- వర్షం కురిసినపుడు వచ్చే మెరుపుల్లో విద్యుచ్ఛక్తి ఉంటుందంటారు. అదెలా సాధ్యం?
- కరెంటు నీటిలో పాసవుతుంది.... గాలిలో ఎందుకు పాస్ కాదు?
సాధారణంగా నేల నుంచి 2 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న మేఘాలే మెరుపులు, ఉరుముల్ని కలిగిస్తాయి. ఈ మేఘాల్ని క్యుములోనింబస్ మేఘాలు అంటారు. వేసవి ఎండల వల్ల సముద్రపు నీరు ఆవిరై భూప్రాంతాలకు విస్తరించినపుడు అక్కడున్న దుమ్ము, ధూళి కణాలతో ఢకొీన్న మేఘాల్లో స్థిర విద్యుత్ పోగుపడుతుంది. అనువైన పరిస్థితి ఏర్పడ్డప్పుడు విద్యుదావేశాలు పరస్పర ఆకర్షణ ద్వారా గాలిలో ప్రవహిస్తాయి. గాలి ప్లాస్మా స్థితికి చేరడం వల్ల ఆ వేడికి కాంతి పుడుతుంది. ఇవే మెరుపులు.
మెరుపులు క్షణికంగా మెరిసినా అందులో ఉన్న విద్యుత్ ప్రవాహం కొన్నిసార్లు వందలాది కిలో ఆంపియర్లుగా ఉంటుంది. పొటన్షియల్ భేదం ద్వారా ఆ విద్యుత్ ప్రవాహం సంభవించడం వల్ల ఎన్నో కూలుంబుల విద్యుదావేశం మేఘాల మధ్య మేఘాలకు నేలకు మధ్య వినిమయం అవుతుంది.
ఒక పదార్థం గుండా విద్యుత్ సరఫరా కావడం అంటే ఆ పదార్థంలో ఎలక్ట్రాన్లు లేదా విద్యుదావేశం ఉన్న కణాలు లేదా అయాన్లు ప్రవహించడమే. లోహాలు (metals), బొగ్గు, గ్రాఫైటు వంటి అలోహాల్లో (non-metals) స్వేచ్ఛగా అటూ ఇటూ కదలగల ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఉప్పు ద్రావణం, సముద్రపు నీరు, తాగే నీరు, గంధకామ్లం వంటి ద్రవ పదార్థాల్లో విద్యుదావేశం ఉన్న అయాన్లు ఉంటాయి. ఇలాంటి ఘన, ద్రవ పదార్థాలను విద్యుత్ పొటన్షియల్ ఉన్న రెండు బిందువుల(poles)మధ్య ఉంచినపుడు విద్యుత్ సరఫరా అవుతుంది. అంటే రుణధ్రువం వైపుకు ధనావేశిత (negatively charged)కణాలు, ధనధ్రువం వైపు రుణావేశితకణాలు ప్రయాణిస్తాయి. ఈ స్థితినే మనం విద్యుత్ ప్రవహించడం అంటాం. అయితే గాలిలో అణువులు తటస్థం(neutral)గాను, దూరదూరంగాను ఉంటాయి. కాబట్టి ఇలాంటి సాధారణ వాయువులను సాధారణ పొటెన్షియల్ తేడా ఉన్న బిందువుల మధ్య ఉంచితే, ఆ వాయువుల్లో చలించే విద్యుదావేశిత కణాలు ఏమీ లేకపోవడం వల్ల కరెంట్ పాస్ కాదు. స్వచ్ఛమైన నీరు, బెంజీన్, అసిటోన్, ఆల్కహాలు వంటి ద్రవాల్లో కూడా కరెంటు ఏమంత గొప్పగా పాస్ కాదు. కానీ అధిక వోల్టేజి ఉండే బిందువుల మధ్య గాలిలో కూడా విద్యుత్ ప్రసరిస్తుంది. అప్పుడు వాయు అణువులు అయనీకరణం చెందుతాయి.
Authorization