టెక్నాలజీ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ప్రతి వస్తువుకూ అడ్వాన్స్డ్గా మార్పులు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచం ముందు ఉన్నది 5జీ టెక్నాలజీ.. ఇపుడు ప్రపంచమంతా దీని గురించే చర్చిస్తోంది. అంటే వైర్లెస్ టెలిఫోన్లో 5వ తరం సాంకేతికత అని అర్థం. ఇప్పటివరకు వచ్చిన 4తరాలలోనూ అనేకానేక మార్పులు వచ్చాయి. రానున్న 5జీ వల్ల ఎంత ఉపయోగముందో.. అంతకంటే ఎక్కువ నష్టమూ ఉంది. దీని వల్ల మానవ మనుగడకు పెను సవాళ్ళు ఎదురుకానున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ 5జీ వల్ల ఏం లాభం ఉందో, ఎంత మేర నష్టం ఉందో తెలుసుకుందాం..
నాగరిక సమాజంలోకి అడుగుపెట్టినప్పటి నుంచే మార్పుల వైపు మనిషి అడుగులు వేగవంతమయ్యాయి. ఆవిరి యంత్రాలతో ఆరంభమైన పారిశ్రామిక విప్లవాల పరంపర భారీ ఉత్పాదన, విద్యుత్, కృత్రిమ వస్తువుల తయారీ, కంప్యూటర్ వంటి వాటికి అంతర్లీనంగా ఉండే ఇంటర్నెట్ రంగంలో 5జీ ప్రవేశించడంతో మానవ జీవితం కొత్త పరవళ్ళు తొక్కుతోంది. కృత్రిమ మేధస్సు ఆసరాతో డ్రైవర్ రహిత కార్లు, డ్రోన్లు, వర్చువల్ అసిస్టెంట్ ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. టోల్గేట్ల వద్ద వాహనాలు కిలోమీటర్లమేర బారులు తీరే పరిస్థితి నుంచి కాదు వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలో నిర్దేశించేందుకూ ఈ టెక్నాలజీ వినియోగంలోకి రానుంది. వీటన్నింటికీ 5జీ చిప్ పనిచేయనుంది. నెట్వర్క్ సేవలలో వస్తున్న 5వ తరమే ఈ 5జీ.. మొదటి తరం నుంచి మార్పులు చేసుకుంటూ.. మరికొద్ది రోజుల్లో 5జీ టెక్నాలజీ రానుంది. దీని వల్ల లాభం ఎంత ఉన్నా, నష్టాలూ అదే రీతిలో ఉండనున్నాయి. దీని నుంచి ఉద్గారమయ్యే రేడియేషన్ వల్ల జీవజాతులు అంతరించే ప్రమాదం పొంచి ఉంది.
టెక్నాలజీలో ఇప్పటివరకు 4వ తరం సాంకేతికతను వినియోగిస్తున్నాం. ఈ నాలుగు తరాలు అనేకానేక మార్పులు చేసుకుని వచ్చాయి. అవి..
1G.. :మొదటి తరం 1980లో ప్రారంభమైంది. డబ్ల్యూటీటీ అని పిలిచేవారు. అంటే వైర్లెస్ టెలిఫోన్ టెక్నాలజీ. ఎనలాగ్ నెట్వర్క్ ద్వారా కమ్యునికేట్ చేసేవారు. అంటే కేవలం కాల్స్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించే అవకాశం ఉండేది.
2G :1991లో డిజిటల్ నెట్వర్క్గా 2జీ ప్రారంభమైంది. ఇందులో ఆడియో స్పష్టంగా ఉండేది. టెక్ట్స్ మెసేజ్లు పంపుకునేలా టెక్నాలజీ రూపొందింది. దీనిని జీఎస్ఎమ్ (గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యునికేషన్) అని పిలిచేవారు. ఇందులోనే అభివృద్ధి చేసుకుంటూ జీపీఆర్ఎస్ (జనరల్ పాకెట్ రేడియో సర్వీస్) ఇంటర్నెట్ ప్యాకేజీ సేవలతో 2.5జీని ప్రవేశపెట్టారు. ఒక సెకండ్కు 28 కెబిపీఎస్ మాత్రమే డౌన్లోడ్ స్పీడ్ ఉండేది. పోస్ట్పెయిడ్ వాడే వారికి మాత్రమే డేటా వినియోగించే అవకాశం. తర్వాత 2.75 జీని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ స్పీడ్ను ఉపయోగించేవారికి నెట్ సింబల్ పక్కన 'ఇ' అని కనిపిస్తుండేది. దీనిని ఎడ్జ్ అనే వారు. అంటే ఎన్హాన్స్డ్ డేటా రేట్స్ ఫర్ జీఎస్ఎమ్ ఎవల్యూషన్ అని అర్థం.
3G: 1998లో ప్రారంభమైనప్పటికీ 2002 వరకు కూడా కానీ కొన్ని దేశాలకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. వీడియో కాల్స్, యూట్యూబ్ వంటివి వినియోగంలోకి వచ్చాయి. దీని వేగం 200 కెబీపీఎస్ / సెకన్ ఉండేది. యూఎంటీఎస్ (యూనివర్సల్ మొబైల్ టెలీ కమ్యూనికేషన్ సర్వీసెస్) అని పిలిచేవారు. దీనినే అభివృద్ధి చేసి 3.5జీగా అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనిని వైర్లెస్ మొబైల్ బ్రాడ్బ్యాండ్ అనేవారు. ఇందులో ఇంటర్నెట్ స్పీడ్ మరికొంత వేగవంతమైంది. ఈ ఇంటర్నెట్ సర్వీస్ను కేబుల్ ద్వారా వినియోగించేవారు. ఈ సమయంలో ఎయిర్టెల్, ఐడియా వంటివి ఇంటర్నెట్ కోసం మోడెమ్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. తర్వాత 2008లో 3.75జీ అందుబాటులోకి వచ్చింది. దీనిని హైస్పీడ్ డౌన్లింక్ ప్యాకెట్ యాసెస్ (హెచ్ఎస్డీపీఏ) అనే వారు. ఇది వాడే వారికి నెట్ సింబల్ వద్ద హెచ్ ప్లస్ అని ఉండేది. అదే సమయంలో 4వ తరం కూడా ప్రారంభానికి సిద్ధమైపోయింది.
2008లోనే ప్రారంభమైనప్పటికీ మన దేశానికి కొంత ఆలస్యంగా ఈ సేవలు అందాయి. జియో వల్ల 4జీ సేవలు మరింత చేరువయ్యాయి. ప్రస్తుతం చాలా వరకు ఈ తరాన్నే వినియోగిస్తున్నారు. దీని ద్వారా పూర్తి స్థాయి హెచ్డీ వీడియోలను స్ట్రీమ్ చేసుకోగలుగుతున్నాం. అంటే 1080 స్పీడ్ను అందుకోగలుగుతున్నాం. ఇందులో హై క్వాలిటీ ఇంటర్నెట్ను వినియోగిస్తున్నాం. దీనిని ఎల్టీఈ (లాంగ్ టర్మ్ ఎవల్యూషన్) అంటారు. దీని ద్వారా వెబ్పేజీ, వీడియోకాల్స్ వంటి చాలా త్వరగా కనెక్ట్ అయిపోతున్నాయి. ఇందులోనే 4.5జీ కూడా వచ్చింది. అదే ఎల్టీఈ అడ్వాన్స్డ్. ఇది ఇంకా వేగవంతమైనది. దీని సింబల్ వీఓఎల్టీఈ (వాయిస్ ఓవర్ ఎల్టీఈ) అని చూపిస్తుంది.
3G దీనిని 2020 నాటికి తీసుకురావాలని అంచనాలు ఉన్నాయి. దీనిని ఎన్జీఎంఎన్ (నెక్ట్స్ జనరేషన్ మొబైల్ నెట్వర్క్)గా పిలుస్తున్నారు. ప్రస్తుతం టెలికాం కంపెనీలు దీనిపై కసరత్తు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా హ్యాండ్ సెట్ తయారీ కంపెనీలతో భాగస్వామ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రయోగాలు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి కొన్ని మొబైళ్ళనూ మార్కెట్లోకి విడుదల చేశాయి. ఈ ఐదవ తరం ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. విజయవంతమైతే సెకనులోనే 100 గిగా బైట్స్ వేగం అందుబాటులోకి వస్తుంది. అంటే.. ఈ వేగాన్ని మాటల్లో చెప్పలేం. రెప్పపాటులో ఒక సినిమాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తిస్థాయిలో 4జీనే వాడుకోలేని పరిస్థితిలో వుండగానే, ఇప్పుడు 4జీ కన్నా పదిరెట్లు వేగంతో 5జీ రాబోతోంది. 2035 నాటికి దీనివల్ల 12 ట్రిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ ఐహెచ్ఎస్ మార్కెట్ అంచనా వేస్తోంది.
జరగనున్న అద్భుతాలు..
5జీ టెక్నాలజీ దేశ స్వరూపాన్నే మార్చబోతోంది. ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మన దేశం కూడా ముందడుగు వేస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే దేశం డిజిటల్ ఇండియా వైపు పరుగులు తీయడం ఖాయం. పట్టణ ప్రాంతాలలో 10వేల ఎంబీపీఎస్, గ్రామాలలో 1 వేయి ఎంబీపీఎస్ స్పీడ్ను అందుబాటులోకి తీసుకురావచ్చని అంచనాలున్నాయి. సాఫ్ట్వేర్, కన్సల్టెన్సీ, సమాచార రంగాలలో 5జీ విశేషంగా ఉపయోగపడుతుంది. వీడియోకాల్స్లో రెప్పపాటు అంతరాయం కూడా ఏర్పడదు. ఏ సమాచారమైనా రెప్పపాటులో అందుతుంది. 4జీ 1800 మెగా హెడ్జ్ ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంటే, 5జీ మాత్రం 73వేల మెగా హెడ్జ్ ఫ్రీక్వెన్సీలో సిగల్స్ పని చేస్తాయి. ఈ సేవలు పొందాలంటే కొత్త రకం ఫోన్లు, వైఫై రూటర్లు వినియోగించాల్సి వస్తుంది. టవర్లు సైతం కొత్త రకం అవసరమవుతాయి. డేటా ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్మెంటెడ్ రియాల్టీ వంటి వాటితో మొత్తం వైద్య రంగం రూపురేఖలే మారిపోనున్నాయి. అంతేకాదు, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, ఆటోమొబైల్, ట్రాన్స్పోర్ట్, ఫ్యాక్టరీలు, రక్షణ రంగం, నిఘా వ్యవస్థ, స్పేస్సైన్స్ ఇలా ప్రతి రంగంలోనూ వేగం పెరుగుతుంది. ప్రస్తుతం కొన్ని అంశాలకే పరిమితమైన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ 5జీ రాకతో ప్రతి రంగంలోనూ, ప్రతి వస్తువుకూ ఇంటర్నెట్ అనుసంధానం పెరిగే అవకాశాలే ఎక్కువ. ఐఐటీ హైదరాబాద్ కూడా 5జీ ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది.
లోపాలు..
5జీ వల్ల సౌకర్యవంతమైన జీవితం అందుబాటులోకి వస్తుంది కానీ డేటా చోరీ ఎక్కువగా ఉండనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సాంకేతిక పరంగా చూసుకుంటే ఏకేఏ అనేది ఒక నెట్వర్క్ సెక్యూరిటీ ప్రొటోకాల్. ఫోన్, సెల్యులర్ నెట్వర్క్స్ మధ్య కమ్యూనికేషన్లకు రక్షణ కల్పిస్తుంది. దీనిపై నార్వేకు చెందిన పరిశోధకులు విడుదల చేసిన సమాచారం ప్రకారం 'అథంటికేషన్ ఆఫ్ కీ అగ్రిమెంట్ (ఏకేఏ)' పై ప్రతికూల ప్రభావం చూపగలిగే భద్రతా లోపం 5జీ నెట్వర్క్లో ఉంది. స్మార్ట్ఫోన్ల నుంచి చేసే కాల్స్, టెక్ట్స్ సందేశాల డేటాను హ్యాకర్లు సులభంగా చోరీ చేసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మాన్పవర్కు సంబంధించి చూసుకుంటే ఉత్పత్తులు రెండింతలు చేసుకునేందుకు యాజమాన్యాలు టెక్నాలజీ వైపు మొగ్గు చూపడంతో ఫ్యాక్టరీల్లో ఆటోమేషన్ పెరగడం వల్ల మనుషుల జీవనోపాధి దెబ్బతింటుంది. లక్షల మంది జీవితాలు రోడ్డు మీదకు వస్తాయి. పర్యావరణ పరంగా ఇప్పటికే రేడియేషన్ ద్వారా కొన్ని రకాల పక్షులు అంతరించిపోయాయి. 5జీ టెక్నాలజీ వల్ల వెలువడే రేడియేషన్తో పక్షిజాతులు, మూగజీవాలు అంతరించే ప్రమాదం ఉండనుంది. 5జీ టెస్ట్ సిగల్ రేడియేషన్ వల్ల హేగ్ పట్టణంలో వందలాది పక్షులు చనిపోతున్నాయని అక్కడి పశు వైద్యులు నిర్ధారించారు. ఏదిఏమైనా రానున్న 5జీ టెక్నాలజీ వల్ల ఎంత మేర మంచి జరుగుతుందో తెలియదు కానీ మానవాళికి పెనుముప్పే సంభవించవచ్చని పర్యావరణ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Authorization