్రాండ్ మెషీన్ బెడిసికొట్టింది. అదే మిషన్ను చంద్రయాన్ 2కు తయారు చేయాల్సి ఉండడంతో రష్యా ఇస్రోతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో ఇస్రోనే స్వయంగా మాడ్యుల్ను తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఈ కారణాల వల్ల మార్చి 2018లో వాయిదా వేసుకున్నప్పటికీ, ప్రాజెక్టులో చేపడుతున్న మార్పుల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది. ఫిబ్రవరి 2019లో ల్యాండర్ మాడ్యుల్ను పరీక్షించినపుడు దానికి ఉన్న నాలుగు చక్రాలలో ఒకదానికి సమస్య ఏర్పడింది. దీనికి తోడు ఏప్రిల్ 11న ఇజ్రాయెల్ చంద్రునిపై చేసిన ల్యాండింగ్ ఫెయిల్ అవ్వడంతో ఒకింత వెనుకడుగు వేసింది. చంద్రయాన్లో మరికొన్ని మార్పులు చేసి అన్ని రకాలుగా పరీక్షించుకుని ఈ ఏడాది జులై 9 నుంచి 16 మధ్యలో ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఎలా ఉంటుంది..?
చంద్రయాన్ 2లో ల్యాండర్, రోవర్, ఆర్బిటర్ అనే మూడు మాడ్యుల్స్ ఉంటాయి. వీటిని హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్ అయిన జీఎస్ఎల్వీ మార్క్ 3ను ఉపయోగించనున్నారు. ఇందులో దాదాపు 3290 కేజీల బరువున్న ఈ వెహికల్ను ప్రయోగించడానికి రూ.800 కోట్లు ఖర్చు చేస్తోంది. రోవర్ను ల్యాండర్ మాడ్యుల్లో అమరుస్తున్నారు. ల్యాండర్ను ఆర్బిటర్కు అమర్చనున్నారు. ల్యాండర్ మాడ్యుల్కు విక్రమ్ అని, రోవర్ మాడ్యుల్కు ప్రయాణ్ అని పేర్లు పెట్టారు.
పని తీరు..
శ్రీహరికోట నుంచి చంద్రయాన్ 2లో ఉన్న మాడ్యుల్స్ను జీఎస్ఎల్వీ ద్వారా అంతరిక్ష కక్ష్యలోకి జులై 9-16 మధ్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ శాటిలైట్ భూమి నుంచి చంద్రుని మీదకు చేరడానికి 45 నుంచి 50 రోజులు సమయం పడుతుంది. ఒకసారి లూనార్ కక్ష్యలోకి చేరిందంటే, ఆర్బిటార్ నుంచి ల్యాండర్ విడిపోతుంది. విడిపోవడానికి ముందే ఇందులో ఉన్న హై రిజల్యూషన్ కెమెరా ల్యాండింగ్ ప్రాంతాన్ని పరీక్షిస్తుంది. ల్యాండర్లో ఉన్న లిక్విడ్ ఇంజన్ సాయంతో చంద్రుని భూభాగం మీద ఇప్పటివరకు ఇతర దేశాలు అన్వేషించని ప్రదేశమైన దక్షిణ భాగంలో నిర్ణయించిన ప్రాంతంలో దిగుతుంది. ఒకసారి విక్రమ్ చంద్రుని కక్ష్యలోకి చేరిందంటే అందులో నుంచి ప్రయాణ్ బయటకు వస్తుంది. అది చంద్రునికి 300 - 400 మీటర్ల దూరంలో తిరుగుతుంది. శాస్త్రవేత్తలకు అవసరమైన ప్రయోగాలకు సాయపడేందుకు అక్కడ 14 రోజుల పాటు ప్రయాణిస్తుంది. చంద్రుని కక్ష్యలోని పరిస్థితులకు సంబంధించి సమాచారాన్ని, ఛాయా చిత్రాలను భూమికి చేరవేస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత్ కీర్తి పతాకం ఎగురవేసినట్టే.. ప్రపంచ దేశాల దృష్టి మన వైపుకు మళ్ళినట్టే.. అందుకే చంద్రయాన్ 2 విజయవంతం అవ్వాలని కోరుకుందాం...
Authorization