Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'దీపావళి' చిత్రంలో ''సరియా నాతో సమరాన నిలువగలడా'' అంటూ సత్యభామ పొగరు, అహంకారమంతా తన గొంతులో నింపుకుని పాడిన పాట వినగానే ఎ.పి.కోమల గుర్తుకువస్తారు.
ఎ.పి.కోమల (ఆర్కాటు పార్థసారథి కోమల) పుట్టి పెరిగిందంతా మద్రాసులోనే. నాలుగేళ్ళ వయసులోనే పాటలు పాడుతున్న కోమలను చూసిన గాడవల్లి పైడిస్వామి శాస్త్రీయ సంగీతాన్ని నేర్పించడానికి రాజమండ్రి తీసుకెళ్ళారు. అక్కడ సంగీతంతో పాటు తెలుగు కూడా నేర్చుకుంటూనే సంగీత కార్యక్రమాల్లో పాల్గొని బహుమతులు అందుకున్నారు. రెండేళ్ళ తర్వాత తిరిగి మద్రాసు చేరుకున్నారు కోమల.
సంగీతంలో అవగాహన ఉండడంతో తొమ్మిదేళ్ళ వయసులోనే తెలిసిన వారి ద్వారా ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగంలో చేరారు. రేడియోలో వచ్చే 'గానలహరి' కార్యక్రమంలో విద్యార్థిగా పాల్గొన్నారు. అదే వయసులో ప్రయాగ నరసింహమూర్తి, రేడియో స్టేషన్లో పనిచేసే ఎస్.ఎన్.మూర్తి గార్ల ద్వారా చిత్తూరు నాగయ్య దర్శకత్వంలో వచ్చిన 'త్యాగయ్య' చిత్రంలో పాడే అవకాశం వచ్చింది. మూడు నెలల రిహార్సల్స్ తర్వాత ''మధురానగరిలో చల్లనమ్మ బోదు'' అనే పాటను జమునారాణి గారితో కలిసి పాడారు. అలా మొదటి సినిమా పాట తెలుగు చిత్రంలోనే పాడే అవకాశం లభించింది. ఆ తర్వాత వరుసగా తమిళ, కన్నడ, మలయాళ, సింహళ భాషల్లో పాటలు పాడే అవకాశాలు వెంటవెంటనే వచ్చాయి. అవకాశం వచ్చినప్పుడు ఓ పక్క సినిమా పాటలు పాడుతూనే ఆలిండియా రేడియోలో బాధ్యతలు నిర్వహిస్తూ 1995లో పదవీ విరమణ చేశారు. అంతకాలం రేడియోలో గ్రేడ్ వన్ ఆర్టిస్టుగా పనిచేసినా సినిమా రంగం ఇచ్చిన గుర్తింపు ఉద్యోగం ఇవ్వలేకపోయిందని కోమల అభిప్రాయం.
'రక్షరేఖ' చిత్రంలో ఘంటసాలతో కలిసి ''ఓ... ఓహౌ రాజకుమారా'' అంటూ తొలి యుగళగీతం ఆలపించారు. ఓగిరాల రామచంద్రరావు, ఘంటసాల, సాలూరి రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, కె.వి.మహదేవన్.... ఇలా ఆ రోజుల్లోని ప్రముఖ సంగీత దర్శకులందరి దగ్గరా కోమల పాడారు. 1975 'యశోద కృష్ణ' అనే తెలుగు చిత్రంలోని పాట ఆమె పాడినవాటిలో ఆఖరిది. అలా తొలిపాట, చివరిపాట తెలుగులోనే.
బాలాంత్రపు రజనీకాంతరావు గారు పాడించిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి ''ఆకులో ఆకునై...'', గురజాడ ''దేశమును ప్రేమించుమన్నా'' అని రేడియోలో పాడిన లలితగీతాలు కోమలకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. వివిధ భాషల్లో దాదాపు ఐదువేల పాటలు పాడిన కోమలకు తమిళంలోనే గాయనిగా మంచి పేరు వచ్చింది.
'పరమానందయ్య శిష్యుల కథ'లో లీలతో కలిసి ''వనిత తనంత తానే వలచిన'' పాట, 'బంగారు పంజరం' చిత్రంలో ''పదములె చాలు రామా''. 'జయసింహ'లో ''మురిపెము మీర మీ కోరిక తీర, మనసైన చెలి పిలుపు'', 'పిచ్చి పుల్లయ్య'లో ''ఓ పంతులు గారు'', 'పెంపుడు కొడుకు, రంగుల రాట్నం' చిత్రాల్లో పాడిన పాటలు ఆమెకు గుర్తింపు తెచ్చాయి.
సినిమాకు సంబంధించి ఎస్. వరలక్ష్మి పాటలు, శాస్త్రీయ సంగీతంలో ఎం.ఎల్.వసంతకుమారి పాటలను ఇష్టపడే కోమల పి.సుశీల గాత్రంలో ఉండే మార్దవం, స్పష్టత ఇంకెవరి గొంతులోనూ రాదంటారు.
చెన్నై ప్రభుత్వం 'మధురవాణి' బిరుదు, బాలమురళీకృష్ణ గారి చేతులమీదుగా సన్మానం, అమృతగానవర్షిణి, ఘంటసాల స్వర్ణ కంకణం వంటి బహుమతులు ఆమె గాన ప్రతిభకు తార్కాణాలు. ఎమ్మెస్.సుబ్బులక్ష్మి కోమలకు ఫోన్ చేసి అభినందించడం, ముఖ్యమంత్రిగా ఉన్న ఎం.జి.రామచంద్రన్ అభినందిస్తూ ఉత్తరం రాయడం తన జీవితంలో మర్చిపోలేని సంఘటనలుగా భావిస్తారు.
సంగీతమనే సాగరంలో ఓపికున్నంత వరకు పాడుతూ ఉండాలనేది కోమల కోరిక. సంగీతాన్ని ఓ వ్యాపకంగా కాకుండా అదో గమ్యంలా సాధన చేయాలంటారు కోమల. త్యాగరాజ కీర్తనలు, దీక్షితార్ కృతులు పాడుకోవడంలో ఉన్న ఆనందం మరెందులోనూ ఉండదనే కోమల రత్నకాంతి, భవప్రియ, శ్రీ కంఠి రాగాలంటే ఎక్కువ ఇష్టపడతారు.
కళాకారులు సున్నిత మనస్కులు అంటారు. కోమల జీవితాన్ని చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. కుటుంబ బాధ్యతల రీత్యా, మరికొంతమంది తోటి కళాకారిణుల వివాహ వైఫల్య జీవితాల్ని దగ్గరగా చూడడం వల్ల ఆమె జీవితంలో పెళ్ళి మాట తలపెట్టలేదు.